Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మనం చదవడం ఏమిటి బ్రదర్… మనమే వార్తల్ని సృష్టించాలి…

June 29, 2023 by M S R

నాయకులు , జర్నలిస్ట్ లు పత్రికలు చదువుతారా ? పత్రికల వార్తలపై కేటీఆర్ కు కెసిఆర్ పరీక్ష… మనం వార్తలు సృష్టించాలి కానీ చదవడమా అన్న ఎన్టీఆర్……. జర్నలిస్ట్ జ్ఞాపకాలు –

_______________________

జర్నలిస్ట్ లు పత్రికలు చదువుతారా ? అంటే ఇదేం ప్రశ్న ? వారే చదవకపోతే ఇంకెవరు చదువుతారు , చదవకపోతే జర్నలిస్ట్ గా ఉద్యోగం ఎలా చేస్తారు అనిపిస్తుంది . నిజమే చదువుతారేమో కానీ ఎలా చదువుతారు ? ఏం చదువుతారు ? ఎన్ని పత్రికలు చదువుతారు ? పత్రికలు చదువుతారా ? తిరగేస్తారా ? అనేది కూడా వృత్తిలో సత్తా చాటడంలో కీలకమే .

Ads

మనం వార్తలు సృష్టించాలి కానీ మనం వార్తలు చదవడం ఏమిటీ బ్రదర్ అని సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ అనే వారట .. ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ రాజకీయాల ఆసక్తి అంశం గురించి చెప్పారు . నిజానికి రాజకీయాల పట్ల ఎన్టీఆర్ కన్నా తనకే ఎక్కువ ఆసక్తి అని , మర్రి చెన్నారెడ్డి , జలగం వెంగళరావు వంటి వారితో తనకు స్నేహం ఉండేదని, కానీ రాజకీయాల పట్ల ఏ మాత్రం ఆసక్తి లేని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం తనకు ఆశ్చర్యం కలిగించింది అని అక్కినేని చెప్పుకొచ్చారు .

బ్రహ్మానందరెడ్డి కాలం లో ఓసారి షూటింగ్ విరామంలో రాజకీయాల గురించి సీరియస్ గా మాట్లాడుకుంటుంటే ఎన్టీఆర్ వచ్చి… ఎందుకు బ్రదర్ మనకు ఎలాంటి ఉపయోగం లేని రాజకీయాల గురించి చర్చ అన్నారని అక్కినేని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు . ఉదయం లేవగానే ఇంటలిజెన్స్ వాళ్ళు , సమాచార శాఖ వారు సీఎంకు సమాచారం ఇస్తారు . కానీ అంతకు మించి కళ్ళు ఉండాలి లేక పోతే ఏమవుతుందో ఎన్టీఆర్ రాజకీయమే ఉదాహరణ …

*****

మీరు రోజుకు ఎన్ని పత్రికలు చదువుతారు ? తెలంగాణ ఏర్పడిన తరువాత మొదట సంవత్సరం హరిత ప్లాజాలో జరిగిన ప్రగతి నివేదిక మీడియా సమావేశం సందర్భంగా ఇష్టాగోష్టిగా మాట్లాడుతుంటే కె . తారక రామారావు అడిగిన ప్రశ్న . యూ ట్యూబ్ , సామాజిక మాధ్యమాలకు అలవాటు కాని రోజులు … రోజుకు రెండు మూడు పత్రికలు చదువుతాను అని చెప్పాను . నేను పన్నెండు పత్రికలు చదువుతాను , ఐనా అప్పుడప్పుడు మా నాన్న పత్రికల్లో వచ్చిన వార్తలపై పరీక్ష పెడతారు అని ఓ ఆసక్తి కరమైన ఉదంతం చెప్పారు .

*****

కెసిఆర్ ఓ రోజు కేటీఆర్ ను ఈరోజు ఆంధ్రభూమి చదివావా అని అడిగారట… చదివాను అని చెబితే, ఆసక్తి కలిగించే విషయం ఏముంది అని ప్రశ్నిస్తే, చదివిన వార్తలు అన్నీ చెబితే ,.. అది కాదు, నీకేమి ప్రత్యేకం అనిపించలేదా అనడిగారట… మరోసారి పేజీలు తిరగేశారు . దేని గురించో అర్థం కాలేదు . ఎడిట్ పేజీలో పాఠకులు రాసే ఉత్తరాల శీర్షిక చదవమంటే కేటిఆర్ చదివారు . ఐనా, ఏముంది వీటిలో ప్రత్యేకం అనుకుంటే కెసిఆర్ ఓ పాఠకుడి ఉత్తరం చూపించారు .

కాంగ్రెస్ నాయకులు ఎలాగూ చేయరని తెలిసి పోయింది , మీరైనా చేయవచ్చు కదా ? అంటూ పాఠకుడు రాసిన ఉత్తరం . అంటే జనం ప్రజలు కాంగ్రెస్ పై ఆశలు వదిలేసుకున్నారు అంటూ ఆ పాఠకుడి అభిప్రాయం గురించి కెసిఆర్ వివరించారు . రోజుకు 12 పత్రికలు చదివినా కెసిఆర్ ఏదో విషయం అడుగుతూనే ఉంటారని , దాని వల్ల ప్రతి విషయం తెలుసుకోవడానికి అన్ని పత్రికలు క్షుణ్ణంగా చదువుతాను అని కేటిఆర్ అన్నారు .

టివి 9 బిగ్ డిబేట్ లో మీ ఇంట్లో అందరూ బాగా మాట్లాడుతారు అని రజనీ కాంత్ అంటే మాట్లాడడం కాదు సబ్జెక్ట్ ఉండాలి అని కేటీఆర్ బదులిచ్చారు . అన్ని పత్రికలు ఏదో ఓ పార్టీకి అనుకూలంగా మారాయి, ఐనా రాజకీయాల్లో ఉన్నా , జర్నలిజంలో ఉన్నా ప్రతి రోజు పత్రికలు చదవక పోతే పోటీ ప్రపంచంలో దెబ్బ తింటారు . కెసిఆర్ అన్ని పత్రికలు క్షుణ్ణంగా చదువుతారు . చివరకు సాహిత్యాన్ని కూడా చదువుతారు . చదివినప్పుడే విషయ పరిజ్ఞానం ఉంటుంది . ఎప్పుడు, ఎక్కడ , ఏ అంశం పైనైనా మాట్లాడగలరు .

****

95లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొత్తలోనే ప్రజల వద్దకు పాలన అని మీడియాతో పాటు బస్సులో జిల్లాలకు వెళ్లేవారు . ప్రధాన పత్రికలతో పాటు, జర్నలిస్టులు కూడా పెద్దగా పట్టించుకోని చిన్న పత్రికలు సైతం బస్సులోనే చంద్రబాబు చూసేవారు . ఉదయమే ఆ పత్రికలు చూస్తే మూడ్ ఆఫ్ అవుతుంది కాబట్టి నేను చూడను అని వై యస్ రాజశేఖర్ రెడ్డి శాసనసభలోనే ప్రకటించారు . లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక కాబట్టి ఈనాడు చదువుతాను అని మరో సందర్భంలో అన్నారు .

వై యస్ జగన్మోహన్ రెడ్డికి సొంతంగా పత్రికనే ఉంది . ఆయన పత్రికలు చదవడం గురించి తెలియదు , పత్రికలు చదివే అలవాటు గురించి సభలో కానీ , బహిరంగంగా కానీ చెప్పక పోవడం వల్ల దాని గురించి తెలియదు .

జవహర్ లాల్ నెహ్రూ తనను తానే విమర్శించుకుంటూ కలం పేరుతో కాలమ్ రాసేవారు . వాజపేయి చదవడమే కాదు కవిత్వం రాసేవారు కూడా . ప్రధాని మోడీ ఒక్కసారి కూడా విలేకరుల సమావేశం నిర్వహించలేదు . చదవడం గురించి తెలియదు . మాజీ ప్రధాని పివి నరసింహారావుకు పత్రికలు , సాహిత్యం చదివే అలవాటే కాదు , ఏకంగా ఒక పత్రిక నడిపిన అనుభవం ఉంది . వ్యాసాలు రాశారు, కథలు, నవల , ఆత్మ కథ లాంటి ఇన్సైడర్ రాశారు . విశ్వనాథ వేయి పడగలను హిందీలోకి అనువదించారు . బహుభాషా కోవిదులు . బాగా చదివే అలవాటు ఉన్న వారే బాగా మాట్లాడగలరు .

జిల్లా అనుబంధాలు వచ్చాక కొంతమంది జర్నలిస్ట్ లు జిల్లా పేజీలు చూసి పేపర్ పక్కన పడేసేవారు . మరికొందరు తాము రాసిన వార్త చూడడమే పత్రిక చదివినట్టు భావించేవారు . ఎడిట్ పేజీ చదివే అలవాటు తక్కువ మందికి ఉంటుంది . జర్నలిజంలో ఉండాలి అనుకుంటే వీలైనన్ని పత్రికలు , వీలైనంత ఎక్కువ చదవాలి . మీడియా పార్టీలకు అనుబంధంగా మారిన కాలంలో అసలు చదవకుండా ఉండడం పరిష్కారం కాదు . ఒకటి కన్నా ఎక్కువ పత్రికలు చదివి విషయాన్ని అనేక కోణాల నుంచి తెలుసుకోవచ్చు . రిపోర్టర్ తిరక్క చెడితే , సబ్ ఎడిటర్ తిరిగి చెడిపోతారు అని మీడియా సర్కిల్ లో ఓ జోక్ . తిరిగినా , తిరగక పోయినా చదివే అలవాటు లేకపోతే రాణించడం కష్టం …. – బుద్దా మురళి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions