Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాంగ్రెస్ తెలివైన ఎత్తుగడ..! పంజాబ్ అంటే అగ్రవర్ణ సిక్కులదే కాదు…!!

September 20, 2021 by M S R

పంజాబ్‌కు తొలి దళిత (రాందాసియా) సిక్కు సీఎం చన్నీ
===================================

మూడు కోట్ల జనాభా ఉన్న పంజాబ్‌లో తొలి దళిత (ఎస్సీ–రాందాసియా–చమార్‌) సిక్కు చరణ్‌ జీత్‌ సింగ్‌ చన్నీ సోమవారం ప్రమాణం చేస్తున్నారు. అది కూడా కాంగ్రెస్‌ తరఫున, ఇంకా ఈ పదవిలో ఆరు నెలలు ఉండడానికి మాత్రమే. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు సీఎంను మార్చి జనాన్ని మాయ చేయాలని ప్రయత్నించి విఫలం కావడంలో– దేశంలో గొప్ప ముదుసలి పార్టీగా (గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ–జీఓపీ) పేరు మోసిన కాంగ్రెస్‌కు విస్తృత అనుభవం ఉంది. పంజాబ్‌ జనాభాలో దాదాపు 30 శాతం అనుసూచిత కులాలవారే. (ఈ ఎస్సీల్లో సిక్కులూ, హిందువులూ ఉంటారు). కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన బడా దళిత–చమార్‌ సిక్కు బూటాసింగ్‌ అప్పట్లో కాంగ్రెస్‌ తరఫున సీఎం కాలేకపోయారు.

punjab cm

ఇద్దరే నాన్‌ జాట్‌ సిక్కు సీఎంలు–వారిద్దరూ కాంగ్రెస్‌ నేతలే
––––––––––––––––––––––––––––––––––––

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అవతరించిన పదేళ్లకు ఉమ్మడి పంజాబ్‌ చీలిపోయి పంజాబీ మాట్లాడేవారితో ప్రస్తుత చిన్న పంజాబ్‌ (కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌తో కలిసి 14 లోక్‌సభ సీట్లే) ఉనికిలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అంటే దాదాపు ఈ 55 ఏళ్లలో 11 మందీ సిక్కులే ముఖ్యమంత్రులయ్యారు. వారిలో ముగ్గురు అకాలీదళ్‌కు చెందిన నేతలు గుర్నామ్‌సింగ్, ప్రకాశ్‌సింగ్‌ బాదల్, సుర్జీత్‌సింగ్‌ బర్నాలా. అకాలీ సీఎంలు ముగ్గురూ జాట్‌ సిక్కులే. మిగిలిన 9 మంది కాంగ్రెస్‌ సీఎంలలో ఇద్దరు (మొదటి సీఎం గ్యానీ గుర్ముఖ్‌సింగ్‌ ముసాఫిర్, గ్యానీ జైల్‌సింగ్‌) మాత్రమే జాట్‌ కులానికి చెందని సిక్కులు. ముసాఫిర్‌ ఖత్రీ (క్షత్రియ) సిక్కు కాగా, జైల్‌సింగ్‌ రామ్‌గఢియా సిక్కు (ఓబీసీ–స్వర్ణకార, వండ్రంగి వృత్తిగల సిక్కు). అంటే మొత్తం 11 మంది ముఖ్యమంత్రుల్లో ఇద్దరు మాత్రమే జాటేతర సిక్కులు. జాట్లు మన రెడ్డి, కమ్మలాగా వ్యవసాయాధారిత కులం అనే వేరే చెప్పాల్సిన పనిలేదు. పంజాబ్‌లో రైతు అనే మాటకు సమానార్ధకంగా జాట్‌ అనే పదం వాడతారు.

Ads

ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగా 1966 నవంబర్‌న బక్కచిక్కిన అవశేష పంజాబ్‌ మొదటి సీఎంగా కాంగ్రెస్‌ తరఫున పైన చెప్పినట్టు గ్యానీ గుర్ముఖ్‌ సింగ్‌ ముసాఫిర్‌ అయ్యాక 127 రోజులకు గద్దెదిగాల్సి వచ్చింది. 1967 మార్చి ఎన్నికల్లో మరో 9 రాష్ట్రాలతో పాటు పంజాబ్‌ ప్రజలూ కాంగ్రెస్‌ను ఓడించారు. దాంతో అకాలీదళ్‌ నేత, మొదటి జాట్‌ సిక్కు జస్టిస్‌ గుర్నామ్‌ సింగ్‌ మిత్రపక్షాల మద్దతుతో (కాంగ్రెస్‌ను పాతరేయడానికి భిన్న సిద్ధాంతాలున్న కమ్యూనిస్టులు, భారతీయ జనసంఘ్‌ కలిశాయి) సంకీర్ణ సీఎం అయ్యారు. ఆయన తర్వాత సీఎంలు అయిన లచ్మన్‌ సింగ్‌ గిల్‌ (కాంగ్రెస్‌ మద్దతు ఉన్న అకాలీ తిరుగుబాటుదారు), ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ (శిరోమణి అకాలీదళ్‌) ఇద్దరూ కూడా జాట్‌ సిక్కులే. తర్వాత 1972 మార్చి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ (ప్రధాని ఇందిరాగాంధీ) ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా పంజాబ్‌లో ముఖ్యమంత్రి ఎంపికలో ప్రయోగం చేసింది. సిక్కు గ్రంథాలు, కీర్తనలు బాగా చదవి కంఠస్థం చేసిన గ్యానీ జైల్‌ సింగ్‌ను (ఇప్పటి వరకూ ఏకైక ఓబీసీ సీఎం) ముఖ్యమంత్రి గద్దెనెక్కించింది. రాజకీయ, పాలనా సామర్ధ్యం ఉన్న జైల్‌సింగ్‌ ఐదేళ్ల 44 రోజులు సీఎం పదవిలో కొనసాగి అవశేష పంజాబ్‌ రాష్ట్రంలో రికార్డు సృష్టించారు. (1982–87 మధ్య భారత రాష్ట్రపతిగా పనిచేసిన గ్యానీజీ చివరి నెలల్లో అప్పటి కాంగ్రెస్‌ ప్రధాని రాజీవ్‌ గాంధీకి బోఫోర్స్‌ కుంభకోణం కారణంగా ముచ్చెమటలు పట్టించిన విషయం మా తరం వారికి ఇంకా గుర్తుంది)

1977 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత అకాలీదళ్‌ తరఫున ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ మరోసారి సీఎం అయ్యారు. ఇక ఆయన తర్వాత ముఖ్యమంత్రులైన దర్బారాసింగ్, సుర్జీత్‌ సింగ్‌ బర్నాలా, బియాంత్‌ సింగ్, హర్‌ చరణ్‌ సింగ్‌ బరాఢ్, రాజిందర్‌ కౌర్‌ భట్టల్‌ (బర్నాలా తప్ప మిగిలిన నలుగురూ కాంగ్రెస్‌ వారే) –వారందరూ జాట్‌ సిక్కులే. 2002 నాటికి మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన జాట్‌ సిక్కు ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ తర్వాత కాంగ్రెస్‌ తరఫున కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఐదేళ్ల మూడు రోజులు–అంటే పూర్తి పదవీకాలం సీఎం పదవిలో కొనసాగారు. ఆ తర్వాత నాలుగోసారి సీఎం అయిన బాదల్‌ 2007 నుంచి 2017 వరకూ పదేళ్ల 15 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించారు. అలాగే అంతకు ముందు కాంగ్రెస్‌ తరఫున ఐదేళ్లు పూర్తి చేసుకున్న సీఎంలుగా జైల్‌ సింగ్, అమరీందర్‌ సింగ్‌ రికార్డుల్లోకి ఎక్కారు. అయితే, 2017 లో 75 ఏళ్లు నిండుతున్న సమయంలో చివరిసారి ముఖ్యమంత్రి అయిన అమరీందర్‌ ఈసారి ఐదేళ్లు పూర్తిచేయకుండా నాలుగేళ్ల 187 రోజులకు పార్టీ›నాయకురాలు సోనియాగాంధీ ఆదేశాలతో రాజీనామా చేయాల్సి వచ్చింది.

మొదట లోక్‌సభ మాజీ స్పీకర్, కేంద్ర మాజీ మంత్రి, హిందూ జాట్‌ కాంగ్రెస్‌ నేత బలరామ్‌ జాఖఢ్‌ కొడుకు, పీసీసీ నేతగా పనిచేసిన సునీల్‌ జాఖఢ్‌ తొలి హిందూ సీఎం అవుతారని శనివారం వార్తలొచ్చాయి. అయితే, పటియాలా సంస్థానం మాజీ యువరాజు కూడా అయిన 79 ఏళ్ల అమరీందర్‌ కొత్త పార్టీ పెట్టకుండా ఆపడానికి అన్నట్టు తొలి దళిత సిక్కు చరణ్‌ జీత్‌ సింగ్‌ చన్నీని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసి కాంగ్రెస్‌ గొప్స సాహసం చేసి, అనూహ్యమైన రాజకీయ జూదానికి తెరతీసింది. 58 ఏళ్ల రాందాసియా (ఎస్సీ) సిక్కు అయిన చన్నీ స్వాతంత్య్రం వచ్చాక పుట్టిన తొలి పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు. పంజాబ్‌ జానాభాలో దళితులు దాదాపు 30 శాతం వరకూ ఉన్నారు. వారిలో చర్మకార వృత్తి మూలాలున్న రవిదాసియా లేదా రాందాసియా సిక్కులే మూడొంతులకు పైగా ఉన్నారు. హిందూ దళితుల్లోనూ ఈ వర్గానిదే పెద్ద వాటా. బహుజన్‌ సమాజ్‌ పార్టీ స్థాపకుడు ‘మాన్యవర్‌’ కాన్షీరామ్‌ కూడా చర్మకార సిక్కు కుటుంబంలో పుట్టి హిందువుగా పెరిగినవాడు. పంజాబ్‌ సిక్కుల్లో పెద్ద కొడుకును కుదిరితే హిందువుగా పెంచే ఆనవాయితీ ఉందట.

