.
స్టార్ లింక్ కు అనుమతులు రాక ముందే జియో, ఎయిర్ టెల్ ఒప్పందాలు… అప్పుడు అభ్యంతరాలు చెప్పిన సంస్థతోనే జట్టుకట్టిన సంస్థలు…
అసలు ఇండియాలో ఇప్పటి వరకు శాటిలైట్ ఆధారిత డేటా సేవలు అందించేందుకు విధివిధానాలే లేవు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) దీనికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు సిద్ధం చేయాల్సి ఉంది. కానీ ఈ లోగానే దేశంలోని దిగ్గజ టెలికం సంస్థలు అయిన రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్ అమెరికాకు చెందిన ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ తో ఒప్పందాలు చేసుకున్నాయి.
Ads
ఈ రెండు కంపెనీలు కూడా స్టార్ లింక్ సర్వీసులను ఇండియాలో అందించేందుకు రెడీ అయ్యాయి. తొలుత ఎయిర్ టెల్ ఒప్పందం విషయం వెలుగులోకి రాగా.. మరుసటి రోజే అంటే బుధవారం నాడు రిలయన్స్ జియో ఒప్పందం విషయం అధికారికంగా వెల్లడైంది.
ఇక్కడ మరో విచిత్రం ఏమిటీ అంటే ఇండియాలో స్టార్ లింక్ సర్వీసులకు ఇండియాలో అనుమతి ఇచ్చే విషయంలో ఇటు రిలయన్స్ జియోతో పాటు ఎయిర్ టెల్ కు తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. అందరికి సమాన అవకాశాలు ఉండాలి అని… స్టార్ లింక్ కు కూడా స్పెక్ట్రమ్ వేలం ద్వారానే కేటాయింపులు చేయాలి తప్ప..నేరుగా కేటాయించవద్దు అంటూ ఈ రెండు సంస్థలు వాదించాయి.
ఇండియన్ టెలికం మార్కెట్ లో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ కలిపి ఏకంగా 75 శాతం పైనే మార్కెట్ వాటా కలిగి ఉంటాయి. ఇప్పుడు వీటితో స్టార్ లింక్ కూడా కలిస్తే ఈ రెండు కంపెనీల గుత్తాధిపత్యం (మొనోపలీ) మరింత పెరిగే అవకాశం ఉంది అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే…. ఈ దెబ్బకు ప్రభుత్వ రంగంలోని బిఎస్ ఎన్ఎల్ తో పాటు వోడాఫోన్ కూడా రాబోయే రోజుల్లో మరింత సంక్షోభంలో కురుకుపొయ్యే అవకాశం ఉంది అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
స్టార్ లింక్ అనే కంపెనీ స్పేస్ ఎక్స్ కు చెందిన అనుబంధ సంస్థ. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ తో ఒప్పందాలు చేసుకుంటూ రిలయన్స్ జియోతో పాటు ఎయిర్ టెల్ కూడా ఇండియాలో స్టార్ లింక్ కు ఇండియాలో అనుమతులు వచ్చిన తర్వాత తమ సేవలు ప్రారంభం అవుతాయి అని అధికారికంగా ప్రకటించాయి.
కొత్తగా వెయ్యి అవుట్ లెట్స్ అంటే ఇండియాలోకి స్టార్ లింక్ ఎంట్రీ ఇస్తుంది అనే విషయాన్ని ప్రభుత్వం అనుమతులు ఇవ్వకముందే ఈ రెండు ప్రైవేట్ టెలికాం కంపెనీలు వెల్లడించినట్లు అయింది అనే చర్చ కూడా సాగుతోంది. ఒక విదేశీ కంపెనీని అత్యంత సున్నితమైన శాటిలైట్ ఆధారిత సేవల రంగంలోకి అనుమతించే ముందు ఒక కన్సల్టేషన్ పేపర్ విడుదల చేసి… దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది అని… కానీ అలాంటిది ఏమి లేకుండా రెండు దిగ్గజ ప్రైవేట్ కంపెనీలు ఇండియాలోకి స్టార్ లింక్ ఎంట్రీ ఇస్తుంది అనే విషయాన్ని తమ ఒప్పందాల ద్వారా చెప్పటం అంటే ఇంతకంటే దారుణం మరోకోటి ఉండదు అనే అభిప్రాయాన్ని అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఇండియాలోకి స్టార్ లింక్ వచ్చే ప్రయత్నాలు చేస్తుంది అనే వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఆ విదేశీ కంపెనీకి కావాల్సిన అనుమతులు వస్తాయి అనే ధీమాతో ముందే రెండు టాప్ టెలికం కంపెనీలు ఒప్పందాలు చేసుకోవటం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రభుత్వం ముందు నుంచి కూడా స్టార్ లింక్ భారత్ లోని చట్టాలకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అని …ఈ నిబంధనలు అన్నీ పాటించిన తర్వాతే అనుమతులు మంజూరు చేస్తాం అని చెపుతోంది.
భారత్ ప్రభుత్వం వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేసిన తర్వాత మాత్రమే స్టార్ లింక్ సర్వీసులకు అనుమతి మంజూరు అయ్యే అవకాశం ఉంది. ఇటీవల అమెరికాలో ప్రధాని మోడీ, స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ల భేటీ తర్వాతే ఇండియాలో టెస్లా షో రూమ్ ఓపెన్ చేసే కార్యక్రమంలో వేగం పెరగటం…ఇప్పుడు స్టార్ లింక్ తో అటు ఎయిర్ టెల్, ఇటు రిలయన్స్ జియో ఒప్పందాలు చేసుకోవటం మాత్రం చర్చనీయాంశంగా మారాయి.
అందుకే కార్పొరేట్ వర్గాల్లో మాత్రం మోడీ పై మస్క్ మాయాజాలం బాగానే పని చేసింది అనే చర్చ సాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టీంలో కీలకంగా ఉన్న ఎలాన్ మస్క్ ఇప్పుడు మరింత పవర్ ఫుల్ గా మారారు అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది… ( వాసిరెడ్డి శ్రీనివాస్ )
ట్రంప్ వ్యాపారి,… మస్క్ వ్యాపారి… వాళ్లకు వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం… మోడీ వెళ్లి ట్రంపుతో, మస్క్తో భేటీ అయినా… తెల్లారి నుంచే సుంకాలు మొదలయ్యాయి… మోడీ గీడీ దోస్తీ గోస్తీ జాన్తానై అంటున్నాడు ట్రంపు… భేటీ కాగానే మస్క్ టెస్లా కార్లకు గ్రీన్ సిగ్నల్… ఇప్పుడు ఈ జియో, ఎయిర్టెల్ ఒప్పందాలు… ఏం కత్తి మెడపై పెట్టి మోడీని ఒప్పించారు మహాశయా..!!
Share this Article