Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజాలా అనుభవించాడు – అటెండర్‌గా బతుకీడ్చాడు …

June 24, 2023 by M S R

రాజాలా అనుభవించాడు – అటెండర్ గా బతుకీడ్చాడు ..

సీఎంతో టిఫిన్ .. ప్రధానితో లంచ్ చేయాలి అంటే జర్నలిజంలోకి రండి …

జర్నలిస్ట్ జ్ఞాపకాలు –

Ads

————————————

మాసిన బట్టలతో దాదాపు 60 ఏళ్ళ వయసున్న అతను సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందరికీ టీ ఇచ్చేవాడు . అటెండర్ గానే పరిచయం . అక్కడికి వచ్చే నాయకులు ఎంతో కొంత ఇస్తే అదే అతని బతుకు తెరువు . ఓరోజు ఎందుకో హఠాత్తుగా అప్పటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి చరణ్.. ‘మురళీ అతను ఎవరో నీకు తెలుసా?’ అని అడిగాడు . అటెండర్ గురించి తెలుసా అని అడగడానికి ఏముంటుంది ? అనిపించింది .

సంగడు తెలియక పోవడం ఏముంది అన్నాను . అప్పటి వరకు నాకు తెలిసిన అతని పేరు సంగడే .. అందరూ అతన్ని సంగడు అనే పిలిచే వారు . అతని పేరు సంగడు కాదు, సంగమేశ్వర్ రావు గారు అని స్వామిచరణ్ చెప్పుకొచ్చారు . హైదరాబాద్ లో నలుగురైదుగురికి మాత్రమే ఏసీ కారు ఉన్న రోజుల్లో అతను హైదరాబాద్ లో అడుగు పెట్టాడు, అతని కోసం ఏసీ కారు వచ్చేది అని చెబితే నమ్మలేక పోయాను . 1988-89 ప్రాంతంలో సంగారెడ్డిలో జిల్లా రిపోర్టర్ గా ఉన్నప్పుడు మాజీ స్పీకర్ పి.రామచంద్రారెడ్డి బిల్డింగ్ లోనే జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఉండేది . అక్కడే సంగడు పరిచయం . స్వామి చరణ్ చెప్పింది నమ్మలేక సంగమేశ్వర రావు గారు సంగడు గా ఎలా అయ్యాడు అని అతన్నే అడిగాను .

******

ఉదయం సీఎంతో టిఫిన్ చేసి , మధ్యాన్నం ప్రధానితో లంచ్ చేయాలి అంటే జర్నలిజంలోకి రండి .. ఇలానే సాగేది హైదరాబాద్ లో ఓ ప్రైవేటు జర్నలిజం స్కూల్ ప్రకటన . ఇప్పుడు కనిపించడం లేదు కానీ ఓ 20 ఏళ్ళ క్రితం ఈ ప్రకటన రోజూ కనిపించేది . నిజంగా జర్నలిస్ట్ ల జీవితం అంత అద్భుతంగా ఉంటుందా ?

ఇప్పుడు కాదు, ఎప్పుడూ అంత అద్భుతంగా లేదు . ఉండదు . సీఎంలకు , పీఎంలకు మరే పని లేనట్టు జర్నలిస్ట్ లతో టిఫిన్ చేయడం , లంచ్ చేయడమే పనా ? ఇంట్లో భార్యా పిల్లలకు జ్వరం వచ్చినా ఆస్పత్రికి వెళ్లేంత సమయం ఉండదు . కానీ ఓ సినిమా యాక్టర్ భార్య ప్రసవిస్తే గంటల తరబడి ఎండలో కెమెరాలతో ఆస్పత్రి వద్ద పడికాపులు కాయాలి . వాస్తవానికి , ప్రకటనలకు ఎంత తేడా ఉంటుందో ఈ ప్రకటన , ఆస్పత్రి వద్ద పడిగాపులు కాసిన జర్నలిస్టుల ఫోటోనే సాక్ష్యం .

ప్రజాప్రతినిధులు , అధికారులు , చివరకు అందరినీ వణికించే లోకల్ గుండాలు సైతం నమస్తే అన్నా అని పలకరించడం మద్యం కన్నా మత్తుగా ఉంటుంది . సగం జీవితం … అయిపోయాక ఆ మత్తు దిగి అసలు జీవితం అర్థం అవుతుంది . నక్సలైట్ల నాయకుడిగా లక్షల రూపాయల డెన్ బాధ్యతలు నిర్వహించి , తరువాత జర్నలిజంలోకి వచ్చి తమను తాము కంట్రోల్ చేసుకోలేక దయనీయమైన స్థితిలో చనిపోయిన జర్నలిస్ట్ మిత్రులు తెలుసు ….

ఓ వీడియో ఆ మధ్య బాగా పాపులర్ అయింది . టివి 9 రిపోర్టర్ అంటే లోకల్ గా చాలా శక్తి వంతుడు అని అర్థం . ఆ శక్తి మొత్తం చేతిలో లోగో ఉన్నంత వరకే . లోగో లాగేసుకుంటే నీటిలో నుంచి బయట పడ్డ చేపలా గిలగిల కొట్టుకుంటారు . ఏం జరిగిందో అతన్ని ఛానల్ నుంచి తీసేస్తే టివి9 స్టూడియోలో రవిప్రకాష్ కాళ్ళు పట్టుకొని బతిమిలాడుతున్నాడు . ఎవరో దీన్ని వీడియో తీశారు .

కొంతకాలానికి రవిప్రకాష్ ను కూడా ఇలానే బయటకు పంపారు . అలానే గిలగిల కొట్టుకున్నా , డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకో ఛానల్ పెడతారు , ఛానల్ పెట్టే వారు దొరుకుతారు . అలాంటి వారి పరిస్థితి వేరు . కానీ ఛానల్ లోగోను చూసుకొని తమంత మొనగాడే లేడు అనుకునే వారు , లోగో లాగేసుకుంటే హీరో నుంచి ఒక్కసారి గా జీరో అవుతారు . మారిన కొత్త జీవితాన్ని జీర్ణం చేసుకోవడం అంత ఈజీ కాదు .

ఎడిటర్ గా ఉన్నప్పుడు తలపొగరుతో ఉండే ఒకరు, అది పీకేశాక ఓ జర్నలిస్ట్ తో చాలాసేపు ఆప్యాయంగా మాట్లాడారు . అది నిజమా అని అతను నమ్మలేక పోయాడు . కలిసిన వారందరికీ ఈ విషయం చెప్పుకున్నాడు . ఇందులో నమ్మక పోవడానికి ఏముంది ? పీకేసిన ఎడిటర్ ను పలకరించే వాడు ఎవడు ? నువ్వు కలిశావు కాబట్టి అంత ఆప్యాయంగా మాట్లాడాడు అని చెప్పాను . లోకల్ రిపోర్టర్ ( స్ట్రింగర్ ) మరణించినప్పుడు చందాలు వేసుకొని దహన సంస్కారాలు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి …

*****

ఇది సరే ముందు సంగమేశ్వర రావు సంగడుగా ఎలా మారాడో అది చెప్పు అంటున్నారా ? అక్కడికే వస్తున్నాను . ఇదే ప్రశ్నను సంగడిని అడిగితే …

*****

మదన్ మోహన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా పాపులర్ . ముఖ్యమంత్రి తరువాత అంతటి వైభవం . సంగడు మదన్ మోహన్ కు ఆత్మ లాంటి వాడు . (ఆత్మ అంటే లెక్కలేనన్ని కోట్లు వెనకేసుకున్న ఆత్మ కాదు . ) ఎన్నో చేశాం … ఆడ పిల్లల ఉసురు తగిలింది . మదన్ మోహన్ రాజకీయ జీవితం ముగిసింది . నా జీవితం ఇలా అయింది . అనుకుంటాం కానీ పాపం తగులుతుంది సార్ అంటూ .. చాలా విషయాలు పశ్చాత్తాపంతో చెప్పుకొచ్చాడు .

చాతనైతే నలుగురికి మంచి చేయాలి , లేదా ఊరికే ఉండాలి . అన్యాయం చేస్తే ఏదో రూపంలో పాపం మనకు చుట్టుకుంటుంది అని నా నమ్మకం . ఇది మూఢనమ్మకం అన్నా నాకు అభ్యంతరం లేదు . మనిషిని మనిషిగా ఉండేట్టు చేసే మూఢ నమ్మకం ఐనా నాకు ఇష్టమే . సీఎం లతో టీ తాగి , పీఎంలతో లంచ్ చేస్తాం అనే భ్రమలు ఎంత త్వరగా వీడితే అంత మంచిది . వాస్తవంలో జీవించి , ప్రాక్టికల్ గా ఆలోచించాలి . మహా మహులే రాలిపోయారు , లోగోలతో మనకెందుకు అహంకారం …… – బుద్దా మురళి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions