‘‘ఈ దేశ ప్రధానమంత్రి పదవి అనేది ఓ వ్యవస్థ… ఆ హోదా గౌరవాన్ని రక్షించడం, లోపరహిత రక్షణ కల్పించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత… దానికి భిన్నమైనదేమీ మన ప్రజాస్వామిక వాతావరణానికి ఆమోదయోగ్యం కాదు…’’… ఇదీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ట్వీట్…. వావ్…! పాకిస్థాన్ సరిహద్దుల్లో, ఖలిస్థానీ ప్రేరేపిత ఆందోళనకారుల వల్ల, పంజాబ్ ప్రభుత్వ నిర్లక్ష్యమే సహకారంగా… అత్యంత సెక్యూరిటీ థ్రెట్ ఉన్న మోడీ దాదాపు 20 నిమిషాలపాటు ఓ ఫ్లై ఓవర్ మీద చిక్కుపడిపోవడం, దగ్గరిదాకా ఆందోళనకారుల వాహనాలు రావడం ఖచ్చితంగా ఆందోళనకరం…
ఛల్ హట్… అక్కడ మోడీ ఉండొచ్చు, ఇదే పంజాబ్ సీఎంకు బాస్ రాహుల్ గాంధీ ఉండొచ్చు రేపు… ఆమాత్రం సోయి కనిపించడం లేదు కాంగ్రెస్ పార్టీలో… నోటికొచ్చిన సమర్థనలు చేస్తోంది… అసలే కెనడా, బ్రిటన్ల నుంచి అందుతున్న సహకారంతో ఖలిస్థానీ ఉద్యమకారులు రైతుల పేరిట బలపడుతున్నారనే ఆరోపణలున్న నేపథ్యంలో… పాక్ సరిహద్దుల గుండా పాక్ డ్రోన్లు డ్రగ్స్, ఆయుధాలు జారవేస్తున్న ఉదాహరణలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో… యాంటీ-మోడీ భావజాలుర స్పందనలు, వాదనలు, సమర్థనలు విస్తుగొలుపుతున్నయ్… ఒక ఇందిరను, ఒక రాజీవ్ను కోల్పోయిన పార్టీ కూడా ఇప్పటికీ అదే ధోరణిలో వెళ్తున్నతీరు విస్మయకరం…
కాంగ్రెస్ కావాలనే మోడీ ప్రాణాలు తీసే ఉద్దేశంతో ఇలా వ్యవహరించిందనే పిచ్చి వాదనలను నేను సమర్థించను… కానీ అదేసమయంలో ఓ ఎలక్షన్ డ్రామా కోసం మోడీ ఆడిన ఎపిసోడ్ అనేదీ సమర్థించను… అసలు పంజాబ్ మీద బీజేపీకి ఆశలేమీ లేవు… మరీ పాక్ సరిహద్దుల్లోకి వెళ్లి ఈ డ్రామాలు ఆడే సాహసం బీజేపీ చేస్తుందని ఎవరూ అనుకోలేరు… కానీ నిర్లక్ష్యం నిజం… మోడీ, తన భద్రతావ్యవస్థల చేతకానితనం కారణంగా ఒక బెంగాల్, ఒక పంజాబ్ ప్రమాదకరంగా మారుతున్నాయనేదీ నిజం…
The Prime Minister of India is an institution. It is the duty of every Government to provide foolproof security and safeguard the dignity of this institution. Anything contrary should be unacceptable in our democracy.
— Naveen Patnaik (@Naveen_Odisha) January 6, 2022
మాజీ ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ స్వతహాగా సైనికుడు… తనలోని సైనికుడు మరణించలేదు… అందుకే కీలక సందర్భాల్లో పాక్ దుర్నీతిని ఎండగడుతూ వచ్చాడు… కానీ ఏం జరిగింది..? పాక్ ప్రేమికుడు సిద్ధూ ప్రభావంతో రాహుల్ గాంధీ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాలతో ఆ అమరీందర్ ఔట్… పంజాబ్లో పరిస్థితి మరింత దిగజారింది… అఫ్కోర్స్, రాహుల్ ఈ దేశానికి వీసమెత్తు ప్రయోజనకారి కాదు, అంత పరిణతీ లేదు, ఆ తెలివీ లేదు… తన కోటరీది మరింత విచ్ఛిన్నకర భావజాలం… అందుకే సీనియర్లు ఛీపో అంటున్నారు… ఏళ్లు గడుస్తున్నా ఎఐసీసీ తన అధ్యక్షుడెవరో తేల్చుకునే సుముహూర్తం దొరకడం లేదు… బీజేపీ మాకు నచ్చడం లేదు, మీకు వోట్లేస్తాంరా బాబూ అంటే, ఛల్, మీరెవడ్రా మాకు వోట్లేయడానికి అన్నట్టుగా కొట్టుకుపోతోంది కాంగ్రెస్…
ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్కు తన రాష్ట్రంలో బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి… ఐనా సరే, కీలక సందర్భాల్లో కేంద్రానికి సపోర్ట్ చేస్తున్నాడు, లేదా వ్యతిరేకిస్తున్నాడు… ఇప్పుడు కూడా ఓ ప్రశంసనీయమైన వ్యాఖ్య చేశాడు… ఈ రాజనీతిజ్ఞత మిగతా నాయకుల్లో ఎందుకు కొరవడింది..? పంజాబ్ రైతులూ మీరు తోపులు, అప్పట్లో మా ఇందిర ముక్కుకు దెబ్బతగిలినా ధైర్యంగా ప్రచారం కొనసాగించింది, మోడీకి ఈ శాస్తి జరగాల్సిందే వంటి వ్యాఖ్యానాలు అక్షరాలా మూర్ఖత్వం… ఆల్రెడీ ఖలిస్థానీ దెబ్బ కాంగ్రెస్కు తెలుసు… ఐనా అదే ధోరణి… భస్మాసుర సర్పాలకు పాలుపోస్తే జరిగేది ఏమిటో స్వీయానుభవమే…
మళ్లీ చెప్పుకుందాం, మోడీని వదిలేయండి, అక్కడ జగన్, స్టాలిన్, కేసీయార్, పినరై విజయన్, రాహుల్, అఖిలేష్… చివరకు ఆ మమత ఉన్నా సరే… దేశ అంతర్గత రాజకీయాలు, వైరుధ్యాలు వేరు… కానీ దేశసమగ్రత, దేశ ప్రధాని రక్షణ ఈ దేశకర్తవ్యం… కానీ బీజేపీయేతర పార్టీల్లో పట్నాయక్ తప్ప ఇంకెవరూ స్పందించలేదు… అఫ్కోర్స్, ఇదే ప్లేసులో ఇందిర ఉండి ఉంటే, తరువాత ఏం జరిగి ఉండేది..? రణదీప్ సూర్జేవాలా నువ్వేమైనా చెప్పగలవా..? నువ్వు కూడా శివసేన సంజయ్ రౌత్ తమ్ముడివేనా..? చివరగా :: నేను ఇందిరకన్నా తోపును అని మోడీ అనుకుంటే ఫాఫం అనుకోవాల్సిందే… ఓ టైం వస్తే ఆమె ఎలా దుర్గామాత కాగలదో ఆచరణలో చూపించింది… తన చూపుడు వేలితో దేశగతిని శాసించింది… పోల్చుకోకండి… మీకు చేతకాదు… కాదని జనానికీ అర్థమైంది…!!
Share this Article