.
గుర్తుంది కదా… మాల్దీవుల మంత్రులు మన దేశం మీద విషం కక్కారు… తరువాత మోడీ వెళ్లి లక్షద్వీప్ బీచులో కుర్చీ వేసుకుని కూర్చున్న ఎఫెక్ట్ మాల్దీవుల మీద విపరీతంగా పడింది…
ఇండియన్ టూరిస్టులు దాదాపు నిషేధించారు అక్కడికి వెళ్లడాన్ని… మరీ కొందరు చెత్తా సెలబ్రిటీలు తప్ప… మొదట్లో మాల్దీవుల నాయకులు చైనా మీద ఆశలు పెట్టుకున్నా, అవీ ఫలించక, ఇక తరువాత మన కాళ్లావేళ్లా పడినంత పనిచేశారు.., మీ టూరిస్టులు రాకపోతే చచ్చిపోతాం అని…
Ads
పహల్గామ్ ఉగ్రఘాతుకం, ఆపరేషన్ సిందూర్ దేశప్రజల్లో ఎంతటి భావోద్వేగాల్ని రేకెత్తించాయో తెలుసు కదా… ఆ ధూర్త ఉగ్రదేశం పాకిస్థాన్కు మద్దతు పలికిన దేశాలు ఏమిటో తెలుసా..? తుర్కియే, అజర్ బైజాన్… ఆమధ్య మన పర్యాటకులు మాల్దీవులతోపాటు ఎక్కువగా ఈ రెండు దేశాలకు కూడా వెళ్లేవాళ్లు…
ఎప్పుడైతే ఆ రెండు దేశాలూ పాకిస్థాన్కు మద్దతు ప్రకటించాయో, ఇక పర్యాటకులు అక్కడికి వెళ్లడం మానుకుంటున్నారు… స్వచ్ఛందంగా… ఎవరూ పిలుపునివ్వలేదు… ఎవరూ ఆంక్షలు పెట్టలేదు… ఎవరికి వాళ్లే ఆ రెండు దేశాలకు వెళ్లకుండా నిగ్రహం పాటించడం… అది ఆ రెండు దేశాల మీద ఆగ్రహ ప్రకటన…
మన ప్రజల ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది…! తుర్కియే (టర్కీ) సంగతే తీసుకుందాం… భారత్ నుంచి టర్కీ వెళ్లే పర్యాటకుల సంఖ్య ఒక్క ఏడాదిలోనే భారీగా పడిపోయింది… టర్కీ పర్యాటక శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025లో భారతీయ పర్యాటకుల సంఖ్య దాదాపు 25 శాతం తగ్గింది…
ఎందుకు..? టర్కీ ఎప్పుడూ పాకిస్థాన్కు అనుకూలంగా, ఇండియాకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తోంది… ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు ఆయుధ సామగ్రి అందించిందనే వార్తలు కూడా వచ్చాయి… ఇవన్నీ ఇండియన్లలో టర్కీ పట్ల వ్యతిరేక భావనల్ని పెంచాయి…
ఈ నేపథ్యంలో భారత సోషల్ మీడియాలో ‘#BoycottTurkey‘ ఉద్యమం ఊపందుకుంది… టర్కీకి పర్యటనలను మానుకోవాలని, టర్కీ ఉత్పత్తులు కొనుగోలు చేయవద్దంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది…
దీంతో 2024లో 3,30,985 మంది భారతీయులు టర్కీ వెళ్లగా, 2025లో ఈ సంఖ్య 2, 50,762కు పడిపోయింది… వ్యాపారం, వినోదం, ఇతర అవసరాల కోసం వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది… టర్కీకి వచ్చే మొత్తం విదేశీ పర్యాటకుల్లో భారతీయుల వాటా తక్కువైనా, భారతీయుల నుంచి వచ్చిన ఈ ప్రతిస్పందన ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది..
ఇదే సమయంలో టర్కీ నుంచి భారత్కు వచ్చే దిగుమతులు కూడా కొంతమేర తగ్గినట్లు సమాచారం… ఇప్పుడిక అజర్ బైజాన్ సంగతికొద్దాం… దానిదీ టర్కీ అనుభవమే… అజర్బైజాన్ అధికారిక పర్యాటక గణాంకాల ప్రకారం.., 2024 జూన్ నెలలో కేవలం 9,934 మంది భారతీయ పర్యాటకులు మాత్రమే ఆ దేశానికి వెళ్లారు… అంతకుముందు సంవత్సరం ఇదే జూన్ నెలలో ఈ సంఖ్య 28,315... ఇది దాదాపు 66 శాతం తగ్గుదల...
పాక్కు మద్దతు — త్రైపాక్షిక సమావేశాలు
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అజర్బైజాన్కి వెళ్లి, ఆ దేశ మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు… తుర్కియే, అజర్బైజాన్, పాకిస్థాన్ల మధ్య త్రైపాక్షిక సమావేశాలు కూడా జరిగాయి… అజర్బైజాన్ గతంలో భారత్ను కీలక పర్యాటక మార్కెట్గా పేర్కొనగా, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది…
పర్యాటక సంస్థల చర్యలు
భారతదేశపు ప్రముఖ ట్రావెల్ పోర్టల్స్ MakeMyTrip, EaseMyTrip వంటి సంస్థలు తుర్కియే, అజర్బైజాన్కు ప్యాకేజీలను తగ్గించడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో అసలు ప్రోత్సహించడం లేదు… సామాజిక మాధ్యమాల్లో కూడా #BoycottTurkey, #BoycottAzerbaijan వంటి క్యాంపెయిన్లు ఊపందుకున్నాయి…
పర్యాటకుల సంఖ్య తగ్గుదలకు కేవలం భావోద్వేగాలే కాకుండా, ఆ దేశాల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం (Inflation), వీసా నిబంధనలు కూడా ఓ కారణం కావచ్చు… టర్కీ విషయంలో భారతీయుల ఆగ్రహానికి మరో ప్రధాన కారణం కశ్మీర్… ఐరాసలో అది పదే పదే పాకిస్థాన్కు మద్దతుగా మాట్లాడటం…
అజర్బైజాన్ – అర్మేనియా కనెక్షన్…: అజర్బైజాన్ పట్ల భారతీయుల వ్యతిరేకతకు మరో ముఖ్య కారణం ఉంది… అజర్బైజాన్ శత్రుదేశమైన అర్మేనియాకు భారత్ ఆయుధాలను (Pinaka Rockets etc…) విక్రయించడం... ఇది అజర్బైజాన్కు నచ్చలేదు, అందుకే వారు పాకిస్థాన్తో జతకట్టారు… దీనివల్ల సహజంగానే భారతీయులు ఆ దేశాన్ని దూరం పెడుతున్నారు…
‘సాఫ్ట్ పవర్’ ప్రదర్శన…: గతంలో భారతీయులు విదేశీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు… కానీ మాల్దీవుల ఉదంతం తర్వాత, సామాన్య భారతీయుడు కూడా తన ‘పర్యాటక బలాన్ని’ (Tourism Spending Power) ఒక ఆయుధంగా వాడొచ్చని గ్రహించాడు… ఇది భారత్ మారుతున్న ‘సాఫ్ట్ పవర్’కు నిదర్శనం…
ప్రత్యామ్నాయాల వేట..: టర్కీ, మాల్దీవుల వైపు చూడటం మానేసిన భారతీయులు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు…?
-
లక్షద్వీప్ & అండమాన్…: స్వదేశీ పర్యాటక రంగం పుంజుకుంది….
-
వియత్నాం, ఫిలిప్పీన్స్ & థాయిలాండ్…: భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వడం, భారత్ పట్ల సానుకూల వైఖరి ఉండటంతో ఇవి ఇప్పుడు హాట్ ఫేవరెట్స్…
భారతీయులు ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్చు చేసే పర్యాటకులలో (High-spenders) ఒకరిగా ఎదుగుతున్నారు… మరోవైపు దేశ ప్రయోజనాల కంటే వినోదం ముఖ్యం కాదని కూడా భారతీయులు స్పష్టం చేస్తున్నారు… మాల్దీవులు ఎలాగైతే దారిలోకి వచ్చిందో, రేపు టర్కీ, అజర్బైజాన్లు కూడా తమ ఆర్థిక ప్రయోజనాల కోసం భారత్ పట్ల తమ వైఖరిని మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది… ఏర్పడాలి…
Share this Article