Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాంభట్ల కృష్ణమూర్తి అంటే ఒక పెద్ద బెల్జియం అద్దం…

March 25, 2023 by M S R

1920 మార్చి 24 రాంభట్ల పుట్టినరోజు

మరోసారి పెద్దాయన్ని గుర్తుచేసుకుంటూ ..

ఒక బెల్జియం అద్దం – రాంభట్ల కృష్ణమూర్తి
Cartoonist, critic, poet and communist
—————————————————————–

శాపాలతోటి కాళ తమోరాశి తూలదు

Ads

ఏపాటిదైన వెల్గు ప్రసారించుతూ పద…

అని వెలుతురు దారుల్లోకి నడిపించి,

కొవ్వొత్తిలాగ కాలి ప్రదీపించు వారికీ

చెయ్యెత్తి లాల్ సలాం సమర్పించుతూ పద…

అంటూ ఉత్తేజ పరిచినవాడు రాంభట్ల.

సనాతనాల బూజుపై కులం మతం రివాజుపై

పురాణ నమ్మకాలపై తుఫాను రేగుతోంది రా…

అని గొప్ప ఆశావహ దృక్పథాన్ని ఇచ్చినవాడు.

రాంభట్లగారి నెపంతో… కొన్ని జ్ఞాపకాలు…

కొంత నా సొంత సొద.

1960 వ దశకం… హైదరాబాద్.

హిమయత్ నగర్ కావచ్చు. ఒక సాయంకాలం.

మఖ్దూం మొహియుద్దీన్, రాంభట్ల కృష్ణమూర్తి మరికొందరు స్నేహితులతో కూర్చుని ఉన్నారు.

“నేనొక కొత్త పద్యం రాశాను, చదువుతాను వినండి” అన్నారు మఖ్దూం.

అది ఉర్దూ కవిత. అందరూ శ్రద్ధగా విన్నారు.

మంచి కవిత్వం. గొప్ప రిథమ్.

బాగా నచ్చింది. వహ్వా అన్నారంతా.

“దాన్ని నేను తెలుగులోకి అనువాదం చేస్తాను” అన్నారు రాంభట్ల. –

మఖ్దూం సందేహించారు. “ఆ కవిత ఉర్దూ సంప్రదాయానికి సంబంధించినది. తెలుగులోకి

ఒదగదేమో” అన్నారు మఖ్దూం. దాన్ని తెలుగు చేయడం అసాధ్యం అనుకున్నారాయన.

“నేను చేస్తాను. దానికి తగిన ఛందస్సు తెలుగులో ఉంది” అన్నారు రాంభట్ల పట్టుదలగా.

రెండు మూడు రోజుల్లోనే రాంభట్ల ఆ కవితను తర్జుమా చేశారు. మఖ్దూంకి వినిపించారు.

ఆయన ఆశ్చర్యపోయారు. చాలా బాగా

వచ్చిందని మెచ్చుకున్నారు.

ఆ ఉర్దూ కవిత… ఒక పురాతన పర్షియన్ ప్రేమ కథ.

దేవదాసు, లైలా మజ్నూల్లా ఒక లెజండరీ ట్రాజెడీ. ప్రపంచ ప్రఖ్యాతి చెందింది.

షిరీన్ ప్రియురాలు… ఫర్హాద్ ప్రియుడు.

ఈ ప్రేమ కథ వెనుక కొంత చారిత్రక వాస్తవం ఉందంటారు. కొన్ని నిజాలు, కొంత కల్పన కలగలిపి కవిత్వంగా మలిచారు నాటి మహాకవి ఒకరు.

నాకు రాంభట్ల గారు చెప్పిన కథ.

షిరీన్ ఫర్హాద్ లు ప్రేమికులు. ఆమె రాజకుమారి. అతను పేదవాడు. స్వయంవరంలో నిరుపేదనే కోరుకుంటుంది షిరీన్. రాజుకు నచ్చదు.

కూతురి ఇష్టాన్నీ కాదనలేడు.

పెళ్లికి సరేనంటూ ఒక షరతు పెడతాడు రాజు.

దేశ సరిహద్దులోని పెద్ద కొండను తొలిచి అవతల ఉన్న నదిలోని నీళ్లు ఇక్కడి పొలాల్లోకి మళ్లించగలిగితే పంటలు పండి

ప్రజలు సుఖశాంతులతో ఉంటారని అలా

చేయగలిగితే షిరీన్ ని పెళ్లి చేసుకోవచ్చని అంటాడు. యువకుడూ, ఆవేశపరుడూ అయిన ఫర్హాద్

పలుగూ పారా భుజాన వేసుకుని

కొండవైపు నడుస్తాడు.

తవ్వడం మొదలుపెడతాడు.

*** *** ***

ఒక పున్నమి వెన్నెల రాత్రి… రాజు, కూతుర్ని కోటపైకి తీసుకువెళతాడు. ఒకసారి కిందికి చూడమ్మా అంటాడు. చూస్తుంది. ఆశ్చర్యపోతుంది.

కింద కోట చుట్టూ నీళ్లు ప్రవహిస్తుంటాయి.

పొరుగు దేశపు రాజు కొండను తవ్వి నీళ్లు ఇటు రప్పించాడని చెబుతాడు. తండ్రి మాట విని ఆ రాజునే పెళ్లి చేసుకుంటుంది షిరీన్.

*** *** ***

పగిలి కొండ మీద నుంచి రాలిపడుతున్న రాళ్లలాగే యాభయ్ సంవత్సరాలు దొర్లిపోతాయి.

చివికి, అలిసి డస్సిపోయిన ఫర్హాద్ చివరికి సాధిస్తాడు. నది నీళ్లను

దేశంలోని ఎండిన పొలాల మీదికి మళ్లిస్తాడు. అప్పుడు అతని వయసు 70 ఏళ్లు.

తిప్పలు పడి రాజుని కలుస్తాడు.

విజయగాథని వివరిస్తాడు.

రాజు నవ్వుతాడు.

కూతురు షిరీన్ కి ఏనాడో పెళ్లయిపోయిందని చెబుతాడు. తట్టుకోలేకపోతాడు ఫర్హాద్.

గుండె పగిలి చనిపోతాడు.

*** *** ***

కోట చుట్టూ తెల్లని ఉల్లిపొరల్లాంటి శాటిన్ తెరలు పరిపించి, గాలికి అవి కెరటాల్లా కదులుతుంటే… అవిగో నీళ్లు అంటూ కూతుర్ని మభ్యపెడతాడు రాజు. అదీ విషాదం.

మఖ్దూం పద్యానికి రాంభట్ల అనువాదం…

శీర్షిక ‘నృత్తం’

సురూప రంగ రాగ సంచయాల వార్త తెచ్చెనూ సుమాయుధేక్షు ధన్వుసీధు పాత్రగొంచు వచ్చెనూ నిశాతపాల లేతలేత కాకతో తపించుతూ…

ఇదీ మకుటం…

మహేశనృత్తమంటపం దిశాప్తమై రహించనీ

ప్రసిద్ధశిల్ప శీర్ణమద్దిగంతముల్ రణించనీ

జయించనీ శిలోచ్ఛయ ప్రభేదన శ్రమాప్తినీ

జయించనీ విశుద్ధ స్నిగ్ధ ముగ్ధ ప్రేమ ప్రాప్తినీ

అని- పంచచామరంలో అందంగా,

లయబద్ధంగా నడిపించారు.

“ఏక్ చమేలీకీ మండువే చలే… దోబదన్ ప్యార్ కీ ఆగ్ మే జల్ గయే…” అనే మఖ్దూం ప్రసిద్ధ గీతాన్ని కూడా రాంభట్ల అనువదించారు. ‘మఖ్దూం కవిత’ అనే సంకలనంలో నృత్తం, చమేలీకీ మండువే చలే రెండూ ఉన్నాయి. ఆ పుస్తకానికి రాజ్ బహదూర్ గౌర్

రాసిన ముందు మాట చదివి తీరాలి.

1973-74 విజయవాడ, విశాలాంధ్ర, చుట్టుగుంట

అప్పట్లో విశాలాంధ్ర దినపత్రిక ఆఫీసంటే ఒకటి కాదు, వంద… లిటరల్ గా. దిన, వార, మాస పత్రికలూ, కొన్ని టాబ్లాయిడ్లూ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ (వీపీహెచ్) పుస్తకాలూ, నవలలు, కథా, కవితా సంకలనాలూ, సువినీయర్లు, పోస్టర్లు, ఇన్విటేషన్లు,

కరపత్రాలూ వందలు వేలల్లో ప్రింటవుతుండేవి.

చండ్ర రాజేశ్వరరావు, నీలం రాజశేఖరరెడ్డి, వేములపల్లి శ్రీకృష్ణ, రాజ్ బహదూర్ గౌర్, విజయకుమార్, కె.ఎల్.మహేంద్ర, సురవరం సుధాకరరెడ్డి లాంటి నాయకులు తరచూ వచ్చిపోతుండేవారు. ఇటు విశాలాంధ్రలో…

ఎడిటర్ రాఘవాచారి, తుమ్మల వెంకట్రామయ్య, నిడమర్తి ఉమారాజేశ్వరావు, ఏటుకూరి బలరామ్మూర్తి, కంభంపాటి సత్యనారాయణ సీనియర్, వీపీహెచ్ బాస్ పీసీ జోషి, సోదుం రామ్మోహన్, కె.రాజేశ్వరరావు ఇలా ఎంతో మంది ప్రసిద్ధులు. ఇక రచయితలు మహీధరర రామ్మోహనరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య,

కవి రవి (రామలింగ శాస్త్రి), బొల్లిముంత శివరామకృష్ణ, చందు సుబ్బారావు, పెనుగొండ లక్ష్మీనారాయణ, అదృష్ట దీపక్ ఇంకా అనేకులు వచ్చి వెళుతుండేవారు.

విశాలాంధ్ర పై అంతస్తులో పెద్ద మీటింగ్ హాలు,

గెస్టుల కోసం గదులు ఉండేవి. రాంభట్ల మల్లారెడ్డిగార్లను అక్కడే కలిసేవాళ్లం. నేనెప్పుడూ మోహన్ వెంటే. మోహన్ వెనుక ఉండటమే పెద్ద ఎడ్యుకేషన్ అని చాలా ఏళ్ల తర్వాత నాకు తెలిసొచ్చింది. ఏలూరు రోడ్డులోని విశాలాంధ్ర బుక్ హౌజ్ మేడ మీద చిన్న గదిలో అరసం సమావేశాలు జరిగేవి. గుంటూరు శేషేంద్ర శర్మ, ఇందిరాదేవి ధన్ రాజ్ గిరి లాంటి ఎందరో కవుల్నీ రచయితల్నీ కలిసింది అక్కడే. సమావేశాల్లో రాంభట్ల, మల్లారెడ్డి మాట్లాడేవారు. వాళ్లిద్దరూ ఇద్దరే.

ప్రవాహంలా మాట్లాడతారు. సరదాగా… ఈజీగా… హాయిగా… హాస్యంతో జోకులతో నవ్విస్తూ…

రెడీ విట్టూ, క్విక్రి పార్టీ… చటుక్కున ఒక

గొప్ప పొయెం కోట్ చేయడం…

ఒక్క మాటలో చెప్పాలంటే… చంపేస్తారంతే!!

1973 లోనే అనుకుంటా… నర్సరావుపేటలో

జరిగిన ఆఫ్రో ఆసియన్ రచయితల

సమావేశానికి వెళ్లాను. సాయంత్రం అందరూ ఊరేగింపుగా బయల్దేరారు. లెజెండరీ పులుపుల

శివయ్యగారు లీడ్ చేస్తూ ముందు నడుస్తుంటే, వెనుక రాంభట్ల కృష్ణమూర్తి, గజ్జల మల్లారెడ్డి, గంగినేని వెంకటేశ్వరరావు… వాళ్లతో కుర్రకుంకని నేనూ… ఇంకా ఎంతో మంది.

ఎంతటి చక్కని రోజులవి ! రాంభట్లని కలిస్తే చాలు…

సోల్జినిత్స్ న్ కాన్సన్ ట్రేషన్ క్యాంపు నుంచి

సోమర్ సెట్ మామ్ శృంగారం దాకా…

మైకలేంజిలో ‘డేవిడ్’ నుంచి విన్సెంట్ వాంగో

‘సన్ ఫ్లవర్స్’ దాకా…

మిరుమిట్లు గొలిపే కొమురం భీం సాహసం నుంచి తలవంచని దొడ్డి కొమరయ్య త్యాగం దాకా…

మయకోవస్కీ ‘లెనిన్’ కావ్యం నుంచి పాబ్లో నెరూడా అరుణారుణ కవితా చరణాల దాకా..

బాబిలోనియా మెసపుటేమియా నాగరికతల నుంచి మొఘల్ సామ్రాజ్యపు అంతిమ

ఘడియల దాకా….

ఆయన చిటికెన వేలు పట్టుకుని నడిస్తే చాలు… Around the world with a

wonderful chai…ఎందుకంటే

రాంభట్ల కవి, రచయిత, విమర్శకుడు, ఆర్టిస్టు,

కార్టూనిస్టు, హిస్టోరియన్… ఇంకా ఎన్నో….

కళా సౌందర్య తత్వ జ్ఞాన నిధి తాళం చెవిని జేబులో వేసుకు తిరిగే మాంత్రికుడు… తాంత్రికుడు రాంభట్ల. ఒక రోజు విజయవాడలో ఆయన కనిపించగానే- “హా.. హు…హీ… రాం భీం క్లీమ్ భట్ల …..” అన్నాడు అదృష్ట దీపక్. అంటే సాహితీ సంజీవనీ సిద్ధం

శాయరా డింగరీ అని అర్థం. రాంభట్ల ఎంత ఆనందంగా నవ్వారో చెప్పలేను.

వేగుంట మోహన ప్రసాద్ బతికిన క్షణాలు

అన్నది ఇలాంటి రోజుల గురించే.

1977 జులై 19 హైదరాబాద్, ఖైరతాబాద్.

విజయవాడ విశాలాంధ్రలో పని చేస్తున్న మోహన్ కి హైదరాబాద్ నుంచి ఫోనొచ్చింది.

సీనియర్ జర్నలిస్టు మోటూరి వెంకటేశ్వరరావు నుంచి. “ఇక్కడ ఈనాడులో పని

చేయడానికి రాయడం వచ్చిన కుర్రాడినెవరినైనా పంపగలవా?” అని. తప్పకుండా

అన్నాడు మోహన్. “నాకు ఇంగ్లీషు రాదు. అనువాదం అంతకంటే రాదు” అని చెప్పాను.

“.. అదే వస్తుంది… వెళ్లరా” అని హైదరాబాద్ బస్సెక్కించాడు మోహన్.

జూలై 19 ఉదయం 11 గంటలకు ఈనాడు

ఆఫీసుకు వెళితే… చాలా ఏళ్ల నుంచి

తెలిసినట్టు మోటూరి పలకరింపు. మొదటి అంతస్తులో ఈనాడు ఎడిటోరియల్ సెక్షన్.

పరిచయాలు అయ్యాక రెండో అంతస్తుకి తీసుకెళ్లారాయన. అక్కడ రాంభట్ల

కృష్ణమూర్తిగారు ఉన్నారు. అరె… నాకు తెలిసినాయనే కదా అనుకున్నా. ఇటు చూస్తే

గజ్జల మల్లారెడ్డి, ప్లజంట్ సర్ ప్రైజ్. ఈయనా తెలుసు కదా. మరో టేబుల్ దగ్గర ఒక

పెద్దాయన తెల్లని దుస్తులతో బట్టతలతో

హుందాగా పేపరు చదువుకుంటున్నారు.

ఈయన రాచమల్లు రామచంద్రారెడ్డి అని పరిచయం చేశారు. ఓ నమస్కారం పెట్టి మామూలుగా ఉండటానికి తెగ తిప్పలు పడ్డాను. రారా సారస్వత వివేచన చదివి ఉన్నాను. చలం, తిలక్, అద్దేపల్లిని రారా తిట్టిన తిట్లు… “ఇలాంటి కవిత్వం రాసిన చేత్తో

అన్నం ఎలా తింటారో” అని దిగంబర కవుల్ని కొరడాతో కొట్టడం లాంటివన్నీ గుర్తొచ్చి

ఆనందంతో కాళ్లు వణికాయి.

రాంభట్ల గారు చాలా లిబరల్. వెరీ ఫ్రెండ్లీ.

సాహిత్య రాజకీయ కబుర్లు, జర్నలిజం anecdotes అలా చెబుతూనే ఉండేవారు. వీళ్లంతా పెద్దవాళ్లు. ఎస్టాబ్లిష్ సూపర్ స్టార్లు. నాకు అప్పుడు 19 ఏళ్లు. వీళ్లతో ఉండటం, చదవడం, రాయడం, నేర్చుకోవడం… అదో గొప్ప అదృష్టం అనీ,

దేవతలు అయాచితంగా దోసిట్లో నింపిన అమృతమనీ కొంచెం లేటుగా అర్థమైంది.

రాంభట్ల గారికి గురజాడ కన్యాశుల్కం ఒక అబ్సెషన్.

గిరీశాన్నో, మధురవాణినో కోట్ చేయకుండా ఆయనకి రోజు గడవదు. “నేషనల్ కాంగ్రెస్ అనగా దివాన్ గిరి చెలాయించడం” అని బుచ్చమ్మకు వెంకటేశం చేత చెప్పించిన మాట ఎంత సత్యం.

గురజాడ తర్వాత నా దృష్టిలో ఇంత వరకూ సవిమర్శక వాస్తవికత మన సాహిత్యంలో

వెలువడ లేదు అని ఒక వ్యాసంలో రాశారు రాంభట్ల.

గురజాడ మోకాలును తాకగల

రచయితలు కూడా కన్పించడం లేదు అంటారాయన. కొంత స్వీపింగ్ గా అనిపించినా అలా నిక్కచ్చిగా మాట్లాడటం ఆయన స్టైల్.

మెరిసే కళ్లజోడూ, జీన్ ప్యాంటూ గళ్ల చొక్కా టక్ చేసుకుని, నుదిటి మీద పడుతున్న పెప్పర్ అండ్ సాల్ట్ హెయిర్ ని సవరించుకుంటూ హుషారుగా మాట్లాడేవారు రాంభట్ల. భుజమ్మీద చెయ్యేసి ఏం ఫ్రెండూ అంటూ ఆత్మయమైన పలకరింపు. గురువూ, తండ్రీ, స్నేహితుడూ, మందలించేవాడూ, ప్రేమించేవాడూ జ్ఞానాన్ని దోసిళ్లతో పంచి ఇచ్చేవాడు

ఆ ఒక్కడే…. రాంభట్ల కృష్ణమూర్తి.

వేడి వేడి చాయ్ తాగి, ఒక సిగరెట్టు వెలిగించాడా… అప్పుడే మరో లోకంలో అమృతం

తాగి మబ్బుల మీద నుంచి వచ్చినట్లు మాటల మాలికలు అల్లుతాడు రాంభట్ల.

నవ్వుతూ జర్నలిజం మెళకువలు నేర్పిస్తూ

ఏ మాట అడిగినా ఇట్టే అర్థం చెప్పేస్తూ

చీకూ చింతా లేనట్లు ఆనందంగా గలగల్లాడుతూ…

ఎంత కష్టం అలా ఉండటం!

రాంభట్ల కృష్ణమూర్తి అంటే ఒక పెద్ద బెల్జియం అద్దం.

ఆ flawless అద్దంలో మనల్ని మనం నిండుగా చూసుకోగలం. తెలుసుకోగలం. నేర్చుకోగలం. మురిసిపోగలం కూడా.

“ఓయ్ ఫ్రెండూ, మాతో జాగ్రత్త. మేం

కోబ్రాలం” అన్నారాయన ఒకసారి.

అంటే.. ? కోనసీమ బ్రాహ్మలం అని!

మేం డేంజరస్ అనీ!

రాజకీయాలూ, సాహిత్యం అయినా, శ్రీశ్రీ, మావో అయినా అనుకున్నదాన్ని సూటిగా

నిర్మొహమాటంగా చెప్పేవారాయన…

ఒక మెరుపులాంటి విరుపుతో.

అందులో జోకూ పేలుతుంది… లాగి లెంపకాయ కొట్టినట్టు ఓ చేదు నిజమూ ఉంటుంది.

ఒక రోజు రాంభట్లను అడిగాను, “మోహన్ ఎవరు?” అని. “మోహన్ ఒక డ్రీమర్”

అన్నారాయన. “మరి నేనో..?” అని అడిగా. “ఇంచుమించుగా నువ్వూ అంతే. హాఫ్

డ్రీమర్ వి” అన్నాడాయన.

అది తిట్టో పొగడ్తో ఏమో..?

రాంభట్లగారు స్వచ్చంగా స్వేచ్చగా నిర్భీతిగా

అలా ఎలా బతగ్గలిగారు అనుకుంటే…

పూలదండలూ, సన్మానాలూ, సాహిత్య అకాడమీల లౌల్యం లేదు. ప్రభుత్వ పద్మశ్రీలు, పరమ వీర సాహితీ చక్ర బిరుదుల మోజూ లేదు. చదువుకోవడమే, తెలుసుకోవడమే, జ్ఞాన సముపార్జనే మానవునికర్తవ్యం అని మనసా

వాచా నమ్మినవాడిలా కనిపించేవాడు. –

అందరు పాత తరం కమ్యూనిస్టుల్లాగే ఆకలి కన్నీళ్లూ లేని లోకం కోసం ఆశించాడు. కలలు కన్నాడు. కవిత్వం రాశాడు.

లేవండి వంచితులారా… పురిటాకలి వరకము నుంచీ

ఘోషించె మోచన లావా… గగనాలన్ ముంచెత్తించీ…. అంటూ కమ్యూనిస్టు

ఇంటర్నేషనల్ గీతాన్ని తెలుగులోకి అనువదించింది రాంభట్ల గారే.

రెపరెపలాడే ఎర్ర జెండాల అంగార స్వప్నాల్ని మా గుండెల్లోకి నేరుగా ప్రేమగా బట్వాడా

చేసినవాడు రాంభట్ల.

ఆయన చాలా మందికి గొప్ప మానవుడూ… మార్గదర్శకుడూ… గురుతుల్యుడూ కావొచ్చు.

నాకైతే అంతకంటే ఎక్కువే.

– TAADI PRAKASH. 9704541559

బొమ్మ : మోహన్.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…
  • కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!
  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
  • ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…
  • ఇలాంటి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మన పొరుగిల్లు అయితే బాగుండు…
  • ఆపరేషన్ సిందూర్‌ను పొడిగించకపోవడమే మంచిదైందట…!!
  • టెక్నాలజీ మాత్రమే తెలిస్తే చాలదు… టెక్నిక్ కూడా తెలియాలి…
  • విజయ బాపినీడు ప్రేక్షకుల్ని ఏదో మాయ చేయబోయాడు కానీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions