.
Subramanyam Dogiparthi ….. బాలకృష్ణ సినిమాల్లో నాకు నచ్చిన సినిమా 1989 జూన్లో వచ్చిన ఈ అశోక చక్రవర్తి . మళయాళంలో సూపర్ హిట్టయిన ఆర్యన్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . మళయాళంలో మోహన్ లాల్ , హిందీ నటుడు శరత్ సక్సేనా , రమ్యకృష్ణ , శోభన ప్రధాన పాత్రల్లో నటించారు . ఈ మళయాళ సినిమా హిందీలోకి కూడా డబ్ అయింది .
- 1989 జూన్లో ఒకే రోజు రెండు సినిమాలు దాదాపు ఒకే కధాంశంతో విడదలయ్యాయి . ఒకటి ఈ బాలకృష్ణ అశోక చక్రవర్తి అయితే రెండవది వెంకటేష్ నటించిన ధ్రువనక్షత్రం . రెండు సినిమాలకు డైలాగ్స్ పరుచూరి బ్రదర్సే వ్రాయడం ఆసక్తికరం . దురదృష్టవశాత్తు అశోక చక్రవర్తి నిరాశపరిస్తే ధ్రువనక్షత్రం హిట్టయింది .
ఆరోజుల్లో ఈ వివాదం పత్రికలలో ప్రకటనల దాకా వెళ్ళింది . అశోక చక్రవర్తి నిర్మాతలు తాము మూడు లక్షల రూపాయలు ఇచ్చి రైట్స్ కొనుక్కున్నామని తెలియపరిచారు . డైలాగ్స్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ధ్రువనక్షత్రం నిర్మాతలకు ఇది తెలిసీ చెప్పకపోవటం సినిమా రంగ నైజం అయి ఉండాలి ...
Ads
ఈ అశోక చక్రవర్తి కధకొస్తే :… సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి నాలుగు వేదాలను ఔపోసన పట్టిన వాడు వేదుల వెంకట అశోక్ . గ్రామంలో ఉన్న తన కుటిల మేనమామ , సర్పంచ్ కుట్ర పన్ని అమ్మ వారి నగలను దొంగిలించాడనే నేరం మోపి జైలుకు పంపుతారు . జైలు నుంచి తిరిగొచ్చిన కుమారుడిని తండ్రి సోమయాజులు గృహ బహిష్కరణ చేస్తాడు .
అశోక్ బొంబాయికి చేరి సత్యనారాయణ వద్ద గ్యాంగ్ స్టర్ అవుతాడు . కోట్లు సంపాదిస్తాడు . అశోక్ మేనమామ కూతురు భానుప్రియ తండ్రి తెస్తున్న సంబంధాన్ని తప్పించుకోవటానికి బొంబాయి చేరుతుంది . అక్కడ ఓ పోలీస్ ఆఫీసర్ రంగనాధ్ సహాయంతో బావ వద్దకు చేరుతుంది . సత్యనారాయణ ప్రోత్సాహంతో గ్రామానికొచ్చి తన నిర్దోషిత్వాన్ని తండ్రి సమక్షంలో రుజువు చేసుకుని అసలు దుర్మార్గులని అంతం చేయడంతో సినిమా ముగుస్తుంది .
ప్రధమ తాంబూలం బాలకృష్ణకే . అతనికి ఇది 47 వ సినిమా . నిలకడగా చేసాడు . డాన్సుల్లో , ఫైట్లలో , డైలాగ్స్ డెలివరీలో matured గా నటించాడు . తర్వాత స్థానం సత్యనారాయణది . ఆయనకు ఇలాంటి పాత్రలు కరతలామలకం . బ్రహ్మాండంగా నటించారు . సత్యనారాయణకు ప్రత్యర్థి గ్యాంగ్ స్టర్ గా శరత్ సక్సేనా , అతని అసిస్టెంటుగా మరో హిందీ నటి సువర్ణ ఆనంద్ నటించారు .
కధానాయికగా భానుప్రియ గ్లామర్ స్పేసుని అద్భుతంగా ఫిల్ చేసింది . పాటల్లో అదరగొట్టేసింది . ఇతర ప్రధాన పాత్రల్లో సోమయాజులు , అంజలీదేవి , జ్యోతి , శుభలేఖ సుధాకర్ , పి యల్ నారాయణ , భాగ్యశ్రీ , నర్రా , గొల్లపూడి , తాతినేని రాజేశ్వరి , ఈశ్వరరావు , ప్రదీప్ శక్తి , వంకాయల , రంగనాధ్ , చలపతిరావు , తదితరులు నటించారు .
ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనం అంటూ సాగే పాటకు సంగీతం శ్రావ్యంగా ఉంటుంది . నృత్య దర్శకులు శివశంకర్ బాలకృష్ణ చేత కూడా శాస్త్రీయ నృత్యాన్ని చేయించారు . అభినందనీయులు . పాట చిత్రీకరణ కూడా బాగుంటుంది . మిగిలిన పాటలు ఝనక ఝనక ఝం , సువ్వీ సువ్వీ , అబ్బ రూపమెంత రుచిరా పాటల చిత్రీకరణ బాగుంటుంది .
పాటలన్నీ వేటూరి వారు వ్రాయగా బాలసుబ్రమణ్యం , జానకమ్మ , చిత్ర శ్రావ్యంగా పాడారు . సినిమాలో సింహభాగం షూటింగ్ బొంబాయిలో చేసారు . గేంగ్ వార్ మీద ఫోకస్ కాదు . ఫోకస్ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిపెరిగిన అశోక్ డాన్ కావటం మీద . అందుకు బొంబాయిని ఎంపిక చేసుకోవటం బాగుంది .
సినిమా యూట్యూబులో ఉంది . నేను టివీలో చూసా . ఈ సినిమాలోనే అనుకుంటా . సత్యనారాయణ డైలాగ్ ఒకటి ఉంటుంది . పోతే సైన్యం , వస్తే రాజ్యం . మన రాజకీయ పార్టీల అధినేతలకు , ఆ పార్టీల కోసం తమ జీవితాలను నాశనం చేసుకునే సైన్యానికి బ్రహ్మాండంగా వర్తిస్తుంది .
ఇంతకుముందు చూడని బాలకృష్ణ అభిమానులు ట్రై చేయవచ్చు . బాగానే ఉంటుంది . It’s an action cum crime-oriented entertainer . నేను పరిచయం చేస్తున్న 1204 వ సినిమా. #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article