.
కాలం మారిపోయింది… జనాభా క్షీణిస్తున్న అనేక దేశాల్లో ప్రభుత్వం ఎన్నెన్నో భారీ ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా సరే, పెళ్లిళ్లకు నో, పిల్లలకు నో… డబుల్ ఇన్కమ్, నో చిల్డ్రెన్ పాలసీ ఇప్పుడు…
ధైర్యం చేసి ఒక్కరిని కన్నా, పెంచి, పెద్ద చేసి, మంచి విద్యాబుద్ధులు చెప్పించి, సెటిల్ చేసేసరికి వీడి తల తోకకొస్తుంది… వైద్యం, విద్య ఎట్సెట్రా అత్యంత ఖరీదైన అంశాలు ఇప్పుడు… అసలు మా తిండీతిప్పలకే దిక్కులేదురా అంటే సంతానం దేనికిరా బాబూ అనేదే ఇప్పుడు యువత కొత్త ఆలోచనల ట్రెండ్…
Ads
కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కుటుంబానికి ముగ్గురు పిల్లలు అనే పిలుపునిస్తున్నాడు… ఇద్దరు మీకు, ఒకరు దేశానికి అనేది ఆయన పిలుపులో మర్మార్థం… సమాజ పరిరక్షణ ఉద్దేశం అంటున్నాడు… కానీ అసలు నిజం అందరికీ తెలుసు… హిందూ ధర్మ పరిరక్షణ… గుడ్, ఆర్ఎస్ఎస్ చీఫ్గా తను చెప్పింది కరెక్టే అనుకుందాం కాసేపు…
ఈలోపు మిత్రుడు Nàgaràju Munnuru పోస్ట్ ఓసారి చదవండి…
ప్రతి హిందూ జంట ముగ్గురు పిల్లల్ని కనాలి: RSS చీఫ్ మోహన్ భగవత్…
భారతదేశం హిందూ దేశం అవడం అనే సుదూర స్వప్నం సంగతి అటుంచితే కనీసం దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు సెక్యులర్ దేశంగా ఉంచాలి అంటే దేశం హిందువులు మెజారిటీగా ఉండాలి.
కానీ ఈ కింది ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు?
1. పిల్లల్ని కనాలంటే ముందు పెళ్లి చేసుకోవాలి. (పెళ్లి చేసుకోకుండా కూడా పిల్లల్ని కనవచ్చు అనే తిక్క ప్రశ్నలు వేయకండి) పెళ్లి కావాలంటే అబ్బాయికి చదువు, ఉద్యోగం, మాంచి జీతం, ఇల్లు, పొలం, కారు లాంటి ఆస్తిపాస్తులు ఉండాలని, ఆడపడుచు , అన్నదమ్ముల గొడవలు ఉండకూడదు అని, అత్తమామలు బతికి ఉండకపోతే ఇంకా మంచిదని.. అమ్మాయి తరపు వాళ్ళు కండీషన్లు పెడుతున్నారు.. అబ్బాయిలు ఇవన్నీ సంపాదించే సరికి బెండకాయ ముదిరినట్టు ముదిరిపోతున్నారు.
2. అమ్మాయిలు చదువు, ఉద్యోగం కోసం పెళ్ళిళ్ళు ఆలస్యం చేయడం.. అందం, ఆరోగ్యం దెబ్బతింటుందని పిల్లల్ని కనడం వాయిదా వేయడంతో పిల్లల్ని కనే వయసు దాటిపోతుంది. IVF సెంటర్ల చుట్టూ తిరిగి ఒక్కరిని కనడానికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది.
3. మాకు పుట్టే సంతానం కాన్వెంట్ స్కూళ్ళో ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ఇంజనీర్, డాక్టర్ అవ్వాలి, అమెరికా, ఆస్ట్రేలియా పోయి గ్రీన్ కార్డు సంపాదించాలి అని ఎక్కువమంది హిందూ తల్లిదండ్రుల కోరిక. ఇలా ఒక సంతానం కని PG పూర్తి చేయించాలి అంటే లక్షల్లో కొన్నిసార్లు కోటి రూపాయలు మించి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాని మాకు పుట్టే సంతానం వ్యవసాయం చేయాలని, మార్కెట్లో పాలు, పూలు, కూరగాయలు అమ్మాలని, డైరీ ఫామ్, కోళ్ళు మేకల పెంపకం చేయాలని, మెకానిక్, ప్లంబర్, మేస్త్రి, కార్పెంటర్ పనులు చేయాలని ఎవరూ కోరుకోవడం లేదు. సమాజంలో ₹20-25 వేలకు కాల్ సెంటర్లో పనిచేసే ఉద్యోగికి ఉన్న విలువ నెలకు ₹50-60 వేలు సంపాదించే మేస్త్రికి లేదు.
4. ఇక చివరగా… హిందువులను ముగ్గురు సంతానం కనమని సలహా ఇచ్చేవారికి ప్రశ్న (RSS కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా మరెవరైనా కావచ్చు) సలహా ఇవ్వడం తేలిక.. అది అమలు చేయడానికి మీరు అందిస్తున్న ప్రోత్సాహం ఏమిటి? పెళ్ళిళ్ళు సరైన వయసులో చేసుకోవాలి, ఆస్తిపాస్తులు, కట్నాల విషయంలో మొండి పట్టుదలతో విలువైన వయసును వృధా చేయవద్దు అని హిందువులకు మార్గ నిర్దేశం చేస్తున్నారా?
ముగ్గురు సంతానం కనే జంటలకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నారా? మూడో సంతానం చదువు, పెంపకంలో ఏదైనా సహాయం చేస్తున్నారా? సంతానం ఎక్కువైతే పెద్దయ్యాక ఆస్తిపాస్తుల గొడవలు ఎక్కువ అవుతాయి. వాటిని సామరస్య పూర్వకంగా పరిష్కారం చేసే ఏదైనా వేదికలు ఏర్పాటు చేశారా?
4. చివరగా కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్న.. దేశ జనాభా నియంత్రణ, సమతుల్యత కొనసాగింపు మీద కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏమిటి? వచ్చే 20 నుండి 50 ఏళ్ల కాలంలో మారబోయే డెమోగ్రాఫ్ మార్పుల మీద ప్రభుత్వ విధానపరమైన ఆలోచన ఏమిటి? గ్రౌండ్ లెవల్లో యాక్షన్ లేకుండా కేవలం సలహాలతోని మార్పులు సాధ్యం కావు….. -నాగరాజు మున్నూరు
అయ్యా, మోహన్ భగవతూ... సగటు హిందూ కుటుంబం పిల్లల్ని కని సమాజం మీద వదిలేయదు... బాధ్యత తీసుకుంటుంది, పెంపకానికి, చదువుకు... పిలుపునివ్వడం కాదు, సాధ్యాసాధ్యాలు ఆలోచించాలి కదా...
Share this Article