ప్రపంచం మొత్తమ్మీద అలుసు ఎవరయ్యా అంటే…? సుగర్ రోగి, అదేనండీ మధుమేహం, డయాబిటిస్ రోగి…! గడ్డి, పచ్చి కూరగాయలు, వేపాకులు, మెంతులు తినడం దగ్గర్నుంచి… ఇది తిను, ఇది తినకు… ఇన్ని గంటలు పడుకో వరకూ… వేల సలహాలు… వందల సైట్లు, చానెళ్లు, పత్రికలు, డాక్టర్లు వేల సలహాల్ని ఇప్పటికే సుగర్ రోగులపై రుద్దారు, రుద్దుతూనే ఉన్నారు, రుద్దుతారు కూడా… అఫ్ కోర్స్, నాలుగు మంచి సలహాలు చెబితే తప్పేమీ లేదు కానీ అన్నీ విని, అన్నీ చదివి, కొన్ని ఆచరించగలిగి, కొన్ని ఆచరించలేక… చివరకు మైండ్ బ్లాంక్… మన తెలుగులోనూ అంతేగా… ఒక మంతెన అయిపోయింది, కొద్దిరోజులు వీరమాచినేని… తాజాగా ఖాదర్ చిరుధాన్యాలు… ఈ అనేకానేక వార్తల నడుమ కొన్ని ఇంట్రస్టింగు వార్తలూ, అనగా సలహాలు కనిపిస్తుంటాయ్… అదే ఇది… టైమ్స్ వాడు వేశాడు లెండి… ఏమిటో చూద్దాం…

మామూలుగా చద్దన్నమో, పాత రొట్టెలో తినండర్రా అంటే… కొందరు ఏమంటారు..? నాకేం ఖర్మ..? ఏం చెబుతున్నావ్ అంటూ ఎగురుతారు మనమీద… కానీ ప్రియాంక అనే డాక్టర్ చెప్పినట్టుగా టైమ్స్ రాసుకొచ్చిన స్టోరీ ఏమంటున్నదీ అంటే..? చద్ది ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం అని..! సుగర్, బీపీ, వేడిమి, గ్యాస్, మలబద్ధకం ఎట్సెట్రా చాలా సమస్యలకు చద్ది గోధుమరొట్టెలే మంచి మందు అని తేల్చేస్తున్నారు వాళ్లు… ఎలాగంటే..?
నిజానికి 12 గంటల క్రితం వండిన ఏ ఆహారమైనా సరే ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతుంటారు డాక్టర్లు… తాజాగా వండినవి, వేడివి తినాలీ అని హితవు చెబుతుంటారు… అందుకే మిగిలిపోయిన అన్నాన్ని గానీ, రొట్టెల్ని గానీ పారేస్తుంటారు… కానీ ఇది వేరే కథ…
రాత్రి మిగిలిన గోధుమ రొట్టెల్ని (చపాతీలు, పుల్కాలు) పొద్దున్నే పచ్చి పాలలో పావుగంట సేపు నానేసి, తినేస్తే బీపీ కంట్రోల్ అవుతుందట… అంతేకాదు, ఇది ఒంట్లో వేడిమిని కూడా తగ్గించేస్తుందట… పొద్దున చేసుకున్న చపాతీలు మిగిలిపోతే సేమ్, ఇలాగే పచ్చిపాలలో నానబెట్టి రాత్రి తింటే… కడుపులో ఉబ్బరం, గ్యాస్తోపాటు మలబద్ధకానికీ భేషైన మందుగా పనిచేస్తుందట మరి… పొద్దున్నే అంతా సాఫ్… ఇక సుగర్…? సేమ్… ఎప్పుడో వండిన చపాతీలను పావుగంట సేపు పచ్చిపాలలో నానబెట్టి, అలాగే తినేయాలిట… కూరలు, పచ్చళ్లతో కాదు సుమా… జస్ట్, అలాగే మందులాగా..! ఎంతకాలం పాత చపాతీల్ని ఇలా తినాలో కూడా చెబుతున్నారు వాళ్లు… 12 నుంచి 15 గంటల క్రితం చేసుకున్న చపాతీల్ని ఇలా వాడాలట… అన్నట్టు పనిలోపనిగా మరో చిట్కా…
ఈమధ్య Intermittent Fasting కూడా పాపులర్ అయిపోతున్నది… అంటే 18 గంటల ఉపవాసం… అనగా… ఉదయం 10 గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేశారు అనుకొండి, సాయంత్రం 4 గంటలకు తిండి క్లోజ్… ఈమధ్యలో బతకటానికి అవసరమయ్యేంత కాసింత తిండి తినాలి… ఇక ఆ తరువాత మళ్లీ ఉదయం 10 దాకా ఏమీ తినొద్దు… కడుపు ఖాళీగా అనిపిస్తే నీళ్లు తాగాలి అంతే… సో, ఈ ఫాస్టింగు పాటించేవాళ్లు పొద్దున్నే ఈ చద్ది చపాతీల్ని పచ్చిపాలల్లో నానేసి తింటే… ఒంటి గంటకు ఓసారి, నాలుగు గంటలకు ఓసారి ఒకటో రెండో చిన్న చపాతీల్ని ఇలా తినేస్తే… సూపర్ అన్నమాట… మరి దేహానికి అవసరమైన ఫ్యాట్, ప్రొటీన్లు, ఇతర పోషకాల మాటేమిటీ అంటారా..? మధ్యాహ్నం ఒంటి గంటకు ఓ కోడిగుడ్డు (పచ్చసొనతోనే సుమా), పళ్లు, కీరా వంటి వెజ్ సలాడ్స్ తీసుకుంటే చాలునన్నమాట… ఈ ‘ఆహారవైద్యం’ వల్ల మరో ప్రయోజనమూ ఉందండోయ్… బరువు తగ్గడం..! ఇదేదో బాగున్నట్టుంది కదూ… లాభం ఉన్నా లేకపోయినా నష్టం మాత్రం లేదు… అయితే సాయంత్రం నాలుగు తరువాత 18 గంటలు కడుపులోకి ఏమీ తీసుకోకపోతే మరి సుగర్ లెవల్స్ డౌన్ అయిపోతే ఎవరిదీ రెస్పాన్సిబులిటీ…? ఈ ఒక్క ప్రశ్నకే ఎవరి దగ్గరా జవాబు లేదింకా..! (ఇలాంటి చిట్కాలు, సలహాలు సమస్య తీవ్రతను తగ్గించొచ్చునేమో కానీ చికిత్స కాదు… అది దృష్టిలో పెట్టుకొండి… అంతే…)
kalimi muralidhara reddy says
Believe your ancestors food which is again redeemed by Dr Khadar Vali. They will 100% show the result with in 2 months and completely transforms the health . Just go for it. No restrictions. Only our ancestors food, that is all.