.
జర్నలిస్టుల బతుకులు దీపం కింద చీకటి అని అందరూ అంటుంటారు… నిజమే, చీకటే… బతుకుల్లో కాదు, అవగాహనల్లో, జ్ఞానంలో… పరిణతిలో… చివరకు తమకు వర్తించే అంశాల్లోనూ సోయి లేని చీకటి రాతియుగపు బతుకులు… అందుకే కదా, అది తెలిసే కదా… ది గ్రేట్ కేసీయార్ జర్నలిస్టుల ఇళ్లస్థలాల అంశంలో జాడించి తన్నాడు… ఐనా హైదరాబాద్ జర్నలిస్టులకు బుద్ది రాలేదు…
ఒరేయ్, నేను న్యాయం చేస్తానురా అని రేవంత్ రెడ్డి సానుకూలంగా, సిద్ధంగా ఉన్నా సరే… అసలు నువ్వెవడివి మాకు న్యాయం చేయడానికి..? మా సీటు కింద మేమే గోతులు తవ్వుకుంటాం అనడమే కాదు… జవహర్ హౌజింగ్ సొసైటీ ప్రాబ్లం క్లియరైతే మాకూ న్యాయం జరుగుతుంది అని ఆశపడుతున్న మరో వేలాది మంది ఆశల మీదా నీళ్లు జల్లుతున్నారు…. అద్భుత విజ్ఞత, విచక్షణ కలిగిన కొందరు…
Ads
ఎస్, ప్రపంచంలో జర్నలిస్టులను మించి అనైక్యత, అపరిపక్వత, అవగాహనరాహిత్యంలో … అండమాన్ సెంటినలీస్ జాతి కూడా దిగదుడుపే… అన్నట్టు… మోడీ భాయ్, ప్లీజ్, ఆ చమురు పాలిటిక్స్, ఆ దిక్కుమాలిన జియోపాలిటిక్స్ సంగతి తరువాత చూసుకో…, అమిత్ షా భాయ్, నీ హోం శాఖ వ్యవహరాలు తరువాత… ఇదుగో… మావాళ్లు వస్తారట… ప్లీజ్… వెంటనే అటెండ్ కావాలి… కాదంటే మేం కాటేస్తాం… జాగ్రత్త… మేమసలే అత్యద్భుత జ్ఞానసంపన్నులం తెలుసా..?
పాత్రికేయ మిత్రుడు, సీనియర్ జర్నలిస్ట్ జకీర్ ఏమంటాడంటే..? ఓసారి చదవండి… దీర్ఘంగా నిట్టూర్చి, నివాళి అర్పించండి జర్నలిస్టుల విజ్ఞతకు, విచక్షణకు…!! అన్నట్టు… ఏదో ఫామ్ హౌజులో ఓ సజీవ ఆత్మ పకపకా నవ్వుతోంది… కాస్త వినండి…
మిత్రులారా!
ఇప్పుడు కాకపోతే,మరెప్పుడూ కాదు !
———–
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ BOD సమావేశం ఏప్రిల్ 6న ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఇందుక్కారణం ఏకాభిప్రాయానికి రాకపోవడమే. 5 గురు సభ్యుల్లో ఇద్దరు తమ మొండి, వితండవాదాన్నే మరోసారి మొదలుపెట్టారు.
నిజాంపేట్, పేట్ బషీరాబాద్ స్థలాలపై మనకు హక్కు ఉన్నందున వదులుకోమని, ప్రభుత్వంతో పోరాడతామని ఆ ‘ఇద్దరు’ అంటున్నారు. త్వరలో సమాచార మంత్రి పొంగులేటితో మన హౌజింగ్ సమస్యపై కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో BOD సమావేశమైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరకు వెళ్ళేటప్పుడు BOD కాంక్రీటుగా ఒక నిర్ణయంతో, రెండు, మూడు ఆప్షన్స్ తో వెళ్లాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. ఆయన సూచనలతోనే BOD సమావేశం జరిగిందని అర్ధమవుతోంది.
JNJHS సభ్యులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు గాను రేవంత్ రెడ్డి COMMITED గా ఉన్నట్టు నేను నమ్ముతున్నా. మిగతా సభ్యులు నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. FUTURE CITY లో ఇళ్ల స్థలాలను కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. సీఎం లైనుకు భిన్నంగా మనమెలాంటి నిర్ణయం తీసుకున్నా ఇక ఈ జన్మకు మన ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కాదు.
తాము ప్రధాని మోడీ, అమిత్ షా దగ్గరకు వెళతామని ఇద్దరు BOD సభ్యులు, కొంతమంది సభ్యులతో అంటున్నట్టు తెలిసింది. ఒక రాష్ట్రంలో జర్నలిస్టుల హౌజింగ్ సమస్య పరిష్కారానికి అమిత్ షా ఎందుకు పూనుకుంటారో, అమిత్ షా సదరు రాష్ట్ర సీఎంను ఎలా భయపెడతారో మనకు అర్ధం కాదు. ఈ వ్యవహారం సమస్యను పక్కదారి పట్టించడానికే కాకుండా, రాజకీయ రంగు పులమడానికి తప్ప ఎందుకూ పనికి రాదు.
అసలు JNJHS న్యాయపోరాటానికి సంబంధించిన వివరాలు…
డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008లో జర్నలిస్టులు, IAS, MLA, MLC వంటి వర్గాలకు భూ కేటాయింపులు జరిగాయి… మన సొసైటీకి Nizampet, Pet Basheerabad లలో 70 ఎకరాలు ఇచ్చారు. వైఎస్సాఆర్ కేటాయింపులను వ్యతిరేకిస్తూ ఒకరిద్దరు కోర్టుకు వెళ్లారు. కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది.
JNJHS సభ్యులకు ఆ భూములు స్వాధీనపరచాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ 2022 లో తీర్పు ఇచ్చారు.
(సాధారణ ప్రజలకు కాకుండా VIP లకు తక్కువ రేటుకు భూమి ఇచ్చారు అని సవాలు చేస్తూ కేసు నడిచింది.)
జర్నలిస్టులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్జీలు తదితర వర్గాలకు 2008లో ఇచ్చిన GO లన్నీ చట్ట విరుద్ధమని 2024 లో సుప్రీంకోర్టు మరో తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని Article 14కు వ్యతిరేకం అని చెప్పింది. MPs, IAS, జర్నలిస్టులకు ఇచ్చిన భూ కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేసింది.
జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, అధికారులు ప్రత్యేక కేటగిరీ కిందకు రారు. బలహీనవర్గాలు కూడా కాదు. 2022 లో జస్టిస్ రమణ తీర్పు రాగానే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మెడలు మనం వంచగలిగి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. నిజాంపేట్,పేట్ బషీరాబాద్ స్థలాలపై లీగల్ గా మనకు ఎలాంటి హక్కు లేదు.
2008–2022 మధ్య మన సొసైటీకి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. 2022 లో ఇచ్చిన తీర్పు మనకు రిలీఫ్. (POCCESSION తీసుకోవాలి అని తీర్పు). 2024 లో JNJHS కు పూర్తి నిరాశ కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో రివ్యూ పిటిషన్ కూడా చివరకు కొట్టివేసింది.
ఇక ఇప్పుడు మన ఇళ్ల స్థలం మనకు రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినాలి. ఫ్యూచర్ సిటీలో భూమి తీసుకోవాలంటున్న సీఎం మాటను మనమంతా జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించవలసి ఉన్నది. ఈ ప్రక్రియ ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా అంటే ఈ ఏడాది దసరా కల్లా ఫ్యూచర్ సిటీలో భూమిపూజ జరగవచ్చు.
నిజాంపేట్, పెట్ బషీరాబాద్ స్థలాలలో ఒక్క అంగుళం కూడా మనకు హక్కు లేదని మిత్రులంతా అర్ధం చేసుకోవాలి. అసలు ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కాకుండా ‘డైరెక్టర్’ పదవులు పట్టుకొని వేలాడాలనే మనస్తత్వంతో ఉన్నవారిని JNJHS నుంచి బహిష్కరించడం మంచిది. 1100 మంది సభ్యుల జీవితాలతో చెలగాటమాడే హక్కు ఎవరికీ లేదు.
నిజాంపేట్,పేట్ బషీరాబాద్ మనవే, అక్కడి నుంచి కదలం, సుప్రీంకోర్టు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది, మన స్థలం మనం స్వాధీనం చేసుకుందాం, వంటావార్పు చేసుకుందాం, టెంపరరీ గుడిసెలు వేసుకుందాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడలు వంచుదాం, ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటాలు చేద్దాం….. అంటూ మూర్ఖంగా మాట్లాడేవారు JNJHS విద్రోహులు.
జనరల్ బాడీ సమావేశం ఎలా జరుగుతుందో చూస్తాం, ఒక్కొక్కరి అంతు చూస్తాం అని కొందరు ‘మూర్ఖులు’ అంటున్నట్టు తెలుస్తోంది. జనరల్ బాడీ సమావేశం జరగకపోతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి ఫ్యూచర్ సిటీలో మనం ఇంటి స్థలాలు ఎలా సాధించగలం! SK.ZAKEER, JNJHS, Hyderabad…
- (సొసైటీ కాస్త డబ్బును నివాళ్ల కోసం కేటాయిస్తే బెటర్… ఇప్పటికే ఓ 60 మంది దాకా మరణించారు… ఇదెలాగూ ఎటూ తేలదు… ది గ్రేట్ అడ్డదిడ్డం డైరెక్టర్లు, అడ్డుకోలేని అసమర్థ డైరెక్టర్ల పుణ్యమాని… నెలనెలా నివాళ్లకు, మృతుల ఇళ్లకు వెళ్లి రెండు బొకేలు అక్కడ పెట్టడానికి కాస్త డబ్బు కేటాయించి పెట్టండి… అంతకు మించి మీకు కూడా ఏమీ చేతకాదు…)
Share this Article