.
కేరళలోని కొండల మధ్య ఉన్న Wayanadలో ఒకప్పుడు జీవితం ప్రశాంతంగా సాగేది… కానీ 2024 జూలైలో ముండక్కై– చూరల్మల ప్రాంతాల్లో భారీ లాండ్స్లైడ్ జరిగింది… కొండచరియలు విరిగిపడి గ్రామాలనే మింగేశాయి… వందల కుటుంబాలు ఒక్కరాత్రిలో ఇల్లు, జీవితం అన్నీ కోల్పోయాయి…
ఆ విషాదం తర్వాత కేరళ ప్రభుత్వం బాధితుల కోసం ఒక పెద్ద పునరావాస ప్రాజెక్ట్ మొదలుపెట్టింది… కల్పెట్ట దగ్గర ఎల్స్టోన్ ఎస్టేట్ అనే ప్రాంతంలో ఒక కొత్త టౌన్షిప్ నిర్మిస్తోంది… అక్కడ మొత్తం 410 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది, సుమారు 400 కుపైగా కుటుంబాలకు అక్కడ కొత్త జీవితం మొదలయ్యేలా చేయాలని లక్ష్యం…
Ads
ఇటీవల ఆ కొత్త కాలనీని చూడటానికి మలయాళ సినీ దిగ్గజం Mammootty అక్కడికి వెళ్లాడు… బాధితులతో మాట్లాడాడు… కొత్తగా కట్టిన ఇళ్లలోకి వెళ్లి చూశాడు… ఆ ప్రాజెక్ట్ను చూసి ఆయన కూడా ప్రశంసించాడు… నిజానికి ఈ టౌన్ షిప్ ఏమిటంటే..?
ప్రభుత్వం ఆ భూమిని కొన్నది, ప్రజలు విరాళాలు ఇచ్చారు, పలు కంపెనీలు సీఎస్ఆర్ డబ్బు ఇచ్చింది… ఓ మిక్స్డ్ ప్రాజెక్టు అది… రాజకీయాలకు అతీతం… సమాజం ఆ బాధితులకు అండగా నిలబడిన ఓ మంచి ప్రాజెక్టు… మమ్ముట్టి కూడా తన పర్యటనను పక్కా పర్సనల్గా సాగించాలని అనుకున్నాడు… కానీ అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది…
అక్కడే ఉన్న సీపీఎం (CPM) పార్టీ వయనాడ్ జిల్లా కార్యదర్శి K. రఫీక్ కూడా మమ్ముట్టితో పాటు నడుస్తున్నాడు… మమ్ముట్టి ఎటు తిరిగితే అటు తను కూడా వెంట ఉన్నాడు… జనాలు, మీడియా, కెమెరాలు… అందరూ మమ్ముట్టిని చుట్టుముట్టి ఉన్న పరిస్థితి…
ఇదంతా చూసి… సీపీఎం పార్టీ తనను రప్పించి చూపిస్తోందని జనంలో వేరే సంకేతాలు వెళ్తాయని అనుకున్నట్టున్నాడు మమ్ముట్టి… అందుకని రఫీక్ వైపు తిరిగి “మీరు ఎప్పుడూ నా పక్కనే నిలబడుతున్నారు. అలా ఉంటే నేను మీ కోసం వచ్చినట్టు ప్రజలు అనుకుంటారు… కాస్త దూరంగా ఉండండి…” అన్నాడు చిన్నగా…
అది అక్కడున్నవారికి పెద్ద విషయం అనిపించలేదు… కానీ అక్కడే ఉన్న ఎవరో ఒకరు మొబైల్తో ఆ క్షణాన్ని వీడియోగా రికార్డ్ చేశారు… ఆ వీడియో సోషల్ మీడియాలోకి వెళ్లిన తర్వాత కథ మారిపోయింది…
కొంతమంది — “మమ్ముట్టి సరైన మాటే అన్నాడు. ఇది ప్రజల డబ్బుతో కట్టిన కాలనీ, రాజకీయ ప్రచారం అవ్వకూడదు” అన్నారు. మరికొందరు — “ఒక పార్టీ నాయకుడిని అలా పబ్లిక్గా మాట్లాడటం సరైంది కాదు” అంటూ విమర్శించారు…
కొద్దిసేపట్లోనే మమ్ముట్టిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది… విషయం పెద్దదయ్యింది… సీపీఎం సైబర్ కార్యకర్తలు సీరియస్ కామెంట్స్ పెట్టసాగారు… ఈ వివాదం పెరగడంతో K. రఫీక్ స్వయంగా స్పందించాడు… మమ్ముట్టి తనకు ఫోన్ చేసి “అలా అవమానించే ఉద్దేశం లేదు” అని చెప్పాడని వెల్లడించాడు… ఇద్దరి మధ్య అసలు ఎలాంటి గొడవ లేదని కూడా చెప్పాడు…
ఇంతలో ఈ విషయం కేరళ ముఖ్యమంత్రి Pinarayi Vijayan దృష్టికి కూడా వెళ్లింది… ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన — మమ్ముట్టి మంచి ఉద్దేశంతోనే బాధితులను కలవడానికి వెళ్లాడని, సోషల్ మీడియాలో అతనిపై జరిగిన దాడులు సరైంది కాదని అన్నారు… ఇది పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతూ ఉండటంతో ఇక “అలా ఆయనకు అసౌకర్యం కలిగితే ముఖ్యమంత్రిగా నేను చింతిస్తున్నాను” అని కూడా చెప్పాడు…
ఇలా చూస్తే… వయనాడ్లో బాధితుల కోసం కట్టిన ఇళ్ల మధ్య ఒక చిన్న మాట, ఒక మొబైల్ వీడియో, సోషల్ మీడియా వాదనలు… చివరకు ముఖ్యమంత్రి స్పందించేంత పెద్ద కథగా మారిపోయింది… ఈ కాలంలో మాటలు కాదు… వాటిని రికార్డ్ చేసే కెమెరానే కథను మార్చేస్తుంది అనిపించే సంఘటన ఇది… అసలే ఎన్నికల కాలం మరి..!!
Share this Article