.
ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్ కావాలంటే పెద్ద ప్రయాస, పైరవీ… ఎంపీలకు ఇచ్చే కనెక్షన్ల కోటా నుంచి రాయించుకుంటే దక్కేది… తరువాత..? ఇంట్లో టెలిఫోన్ ఉంటే అదే ఓ పేద్ద హోదా…
సరే, ట్రంక్ కాల్స్, లైటనింగ్ కాల్స్, గంటల తరబడీ నిరీక్షణలు, లో వాయిస్ కష్టాలతో అరుపుల కథలు వేరు… టెలికామ్ సిబ్బందికి దసరా మామూళ్లు, లంచాలు కూడా… తరువాత మొబైల్ ఫోన్లు వచ్చాయి…
Ads
ఇంట్లోకి ఫోన్లు నడిచొచ్చాయి, కాదు, అరచేతుల్లోకి… వీడి సర్వీస్ బాగాలేకపోతే వాడు, కాదంటే మరొకడు… పోటీ… సర్వీస్… ఆఫర్లు… నాణ్యత పెరిగింది… కంపెనీల నడుమ స్వాపింగ్ ఈజీ అయిపోయింది… బ్రాడ్బ్యాండ్తో ప్రపంచం మన అరచేతుల్లో కనిపిస్తోంది…
మన ఇంటికి కరెంటు సరఫరా చేసే కంపెనీలు కూడా ప్రైవేకరించబడితే..? డిస్కమ్ల నడుమ పోటీ పెరిగి, వినియోగదారుడు తనకు మంచి సర్వీస్, మంచి టారిఫ్ ఇచ్చే కంపెనీని మాత్రమే ఆప్ట్ చేసుకునే సౌకర్యం, సౌలభ్యం కలిగితే..?
బాగుంటుంది అనిపిస్తోందా..? కేంద్ర ప్రభుత్వం అదే దిశలో అడుగులు వేస్తోంది… ఏ కంపెనీ ఐనా సరే కరెంటు సరఫరా చేయొచ్చు… ప్రస్తుత ప్రభుత్వ కంపెనీలతో పోటీపడొచ్చు… ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్నే వాడుకుని, దానికి చార్జీలు కట్టుకుంటూ… కరెంటు సప్లయ్ రంగంలోకి ప్రైవేటు కంపెనీలు అడుగుపెట్టే రోజులొస్తున్నాయి…
కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ తెచ్చిన ఓ ముసాయిదా బిల్లును అన్ని రాష్ట్రాలకూ పంపించారు, నెల రోజుల్లో అభిప్రాయాలు చెప్పమని కోరారు… మెజారిటీ ఎన్డీయే రాష్ట్రాలు ఎలాగూ వోకే చెబుతాయి… దీంతో ఏం జరుగుతుందంటే..?
ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ లైన్లను వేరే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు వాడుకుని, వాటికి అద్దె చెల్లించి… వినియోగదారుడికి కరెంటు సప్లయ్ చేస్తాయి… ఒకవేళ కరెంటు చార్జీలు, ట్రూఅప్లు గట్రా ప్రభుత్వ కంపెనీలు నిర్ణయాలు తీసుకోకపోతే రెగ్యులేటరీ కమిషన్లే ఆ నిర్ణయాలను సూమోటోగా తీసేసుకుంటాయి… క్రాస్ సబ్సిడీ సర్చార్జీలు రద్దు…
క్రాస్ సబ్సిడీ అంటే… గృహవిద్యుత్తుకు తక్కువ టారిఫ్, కమర్షియల్ వినియోగానికి ఎక్కువ టారిఫ్ ఉంటుంది కదా… అంటే కమర్షియల్ వినియోగదారుడు కొంతమేరకు గృహవిద్యుత్తు వినియోగదారుడికి తనే కొంత సబ్సిడీ ఇస్తున్నట్టు… అదే క్రాస్ సబ్సిడీ రఫ్గా… అవి ఇప్పుడు తీసేయబడతాయి… ప్రస్తుతం మెట్రోలు, రైల్వేలు, ఇండస్ట్రీలు చెల్లిస్తున్న క్రాస్ సబ్సిడీల అధిక ఛార్జీలు ఉండవు…
అయ్యో, అయ్యో… ప్రైవేటీకరిస్తున్నారు బాబోయ్ అని ఆందోళన వ్యక్తం చేసే గొంతులు కూడా వినిపిస్తాయి… కానీ ప్రభుత్వరంగంలోనే అక్రమాలు, నాణ్యతలోపాలు, సర్వీస్ లోపాలు ఎక్కువ… అందరికీ తెలుసు కదా… మార్పు తప్పదు…
మరి రైతులకు ఇచ్చే ఫ్రీ కరెంటు..? 200 లోపు వాడకం ఉన్న పేద వినియోగదారులకు ఇచ్చే ఫ్రీ కరెంటు..? ప్రభుత్వాలు ఆ సబ్సిడీలను నేరుగా వినియోగదారులకు గానీ… లేదా ఆమేరకు డిస్కమ్కు గానీ చెల్లించాలి… తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యవసాయ, గృహజ్యోతి వంటి సబ్సిడైజ్డ్ కనెక్షన్ల కోసం సపరేట్ డిస్కమ్ ఏర్పాటు చేయబోతోంది… దాని ఉద్దేశం కూడా కొత్త విద్యుత్తు చట్టం వైపు అడుగులు వేయడమే…
ప్రస్తుతం విద్యుత్ చౌర్యం కేసులో ఒక వినియోగదారుడిని పట్టుకుంటే… గరిష్ట వినియోగం ఆధారంగా రెండేళ్లు. మూడేళ్లు, నాలుగేళ్లు. ఇలా ఇష్టం వచ్చిన కాలానికి డిస్కమ్ లు జరిమానాలు వేస్తున్నాయి… ఇక ముందు అలా కుదరదు… ఆ వినియోగదారుడు ఎన్నేళ్లుగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నా… గరిష్టంగా ఏడాది కాలానికి మాత్రమే జరిమానాలు వేయాల్సి ఉంటుంది…
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల రాజకీయ కారణాల వల్ల (ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు పెరగడం ఇష్టం లేకనో, మరేవైనా రాజకీయ కారణాలతోనో) డిస్కమ్స్ టారిఫ్ పిటిషన్లను ఈఆర్సీకి సమర్పించకుండా ఆపుతాయి… ఫలితంగా చార్జీలు పెరగవు గానీ వ్యయాలు, డిస్కంల నష్టాలు మాత్రం ఏటికేడాది పెరిగిపోతుంటాయి…
కొత్త చట్టం ప్రకారం ఈఆర్సీలే ఆ నిర్ణయాల్ని సూమోటోగా తీసేసుకుంటాయి… విద్యుత్ రంగంలో పాలసీలపై చర్చించడానికి వీలుగా జాతీయ స్థాయిలో కేంద్ర విద్యుత్ మంత్రి చైర్మన్ గా ఎలక్ట్రిసిటీ కౌన్సిల్ ఏర్పాటు అవుతుంది… (జీఎస్టీ కౌన్సిల్ తరహాలో)… ఇందులో రాష్ట్రాల విద్యుత్ మంత్రులు సభ్యులుగా ఉంటారు..! ఇలా కొత్త విద్యుత్తు చట్టం విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది…!!
Share this Article