.
Subramanyam Dogiparthi ….. బాపు దర్శకత్వం వహించిన ఏక్షన్ సినిమాలలో ఒకటి 1985 ఏప్రిల్లో వచ్చిన ఈ జాకీ సినిమా … హీరో పైలాపచ్చీస్ కుర్రాడు . జల్సారాయుడు . కంట్రోల్ చేయటానికి మరదలితో పెళ్లి నిశ్చయిస్తాడు తండ్రి .
మరొకరిని ప్రేమించిన మరదలు హీరోని ఒకటి పక్కన సున్నా అని హేళన చేసి పెళ్ళి చేసుకోను అంటుంది . ఆ మాటతో హర్టయిన హీరో తండ్రి పేరు చెప్పకుండా తనను తానుగా ప్రేమించే అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోతాడు .
Ads
అలా వెళ్ళిపోయిన హీరో ఓ మిలిటరీ కమాండర్ ఇంట్లో పాలేరుగా సెటిల్ అవుతాడు . తన మంచితనంతో కుటుంబంలో ఒకడిగా అయిపోతాడు . కమాండర్ గారి కూతురు మనసు పారేసుకుంటుంది . ఆ ఊళ్ళో జమీందార్ గారి కూతురు పెద్ద పొగరుబోతు , డబ్బు కైపులో ఓలలాడుతూ ఉంటుంది .
పంచకళ్యాణి లాంటి ఆ పొగరుబోతుని లొంగదీసుకుని ప్రేమించబడతాడు . సినిమా అన్నాక విలన్స్ ఉండాలి కదా ! జమీందార్ గారి భాగస్తుడు పొగరుబోతు హీరోయిన్ని మానభంగం చేయపోవటం , హీరో వచ్చి రక్షించటం , వగైరాలతో సినిమా ముగుస్తుంది .
మధ్యలో హీరోయిన్ హీరోని సంశయించటం వంటి మసాలాలు ఉన్నాయి . క్లైమాక్సులో హీరోయిన్ విలన్ మరి ఏ స్త్రీని మానభంగం చేసే అవకాశం లేకుండా ‘అక్కడ’ షూట్ చేస్తుంది . బాపు గారికి ఈ ఐడియా ఎవరిచ్చారో ! వెరైటీగా ఉంది .
బాపు ప్రకృతి ప్రేమికుడు . ఆయన సినిమాలలో సెట్లన్నీ తోటలు , చెట్లు , చేమలు , జలపాతాలు , కాలువలే . ఈ సినిమా చాలా భాగం అలా ప్రకృతిలోనే తీయబడింది . ముఖ్యంగా పాటలు . వేటూరి వారు గొప్ప సాహిత్యాన్ని అందించారు .
సుహాసిని , శోభన్ బాబుల డ్యూయెట్ కరివరద మొరను వినలేవా శశివదన చెలిమి చేయలేవా అంటూ సాగుతుంది . ‘కరివరద’ భలే పదప్రయోగం . అంటే ఏనుగుని రక్షించిన విష్ణువు .
ఓ నారీ వయ్యారీ అహంకారీ అంటూ సుహాసినిని టీజ్ చేస్తూ శోభన్ బాబు పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . అలాగే శ్రావ్యంగా ఉండే మరో పాట అలా మండిపడకే జాబిలీ … యస్ జానకి అద్భుతంగా పాడింది … సుమలత ఊహల్లో సాగే పాట సుయ్యి సుయ్యి మువ్వల గోపాల జాజి పువ్వుల జంపాల చాలా అందంగా బాపు శైలిలో చిత్రీకరించబడింది .
బాపు తన సినిమాలలో ఎలాగోలా రాముడిని , కృష్ణుడిని , రామాయణ భారతాలను ఇరికించాల్సిందే . ఈ పాట రాధ , గోపాలుడు , గోపికల మీద ఉంటుంది అందంగా . నిదురలెమ్ము నిమ్మకాయ కళ్ళు విప్పు కంద పిలక , తధిగిణ తోం తోం తకధిమ తోం తోం పాటలు కూడా బాగుంటాయి .
బాలసుబ్రమణ్యం సంగీత దర్శకత్వం చాలా బాగుంటుంది . పాటల సంగీతమే కాదు ; బేక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది . బాలసుబ్రమణ్యం , జానకమ్మ , శైలజలు గాత్రాన్ని అందించారు .
బాపు అంటే రమణ , రమణ అంటే బాపు . మనందరికీ తెలిసిందే . ముళ్ళపూడి వారే ఈ సినిమాకు సంభాషణలను వ్రాసారు . బాగా ఉంటాయి . విరాటపర్వంలో పాండవుల్లాగా హీరో గారు తన ఇంట్లో తలదాచున్నాడని రావు గోపాలరావు చేత అనిపిస్తాడు . అలా భారతాన్ని బాపు రమణలు జొప్పించారు .
1+2 లుగా శోభన్ బాబు , సుహాసిని , సుమలత నటించారు . ముగ్గురూ అందంగా ఉంటారు . సుహాసిని పొగరుబోతు అమ్మాయిగా బాగానే నటించింది . శోభన్ బాబు చాలా హుషారుగా , చలాకీగా , ఏజ్ యూజువల్ అందంగా కనిపిస్తారు . ఆయన అభిమానులు ఆయన్ని ఎలా కావాలనుకుంటారో అలాగే కనిపిస్తాడు . బాపు శోభన్ బాబు అభిమానులను నిరుత్సాహపరచలేదు . క్లైమాక్స్ సీన్ తీసిన బంగళా బాగుంది రాజమహల్లా . ఎక్కడిదో ఆ మహల్ !?
ఇతర పాత్రల్లో గుమ్మడి , రావు గోపాలరావు , శ్యామలగౌరి , అత్తిలి లక్ష్మి , గిరిబాబు , భీమేశ్వరరావు , సుధాకర్ , నర్రా , ప్రభృతులు నటించారు . సుహాసిని చెలికత్తెగా నటించిన నటి పేరు నాకు తెలియదు . చాలా బాగా నటించింది .
వంద రోజుల క్లబ్బులో చేరిన ఈ సినిమా శోభన్ బాబు , బాపు అభిమానులకు చాలా చాలా నచ్చుతుంది . చూసి ఉండకపోతే చూడొచ్చు . చూడబులే . ముఖ్యంగా పాటలు . చాలా శ్రావ్యంగా ఉంటాయి . యూట్యూబులో ఉంది సినిమా . It’s a Bapu mark entertaining classic . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article