Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లెక్కల తాబేలు… అంకెల మాంత్రికుడు… ఓ జ్ఞాపకం…

April 25, 2023 by M S R

Murali Buddha………..   లెక్కల తాబేలు – అంకెల మాంత్రికుడు…… ఓ జ్ఞాపకం

నాలుక పైనే అంకెలు , రాజకీయ చరిత్ర కలిగిన నాయకుల్లో గొనె ప్రకాష్ వంటి వారు ఇంకొకరు లేరు . పతంజలి గారు లెక్కల తాబేలు అని ఓ అద్భుతమైన కథ రాశారు . కథ సంక్షిప్తంగా . తాబేళ్ల రాజ్యం లో ఓ తాబేలు సరదాగా లెక్కలు నేర్చుకుంది. 27వ ఎక్కం ముందు నుంచి వెనక నుంచి ముందుకు ఎలా అంటే అలా చెప్పగలదు . ఏ విషయం ఐనా లెక్కలతో చెప్పేస్తుంది . నృత్యం , భవన నిర్మాణం ఏదైనా కావచ్చు లెక్కలతో అద్భుతంగ చెబుతుంది …లెక్కల్లో ఆ తాబేలును ఓడించే వారు లేరు .

లెక్కల తాబేలు లెక్కల ప్రతిభ తాబేళ్ల రాజ్యం రాజుకు తెలుస్తుంది . రాజసభకు పిలిపించి ప్రతిభను పరీక్షించి ముగ్ధుడై రాజు తన కొలువులో ఉండమంటాడు … ఏ విషయం ఐనా లెక్కల తాబేలు చెప్పే లెక్కలకు తిరుగు ఉండదు . లెక్కల తాబేలుతో చర్చించి రాజు నిర్ణయాలు తీసుకునే వారు . ఓ సారి లెక్కల తాబేలు రాజుతో రాజా మన దేశం లో తాబేళ్ల సంఖ్య పెరుగుతుంది . దేశం సరిపోదు పొరుగున ఉన్న కోతుల దేశం పై దండ యాత్ర చేసి ఆక్రమించు కుందాం అని లెక్కలు చెబుతారు .. తాబేళ్ల డిప్ప ఎంత బలంగా ఉంటుంది .కోతులు ఎంత శక్తితో ఎంత సమయం లో ఎన్ని సార్లు కొట్టగలవు . వాటిని తాబేళ్లు ఎలా తట్టుకోగలవు అని లెక్కలు చెబుతాడు … రాజు ఆ లెక్కలకు సంతృప్తి చెంది పొరుగు దేశం పై దాడికి వెళ్తాడు తన తాబేళ్ల సైన్యం తో …..

Ads

2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తెరాస పొత్తుతో పోటీ . కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది . మాతో పొత్తు వల్లే కెసిఆర్ గెలిచాడు అని ysr , ఇతర కాంగ్రెస్ నేతల విమర్శలు .. మాతో పొత్తు వల్లే మీకు అధికారం వచ్చింది అని తెరాస విమర్శ . దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి అని కెసిఆర్ కు కాంగ్రెస్ సవాల్ .. సరే అని కెసిఆర్ రాజీనామా…. కరీంనగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ …

ఓ రోజు ఆంధ్రభూమి లో ఉండగా ఎడిటర్ శాస్త్రి పిలిచి కరీం నగర్ ఫలితం ఎలా ఉంటుంది అని అడిగితే … కెసిఆర్ గెలుస్తాడు అంటే తెలంగాణ వాదిగా కాదు మాములుగా చెప్పు అని అడిగాడు .. చాలా మందికి కోరిక , అంచనా ఈ రెండింటికి తేడా తెలియదు . నా కోరిక , అంచనా రెండూ ఒకటే … అని బలంగా చెబితే …. లేదు ఓడిపోతున్నాడూ ఇదిగో లెక్కలు చూడు అని కొన్ని పేపర్లు ఇచ్చాడు . కరీం నగర్ చరిత్ర , గ్రామాలు , కులాలు , మతాలు , గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు గెలుపు ఓటముల వివరాలు …. దీని ప్రకారం తెరాస గెలువదు అని తేల్చారు .

ఆ లెక్కలు పాత చరిత్ర అన్నీ నిజాలే … ఈ వివరాలు ఎలక్షన్ కమిషన్ వద్ద కూడా లేక పోవచ్చు .. ఈ లెక్కలు మీకు ఇచ్చిన రిపోర్టర్ ఎవరో కానీ వాటిని తయారు చేసింది మాత్రం గొనె ప్రకాష్ … మరెవరూ ఇలా తయారు చేయలేరు అని చెప్పాను … ఈ లెక్కలు వేరు , ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల పోరు వేరు అన్నాను … నువ్వెంత చెప్పునా నా కెందుకో తెరాస ఓడి పోతుంది అనిపిస్తోంది అని ఎడిటర్ లెక్కల పేపర్ ను ఆసక్తిగా చూస్తూ అన్నారు . పైగా ysr సర్వశక్తులను కరీం నగర్ లో మోహరించాడు అన్నారు .

