.
ఛత్రపతి శివాజీ కథ అందరికీ తెలిసిందే… శంభాజీ కథను ఇప్పుడు ఛావా సినిమా ద్వారా తెలుసుకున్నాం… మరాఠీ ఆత్మగౌరవం, రాజ్యరక్షణ, ధర్మపరిరక్షణలకై వాళ్ల పోరాటం కథలు మహారాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తమ్మీద వ్యాపించినవే…
కానీ ఈ కథ, మనం చెప్పుకోబోయే శివాజీ గురించి కాదు, శంభాజీ గురించి అసలు కాదు… ఆ శివాజీ ప్రాణాలనే కాపాడిన ఓ యోధుడి గురించి… రాజు కోసం, దేశం కోసం, ధర్మం కోసం – చావును సైతం ధిక్కరించి, దేహమంతా రక్తంతో తడిసి ముద్దయినా కూడా, రాజు ఛత్రపతి శివాజీ సురక్షితుడు అయ్యాడు అన్న వార్త తెలిశాకే ప్రాణాలను వదులుతానని మొండి పట్టుదలతో యుద్ధం చేసిన వీరుడి గురించి…
Ads
అది 1660 వ సంవత్సరం… బీజాపూర్ రాజ్యాన్ని వందల ఏళ్లుగా పాలిస్తున్న ఆదిల్ షా పాలకులు ఎన్నోసార్లు శివాజీ మీదకు యుద్ధానికి వెళ్లి చావు దెబ్బ తిని ఓడిపోయేవారు… అందుకే ఈసారి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సహాయం తీసుకొన్నారు…
పన్హాలా కోటలో 600 మంది సైన్యంతో మాత్రమే ఉన్నారు శివాజీ, తన కుడి భుజం, సర్వ సైన్యాధిపతి బాజీ ప్రభు దేశ్పాండే… 10000 సైన్యంతో కోటని చుట్టుముట్టి బందీలను చేశారు. సరైన సమయం చూసి ఇక ఛత్రపతిని చంపేయాలని శత్రువులు ఎదురు చూస్తున్నారు…
కేవలం 600 మంది సైన్యంతో 10000 మందితో పోరాడి యుద్ధం గెలవడం అసాధ్యం అని శివాజీకి తెలుసు కాబట్టి అక్కడి నుండి తప్పించుకోవడం ఒక్కటే శివాజీకి ఉన్న మార్గం… కానీ 10000 మంది నుండి తప్పించుకోవడం కూడా అంత సులువైన పని కాదు…
పన్హాలా కోటలో ఉన్న ధాన్యశాలలో ఉన్న మొత్తం ధాన్యం ఖాళీ ఐతే శత్రు సైన్యంలో కొంతభాగం ఆహారం సేకరించటానికి వెళ్తుంది. అప్పుడు తప్పించుకోవడం సులువుగా ఉంటుందని శివాజీ ఆలోచించాడు… కొన్ని నెలలు గడిచాయి… పన్హాలా కోటలోని ఆహారం, ధాన్యాగారంలోని ధాన్యం అన్నీ ఖాళీ అయిపోయాయి…
ఇప్పడు 10000 మందికి ఆహారం కావాలి కాబట్టి శత్రు సైన్యంలోని కొంతభాగం ఆహారం కోసం మరో దేశానికి బయలుదేరారు… ఛత్రపతి శివాజీ తప్పించుకొనే సమయం ఆసన్నమైనది. పన్హాలా కోట నుండి రంగీ నారాయణ్ అనే మరాఠా నాయకుడు పాలిస్తున్న “విశాల్ ఘాట్ కోటకు” వెళ్ళాలి అని శివాజీ నిర్ణయించుకున్నాడు…
13 జులై 1660 వర్షాకాలం… అమావాస్యకి దగ్గరలో వెన్నెల కాంతి బాగా తక్కువ ఉన్న ఒక రాత్రి, ఛత్రపతి శివాజీ – బాజీ ప్రభువులతో పాటు 600 మంది సైనికుల అడవి మార్గం గుండా ప్రయాణించటానికి సిద్ధంగా ఉన్నారు…
సైన్యంలో శివాజీ మహారాజు పోలికలతో ఉండే శివకాశి అనే ఒక సైనికుడిని శివాజీ ధరించే దుస్తులు, నగలు తొడిగి అచ్చు గుద్దినట్లుగా శివాజీ మహారాజులాగా తయారు చేసి, ఆధీల్షాయి సైన్యానికి కనపడే విధంగా 10 మంది సైనికులతో ఇంకోవైపు పంపించారు…
ఛత్రపతి వేషంలో ఉన్న శివకాశిని చూసి శివాజీయే తప్పించుకుంటున్నాడు అనుకుని ఆదిల్షాయిల సైన్యాధిపతి తన సైన్యం అంతటినీ పిలిపించాడు. ఇదే అదునుగా చూసి విశాల్ ఘాట్ వైపుకు అడవి మార్గం గుండా అతి వేగంగా బయలు దేరారు శివాజీ అతని సైనికులు…
వర్షాల తాకిడికి అడవి బాటలోకి ముళ్లకంపలు చెత్తా చెదారం కొట్టుకొచ్చాయి, నడిచే మార్గం అంతా బురద ముళ్ల పొదలతో భయంకరంగా ఉంది. కానీ అక్కడ ఉన్న 600 మందికీ ఒక్కటే లక్ష్యం ఛత్రపతి శివాజీని విశాల్ ఘాట్కు చేర్చటం. ఆ 600 కి ఉన్న ధైర్యం కూడా ఒక్కడే అతడే బాజీ ప్రభు దేశ్పాండే….!!
బాజీ ఉన్నంత వరకు తమను ఎవరూ ఏమి చేయలేరు అనే నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఆదిల్షాయిల సైన్యాధిపతి పట్టుకున్నది శివాజీ మహారాజును కాదని, మారువేషంలో ఉన్న శివకాశి అని తెలుసుకోటానికి ఎక్కువ సమయం పట్టలేదు…
శివకాశిని అక్కడికక్కడే నరికి చంపి, 8000 మంది సైన్యాన్ని శివాజీ వెనుక తరుముకుంటూ వెళ్లి, శివాజీని బంధించి తీసుకురమ్మని ఆదేశించాడు. తెల్లవారే సమయానికి “గోడ్కింగ్” అనే ఇరుకైన పర్వత ప్రాంతంలో విశ్రాంతి తీసుకొంటున్న శివాజీ సైన్యం, ఆదిల్షాయిల సైన్యం సమీపిస్తుందని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఆదిల్షాయిల సైన్యానికి చిక్కకుండా వేగంగా విశాల్ఘట్ కి చేరటం అసాధ్యం …
ఎందుకంటే ఆ సమయంలో ఛత్రపతి శివాజీ సైన్యం వద్ద ఒక్క గుర్రం కూడా లేదు, కానీ సగం ఆదిల్షాయిల సైన్యం వద్ద గుర్రాలు ఉన్నాయి. అక్కడే యుద్ధం చేసి ఆదిల్షాయిల సైన్యాన్ని ఓడించటం జరగని పని.
8000 మంది సైన్యంతో 600 మంది ఎంత భయంకరంగా పోరాడినా గెలవడం మాత్రం అసాధ్యం. ఇప్పుడు ఛత్రపతి సైన్యానికి ఉన్న ఒకే ఒక్క దారిని బాజీ ప్రభువు రాజుతో వివరించాడు.
‘‘గోడ్కింగ్ చాలా ఇరుకైన ప్రాంతం… ఈ దారి గుండా సైన్యం ఒకేసారి ఎక్కువ మందితో దాటలేదు… సైన్యంలో సగం మందిని, అంటే సరిగ్గా 300 మందితో నేను గోడ్కింగ్ కు అడ్డుగా నిలబడి ఆదిల్షాయిల సైన్యంతో పోరాడుతాను. ఒకేసారి ఎక్కువ మంది సైనికులు ఈ దారి గుండా రాలేరు కాబట్టి తక్కువలో తక్కువ రెండు మూడు గంటల వరకు నేను ఆదిల్షాయిలను ఆపగలను…
ఈ సమయంలో మిగిలిన 300 మంది సైన్యం తమ ప్రాణాలతో ఛత్రపతిని కాపాడుకుంటూ విశాల్ ఘాట్ కు చేర్చాలి… శివాజీ మహారాజు సురక్షితంగా అక్కడికి చేరుకోగానే అక్కడ ఉన్న ఫిరంగులను 5 సార్లు పేల్చాలి… ఫిరంగులు శబ్దం మహారాజు సురక్షితంగా చేరాడు అనడానికి సంకేతం…’’ అని పథకాన్ని వివరించాడు. మరో దారి లేక అందరూ ఈ పథకాన్నే ఒప్పుకున్నారు…
300 మంది సైన్యంతో శివాజీ మహారాజు బయలు దేరాడు. మిగిలిన 300 మంది సైన్యంతో బాజీ ప్రభువు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. ఆదిల్షాయిల సైన్యం గోడ్కింగ్ కు చేరుకుంది. యుద్ధం మొదలయ్యింది. అరటి చెట్లను నరికినంత సులువుగా ఆదిల్షాయిలను నరికేస్తున్నారు బాజీప్రభు అతని సైన్యం.
ఇరుకైన కొండ ప్రాంతం అవ్వటంతో శివాజీ మహారాజుకు తప్పించుకోడానికి ఎక్కువ సమయం దొరికినా అవతలి వైపు ఉన్నది 8000 మంది సైన్యం… 300 మంది బాజీ ప్రభు సైన్యం ఒక్క నిమిషం కూడా కత్తి తిప్పటం ఆపటం లేదు…
సమయం గడిచేకొద్దీ బాజీ ప్రభు సైన్యం తరిగిపోతుంది , కానీ బాజీ ప్రభువు వైపు ఒక్క సైనికుడు చనిపోతే ఆదిల్షాయిల వైపు 20 నుండి 30 మంది చనిపోతున్నారు . సుమారు 4 గంటలు గడిచే సరికి 8000 మంది ఆదిల్షాయిల సైన్యంలో 5000 మంది మరణించారు. కానీ బాజీ ప్రభు సైన్యంలో దాదాపు అందరూ మరణించారు…
బాజీ ప్రభుతో పాటు అతికొద్ది మంది మాత్రమే మిగిలారు. కేవలం 300 మంది సైన్యంతో 5000 మందిని చంపటం చరిత్రలో అదే మొట్టమొదటిసారి… ఒంట్లో ఉన్న ప్రతి అవయవం మీద కత్తి వేట్లతో దేహం అంతా గాయాలతో… రక్తంతో… తడిసి ముద్దయ్యి ఎర్రగా మండుతున్న అగ్నిగోళంలా ఉన్న బాజీ ప్రభువును చూసి “మనిషా – రాక్షసుడా” అని భయపడ్డారు ఆదిల్షాయిలు…
నిజానికి బాజీ ప్రభువుకి తగిలిన గాయాలు కత్తి పోట్లలో పావు వంతు తగిలినా ఒక మనిషి మరణిస్తాడు , కానీ అగ్ని పర్వతం నుండి లావా ఉబికినట్టు బాజీ ప్రభువుల అవయువాల నుండి రక్తం ప్రవహిస్తున్నా…. అతని చేయి మాత్రం ఇంకా కత్తి తిప్పుతూనే ఉంది…
తన రాజు ఛత్రపతి శివాజీ మహరాజ్ విశాల్ ఘాట్ కు చేరే వరకు తన ప్రాణాలు వదిలే సమస్యే లేదని ఒక చేతితో మృత్యువుని ఆపుతూ….. మరో చేతితో యుద్ధం చేస్తున్నాడు బాజీ ప్రభు… చావుని పూర్తిగా ధిక్కరించి ఊపిరికి ఊపిరి పోగు చేసుకొని యుద్ధం చేస్తూనే ఉన్న బాజీ ప్రభువు చెవులు యుద్ధం మొదలైన నాలుగు గంటల తరువాత ఫిరంగి పేలుడు శబ్దాలు విన్నాయి…
ఆ వెంటనే కాళ్లు నేలకు ఒరిగాయి. కళ్ళు ఆకాశాన్ని చూస్తూ…. ప్రాణం శరీరాన్ని వదిలింది. చరిత్ర మునుపు ఎరగని యుద్ధం చేసి, కేవలం 300 మందితో 8000 మందిని అడ్డుకొని మృత్యువునే వాయిదా వేసిన బాజీ ప్రభువు త్యాగానికి ఛత్రపతి శివాజీ మహారాజు కన్నీటి నివాళి అర్పించి… గోడ్కింగ్ ప్రదేశాన్ని పావన్ కింగ్, అంటే పవిత్రమైన ప్రదేశం అని ప్రకటించాడు..!!
Share this Article