పాపం, అమరీందర్‌!
–––––––––––––
భారతదేశంలో పటియాలా మాజీ సంస్థానాధీశుల కుటుంబంలో పుట్టిన అమరీందర్, ఇంకా హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ మినహా మాజీ సంస్థానాధీశుల వారసులు ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కాలేదు. మాజీ సీఎం, మాజీ ప్రధాని వీపీ సింగ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు అర్జున్‌సింగ్, దిగ్విజయ సింగ్‌ సైతం జమీందారీ తాలూక్‌ దార్లే గాని మాజీ సంస్థానాధీశుల కుటుంబాల్లో పుట్టినోళ్లు కాదు. అయితే, వారు మరి కాస్త గౌరవం కోసం రాజా అని పిలిపించుకుంటారు. అమరీందర్‌ తండ్రి యావవేంద్రసింగ్‌ పటియాలా చివరి సంస్థానాధీశుడు, జాట్‌ సిక్కు. పటియాలా ఉన్నంతలో పెద్ద సంస్థానం. హైదరాబాద్‌ నిజామ్‌ మాదిరిగా ఆయన కూడా స్వతంత్ర భారతంలో కొద్ది కాలం రాజప్రముఖ్‌ (గవర్నర్‌ వంటిది) పదవి చేపట్టారు. ఆయన పెద్ద కూతురు హేమిందర్‌ కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి (డా.మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్లో) కన్వర్‌ నట్వర్‌ సింగ్‌ భార్య. అంటే ఆమె అమరీందర్‌ పెద్దక్క. అప్పట్లో నట్వర్‌ సింగ్‌ హిందూ జాట్‌ అయినప్పటికీ జాట్‌ సిక్కు సంస్థానాధీశుడైన యాదవేంద్రసింగ్‌ (అమరీందర్‌ తండ్రి) ఇంగ్లండ్‌ లో చదువుకున్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన నట్వర్‌ కు తన కూతురు హేమిందర్‌ కౌర్‌ ను ఇచ్చి పెళ్లి చేశారు. అదీగాక నట్వర్‌ రాజస్థాన్‌లోని కులీన హిందూ జాట్‌ కుటుంబంలో పుట్టారు గాని ఆయన స్వయంగా సంస్థానాధీశుని సంతానం కాదు, భరత్‌పూర్‌ జాట్‌ హిందూ సంస్థానాధీశులకు పెళ్లిళ్ల వల్ల బంధువు మాత్రమే. తన కూతురు హేమిందర్‌ కన్నా రెండు మూడు అంగుళాలు ఎత్తు తక్కువ ఉన్నా నట్వర్‌ చదువు, హోదా, ఉన్నత సంస్కారం చూసి పటియాలా ‘మహారాజు’ కూతురును ఇచ్చి పెళ్లి చేశారు. 90 ఏళ్ల నట్వర్‌ ఇంకా పత్రికల్లో వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. ఈ మాజీ మహారాజా రెండో భార్య, అమరీందర్‌ తల్లి మొహీందర్‌ (పెళ్లికి ముందు పేరు మెహతాబ్‌ )కౌర్‌ కూడా లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నారు. మహారాజా మొదటి భార్యకు పిల్లలు పుట్టక పోవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు.
పంజాబ్‌లో కులం ఏమిటి?
––––––––––––––––
దేశ విభజన ఫలితంగా మూడొంతుల కన్నా ఎక్కువ భాగం పంజాబ్‌ పాకిస్తాన్‌లోకి పోయింది. మత ప్రాతిపదికన విభజన వల్ల ఇలా జరిగింది. ఇప్పటి పాక్‌ లో సగం కన్నా ఎక్కువ జనాభా (దాదాపు పదకొండు పన్నెండు కోట్లు) పాకిస్తాన్‌ పంజాబ్‌లోనే ఉంది. పంజాబీ మాట్లాడే ప్రజలే పాక్‌లో భాషాపరమైన మెజారిటీ. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే, కులభేదాలకు వ్యతిరేకంగా పుట్టిన సిక్కు ధర్మాన్ని నమ్మే సిక్కులు దాదాపు 58 శాతం భారత (తూర్పు) పంజాబ్‌లో ఉన్నట్టే, పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో దాదాపు 95 శాతానికి పైగా ముస్లింలే ఉన్నారు. అయినా, వారు తమ తోటి పంజాబీ సిక్కులు, హిందువులు మాదిరిగా కులాన్ని పాటిస్తారు. అందుకే పాకిస్తాన్‌ ప్రస్తుత చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ కమర్‌ జావెద్‌ బాజ్వా ను అక్కడ జాట్‌ ముస్లింగానే పరిగణిస్తారు. ఇస్లాంలోకి ప్రవేశించడానికి ముందు తమకు ఉన్న హిందూ ఇంటి పేర్లను పంజాబీ ముస్లిం జాట్లు, పంజాబీ సిక్కు జాట్లు కొనసాగించడం విశేషం. అలాగే ఖత్రీ ముస్లింలు, సిక్కులు కూడా. మన పంజాబ్‌ సిక్కుల్లో కూడా బాజ్వా అని ఇంటి పేరున్న నేతలు ఉన్నారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు ప్రతాప్‌ సింగ్‌ బాజ్వా. పాకిస్తాన్‌ పంజాబ్‌ వెళితే ఇండియాలోని పంజాబీ సిక్కులు, హిందువుల ఇంటి పేర్లే చాలా వరకు కనిపిస్తాయి. కులం విషయంలో భారత్‌–పాకిస్తాన్‌ భాయీ భాయీ అనే చెప్పాలి. ఎట్టకేలకు భారత పంజాబ్‌లో ఓ దళిత సిక్కు కుటుంబంలో పుట్టిన నేత చరణ్‌ జీత్‌ చన్నీ కాంగ్రెస్‌ తరఫున సీఎం కావడం గొప్ప పరిణామం. అకాలీదళ్‌–బీఎస్పీ కూటమిని, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి పెరుగుతున్న జనాదరణను తట్టుకుని మళ్లీ వచ్చే మార్చి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి ఈ దళిత సిక్కు సీఎం కార్డు ఎంత వరకు పనిచేస్తుందో మరి. మనం గుర్తుంచుకోవాల్సిన మరో పంజాబీ సిక్కు విషయం ఏమంటే–ఇందిరాగాంధీని మషీన్‌ గన్స్‌తో కాల్చిచంపిన ఇద్దరు సిక్కుల్లో ఒకరు, వయసులో పెద్ద అయిన బియాంత్‌ సింగ్‌ దళిత సిక్కు కాగా, రెండో వ్యక్తి సత్వంత్‌ సింగ్‌ జాట్‌ సిక్కు. బియాంత్‌ సింగ్‌ పంజాబీ దళిత సిక్కులు అనుసరించే రాధాస్వామీ పంథ్‌ కు చెందిన కుటుంబంలో పుట్టారు…
– నాంచారయ్య మెరుగుమాల

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions