.
ఎక్కడో ఓ చిన్న వార్త కనిపించింది… రామజన్మభూమి నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వచ్చే ఏప్రిల్ చివరి నాటికి ఆలయ నిర్మాణం సంపూర్ణం అవుతుందని చెప్పినట్టు ఆ వార్త…
గుడి నిర్మాణం అయిపోయిందనడానికి సూచనగా ప్రధాని మోడీ చేతుల మీదుగా భగవత్ ధర్మ ధ్వజాన్ని ఎగురవేయించారు కదా… ఇంకా అసంపూర్ణం అంటున్నారేమిటనే సందేహం తలెత్తడం సహజం…
Ads
ఆలయలో బాలరాముడికి 2024లో జరిగింది ప్రాణప్రతిష్ట… అంటే గర్భాలయంలోని ప్రధాన విగ్రహానికి ప్రాణశక్తిని ప్రతిష్టించడం, భక్తుల దర్శనాలకు అనుమతించడం… కానీ అప్పటికి ఆలయంలోని మొదటి అంతస్థు మాత్రమే పూర్తయింది…
తరువాత గత సంవత్సరం మిగతా అంతస్థులు, ఉప ఆలయాలు పూర్తి చేసి, కలశ స్థాపన, ధ్వజారోహణం నిర్వహించారు… అంటే శిఖరాలు సహా మొత్తం గుడి నిర్మాణం పూర్తయింది… కానీ ఇంకా అనేక పనులు అలాగే పెండింగులోనే ఉండిపోయాయి…
వచ్చే ఏప్రిల్ చివరకు అవన్నీ, తుది మెరుగులు కూడా పూర్తి చేసి, మొత్తం టెంపుల్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయినట్టు అధికారికంగా ప్రకటిస్తారేమో… నృపేంద్ర మిశ్రా మాటలను బట్టి… ఏప్రిల్ 30 నాటికి కేవలం భౌతిక నిర్మాణమే కాకుండా, దానికి సంబంధించిన పేపర్ వర్క్, బిల్లుల చెల్లింపులు కూడా పూర్తి కావాలి…

ప్రధాన ఆలయం పూర్తయినా, చుట్టూ ఉండే సందరీకరణ పనులు (Beautification), భక్తుల సౌకర్యార్థం నిర్మించే మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి ఈ అదనపు సమయం తీసుకుంటున్నారు… ఈ వార్త ప్రకారం, మొత్తం ₹1,900 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేయగా, అందులో ఇప్పటికే ₹1,600 కోట్లు ఖర్చు చేశారు… మిగిలిన నిధులతో చివరి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి…

క్లుప్తంగా చెప్పాలంటే…: పూజలు ప్రారంభమైనప్పటికీ, ఒక భారీ నిర్మాణ ప్రాజెక్టుగా “సంపూర్ణంగా” (All technical & structural aspects), మొత్తం బిల్లుల చెల్లింపులు సహా పూర్తి కావడానికి ఏప్రిల్ చివరి వరకు సమయం పడుతుందని అర్థం… గుడి ప్రధాన నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ… ఏప్రిల్ తరువాత మొత్తం టెంపుల్ కాంప్లెక్స్ ట్రస్టు చేతుల్లోకి అప్పగించబడుతుంది… నిర్మాణ సంస్థలు వెళ్లిపోయాక కేవలం ఒక చిన్న మెయింటెనెన్స్ టీమ్ మాత్రమే అక్కడ ఉంటుంది…

రోజూ 75 వేల మంది సగటున వస్తేనే తిరుమల… ఇన్ని దశా బ్దాల పటిష్ట క్యూలైన్ సిస్టం, క్రౌడ్ మేనేజ్మెంట్ అనుభవం ఉన్న టీటీడీయే సతమతం అవుతుంటుంది… భక్తులకు గంటల కొద్దీ సమయం పడుతోంది… మరి అయోధ్య వర్గాలు చెబుతున్న ప్రకారం రామమందిర దర్శనానికి రోజూ లక్ష నుంచి లక్షన్నర మంది వస్తున్నారు… వీకెండ్స్లో 2 లక్షల వరకూ… ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారనేది విశేషమే…
నిజానికి టీటీడీ ప్రత్యేక టీమ్ అయోధ్యకు వెళ్లి క్రౌడ్ మేనేజ్మెంట్పై అయోధ్య సిబ్బందికి కొంత శిక్షణ, ఏర్పాట్లపై సూచనలు ఇచ్చి వచ్చారు… భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ట్రస్ట్ దర్శన సమయాలను కూడా నిర్ణయించింది… ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు… సాయంత్రం 2:00 నుండి రాత్రి 10:00 వరకు….

ఐనాసరే, ఆ వ్యవధిలో అంతమంది దర్శించుకోవడం విశేషంగా చెప్పుకోవాలి… కాకపోతే తిరుమలలో గర్భాలయం చిన్నది, ఒక్కొక్కరితో దర్శనం చేయించడంతో కొంత సమయం అధికంగా పడుతుంది… అయోధ్యలో గర్భాలయం, మండపాలు చాలా విశాలంగా ఉన్నాయి… భక్తులు ఒకేసారి పెద్ద సంఖ్యలో (దాదాపు 30- 40 అడుగుల దూరం నుండి) బాలరాముడిని దర్శించుకుని కదులుతూనే ఉంటారు… దీనివల్ల దర్శనం చాలా వేగంగా పూర్తవుతుంది…

అయోధ్యలో కొత్తగా నిర్మించిన ‘జన్మభూమి పథ్’ కూడా చాలా విశాలమైనది… వందలాది మంది భక్తులు ఒకేసారి క్యూలో నిలబడినా ఇబ్బంది కలగకుండా షెడ్లు, మంచినీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు…
హనుమాన్ గఢీ నుండి రామమందిరం వరకు భక్తుల ప్రవాహాన్ని నియంత్రించడానికి ప్రత్యేక బారికేడ్లు, వన్-వే మార్గాలను ఏర్పాటు చేశారు… తిరుమలలో భక్తులు కొన్ని గంటల పాటు క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉండాల్సి వస్తుంది, కానీ అయోధ్యలో ప్రవాహం (Continuous Flow) ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారు… అందుకే అక్కడ లక్ష లక్షన్నర మంది వచ్చినా దర్శనం సులభంగా జరుగుతోంది…
Share this Article