.
Subramanyam Dogiparthi
……. డబ్బెవరికి చేదు పిచ్చోడా ! డబ్బెవరికి చేదు మంచోడా ! పూర్తి హాస్య భరిత ఫేమిలీ ఎంటర్టయినర్ . కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రేలంగి నరసింహారావు ఈ డబ్బెవరికి చేదు సినిమాకు స్క్రీన్ ప్లే , దర్శకత్వం వహించారు . ఎక్కడా బోర్ కొట్టకుండా కావలసినంత హాస్యంతో , రొమాన్సుతో లాగించేసారు .
మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు కధను నేసారు . ఇదే టైటిలుతో ఆయన ఓ నవలను కూడా తర్వాత కాలంలో ప్రచురించారు . దాని కధా ఈ సినిమా కధా ఒకటేనా కాదా అనేది నాకు తెలియదు . బహుశా ఒకటి కాదనుకుంటా . నవల చదివిన వారు క్లారిఫై చేయవచ్చు . ఈ సినిమా విజయానికి మరో కారణం డైలాగ్స్ . మా గుంటూరు Divakara Babu Madabhushi గారు వ్రాసారు . చాలా చాలా బాగుంటాయి .
Ads
ముఖ్యంగా పొడుపు కధలు , ప్రశ్నలు , సుత్తి వీరభద్రరావు బావమరిది వేలుని క్షణానికో పేరుతో పిలవటం చాలా సరదాగా ఉంటుంది . ఈ సినిమాకు అసలు హీరో వీరభద్రరావే . ధనవంతుడయిన ఆయనకు ముగ్గురు కూతుళ్లు , ఒక కొడుకు ఉంటారు .
శరత్ బాబు- మనోచిత్ర పెద్ద జంట , చంద్రమోహన్- సులక్ష్మణ రెండో జంట , రాజేంద్రప్రసాద్- సీత మూడో జంట . ప్రముఖ నటి సీతకు తెలుగులో ఇదే మొదటి సినిమా కూడా . ముగ్గురు కూతుళ్ళలో తండ్రి మీద ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవటానికి సుత్తి జంట ఓ ప్లాన్ వేస్తారు .
సంపూర్ణ ఉత్తర భారత దేశ తీర్ధయాత్రకు బయలుదేరిన సుత్తి జంట బస్సులో నుంచి మధ్యలో దిగేస్తారు . తర్వాత ఆ బస్ లోయలో పడి యాత్రికులు చనిపోతారు . సుత్తి జంట ఆ యాత్రలో చనిపోయారని అందరూ భావిస్తారు . వేలు బతికి బయటపడ్డానని తిరిగి వస్తాడు .
కూతుళ్ళలో ఎవరికయినా వైధవ్యం ప్రాప్తించినా , భార్యాభర్తలు విడిపోయినా వారి సంరక్షణ కొరకు యాభై లక్షల ఫిక్సెడ్ డిపాజిట్ దక్కుతుందని వీలునామా వ్రాస్తాడు . ఇంక ఆ యాభై లక్షల కొరకు మూడు జంటలు పడరాని పాట్లన్నీ పడతారు . ఎవరికి వారు ముందుముందుగా విడాకులు తీసుకోవటానికి ప్రయత్నాలు చేసుకుంటారు . ఈ ఉదంతం అంతా సరదాగా సాగుతుంది .
ఆస్తి కోసం భార్యాభర్తలు విడిపోవటానికి కూడా సిధ్ధపడటం , వాళ్ళకు బుధ్ధి వచ్చేలా చేయటం సినిమా క్లైమాక్స్ . రేలంగి నరసింహారావు , వంశీ , జంధ్యాల సినిమాలంటే గమ్మత్తు పాత్రలు చాలా ఉంటాయి . ఈ సినిమాలో కూడా ఉన్నాయి .
గొప్ప పాత్ర నూతన్ ప్రసాదుది . విడాకులశ్రీ బిరుదాంకిత లాయర్ . లాయర్లతో పెట్టుకోకూడదు అని నిరూపించే సరదా పాత్ర .తన నలుగురు కూతుళ్ళకు తన లిటిగేషన్ బుర్రతో పెళ్ళిళ్ళు చేసే తండ్రి పాత్ర . బ్రహ్మాండంగా పేలుతుందీ పాత్ర సినిమాలో . ఆయనకు భార్యగా డబ్బింగ్ జానకి బాగా నటించింది .
పత్రికాధిపతిగా దాసరి అతిధి పాత్రలో తళుక్కుమంటారు . శరత్ బాబు ప్రియురాలిగా దీప జయమాలిని , అనూరాధ లేని లోటుని హాట్ హాటుగా ఫిల్ చేస్తుంది . ఇతర ప్రధాన పాత్రల్లో ఈశ్వరరావు , కల్పనారాయ్ , రావి కొండలరావు , ప్రభాకరరెడ్డి , పొట్టి ప్రసాద్ , పద్మనాభం , ప్రభృతులు నటించారు . ఈ సినిమాలో చంద్రమోహన్ కొడుకుగా ఓ బుడ్డోడు బాగా నటించాడు .
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో ఆత్రేయ , సినారె , కొసరాజు , సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటల్ని వ్రాసారు . బాల సుబ్రమణ్యం , సుశీలమ్మ , వాణీ జయరాం , మాధవపెద్ది రమేష్ , శైలజలు పాడారు . బాగా పాపులర్ అయిన సాంగ్ డబ్బెవరికి చేదు పిచ్చోడా . చిత్రీకరణ కూడా వ్యంగంగా బాగుంటుంది .
నువ్వుంటే విహారం లేకుంటే వియోగం అంటూ సాగే హాట్ హాట్ పాట శరత్ బాబు , దీపల మీద హాట్ హాటుగా ఉంటుంది . ఎత్తుకు పై ఎత్తు వెయ్యి అంటూ సాగే సరదా పాట నాలుగు జంటల మీద హుషారుగా ఉంటుంది . తగునా ఔరా నీకిది తగునా అంటూ వీరభద్రరావు టీజింగ్ సాంగ్ , రాజేంద్రప్రసాద్ సీతల మీద డ్యూయెట్ పంచదార చిలకా బాగుంటాయి .
ఆస్తపాస్తుల కోసం తల్లిదండ్రుల్ని మోసగించే బిడ్డల సినిమాలు మనకు చాలా ఉన్నాయి . అవన్నీ సీరియస్సుగా , నాటకీయంగా ఉంటాయి . రేలంగి నరసింహారావు గురువు దాసరే అలాంటి సినిమాలు చాలా తీసారు .
అయితే ఈ సినిమా సరదా సరదాగా , హాస్యంగా , వ్యంగంగా సాగుతుంది . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు తప్పక చూడవచ్చు . టైముంటే చూసిన వాళ్ళు మరోసారి కూడా చూడవచ్చు . దీప అభిమానులు ఎన్ని సార్లయినా చూడొచ్చు . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు
Share this Article