Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కారం… తనే ఉరిపోసుకుంది ఇలా…

June 24, 2023 by M S R

కాపీరాయుడికి కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కారమా? కేంద్ర (అ)సాహిత్య అకాడమీ భావదారిద్ర్యం… సాహిత్యమా ఏదీ నీ దారి..? ఎటు నీ

పయనం.. కాపీరాయుళ్ళు తప్ప వేరెవరూ లేరా? హవ్వ! షేమ్..షేమ్..షేమ్..! సిగ్గుపడండర్రా…!!
2023 కేంద్రసాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీతల ఎంపిక తుది జాబితా ఒకటి బయటికి వచ్చింది.‌ అందులో తక్కెడశిల జానీ అనే వారికి కవిత్వం, విమర్శ రెండు కేటగిరీలలో ఎంపికకు పేరు నమోదైంది. ఇందులో… 1991 లో వచ్చిన ” వివేచన” ( విమర్శ) కు జ్యూరీ యువపురస్కారానికి ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
చిత్రమేమంటే.. ఈ ఎంపికను అకాడమీ జనరల్ కౌన్సిల్ ఎలా ఆమోదముద్ర వేశారన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న? జనరల్ కౌన్సిల్ లో మృణాళిని (కన్వీనర్) బెల్లంకొండ ప్రసేన్, ఎస్వీ సత్యనారాయణ, మందలపర్తి కిషోర్ సభ్యులుగా వున్నారు… ఈ అనుభవం పండిన సాహితీ దిగ్గజాలకు కాపీ ‘తక్కెడశిల’ గురించి తెలియకపోవడమే.. చిత్రం.. విచిత్రం.! ఏదైతేనేం? జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు ఎవరు ‌సిగ్గుపడాలో తేలాల్సి వుంది….!!
ఎవరీ తక్కెడశిల.. ఏమాకథ..?
కలం పట్టుకుంటే, ఆయన వాక్యం… ఆయన‌ రాయనే రాయడు…!! ఎవరీ ‘విప్లవ ‘ సూరీడు ? ఎవరీ అరివీర భయంకరుడు ? కవిత్వమా? ఏదీ నీ ‘ దారి ‘ ? ‘విప్లవ సూర్యుడు’ అనే ఓ కవిత్వ సంపుటిని చదవాల్సి వచ్చింది. చదివాను.. చదివాక మైండ్ బ్లాంక్ అయి…” తను కదా ! ఈ కాలపు “కాపీ ” కవి అంటే.‌.” అనిపించింది..!!
జానీ భాష చరణ్ తక్కెడశిల..!! (అఖిలాశ) దీని కర్త. కర్మ. క్రియ.!! నిజానికి ఈ పుస్తకాన్ని బలవంతంగా చదవాల్సి వచ్చింది. చదివాక బుర్ర గిర్రున తిరిగింది. మళ్ళీ కోలుకొని, మామూలు కావడానికి రెండుమూడు రోజులు పట్టాయి..ఈ పుస్తకంలో 40 కవితలున్నాయి‌. అవన్నీ ఒక్కరోజే రాసేశాడట.
జానీ బాషాచరణ్ తక్కెడశిల.‌! (ఈ విషయం ఆయనే చెప్పుకున్నాడు) మచ్చుకు ఈ కవితా సంపుటిలోని మూడు కవితల్ని మీ ముందుంచుతున్నాను… చిత్తగించండి.!.(చదివి నన్ను తిట్టుకోవద్దు ప్లీజ్ )
1.” నేను “…కవిత..!!
భూతమ్ నా బందమ్
స్వర్గం నా గృహమ్
నేను రాసేదే పద్యమ్
నేనే పాడేదే కావ్యమ్
గిరులు, సాగరులు
నదులు, సెలయేర్లు
లోకాలు, శోకాలు
ఇవే నాకు అష్టైశ్వ్యర్యాలు
ఋషులే నా నేస్తాలు
దైవాలే నా సహోదరులు
కిన్నెరులు, కింపురుషులు
నా తోటి ప్రయాణికులే
నా వాక్కే కర్ణ కఠోరం
నా బాటే అనితర సాధ్యం
నా మార్గమే స్వర్గ-నరక
అతీత ద్వారం
నేనొక దుర్గంధ సుగంధం
నా చూపు మహోద్రేకం.”…
— తక్కెడశిల.!!
కవిత చదివారు కదా.!. ఇక ఆ కవితలోకి తొంగి చూద్దాం..!!
ఈయన భూతనాథుడు.
భూతమ్ తోనే ఈయన బంధం.
స్వర్గం ఈయన గృహం.
ఈయన పద్యం రాస్తాడు…
కావ్యం పాడతాడు…
ఈయన ఎంతో ఐశ్వర్యవంతుడు.
డాలర్లు, రూపాయలు, ఆస్తులు పాస్తులు కాదు..
గిరులు సాగరులు లోకాలు, శోకాలు నదులు
ఎట్సెట్రా అన్నీ ఈయన అష్టైశ్వర్యాలేనట.
ఈయనకు రుషులు నేస్తాలు.
ఈయన గారు దేవుడికేం తక్కువ కాదు.
ఎందుకంటే… దైవాలే ఈయన సహోదరులు.
కిన్నెరులు, కిం పురుషులు ఈయన గారి
తోటి ప్రయాణికులు.
ఈయన వాక్కు కర్ణ కఠోరం..
(ఈ సంగతి ఆయనే చెప్పుకున్నారు.)
“నా బాటే అనితర సాథ్యం”……
(నిజాన్ని ఎంత నిక్కచ్చిగా చెప్పుకున్నాడో చూడండి.)
“నామార్గం స్వర్గ నరక అతీత ద్వారం.”
(ఇదెక్కడుందో వెతకాల్సిందే.)
“నేనొక దుర్గంథం…”….
(ఈయన గారి నిజాయితీని మెచ్చుకోవాల్సిందే )
తక్కెడశిల
అన్నట్టు ఈ లయ …. ఎక్కడో విన్నట్టుంది కదా..
ఆ.. ఆ.. అదేనండీ…. మహాప్రస్థానంలో …
” ఐ ” అనే శీర్షికతో శ్రీ శ్రీ గారు రాసిన కవిత…!

( ఓ లుక్కేసుకోండి…)



“భూతాన్ని , యజ్ఞోపవీతాన్ని
వైప్లవ్య గీతాన్ని నేను
స్మరిస్తే పద్యం
అరిస్తే వాద్యం
అనల వేదికముందు అస్ర నైవేద్యం
“లోకాలు , భవభూతి శ్లోకాలు
పరమేష్ఠి జూకాల నా మహోద్రేకాలు
నా ఊహ చాంపేయ మాల
రసరాజ్య డోల
నా ఊళ కేదార గౌళ !
గిరులు, సాగరులు, కంకేళికా మంజరులు
ఝరులు నా సోదరులు
నేనొక దుర్గం
నాదొక స్వర్గం
అనర్గళం, అనితర సాథ్యం , నా‌మార్గం.!
— శ్రీ శ్రీ !!


ఇంకో కవిత… యుగాంతం”..!!
“వస్తున్నది వస్తున్నది వస్తున్నది
పెళ.. పెళ… పెళమని
గణ… గణ.. గణమని
భీంకారాలు.. హుంకారాలు.. హాహాకారాలు
రుద్రునిలా. వీరభద్రునిలా
వస్తున్నది… వస్తున్నది… గర్జిస్తూ
కాలాన్ని కాటేస్తది..
దేహాన్ని పాతేస్తది..
పుడమిని పూడ్చేస్తది..
సర్వం మింగేస్తది…”
— తక్కెడ శిల…!!


ఈ కవితలో ఏదో “ యుగాంతాన్ని “ సూచిస్తున్నాడు ఈయన.
అదిగో “వస్తున్నది.. వస్తున్నది అంటూ ..
భయపెడుతున్నాడు.
పెళ..పెళ..పెళమని…. గణగణ గణమని
భీంకారాలు.. హూంకారాలు.. హాహాకారాలు
చేస్తూ మరీ వస్తోందట.
ఆ మహమ్మారి ఎలావుందంటే…..?
రుద్రునిలా.. వీరభద్రునిలా..
గర్జిస్తూ వస్తున్నదట
అది… కాలాన్ని కాటేస్తదట
దేహాన్ని పాతేస్తదట
పుడమిని పూడ్చేస్తదట
సర్వం మింగేస్తుందట..”.
సో… మీరంతా బహుపరాక్ అంటూ హెచ్చరిస్తున్నాడు.
ఇది చదివాక పాపం శ్రీశ్రీ ఏమనుకుంటాడో కదా! ఆయన గంటలు , మరోప్రపంచం, జగన్నాథ రథ చక్రాలు మాత్రం ఖచ్చితంగా నోరెళ్ళబెడతాయి. ఇది కన్ ఫర్మ్..!!
“గంటలు గంటలు గంటలు గంటలు
గంటలు గంటలు
గణ గణ గణగణ గణగణ గంటలు “
“మరో ప్రపంచం మరో ప్రపంచం
………………………….
త్రాచుల వలెనూ.
రేచుల వలెనూ
ధనంజయునిలా సాగండి “
వస్తున్నా యొస్తున్నాయి
జగన్నాథ
జగన్నాథ
జగన్నాథ రథ చక్రాలు”.

….. శ్రీ శ్రీ !!

Ads



3. ఇక ముచ్చటగా మూడో కవిత !!
“జాని – నిజాలు..”
ఏది నిజం… ఏది నిజం?
నీవన్నదా…. నేనన్నదా
ఏది నిజం… యేది నిజం?
లేదు నిజం… లేదు నిజం..
నా నిజం నీ నిజమా..?
నీ నిజం నా నిజమా..?
ఇది నిజం… నిజం.. !
ఇదే జాని.. నిజా యిజం “

— తక్కెడ శిల.!!



