.
Murali Buddha …. జర్నలిస్ట్ లు – వెర్రి పుష్పాలు
చాలా రోజుల తరువాత రమాదేవి గారి ఫోటో చూసి సంతోషం వేసింది … టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆమె ఓ వెలుగు వెలిగారు … ఆమెకు ల్యాండ్ కేటాయించారు అని కొందరు ఈర్ష్య పడుతున్నారు . అందులో నేను కూడా ఉన్నాను …
Ads
ఈర్ష్య మాట ఎలా ఉన్నా ప్రతిభ ఎవరిలో ఉన్నా గుర్తించాలి … నీకు సరైన లెక్కలు వస్తే ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ అనే తేడా లేదు, ఎక్క డైనా నీకు వచ్చిన అంకెలతో లెక్కలు చేయగలవు … అదే విధంగా ల్యాండ్ పొందే ప్రతిభ ఉంటే ఎక్కడైనా పొందగలవు …
ఈమెకు హైదరాబాద్ లోని అత్యంత విలువైన భూమిని బాబు గారు కేటాయించారు … 1999 లో తటస్తురాలిగా ఆమె టీడీపీలో చేరారు . ఎక్కడ ఏ కార్డు చెల్లుబాటు అవుతుందో తెలిసిన నాయకురాలు . సభ్యుల్లో ఏదో గొడవతో కేసులు, కోర్టులు వరకూ వెళ్లారు … బహుశా శివ పార్వతి కావచ్చు, ఆమె నాయకత్వంలో కొందరు మహిళలు భూకుంభకోణంపై బాగానే పోరాటం చేశారు …
ప్రతిభావంతులు ఎక్కడున్నా ప్రతిభ చూపగలరు … సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం tdlp లో టీడీపీ mla ల హడావుడి … Mla లకు ఇంటి స్థలం కోసం ఈ హడావుడి అని ఎర్రబెల్లి దయాకర్ రావు చెబితే – ఇలా వెళితే బాబు ల్యాండ్ ఇవ్వరు … Mla లు ఏ ఇన్ఫో టెక్ అనో ఏదో టెక్నాలెజీకి సంబంధించి ఇంగ్లీష్ పేరు పెట్టుకొని వెళ్ళండి, ఇచ్చేస్తాడు – ఎమ్మెల్యేల హౌసింగ్ సొసైటీ అంటే అస్సలు ఇవ్వరు అని చెప్పాను … వినలేదు… ఇప్పటికీ వారికి ల్యాండ్ రాలేదు . రేవంత్ రెడ్డికి సీఎం పదవి వచ్చింది కానీ ప్లాట్ మాత్రం రాలేదు …
రమాదేవి ప్రతిభా పాటవాల మీద ఈర్ష్య కలుగుతున్న విషయం నిజమే . ఆ తెలివి తేటలు జర్నలిస్ట్ లలో లేవు … 2004లో రెండు లక్షలు చెల్లించి రెండు దశాబ్దాల నుంచి ఎదురు చూస్తూ కలలు కంటూ రాలిపోవడం అంటే వెర్రి పుష్పాలు కాకుంటే మరేమిటి …
అత్యంత భయానక వృత్తులు అని అప్పుడప్పుడూ జాబితా విడుదల చేస్తారు . అందులో జర్నలిజం సంఖ్య ఎంతో తెలియదు కానీ వెర్రి పుష్పాల జాబితా విడుదల చేస్తే మొదటి స్థానాల్లో ఉంటారేమో . ఏదో పేరు పెట్టుకొని రెండు రాష్ట్రాల్లో వందల ఎకరాలు పొందడానికి ఏదీ కొందరికి అడ్డు రాదు … డబ్బులు చెల్లించి రెండు రాష్ట్రాల్లో ఎదురు చూస్తున్న అభాగ్య జర్నలిస్ట్ లకు మాత్రం దిక్కు లేదు …
2004 లో చెల్లించిన ఆ రెండు లక్షలతో భువనగిరిలో అప్పుడు మూడు నాలుగు ఎకరాల భూమి వచ్చేది .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మీ ల్యాండ్ మీకు ఇప్పిస్తానని బండి సంజయ్ స్పష్టమైన హామీ ఇచ్చారు దయామయులు … నన్నే మళ్ళీ గెలిపిస్తే కొత్తవారికి ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు అని రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ లకు ఫ్యూచర్ చూపించారు …
సరే, ఇంతకూ ఏమవుతుంది అంటావు… డబ్బులు కట్టి రెండు దశాబ్దాల నుంచి ఎదురు చూసే దయనీయ స్థితి ఒక్క జర్నలిస్ట్ లకు తప్ప మరే వృత్తిలోని వారికి ఉండదు … ఒక్క హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల జర్నలిస్ట్ లూ బాధితులే.. అనేక జిల్లాల్లో డబ్బులు కట్టి నష్టపోయి దీనంగా ఎదురు చూస్తున్నారు …
సరే రమాదేవి గారూ, మా జర్నలిస్ట్ ల దౌర్భాగ్య స్థితి ఎప్పుడూ ఉండేదే … మీరు ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలి అని, సాధిస్తారు అని పూర్తిగా విశ్వాసం ఉంది … ( 2004 నుంచి ఇప్పటి వరకు కేసులు వేసి ఇక్కడిదాకా తెచ్చింది సాటి జర్నలిస్ట్ లే కానీ రాజకీయ నాయకులు కాదు )…
Share this Article