.
Subramanyam Dogiparthi …….. సంగీత సాహిత్య నృత్యాలకు పట్టాభిషేకం ఈ సాగర సంగమం . మరో శంకరాభరణం . ఒక్కటే తేడా . అందులో కధానాయకుడు ధీరోదాత్తుడు . ఇందులో కధానాయకుడు మానసికంగా బలహీనుడు .
శంకర శాస్త్రి గారు ఎన్ని కష్టాలు వచ్చినా , ఒడుదుడుకులు వచ్చినా స్థితప్రజ్ఞుడిగా సముద్రంలా గంభీరంగా నిలబడ్డాడు . సాగర సంగమంలో బాలు నిరాశానిస్పృహలతో , తాను ప్రేమించిన పడతి దూరం కాగానే దేవదాసు అవుతాడు . ఈ పోలిక పక్కకు పెడితే శంకరాభరణం ఎంతటి కళాఖండమో అంతటి కళాఖండం సాగర సంగమం .
Ads
తెలుగు ప్రజలు ఒక్కొక్కరు ఎన్నిసార్లు చూసి ఉంటారో ! ఈ సినిమాలోని పాటలలోని సాహిత్యం , ఆ సాహిత్యానికి తగ్గట్లు శాస్త్రీయ నృత్యాలు , వాటి చిత్రీకరణ , సంభాషణలు , అద్భుత దర్శకత్వం , సంగీత దర్శకత్వం , ఛాయాగ్రహణాల మీద కనీసం ఓ పది Ph.D లు చేయవచ్చు . అంత భారీ వస్తువు ఉంది ఈ సినిమాలో .
కమల్ హాసన్ నట విరాట రూపం సాగర సంగమం . భరతనాట్యం , కథక్ , కూచిపూడి శాస్త్రీయ నృత్య కళాకారుడిగా అతను ప్రదర్శించిన ప్రతిభ వర్ణనాతీతం . జయప్రద . ముగ్ధ మనోహర సౌందర్యంతో కమల్ హాసనుకి పోటీగా నటించింది , నృత్యించింది .
ఈ సినిమాలో నాకు నచ్చిన మరో పాత్ర శరత్ బాబుది . స్వచ్చ స్నేహానికి ప్రతీకగా ఉంటుంది ఆ పాత్ర . శరత్ బాబు జీవించాడు . జీవితంలో ఇలాంటి స్నేహితుడిని పొందినవాడు కడు అదృష్టవంతుడు .
ఈ మూడు పాత్రల తర్వాత బాలు తల్లి పాత్ర . వంటలు చేసుకుంటూ కొడుకికి ప్రాణప్రదమైన నాట్యంలో అతడు గొప్పవాడు కావాలని నిశ్శబ్ద కలలు కనే పాత్ర . డబ్బింగ్ జానకి చాలా బాగా నటించింది . మరో ప్రధాన పాత్ర శైలజది . జయప్రద కుమార్తెగా , పెంకిఘటంగా , తలబిరుసు డబ్బున్న నర్తకిగా బాగా నటించింది . ఆమె నటించిన ఏకైక చిత్రం ఇది .
ప్రేక్షకులు మరచిపోలేని మరో పాత్ర బుడ్డ ఫొటోగ్రాఫర్ చక్రి . నృత్య దర్శకుడి పాత్రలో మిశ్రో . తమ నృత్యాలతో ప్రేక్షకులను అలరించిన మంజు భార్గవి , గీత . విశ్వనాధ్ మంజు భార్గవిని మరచిపోకుండా నృత్యింపచేసారు . ఇంకా సాక్షి రంగారావు , ప్రభృతులు ఉన్నారు . వీళ్ళందరూ మనకు తెర మీద కనిపించే కళాకారులు .
మనకు కనిపించని తెర వెనుక కళాకారుల గురించి ఎంత చెప్పినా తక్కువే . వేటూరి . విశ్వనాధ్ సినిమాలలో ఆయన పాటల్లోని సాహిత్యం వింటూ ఉంటే సరస్వతీ మాత ఆయన కలంలోకి ప్రవేశించి వ్రాసి వెళ్ళిపోతుందా అని అనిపిస్తుంది . ఒక్కో పాట మీద ఒక్కో థీసిస్ వ్రాయవచ్చు .
మహాకవి కాళిదాసు విరచిత మహా కావ్యం రఘువంశంలోని మొదటి పద్యం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ , పార్వతీప రమేశ్వరౌ అంటూ ప్రారంభమయ్యే నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము .
రఘువంశం నా థర్డ్ ఫారంలో చదువుకున్నాను . ఈ సినిమాలో పార్వతీప దగ్గర ఆపేసి రమేశ్వరౌ అని ముగిస్తాడు . చక్కటి ప్రయోగం . ఆ పదప్రయోగంలో శివకేశవులను ఇద్దరినీ కలిపాడు వేటూరి . ఆ పాటలో కమల్ హాసన్ , జయప్రదలు రతీ మన్మధుల్లాగా తాండవం చేసారు .
అద్భుత చిత్రీకరణ . బాలసుబ్రమణ్యం , జానకిలు ఏం పాడారు ! ఈ నృత్యానికి దర్శకత్వం వహించేందుకు ప్రత్యేకంగా బొంబాయి నుండి నవరంగ్ సినిమా గోపీకృష్ణను పిలిపించారు .
మరో అద్భుతమైన పాట మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో . స్వచ్చ ప్రేమికులకు ఎప్పుడో ఒకసారి ఇలాంటి భావోద్వేగం రాక తప్పదు . విశ్వనాధ్ గారికి ఏం అనుభవం ఉన్నదో ఏమో గాని , ఎంత అందంగా చిత్రీకరించారు !
జయప్రద హావభావాలు !! వ్వాహ్ ! ఆ పాటలో జయప్రద స్నానం చేసే సీన్ విశ్వనాధ్ ఎలా దూర్చాడో ఏమో ! అయ్యబాబోయ్ ! ఏం మౌన చిత్రీకరణ !
క్లైమాక్సులో వచ్చే పాట సాగర సంగమమే ఒక యోగం . శైలజ , కమల్ హాసన్ల నృత్యం , ఆ పాటలో సాహిత్యం మరువలేనిది . బాల కనక మయ చేల సుజన పరిపాల త్యాగరాజ కీర్తనను విశ్వనాధ్ గొప్పగా ఉపయోగించుకున్నారు .
వేదిక మీద మంజుభార్గవి , వంట గదిలో కమల్ హాసన్ నృత్యాలను ఏకకాలంలో చూపిస్తాడు ఫొటోగ్రాఫర్ . కొడుకు నృత్యానికి మురిసిపోయే తల్లి , కెమేరాలో బిగించే ప్రేమికురాలు !! ఓహ్ !
వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం , ఓం నమశ్శివాయ అంటూ సినిమా ప్రారంభంలోనే శైలజ నృత్య గీతం , కమల్ హాసన్ గీతల పాట వేవేల గోపమ్మా , బావి మీద తాగిన మైకంలో కమల్ చిందులేసే పాట తకిట తధిమ తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన పాటలు . ఎంత వ్రాసినా తరగదు .
వందేళ్ళ భారత చలన చిత్ర చరిత్రలోని మొదటి వంద సినిమాల్లో 13 వ సినిమాగా చోటు దక్కించుకుంది ఈ సినిమా . రష్యన్ భాష లోకి అనువదించబడిన మొదటి సినిమా . అంతే కాదు . రష్యాలో ఒకేసారి 400 థియేటర్లలో విడుదల చేసారట . ఎంత గొప్ప గౌరవం !
విశ్వనాధ్ జన్మ చరితార్ధం అయిపోయింది . 35 కేంద్రాలలో వంద రోజులు , విజయవాడ హైదరాబాదులలో 25 వారాలు అడింది . బెంగుళూరులో ఒకే థియేటర్లో 511 రోజులు ఆడింది .
ఇలాంటి రికార్డులు ఇంకా ఉన్నాయి . జాతీయ స్థాయిలో సంగీత దర్శకుడు ఇళయరాజాకు , గాయకుడు బాలసుబ్రమణ్యంకు అవార్డులు వచ్చాయి . విశ్వనాధుకు ఉత్తమ దర్శకుడు , కమల్ హాసనుకి ఉత్తమ నటుడు జయప్రదకు ఉత్తమ నటి అవార్డులు ఫిలిం ఫేర్ నుంచి వచ్చాయి .
ఈ సినిమా నిర్మాత ఏడిద నాగేశ్వరరావుని , మాటల్ని వ్రాసిన జంధ్యాలని , నృత్య దర్శకులు శేషు- రఘులను , కళా దర్శకులు తరణిని , ఛాయాగ్రాహకుడు నివాసుని అభినందించాలి . ఈ సినిమాలో నటించిన నటీనటులు , పనిచేసిన ప్రతీ సాంకేతికుడు చరిత్రకారులే . ఇంతటి దృశ్య కావ్యాన్ని మనకు అందించిన విశ్వనాధుడికి కళాంజలి అర్పిస్తున్నాను . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article