.
నిన్న మనం ఓ కథనం చదివాం కదా… సంపాదనలో సమాజానికి కొంతైనా తిరిగి ఇచ్చే సామాజిక బాధ్యతలో, దాతృత్వంలో ఒక శివ నాడార్తో పోలిస్తే …. అత్యధిక సంపన్నుడు అయి ఉండీ ముఖేష్ అంబానీ ఎంత దూరంలో ఉన్నాడో చెప్పుకున్నాం కదా…
పోనీలే, కనీసం పుణ్యం కోసమో, పాపభీతి కోసమో… ఓ మంచి పని ప్రకటించాడు… బహుశా అదీ కార్పొరేట్ సామాాజిక బాధ్యత కింద చూపిస్తాడో ఏమో తెలియదు గానీ… తను తిరుమలను సందర్శించాడు… తరువాత 2 లక్షల మందికి రోజూ వండి పెట్టగల అత్యంత ఆధునిక వంటశాల నిర్మాణానికి సహకరిస్తానని ప్రకటించాడు…
Ads
రోజూ సగటున 70 నుంచి 80 వేల మంది వస్తున్నారు తిరుమలకు… ఉత్సవాల రోజుల్లో ఇది మరీ ఎక్కువ… అందులో అందరూ అన్నప్రసాదం తీసుకుంటారని చెప్పలేం, సగటున రోజుకు ఎందరు అన్నదానం స్వీకరిస్తున్నారనే లెక్కల్ని పెద్దగా టీటీడీ వెల్లడించినట్టు గుర్తు లేదు… కాకపోతే మెజారిటీ భక్తులు, అత్యంత ధనిక భక్తులు కూడా అన్నదానాన్ని కూడా ఓ ప్రసాదంలా భావించి, తప్పకుండా స్వీకరించడానికి ఇష్టం చూపిస్తారు…
ఇప్పుడు ముఖేష్ అంబానీ ప్రకటించిన అత్యాధునిక ఆటోమేటెడ్ వంటశాల రోజూ 2 లక్షల మందికి వంట చేసి వడ్డించగలదు… అదీ పౌష్టిక విలువలతో… అఫ్కోర్స్, టీటీడీ అందించే సరుకులను బట్టి, వాటి నాణ్యతను బట్టి పౌష్టిక విలువలు ఆధారపడి ఉంటాయి…
మనుషుల అవసరాన్ని, శ్రమను తగ్గించడానికి ఈ కిచెన్ కొత్త టెక్నాలజీ సాయపడుతుంది… హైజీన్ విషయంలో భక్తుల అపోహల్ని తొలగిస్తుంది… మంచి నిర్ణయమే… తన పుణ్యం కోసమే అయినా సరే సగటు భక్తుడికి ఉపయోగకరమే… (ఈమాత్రం ఖర్చు టీటీడీ భరించలేదా అనడక్కండి… వీలైనంతవరకూ టీటీడీ అన్ని విషయాల్లోనూ విరాళాల కోసం ప్రయత్నిస్తుంది…)
ఐతే ఈ మోడరన్ కిచెన్ కోసం ఎంత ఖర్చవుతుంది, ఇతర వివరాలేమిటో అంబానీ టీమ్ చెప్పలేదు, టీటీడీ చెప్పలేదు… మరో విశేషం ఏమిటంటే… టీటీడీ దేవాలయాలు అన్నింట్లోనూ అన్నదానం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పాడు కదా… ఆ దేవాలయాలన్నింటికీ ముఖేష్ అంబానీ అన్నదానం విషయంలో సాయం చేస్తానని ప్రకటించాడు… ఆ వివరాలు కూడా వెల్లడించలేదు, సూత్రప్రాయ ప్రకటన…
ఇది వెంకటేశ్వర స్వామికి సేవ చేయడం, తిరుమల దైవిక లక్ష్యంలో ఒక చిన్న భాగం – ఏ భక్తుడు కూడా ఆకలితో ఉండకూడదని…” అని అంబానీ టీమ్ ప్రకటన చెబుతోంది… తిరుమల తరువాత కేరళలోని గురువాయూర్ టెంపుల్ వెళ్లాడు… అక్కడ 15 కోట్లతో ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రకటించాడు…!!
….
…
…
తాజా అప్డేట్…..
ఒక్కరోజే మూడు ఆలయాలకు అంబానీ భారీ విరాళాలు.. తిరుమలకు రూ.100 కోట్లు
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భారీ విరాళాలు
తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు రూ.100 కోట్ల విరాళం
2 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా కొత్త వంటశాల
రాజస్థాన్లోని నాథ్ద్వారాకు రూ.50 కోట్లకు పైగా విరాళం
కేరళలోని గురువాయూర్ ఆస్పత్రికి తొలి విడతగా రూ.15 కోట్లు
ఒక్కరోజే మూడు ప్రముఖ ఆలయాలను సందర్శించిన అంబానీ
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఆదివారం ఒక్కరోజే మూడు ప్రముఖ ఆలయాలను సందర్శించి, ప్రజాసేవ కార్యక్రమాల కోసం భారీ విరాళాలు ప్రకటించారు. తిరుమల, కేరళలోని గురువాయూర్, రాజస్థాన్లోని నాథ్ద్వారా ఆలయాలకు ఆయన రూ.165 కోట్లకు పైగా విరాళాలను ప్రకటించి వార్తల్లో నిలిచారు.
వివరాల్లోకి వెళితే… ఆదివారం వేకువజామున సుప్రభాత సేవ అనంతరం ముఖేశ్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో నిత్యం 2 లక్షల మందికి అన్నప్రసాదాలు తయారు చేసేందుకు వీలుగా, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త శాటిలైట్ కిచెన్ (వంటశాల) నిర్మాణానికి రూ.100 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ కొత్త వంటశాలను అన్నప్రసాదం ట్రస్టుకు అంకితం చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావడం తమకు లభించిన మహాభాగ్యమని రిలయన్స్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
అనంతరం ఆయన రాజస్థాన్లోని నాథ్ద్వారా ఆలయాన్ని సందర్శించారు. అక్కడ భక్తుల సౌకర్యార్థం యాత్రికుల సముదాయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. రానున్న మూడేళ్లలో పూర్తికానున్న ఈ ప్రాజెక్టు కోసం రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.15 కోట్లను విరాళంగా అందజేశారు.
అలాగే కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి తనవంతు సహాయం ప్రకటించారు. తొలి విడతగా రూ.15 కోట్ల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఒకే రోజు మూడు ఆలయాల్లో అన్నదానం, వసతి, వైద్యం వంటి సేవా కార్యక్రమాలకు అంబానీ భారీగా విరాళాలు ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Share this Article