.
జర్నలిజం… నిజానికి చాలామందికి ఇది కేవలం ఉద్యోగం కాదు. ఒక ప్యాషన్. ఒక తపన. ఒక ఉత్సాహం. అన్నింటికీ మించి సొసైటీకి ఏదో మేలు చేయాలను తలంపు. నిజాన్ని తెలుసుకోవాలి, నిజాన్ని చెప్పాలి. సామాజికంగా మార్పు తేవాలి. ఎన్నో సంవత్సరాలుగా, ఎంతో మంది యువత ఈ రంగంలోకి అడుగుపెట్టింది ఆ ఆకాంక్షతోనే… కానీ ఇప్పుడు?
ఇప్పడది లేదు… ఆ ఉత్సాహం వెలిసిపోయింది… ఆ సంకల్పం లేదు… ఈ వృత్తి ఓ నిస్తేజమైన మార్గంలా కనిపిస్తోంది… అందుకే ఆ కళను జర్నలిజం కోల్పోయింది, ఆ ఆకర్షణనూ కోల్పోయింది… అసలు యువత దీన్ని ఓ కెరీర్లాగా భావించే స్థితి అస్సలు లేదు ఇప్పుడు…
Ads
మీడియా రంగంలో 30 ఏళ్లకు పైగా పనిచేసినా, నాకు ఎప్పటికీ నా ఇష్టం బోధన మీదే… ఢిల్లీ యూనివర్సిటీలో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బోధించిన రోజుల్లోనే కాదు… నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చినా నా ప్రయాణం బోధనే, విద్యార్థులతోనే మమేకం అవుతూ వచ్చాను గత 25 ఏళ్లుగా… దేశంలోని ఎన్నో విశ్వవిద్యాలయాల్లో జర్నలిజం విద్యార్థులను పరిశీలించాక చెబుతున్నాను ఈ మాట…
కానీ ఇప్పుడు కళ్లు చెదిరే ఒక విషాద కథనాన్ని చూస్తున్నాను. గత ఏడాది కేవలం ఓ ఇరవై మీడియా విద్యాసంస్థల్లో పాఠాలు చెప్పి ఉంటాను. దాదాపు ప్రతి గదీ ఖాళీ ఖాళీగానే కనిపించింది. తరగతి గదుల్లో విద్యార్థులు కూర్చున్న కుర్చీలకన్నా ఖాళీ కుర్చీలే అధికం… స్పష్టంగా ఇదొక సంకేతం… ఇది యాదృచ్ఛికం కాదు – జర్నలిజం రంగం యువత దృష్టిలో విలువ కోల్పోయిందన్న స్పష్టత…,
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం (IIJNM), బెంగుళూరులోని న్యూమీడియా COMMITS – రెండు ప్రతిష్టాత్మక జర్నలిజం బోధన సంస్థలు – విద్యార్థుల కొరత, ఆర్థిక సంక్షోభం వల్ల తలుపులు మూసుకోవడం నన్ను వ్యక్తిగతంగా కలిచివేసింది… ఎందుకంటే ఇవి నా పాత పాఠశాలలు కావచ్చు లేదా నా పాత కలల నిలయాలు కావచ్చు…
ఇది కేవలం విద్యాసంస్థల వైఫల్యం కాదు. ఇది జర్నలిజం రంగంలోని సంక్షోభం. మీడియా మీద ప్రజల నమ్మకం క్షీణించింది. టీవీ వార్తలు డ్రామా, సెన్సేషనల్ ప్రాధాన్యంగా మారాయి. పత్రికలు ఓ రఫ్ పేపర్లలాగా మిగిలిపోతున్నాయి. డిజిటల్ మీడియా వేగంగా ఎదుగుతోంది, కానీ అది కూడా నమ్మకాన్ని సంపాదించడంలో విఫలమవుతోంది…
అదే సమయంలో, జర్నలిజం బోధించే సంస్థలు కూడా అసలు సమస్యను పట్టించుకోవడంలేదు. “ఇండస్ట్రీ రెడీ స్కిల్స్” అన్న బాణీతో ప్రకటనలివ్వడం మినహా, నిజమైన మార్పు కనిపించడంలేదు. పాత పాత పాఠ్యాంశాలు, పరిశ్రమను వదిలి ఏళ్లు గడిచిన అధ్యాపకులు, డిజిటల్ మీడియా పట్ల అవగాహన రాహిత్యం — ఇవన్నీ కలిసి విద్యార్థులకు ఒక తప్పుడు దారిలో నడిపిస్తున్నాయి.
ఇప్పటికీ కొంతమంది పాత బడిన టెక్నాలజీలు, పద్ధతులు నేర్పిస్తున్నారు – InDesign… ఇది మీడియా సంస్థలు వాడటం మానేసిన ఎన్నేళ్లయినా అదే నేర్పిస్తున్నారు కొన్ని ప్రభుత్వ జర్నలిజం విభాగాల్లో… QuarkXPress వంటి వాస్తవానికి ఉపయుక్తమైన సాఫ్ట్వేర్లు ఇప్పుడు సిలబస్లోనే లేవు. సోషల్ మీడియా, డేటా జర్నలిజం, మల్టీ-ప్లాట్ఫామ్ కంటెంట్ — ఇవేవీ ఈ తరగతుల గదుల్లో అడుగుపెట్టలేకపోతున్నాయి…
మార్పు అవసరం చాలా స్పష్టంగా ఉంది. జర్నలిజం బోధన రంగం పునరావలోకనం చేసుకోవాలి. డిజిటల్ దిశగా అడుగులు వేయాలి. కొత్త టూల్స్, ప్రాసెస్లు, ప్లాట్ఫారమ్ స్పెసిఫిక్ కంటెంట్పై దృష్టి పెట్టాలి. పరిశ్రమలో పని చేస్తున్న నిపుణులను తరగతుల గదుల్లోకి తీసుకురావాలి…
లేకపోతే జర్నలిజం అనే గొప్ప వృత్తి – నిజానికి ఒక సామాజిక ధర్మం – ఆవిరైపోతుంది. ప్రశ్నించగల గొంతులు మూగవుతాయి. వాస్తవాల కోసం పోరాడే మనసులు వేరే దారులు వెతుకుతాయి. అదే జరగకూడదని, జరగనివ్వకూడదని నా మనసు నిండా ఉంది….
…… ఇది సంజయ్ కుమార్ ఆవేదన…. టైమ్స్లో ఈ వ్యాసం కనిపించింది… ఈయన ఒక అనుభవజ్ఞుడైన న్యూ మీడియా జర్నలిస్ట్, ఘోస్ట్ రైటర్, మీడియా ఎడ్యుకేటర్…. టైమ్స్ గ్రూప్, ఎన్డిటివి, హిందుస్తాన్ టైమ్స్, ఇండియా టుడే, మైక్రోసాఫ్ట్ న్యూస్, యుకె ఆధారిత అంతర్జాతీయ ఫైనాన్స్ మ్యాగజైన్లు… ఇలా చాలా మీడియా సంస్థల్లో పనిచేసిన, బోధించిన అనుభవం…
నిజానికి జర్నలిజం మసకబారడానికి చాలా కారణాలున్నాయి… అందులో ఇది ఓ చిన్న భాగం మాత్రమే…
Share this Article