.
పూర్వ జీవుల వారస అణువులతో కోవిడ్ మరణాలు…. అర్థం కాలేదా..? మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి… అఫ్కోర్స్, ఆల్రెడీ ఏవో వ్యాధులు, ఇంకేవో సమస్యలు ఉన్నవాళ్లు మరణిస్తున్నారు, పైగా ఇప్పుడు పరీక్షలు పెరుగుతున్నాయి కాబట్టి కేసుల సంఖ్య కనిపిస్తోంది…
కరోనా మనల్ని విడిచిపెట్టిందెప్పుడు..? దాంతో ఆల్రెడీ సహజీవనం చేస్తూనే ఉన్నాం కదా… ఏవేవో కొత్త వేరియంట్స్ అంటారు గానీ… అవన్నింటికీ మన దేహాలు ఇమ్యూన్ అయిపోయినవే… సాధారణ జలుబులా మారిన ఒమిక్రాన్కే రకరకాల వేరియంట్లు…
Ads
సరే, అసలు గతంలో కూడా కరోనా మరణాలను అధ్యయనం చేసినప్పుడు… కొన్ని విశేషాలు తెలియవచ్చాయి… అవేమిటంటే…
కోవిడ్ జబ్బు ప్రపంచం మొత్తాన్ని కుదిపేసినప్పటికీ, మరణాలు ఒక్కోచోట ఒక్కో రకంగా ఉన్నాయి. కోవిడ్ వ్యాధి తీవ్రతకు, మరణాలకు దారితీసిన అంశాల గురించి లోతైన పరిశోధనలు, విస్తృతమైన అధ్యయనాలు జరుగుతున్నాయి.
కరోనా పీరియడ్లోనే ‘నేచర్’ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం మానవుని ( హోమో సెపియన్స్) పరిణామ క్రమంలో ఆరు లక్షల సంవత్సరాల క్రితం ఉండిన నియాండర్తల్ మానవుని యొక్క వారసకణాలు (Genes) కలిగి ఉన్న కోవిడ్ బాధితులు తీవ్రంగా జబ్బు పాలైనట్లు గుర్తించారు.
మానవుని వారసఅణువులు డిఎన్ఎ గా ఉంటాయని తెలిసిందే. మానవుల్లో 23 జతల జీన్స్ ఉంటాయి. ఇవి ఎడినిన్, సైటోసీన్, గ్వానిన్, థైమిన్ అనే నాలుగు బేస్ అణువులు. రకరకాల కాంబినేషన్లలో ఇవి ఉంటాయి. మొత్తం 23 జతల క్రోమోజోములలో ఈ రకమైన బేస్ అణువులు 3 కోట్ల పది లక్షల వరకు ఉంటాయి.
ఒక నిర్దిష్టమైన వరుసక్రమాన్ని ( సీక్వెన్స్ లు ) అనుసరించి మానవుల్లో రక రకాల ప్రొటీన్లను తయారు చేసే విధంగా, కణాలను, జీవన క్రియలను నియంత్రించేందుకు గాను అవసరమైన సమాచారం వీటిలో నిక్షిప్తమై ఉంటుంది.
కొన్ని సీక్వెన్స్ లకు ఏ విధమైన పని లేకుండా అలాగే ఉంటాయి. అనేక రకాల వైరస్ల యొక్క వారసఅణువుల భాగాలు కూడా మనిషి జీన్స్ యందు ఉంటాయి. పరిణామక్రమంలో మన పూర్వ జీవులకు చెందిన కొన్ని వారసఅణువులు ఆ రకంగా ఉండిపోయాయి.
పరిణామక్రమంలో ‘హోమో హీడెల్ బెర్జెన్సిస్’ జీవుల కుదురు నుండి ‘నియాండర్తల్’, ‘సెపియన్స్’ మానవ జాతులు ఏర్పడ్డాయి. నియాండర్తల్ మానవులు బలిష్టంగా పొట్టిగా ఉండేవారు. వారి కనుచూపు సూక్ష్మంగా ఉండేది. కపాలంలో నుదురు చిన్నగా, కనుగుడ్ల భాగం గుండ్రంగా ఉండేవి.
కాగా హోమో సెపియన్స్ మానవులు నియాండర్తల్ మానవులతో పోల్చినప్పుడు పొడవుగాను, తక్కువ బలంగానూ ఉన్నారు. కపాలంలో నుదురు పెద్దగా, కనుగుడ్ల భాగం చదరంగా ఉంటుంది. మెదడులో దృష్టికి సంబంధించిన భాగం కొంత తగ్గి వివేకానికి సంబంధించిన భాగం బాగా అభివృద్ధి చెందింది.
ఆఫ్రికా నుండి ప్రారంభమైన నియాండర్తల్, సెపియన్స్ మానవుల ప్రయాణం ప్రపంచమంతా విస్తరించింది. ఆఫ్రికాలో సెపియన్స్ స్థిరపడి పోగా, నియాండర్తల్ లు ఇక వెనక్కి తిరిగి రాలేదు. రెండు జాతుల కలయికతో వారసకణాల మార్పిడి కొంతమేరకు జరిగింది.
ఆ రకంగా నియాండర్తల్ మానవుల యొక్క వారసకణాలు ప్రస్తుతం ఉన్న సేపియన్స్ మానవులలో, అనగా మనలో… ఆఫ్రికాలో ఉన్న వారిలో తప్ప చాలా చోట్ల ఉన్నాయి. ముఖ్యంగా యూరోప్ వారిలో 16 శాతం మందిలోనూ, అమెరికా జనాభాలోని నూటికి తొమ్మిది మందిలో, భారత ఉపఖండంలోని పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ ప్రజల్లో 50 శాతం మందిలోనూ, ఇంకా ఆస్ట్రేలియాలో వున్న మానవుల్లోనూ వున్నాయి.
దాదాపు మూడు నుంచి ఐదు వేల సంవత్సరాలు నియాండర్తల్ మానవులు జీవించినట్టుగా భావిస్తున్నారు. విపరీత వాతావరణ పరిస్థితులు, మంచుయుగం కాలంలో 40 వేల నుండి 50 వేల ఏళ్ల క్రితం ఆ జాతి అంతరించి పోయింది.
నియాండర్తల్ మానవుల యొక్క వారసఅణువులు కొందరు మనిషుల మూడవ క్రోమోజోములో ఉన్నాయి. ఒక్కో మానవునిలోని మూడు కోట్ల పది లక్షల బేస్ అణువులలో… నియాండర్తల్ మానవునికి చెందిన 50,000 అణువులు మాత్రమే మూడవ క్రోమోజోములో ఉన్నట్లుగా గుర్తించారు.
దీనిని LZTFL1 జీన్ గా పిలుస్తారు. 3199 మంది కోవిడ్ బారిన పడి హాస్పిటల్ పాలైన వారి యొక్క, 8 లక్షల 97 వేల 488 మంది సాధారణ ప్రజల యొక్క వారసఅణువులను విశ్లేషించారు. కోవిడ్ జబ్బు బారిన పడిన వారిలో ఈ LZTFL1 వారసఅణువులు ఉన్నవారిలో జబ్బు ఉదృతంగా ఉండటమే కాక మరణాలు కూడా రెట్టింపు ఎక్కువగా ఉన్నాయి.
ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ అనగా దీర్ఘ వ్యాధులు డయాబెటీస్, కిడ్నీ, హెచ్ఐవి, కేన్సర్ వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ… నియాండర్తల్ మానవుల నుండి సంక్రమించిన LZTFL1 జీన్ మూలంగానే కోవిడ్ తో చనిపోయిన పరిస్థితి ఎక్కువగా ఉందని తేలింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కోవిడ్ మరణాలలో దాదాపు 10 లక్షల మరణాలకు ఈ జీన్ కారణం కావచ్చునని నిపుణులు భావిస్తున్నారు… ఏతావాతా మనకు అర్థమైంది ఏమిటి..? మన బాడీ కాన్స్టిట్యూషన్, మనకు వారసత్వంగా సంక్రమించిన జన్యునిర్మాణం కూడా మన ఆరోగ్య స్థితుల్ని, మరణాల్ని శాసిస్తున్నాయి అని…… డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి, సాంక్రమిక వ్యాధుల నిపుణులు, కాకినాడ .
Share this Article