అవును ఏది నిజం.?
నేనన్నది మీరన్నది…..?
నా కవితా? లేక శ్రీ శ్రీ గారి కవితా?…
అంటూ నిలదీస్తున్నాడు..
ఇది కవిగారి ఆత్మాశ్రయ కవితలా వుంది.
అయితే..
లేదు నిజం.. లేదు నిజం అంటూ అన్యాపదేశంగాఅసలు నిజాన్ని చెప్పేస్తున్నాడు.
“ఇదే జాని….నిజాయిజం..”..
అంటూ చివరకు తన నిజాయిజాన్ని చెప్పేశాడు.
కవర్ పేజీ వెనుక కవితను ఒక్కసారి గమనించండి… ఎక్కడో విన్నట్టు ఉంది కదూ.. మీ అనుమానం నిజమే… మళ్ళీ శ్రీశ్రీ గారి పాపులర్ కవితకు ఇదో మక్కికి మక్కి కాపి..!
ఆయన.. ఏడవకండేడవకండి.. వస్తున్నా .. నే వస్తున్నా”
అనంటే… ఈయనేమో
“ప్రజలారా!
బాధపడకండి. బాధపడకండి
వస్తున్నా! వస్తున్నా.
విప్లవ సూర్యుడినై..” అంటాడు.
ఓరి.. ఓరోరి
బీదలారా! సాదలారా!
బాధలతో బతుకు
కాలిన జీవులారా!
బ్రతకలేక బతుకే లేక
బిక్కుబిక్కుమంటూ
జీవించే దీనులారా.
కూడు లేని గూడు లేని
ప్రజలారా! నా సోదరులారా!
బాధపడకండి బాధపడకండి
వస్తున్నా! వస్తున్నా!
విప్లవాక్షరాలతో
విప్లవ సూర్యుడినై…‌”
— తక్కెడశిల, విప్లవ సూర్యుడు.
దీని మూలం వేరే చెప్పాలా?
ఈయన కవిత్వం చదివాక ఈయన శ్రీశ్రీకి ‘వీర కాపీయిస్ట్’ అని ఎలాగూ తెలుస్తుంది కాబట్టి… ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న గిల్టీ తో….
“నేను శ్రీశ్రీనే కాదు… అసలు తెలుగు కవిత్వమే చదవలేదు”.. అని చెప్పుకుంటాడు‌..
(ఇది పచ్చి అబధ్ధమని ఈయన తవికలు చదవగానే ఇట్టే అర్ధమైపోతుంది. అది వేరే సంగతి)
తక్కెడశిల
ఇప్పుడు చెప్పండి డ్యూడ్…
దీన్నేమనాలి.?
కవిత్వమా? కపిత్వమా? కాపీయిత్వమా?
ఇది కవితా? తవికా?
ఇది చోరత్వమా? జారత్వమా?
అమాయకత్వమా? మూర్ఖత్వమా?
ఏదైతేనేం కానీ…” కవి” కావాలన్న ఈయన
కోరికను అభినందించాల్సిందే. అన్నట్టు …
ఈయన కవిత్వంతో ‘అఖిలాంధ్రను’ ఆనందత్వంతో నింపేస్తాడట… జర భద్రమ్ సుమీ.!
(వార్తాపత్రికల్లో ఈయన పాపులర్ కవి. ఈయన కవితలు పత్రికల్లో తరుచూ అచ్చవుతుంటాయి)
అన్నట్టు..’ విప్లవ సూర్యుడు ‘ పేరుతో సంకలనం వచ్చేసింది. దీన్ని ఒక రాత్రిలో కూర్చొని ఒకేపట్టాన రాసిపారేశాడట. ఈ విషయాన్నిఆయనే
స్వయంగా చెప్పుకున్నాడు. ఈయన గారు బహుగ్రంధ కర్త.. “వై “అనేపేరుతో ట్రాన్స్ జెండర్ మీద సుమారు 120 పేజీల దీర్ఘకవితను రాసి, అనంతపూర్ లో ఓ పెద్ద సభలో ఆవిష్కరించడం కూడా.
ఈ పుస్తకం చదివాక అంతకు ముందెప్పుడో ట్రాన్స్ జెండర్ మీద ” రేణుక అయోలా ” గారు రాసిన “మూడోమనిషి” గుర్తుకొచ్చాడు.
ఇప్పటికే తెలుగు కవితా లోకాన్ని ఈ “విప్లవసూర్యుడు తెగ దున్నేస్తున్నాడు…
సో…క విత్వమా ! నీ దారెటు ?
*తక్కెడ శిల “దెబ్బకు మరో కవి “ ఠా “…!!
ఈసారి “తక్కెడశిల “దెబ్బ….. మెర్సీ మార్గరెట్ వంతు!!
మెర్సీ మార్గరెట్..! సాహిత్య అకాడమీ యువకవి పురస్కార గ్రహీత. ఫేస్బుక్ పాఠకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఓ మంచి కవయిత్రి పదికాలాలు గుర్తుండిపోయే కవితలు రాసి గుర్తింపు తెచ్చుకున్న యువతరంగం. అంతా బాగానే వుంది కానీ… మెర్సీ కవితలు కొన్ని చౌర్యానికి గురయ్యాయి. ఆమె పాపులర్ కవితల్ని తీసుకొని కాస్త అటుఇటు మార్చి సొంతం చేసుకున్నడీ చోరశిఖామణి తక్కెడశిల జాని బాషా చరణ్ “ ఉరఫ్ ‘ అఖిలాశ …
(ఇది ఈయనగారి కలం పేరు ) ఈ తవికలు పత్రికల్లో కూడా అచ్చయ్యాయి. వీటిని చూసి ఒరిజినల్ పోయెమ్స్ రాసినవారు ముక్కున వేలేసుకోవాల్సిందే.
ఓ పోయెమ్ ను ఎలా కాపీకొట్టాలి? ఎలా మాడిఫై చేయాలి? దాన్ని ఎలా పత్రికల్లో అచ్చేయించుకోవాలన్న విషయమై ఎవరికైనా సమాచారం కావాలంటే ఈయనను సంప్రదిస్తే సరి.
జాని.. ఒన్ పీస్ కాపీరైటర్ కేరాఫ్ బెంగళూరు ప్రతిలిపి కార్యాలయం! జగమెరిగిన మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానాన్నే కాపీకొట్టిన ఈయనకు వర్తమాన కవుల కవితల్ని కాపీ కొట్టడం ఓ లెక్కా? ఈసారి ఏ మాత్రం మెర్సీ లేకుండా మార్గరెట్ కవితల్ని కాపీకొట్టాడు ఈ ఘనుడు. ఆవైనమేంటో చూద్దామా!
ముందుగా.. .మెర్సీ రాసిన పోయెమ్ (ఒరిజినల్ ) ను చదవండి‌!

“మాటల మడుగు”కవిత…. మెర్సీ మార్గరెట్. !!
“ఒకప్పుడు
నోటి నిండా మాటలుండేవి
మాటలకు మొలకల వేళ్ళుండేవి
పచ్చగా మొలకెత్తేందుకు అవి
సారవంతమైన నేలలు వెతికేవి
ఒకప్పుడు
నోటినిండా మాటలుండేవి
మాటలన్నీ శిల్పాలుగా మారేందుకు
ఒకదాన్నొకటి పెనవేసుకుని, అంటిపెట్టుకుని
ఉలి మొన స్పర్శ కోసం సిద్ధమై
శిల్పాలవడానికి ఆత్రంగా ఉవ్విలూరేవి
ఒకప్పుడు
నోటినిండా మాటలుండేవి
మాటలన్నిటి కాళ్ళకి ఘల్లున మ్రోగే
మువ్వలుండేవి
మువ్వలన్నీ సంతోషంగా నృత్యం చేస్తూ
మాటలకు విలువ పెంచేవి
అవును
ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి
మాటలకు రుచుండేది
మసక కన్నుల్ని వెలిగించే నిప్పు రవ్వలుండేవి
చెమట చుక్కల్ని కౌగలించుకునే చేతులుండేవి
కడుపు నింపే ధాన్యపు గింజల్లా ఉండేవి
కాని ఇప్పుడేమయ్యిందో
నోటినిండా మాటలున్నాయి
మాటలన్నీ గాలికి తేలిపోయే తాలులా
వరిపొట్టులా ఉన్నాయి
మాటల్ని తోడుకునే నాలుక చివర నుండి
గొంతుకపై కొన్ని చేతుల ఉరి కాపలాకాస్తుంది
మాటలన్నీ గవ్వలై
మట్టి పెళ్లలై
కాళ్ళు చేతులు విరిగిన బొమ్మలై
నిస్తేజంగా ఉన్నాయి
ఇప్పుడూ నోటినిండా మాటలున్నాయి
మాటలన్నీ ఆ పహారాకి ఘనీభవించి గడ్డకట్టి
మంచు శిలలై , మౌన తపస్సు చేస్తున్నాయి
ఎవరైనా సహాయానికి రండి నాతోపాటు
ఆ చేతుల్ని నరికి మంటజేసి
మాటల్ని కరిగించడానికి
మళ్ళీ ఆ మాటల్ని ప్రాణమూర్తుల్ని

చేయడానికి “..



సమాచార విప్లవంతో ఇళ్ళల్లో మాటలు కరువైన సందర్భంగా మార్గరెట్ రాసిన
ఈ కవిత పాఠకుల ఆదరణ పొందింది. మనుషుల మధ్య ఘనీభవించిన మాటల్ని
కరిగించడానికి ఏదైన ఉపాయం వెదకాలన్న కవయిత్రి లక్ష్యం గొప్పగా
వుంది.
ఈ కవతను మన సోకాల్డ్ చోరశిఖామణి తస్కరించి, తనదైన పధ్ధతిలో మార్చుకున్నాడు, ఆ వైనమేదో మీరే చూడండి.
“మూగబోయిన మాటలు… తవిక .!!
“ఆ రోజుల్లో మా నోటినిండా మాటలే
అవి నిత్య కుసుమాలై పరిమళిస్తూ వుండేవి
అనుబంధాల ఎరువుతో సేద్యం చేసి
ప్రేమ పంటను ఊరంతా పంచే వారము
నేడు ఆపంటకు కరువొచ్చింది ఎందుకంటే
మా గుండెల్లో కాంక్రీట్ గోడలు వెలిసి
నోటికి నిశ్శబ్ద కంచెను కాపలా బెట్టడంతో
మాటలన్నీ ఈనగరం కూడలిలో
నాగరికత స్తంభానికి ఉరేసుకున్నాయి
సూర్యుడు పెరిగే సమయం నుండి
చంద్రుడు కరిగే సమయం వరకు
మాటల ఊటలు ఊరి శ్రమను మోస్తున్న
హృదయానికి అమృతమై దాహం తీర్చేవి
నేడు ఆ అమృతపు మాటలు
కరెన్సీ నోట్ల కట్టల కొండలపై నుండి దూకి
ప్రాణాలను శూన్యానికి నైవేద్యంగా సమర్పించాయి
ఒకప్పుడు నదిలాంటి స్వచ్ఛమైన నోరు
గాయాల దేహాలకు వైద్యంచేసి అండగా నిలిచేది
నేడు ఆ నోటి నదిలో మాటల నీరు ఇంకిపోయి
అంతర్జాల సాగరంలో అభద్రతా అలలపై తేలియాడుతున్నాయి
సమయం లేదు నేడో రేపో ఎప్పుడైనా
ఈ మాయాలోకాన్ని వీడాల్సిందే
హృదయాన్ని తెరిచి మోముపై నవ్వులు పరిచి
నోటి నుండి ఆణి ముత్యాల్లాంటి మాటలను
సమాజంపై వెదజల్లి తోటి వారి మనసు గెలవాల్సిందే..!!”

— అఖిలాశ‌!! ( ఉరఫ్ తక్కెడ శిల జానిబాషా చరణ్ )



చూశారు కదా.. కవిత ఎత్తుకోవడం దగ్గర నుంచి (‘శీర్షికతో సహా ) అంతా మెర్సీ దయే..!!
మెర్సీ మార్గరెట్ రాసిన మరో కవిత “సీడ్ బాల్ !! కూడా ‘తక్కెడ ‘దెబ్బకు విలవిల్లాడిపోయింది.
ముందుగా మెర్సీ (ఒరిజినల్ ) పోయెమ్ ను చదవండి.

“సీడ్ బాల్.”కవిత … మెర్సీ మార్గరెట్



“ఒక
మనిషిని నాటాలి
ఇంటిముందు జాగాలోనో
జాగాలేని కాంక్రీట్ ముక్కల షో కేసుల్లో
ఒక కుండీ తెచ్చి
ఒక మనిషిని నాటాలి
మట్టిని తవ్వి
పాదు తీసి
గుండెలో కళ్ళలో ఊరే తేమతో
మనిషిని నాటేందుకు కొంత సమయం చేసుకోవాలి
మంచి మనుషుల్ని
ఓపిగ్గా మాట్లాడే మనుషుల్ని
మాట్లాడినంత సేపు శ్రధ్థగా వినే మనుషుల్ని
గాలించి మరీ
సీడ్ బాల్స్ లా
ఉన్నపళంగా చేతులతో చుట్టి దాచేయాలి
ఒక మనిషిని నాటాలి
నిర్మలమైన మనసున్నళమనిషిని
కలుషితమైన ఆలోచనావరణంలో
స్వఛ్ఛమైన ప్రేమను వీచే మనిషిని
భారంగా గుండె పట్టు తప్పి తుళ్ళి పడేటప్పుడు
ఆత్మీయంగా చేతులుచాచి
గుండెలకి హత్తుకునే మనిషిని నాటాలి”

…………….18..5..2017.



మనిషన్నవాడు మాయమౌతున్న ఈ రోజుల్లో ఓ మనిషిని నాటాలన్న మెర్సీ లక్ష్యం గొప్పది.
ఈ కవితను కొట్టేసి మన చోర శిఖామణి ఎలా మార్చాడో చూస్తే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే.

ఇప్పుడు తక్కెడ వారి తవికను చదవండి!!



*హమ్ సబ్ ఏక్ సాథ్ ….!!
“మనమొక జెండాను నాటుకోవాలి
కూడలిలోనో
కార్యాలయంలోనో కాదు
ఒక ముద్ద స్వఛ్ఛమైన మట్టిలో
శరీరం నెట్టేసినా
చెమట చుక్కలను కలుపుకొని
మట్టి ముద్దను తయారుచేసి
అందులో మూడు రంగుల వెన్నెల
ఇరవై నాలుగు కిరణాలు కలుపుకొని
శరీరమంతా నాటుకోవాలి
మనకొక నినాదం కూడా కావాలి
కన్నుల కొమ్మనుండి
రాలుతున్న నీటిని ఒడిసి పట్టుకొని
చీకటి అగాథాల్లో తప్పిపోయిన
ఆ నినాదాన్ని కన్నీటితో కడిగి
దేశ సరిహద్దులలో
వంతెన ఏర్పాటు చేసుకోవాలి
అమ్మ గుండెకు పూసిన ప్రేమకు
ముల్లులు లేని గులాబీలను పొదిగి
వంతెనకు ఇరువైపులా నాటుకోవాలి
అదే వంతెన ప్రపంచ పటపు
రక్తపు గీతలను చెరపాలి
అలాగే మన దోసిళ్ళతో
కాసిన్ని అక్షరాలను తీసుకొని
కులమత జాతి వర్గ జాతి ప్రాంతాలతో
చెదిరిపోయిన మనిషిని
అక్షరాలతో శుభ్రపరిచి
దేశమంటే నీవో నేనో కాదని
దేశమంటే మనమని
గట్టిగా కేకవేసి చెప్పాలి
నేనిప్పుడే అక్షరాల పొలికేక వేశాను
నా గొంతుతో
మీ గొంతులను కలపండి
ఇప్పుడు ఒకే పిడికిలి కాదు
ఒకే గొంతు కూడా కావాలి
ఆ గొంతు నుండి
ఒకే ఒక కేక వెయ్యాలి

అదే.. అదే.. హమారా దేశ్ మహాన్ “..



చూశారుగా ఈ తవికలో ఎంత దేశభక్తిని నూరిపోశాడో! ఇందులో తక్కెడగారు అక్షరాలా పొలికేక కూడా వేశారు. బహుశా ఈ పాటికే ఈ పొలికేక మీ చెవుల్లో ఘూర్ణిల్లుతూ వుండాలి. ఇందులో తన గొంతుతో మన గొంతుల్ని కూడా కలిపి కేక వేయాలంటున్నాడు. ఎంత ప్రమాదభరిత ప్రపోజల్..? తస్మాత్ జాగ్రత్త !!—– ఎ.రజాహుస్సేన్.‌!!



Prasen Bellamkonda స్పష్టీకరణ ఏమిటంటే… 

.
కేంద్ర సాహిత్య అకాడమి యువ అవార్డు గురించి…
అవార్దుకు సంబంధించిన విషయం అనగానే జనరల్ కౌన్సిల్ సభ్యులుగా మృణాళిని గారు, ఎస్వి గారు అండ్ యువర్స్ ఒబీడియంట్లీ, మందలపర్తి కిషోర్ అనబడే నలుగురి పేర్లు ఎవరికైనా గుర్తుకు రావడం సహజం. కనుక ఇవాళ ఉదయం నుంచి మా పేర్లను పలు సందర్భాలలో పలువురు ఉదహరించి ఉండవచ్చు.

మృణాళిని గారు కన్వీనర్ గా మా టీం పనిచేయడం మార్చిలో మొదలైంది. ఈ యువ అవార్దు ఎంపిక ప్రక్రియ.. అంటే జ్యూరీ ఎంపిక, షార్ట్ లిస్టింగ్ వంటి కార్యక్రమాలు… అంతకు పది నెలల ముందే ప్రారంభం అయాయి, ముగిసాయి కూడా. అవార్డు ఎంపిక తేదీ నాటికి మృణాళిని గారు కన్వీనర్ కనుక జ్యూరీ సమావేశాన్ని ఫెసిలిటేట్ చేయడం అనే పనిని మాత్రం ఆవిడ పర్యవేక్షించారు. అంతకు ముందెప్పుడో జరిగిపోయిన జ్యూరీ ఎంపికలో కానీ జ్యూరీ నిర్ణయంలో కానీ మృణాళిని గారి ప్రమేయం రవ్వంత కూడా లేదు… ఉండదు. మిగిలిన ముగ్గురు జనరల్ కౌన్సిల్ సభ్యుల ప్రమేయం కూడా అసలే లేదు… ఉండదు. ఇక్కడ జ్యూరీ నిర్ణయమే ఫైనల్. కొన్ని అపార్ధాలను తుడిచెయ్యాలని ఈ వివరణ.


రజా హుస్సేన్ మరో పోస్టులో ఇంకాస్త యాడ్ చేశారు… అదే ఇది…
మరి ఈ పాపం ఎవరిది..?

యువపురస్కార జ్యూరీ సభ్యులు ఆవుల మంజులత, వడ్డేపల్లి కృష్ణ,. దర్భశయనం శ్రీనివాసాచార్య ఈ ఎంపిక చేశారు. ఒక కవి కవిత్వాన్నో, విమర్శకుడి విమర్శనో ఫైనల్ చేసే సమయంలో ఎంతో ఎక్సర్ సైజ్ చేయాలి. ఆ కవి తాలూకు సాహిత్య కృషి పూర్వాపరాలను కూలంకషంగా పరిశీలించాలి.. చర్చించాలి.. అతడు రాసిన ఇతర పుస్తకాల సమాచారాన్ని వడపోయాలి.‌ అప్పుడు గాని పురస్కార అర్హతపై ఒక నిర్ణయానికి రావాలి.

కానీ.‌ తక్కడశిల జానీ విషయంలో ఇవేం.. జరిగినట్టులేదు.. ఎందుకంటే అతడో కాపీ కవి అని, శ్రీశ్రీ మహాప్రస్థానాన్నే మక్కికి మక్కి దించి “విప్లవ సూర్యుడు” అనే పుస్తకాన్ని సైతం ముద్రించాడని సాహితీ లోకం మొత్తానికి తెలుసు.. చిన్నపిల్లాడ్ని అడిగినా ఈ సంగతి చెబుతారు.. అలాంటిది వెనుకా ముందూ చూడకుండా.‌ ఏకపక్షంగా తక్కెడశిల జానీకి సంబంధించిన కవిత్వం, విమర్శ రెండు కేటగిరీల్లో కూడా పేరు ఫైనల్ చేశారు. కనీసం

ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా ఆలోచించకుండా, నిస్సిగ్గుగా యువ పురస్కారానికి జానీ పేరును ఫైనల్ చేశారు.‌ ఇది అత్యంత దురదృష్టకరం. ఈ శతాబ్దిలోనే సాహిత్య అకాడమీ చేసిన చారిత్రక తప్పిదం…




Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions