.
Subramanyam Dogiparthi …. రాజేంద్రప్రసాద్ , వంశీల విజయయాత్రలో మరో మైలురాయి 1989 లో వచ్చిన ఈ కామెడీ+ క్రైం+ సస్పెన్స్+ ఇన్వెస్టిగేషన్ చెట్టు కింద ప్లీడర్ సినిమా . మళయాళంలో వచ్చిన తంత్రం అనే సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . మళయాళంలో మమ్ముట్టి , ఊర్వశి , తదితరులు నటించారు .
ఏ కధలో అయినా , ఏ సినిమాలో అయినా పాత్రల సృష్టి , కామెడీ సినిమాలు అయితే ఆ పాత్రల మేనరిజమ్స్ ముఖ్యం . ఈ సినిమాలో అలాంటి పాత్రల్లో ముఖ్యమైనది తనికెళ్ళ భరణి పాత్ర . పాత సామాన్లు కొంటాం అని రాజేంద్రప్రసాద్ డొక్కు కారు ఎక్కడ ఆగిపోతే అక్కడ ప్రత్యక్షం అవుతుండే పాత్రను ప్రేక్షకులు అసలు మరచిపోరు .
Ads

మరో పాత్ర అలెక్స్ . రాజేంద్రప్రసాద్ బాడీ గార్డ్ . మూడో పాత్ర రాజేంద్రప్రసాద్ మరదలు కం అసిస్టెంట్ . నటి పేరు కిన్నెర . చాలా చలాకీగా కీలకమయిన పాత్రను పోషిస్తుంది . మిగిలిన పాత్రలు అన్ని సినిమాల్లో చూసేవే .
కధ టూకీగా ఏంటంటే : శరత్ బాబు పెద్ద వ్యాపారవేత్త . ఊర్వశిని పెళ్లి చేసుకుని అన్యోన్య జీవితం గడుపుతూ ఉంటాడు . అతని మారు తండ్రి గొల్లపూడి అతన్ని హత్య చేసి ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా మేనేజ్ చేస్తాడు . కోడలి ఆస్తిని కాజేయటానికి అసలు పెళ్ళే కాలేదని లీగల్ నోటీస్ ఇస్తాడు . ఇప్పుడు చెట్టు కింద ప్లీడర్ పిక్చర్ లోకి వస్తాడు .
కోర్టులో నిలబడటానికే వణికి పోతూ ఉంటాడు రాజేంద్రప్రసాద్ . అతన్ని నిలబెట్టాలని మరదలు ట్రై చేస్తూ ఉంటుంది . ఊర్వశి కేసును టేకప్ చేసాక అతని మీద హత్యా ప్రయత్నం జరగటంతో రాటుతేలతాడు . కేసును పరిశోధించటం మొదలు పెడతాడు .
శరత్ బాబు బాల్య స్నేహితుడు అయిన దేవదాస్ కనకాల సాక్ష్యంతో రాజేంద్రప్రసాద్ కేస్ గెలవటమే కాకుండా గొల్లపూడిని తుదముట్టించి ఊర్వశి ఆస్తిని కాపాడతాడు . చెయ్యి వేసిన మరదల్ని ఏం చేయాలని అలెక్సుని అడుగుతాడు . పెళ్లి చేసుకోవాలని చెప్పటం , పెళ్లి చేసుకోవడంతో సినిమా సుఖాంతం అవుతుంది .
రాజేంద్రప్రసాద్ గొప్పగా నటించాడు . రెండు షేడ్లను చక్కగా చూపాడు . మొదట్లో పిరికివాడుగా , ఆత్మవిశ్వాసం లేని ప్లీడరుగా ; తర్వాత రాటుతేలిన వ్యక్తిగా , క్లైంట్ కొరకు ఎంత దూరమయినా వెళ్ళే లాయరుగా ; కోర్ట్ హాల్లో బల్ల గుద్ది వాదించే లాయరుగా గొప్పగా నటించాడు .

మరో ముఖ్య పాత్ర ఊర్వశిది . నిస్సహాయ మహిళగా , ఒంటరి పోరాటం చేసే మహిళగా బాగా నటించింది . ఇతర ప్రధాన పాత్రల్లో శరత్ బాబు , దేవదాస్ కనకాల , గొల్లపూడి మారుతీరావు , విజయచందర్ , అరుణ్ కుమార్ , కృష్ణ భగవాన్ , రావి కొండలరావు , మా గుంటూరు వాళ్ళయిన ప్రదీప్ శక్తి జీవాలు , భీమరాజు , ఆనంద మోహన్ , బట్టల సత్యం తదితరులు నటించారు .
ఈ సినిమా పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది చల్తీ కా నామ్ గాడీ చలాకీ వన్నె లేడీ రంగేళీ జోడీ బంగారు బాడీ అంటూ సాగే గొప్ప కామెడీ పాట . తర్వాత అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే అంటూ సాగే డ్యూయెట్ . నీరుగారి పారిపోకు , జిగి జిగి జిగిజ జాగేల వనజ అంటూ సాగే పాటలు .
ఇళయరాజా , వంశీ కాంబినేషన్లో పాటలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు . ఫక్తు అలాగే ఉంటాయి పాటలు ఈ సినిమాలో . సిరివెన్నెల వారు , వెన్నెలకంటి వారు , జొన్నవిత్తుల వారు పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , చిత్ర బ్రహ్మాండంగా , శ్రావ్యంగా పాడారు . హిట్ సాంగ్సుని చేసారు . ఈ సినిమాకు డైలాగులను తనికెళ్ళ భరణి వ్రాసారు .
ప్రాక్టీసు లేని ప్లీడర్ని చెట్టు కింద ప్లీడర్ అంటారు . దానిని పికప్ చేసాడు వంశీ . కరెక్టుగా క్లిక్ అయింది . అలాగే చల్తీ కా నామ్ గాడీ . ఈ టైటిలుతో 1950s లో ఒక హిందీ సినిమా ఉంది . డొక్కు వాహనాలను చల్తీ కా నామ్ గాడీ అని అంటూ ఉంటాం . దీనినీ వాడుకున్నారు వంశీ .
సాధారణంగా గోదావరి ప్రాంతంలో సినిమాలను తీసే వంశీ ఈ సినిమాను తిరుపతిలో షూటింగ్ చేసారు . క్లైమాక్సులో కళ్యాణి డాం చూపించాడు . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసినా మళ్ళా చూడవచ్చు . బోరించదు . చూడనివారు తప్పక చూడండి . కేవలం హాస్యమే కాదు ; సస్పెన్స్ , క్రైం కూడా ఉండి అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది .
నేను పరిచయం చేస్తున్న 1210 వ సినిమా .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article