సార్ మీరు ఎడిటర్ నేను రిపోర్టర్ మీరు తలుచుకుంటే ఇప్పుడు నన్ను బదిలీ చేయవచ్చు , ఏమైనా చేయవచ్చు . నేను మీకు భయపడాలి … అలాంటిది నేనే ఇలా ధైర్యం గా మీ అభిప్రాయానికి వ్యతిరేకం గా చెబుతుంటే …. కరీం నగర్ ఓటరు ఎవడికి భయపడతాడు … ధైర్యంగా తెలంగాణకు ఓటు వేస్తాడు అని చెప్పాను ….

లెక్కల తాబేలు లెక్కలకు ముచ్చట పడి రాజు చేరదీసినట్టే …. తెలంగాణ రానే రాదు … ఢిల్లీ వెళ్లి వచ్చిన కెసిఆర్ ముఖ కవళికలు చూస్తే చెప్పేయ వచ్చు అంటూ గొనె చెప్పే అద్భుత మైన లెక్కలు గొనెను ysr కు సన్నిహితం చేశాయి . RTC ఛైర్మెన్ అయ్యారు … లెక్కలతో చెలరేగి పోతున్నారు . కరీం నగర్ ఫలితం ఎలా రాబోతుందో గొనె చెప్పిన లెక్కలు వారందరికీ నచ్చాయి ..కరీంనగర్ లో అంతకు ముందు ఎక్కడా పెట్టనంత ఖర్చు … కాంగ్రెస్ తరఫున అన్ని కుల సంఘాలు మత సంఘాలు , చివరకు అసదుద్దీన్ ఒవైసి ని సైతం ysr రంగం లోకి దించారు .

కరీంనగర్ లో తెరాస ఓడి పోతే తెలంగాణ వాదం అయిపోయినట్టే అని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించే వారు అనుకున్నారు . తెలంగాణ ఏర్పాటును కోరుకున్న వారు కూడా ఇదే అనుకున్నారు ..తాబేళ్ల రాజ్యం రాజు కోతుల రాజ్యం పై దండయాత్రకు వెళ్లారు కదా ? ఏమైంది అంటారా ? తాబేళ్లు దాడి చేయగానే కోతులు ప్రతిఘటించాయి .కోతులు తాబేళ్ల డిప్ప మీద కొడుతున్నా వాటికి ఏమీ కాలేదు … అచ్చం లెక్కల తాబేలు చెప్పినట్టే జరుగుతోంది …..

ఓ సీనియర్ కోతి ముందుకు వచ్చి పిల్ల కోతుల్లారా తాబేలు తో పోరాడాల్సిన తీరు అది కాదు అని చెవిలో ఏదో చెప్పింది … కోతులన్నీ సమరోత్సాహం తో తాబేళ్లను పట్టుకొని …. తలక్రిందులు చేసి కొట్టి చంపాయి … డిప్ప మీద కొడితే ఏమవుతుందో లెక్కల తాబేలు చెప్పింది కానీ తల కిందులు చేసి కొట్టి చంపుతారని ఊహించ లేదు …

కాంగ్రెస్ తెరాస పొత్తు తో పోటీ చేస్తే 50 వేల తో గెలిస్తే , తెరాస సొంతం గా పోటీ చేస్తే రెండున్నర లక్షల మెజారిటీ తో విజయం సాధించారు .గొనె చెప్పిన లెక్కలకు ముగ్దులై చాలా మంది కరీంనగర్ పై పందెం కాసి పెద్ద మొత్తం లో నష్టపోయారు … Clp వద్ద ఆ రోజు వినిపించిన మాటల్లో ఓ మార్వాడీ 50 లక్షలు నష్టపోయారు …తెలంగాణ రాదు అని గొనె చెప్పిన లెక్కలు . కరీంనగర్ లో తెరాస గెలువదు అని చెప్పిన లెక్కలు , తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు అవుతున్నా  ,కరీంనగర్ గెలిచి 18 ఏళ్ళు అవుతున్నా , గొనె చెప్పిన ఈ లెక్కలు ఇప్పుడు విన్నా కన్విన్సింగ్ గా ఉంటాయి . గొనె చెప్పే లెక్కలు , చరిత్ర లో ఒక్క అబద్దం ఉండదు . ఈ లెక్కలు , చరిత్ర ఆధారంగా భవిష్యత్తు లో ఏం జరగబోతుందో అతను చెప్పింది ఏదీ నిజం కాదు .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions