మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓ ట్వీట్ చేశాడు… అందులో ఓ వీడియో… దాదాపు 80 వరకూ పరిశోధన వ్యాసాల్ని, పుస్తకాల్ని, డాక్యుమెంట్లను చదివి, అర్థం చేసుకుని, ఏడాదిన్నరపాటు శ్రమపడి ఈ వీడియోను చేశాను అన్నాడు అందులో… తనే తెర మీద కనిపిస్తూ ఆ డాక్యుమెంటరీ వీడియో వివరాలు చెబుతూ ప్రజెంట్ చేశాడు… దాదాపు 23 నిమిషాలున్న ఆ వీడియోలో తన శ్రమ కనిపిస్తోంది… అభినందించాలి… అదే వీడియో సారాంశాన్ని వెలుగు పేపర్లో ఓ ముప్పావు పేజీ పబ్లిష్ చేశారు… అసలు విషయం ఏమిటయ్యా అంటే..? తన వీడియో ది గ్రేట్ చైనా వాల్ నిర్మించిన ఓ చైనా చక్రవర్తి కథ… చైనాకు అంతకుముందు అసలు చరిత్రే లేదనీ, తన చరిత్రే చైనా చరిత్ర అని బలంగా నమ్మిన క్రీస్తుపూర్వం నాటి ఆ చక్రవర్తి పేరు కిన్ షి హుయాంగ్..! పొద్దున్నే ఆ పత్రికలో ఆ సుదీర్ఘ వ్యాసం చదివినవాళ్లకు లేదా ఆ ట్వీటు ఫాలో అయినవాళ్లకు ఏమాత్రం బోధపడలేదు… అసలు ఒక మెయిన్ స్ట్రీమ్ పొలిటిషియన్, బిజీ పర్సనాలిటీ, త్వరలో బీజేపీలోకి వెళ్లబోతున్నడనే ప్రచారం జరుగుతున్న నాయకుడు… ఏనాటి చైనా పాలకుడి చరిత్రను, తత్వాన్ని, పాలన రీతుల్ని అధ్యయనం చేయడం ఏమిటి అనేది ఆ సందేహం…
వాస్తును నమ్మడం, రాజధానికి దూరంగా ఉండటం, నియంత్రిత వ్యవసాయం, రెవిన్యూ వ్యవస్థ రద్దు, తన లక్కీనెంబర్కు సరిపడేలా ప్రాంతాలుగా విభజించడం, హెరిటేజ్ భవనాలను కూలగొట్టడం, అలవిమాలిన పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం, తనతోనే చరిత్ర, తనదే చరిత్ర అనే భావనలో బతకడం, లోకల్ నాయకులను నమ్మకపోవడం, ఎవరు చెప్పినా వినకపోవడం, కోటరీకి తప్ప ఎవరికీ అందుబాటులో లేకపోవడం, దగ్గరోళ్లకే పాలసీలు తెలియడం… వంటి అంశాల్నే పదే పదే ప్రస్తావించడంతో అర్థమైపోయింది… ఆయన కేసీయార్ గురించి పరోక్షంగా విమర్శించడానికి ఈ చక్రవర్తి కథను ఉదాహరణగా తీసుకుని, ఇంత సుదీర్ఘ చరిత్రను చెప్పాడనేది..! చక్రవర్తి మరణించాక, కొడుకు కుర్చీ ఎక్కుతాడనీ, కానీ లోకల్ నాయకులంతా మర్లపడతారని కూడా రాసుకొచ్చాడు… మొత్తానికి చాలా కష్టపడ్డాడు… ఆ వీడియో కావాలంటే ఇదుగో, ఈ ట్వీట్లో ఉంది…
I promised an intresting story.
Here it is.If possible watch on TV or PC if possible.https://t.co/BBfy2MgMOv
— Konda Vishweshwar Reddy (@KVishReddy) February 18, 2021
కేసీయార్ మీద ఇలాంటి విమర్శలు కొత్తేమీ కాదు… తనను నయా నిజాం నవాబుతో, పాత తరం దొరలతో పోలుస్తూ ఎప్పట్నుంచో కాంగ్రెస్, బీజేపీ నాయకులు విమర్శలు చేస్తూనే ఉంటారు… అయితే ఏడాదిన్నరపాటు ఇంత కష్టపడిన కొండా దేనికి ఇలా పరోక్షంగా, డొంకతిరుగుడుగా విమర్శించడం..? అనాలనుకుంటే నేరుగానే, సూటిగానే, స్పష్టంగానే మన కేసీయార్ కూడా అలాంటి చక్రవర్తే అని విమర్శించవచ్చు కదా… నువ్వు ఎవరిని, ఏమని విమర్శించదలుచుకున్నావో, ఏం చెప్పదలుచుకున్నావో ప్రజలకే సరిగ్గా అర్థం కానప్పుడు, ప్రజల్లోకి సరిగ్గా వెళ్లనప్పుడు ఇక ఈ శ్రమకు రాజకీయ ప్రయోజనం ఏమున్నట్టు..? ఇదుగో ఫలానా చక్రవర్తి పాలన యవ్వారాలు ఇలా ఉండేవి, మన కేసీయార్ కూడా సేమ్ అని నేరుగా పాయింట్లవారీగా రాస్తే జనానికి ‘ఓహో, ఈయన చెప్పదలుచుకున్నది ఇదేనా’ అనే క్లారిటీ వచ్చి ఉండేది కదా… వేల పుస్తకాలు చదివిన కేసీయార్కు ఈ వ్యాసం ఉద్దేశం ఏమిటో చూడగానే అర్థమై ఉంటుంది… కొండా వారి ఈ ఫాయిదా లెస్ ఎఫర్ట్ గమనించి బహుశా నవ్వుకుని ఉంటాడు..!!
Share this Article