.
కాళేశ్వరం అక్రమాలు, అవినీతి, వైఫల్యాల మీద తన ప్రభుత్వ విచారణను తనే ఓ లాజికల్ కంక్లూజన్కు తీసుకురాకుండా… హఠాత్తుగా రేవంత్ రెడ్డి సీబీఐకి అప్పగించి, తెలంగాణ ఎదుట అనేక ప్రశ్నలు మిగిలించాడు ఇప్పుడు…
1) ఘోష్ కమిటీ రిపోర్టును, అంటే కేసీయార్ అరాచకం, అక్రమం, అవినీతి, అడ్డగోలు నిర్ణయాలను సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు మొత్తం తెలియజెప్పేశాం.., ఇక చాలు, మిగతాది కేంద్రం చూసుకుంటుందిలే అనే భావనా..?
Ads
2) బీఆర్ఎస్ మీద నైతిక, రాజకీయ, వ్యక్తిగత కారణాల రీత్యా.., ప్రభుత్వ విధి రీత్యా కూడా కాళేశ్వరం విచారణను, దర్యాప్తును తన చేతుల్లోనే ఉంచుకుంటాడనీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేస్తాడనీ అనుకున్నారు అందరూ… కానీ సిట్ బదులు సీబీఐ ఎందుకొచ్చింది..?
- 3) ఘోష్ విచారణ కమిషన్ కూడా తన నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది… మరింత సమగ్ర దర్యాప్తు అవసరాన్ని ఎన్డీఎస్ఏ, ఘోష్ కమిషన్ చెబుతున్నాయి… రాష్ట్ర ఉన్నతాధికారులైతే నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా దర్యాప్తు చేయలేరని ఈ ప్రభుత్వం భావిస్తోందా..? అందుకే సీబీఐ దర్యాప్తు అంటున్నారా..?
4) ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నాయనేది నిజమే… WAPCOS వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, PFC, REC వంటి ఆర్థిక సంస్థలు కూడా ఉన్నందున, ఈ కేసును కేంద్రం చేతుల్లోకి, అంటే CBIకి అప్పగించారా..?
- 5) నాదంతా కర్మ సిద్ధాంతం, కేసీయార్ తనను తానే శిక్షించుకున్నాడు వంటి మాటలు చెబుతున్నాడు ఈమధ్య రేవంత్ రెడ్డి… కొంపదీసి కేసీయార్ను, కేటీయార్ను, హరీష్రావును క్షమించేశాడా..? మీరూ క్షమించాలని తెలంగాణ జనానికి చెబుతున్నాడా..? వాళ్ల కర్మకు వాళ్లే పోతారనేనా ఫార్ములా కేసులో కేటీయార్ను అరెస్టు చేయకుండా ఆగిపోయింది..? కాళేశ్వరం బాధ్యులు ఇక తేలికగా ఊపిరి తీసుకోవచ్చా..?
6) బీఆర్ఎస్ పదే పదే చెబుతున్నట్టు ఘోష్ రిపోర్టు తప్పులకుప్ప, దాని ఆధారంగా దర్యాప్తు చేయించలేమని తెలంగాణ జనంలోకి రాంగ్ సంకేతాలు వెళ్లడం కాదా ఇది..? అదేదో సిట్ వేస్తే అది ఇంకెన్ని నిజాలు బయటకు తీసేదో కదా..!
(మరీ గూగుల్ మ్యాపులు చూస్తూ ప్రాజెక్టు లొకేషన్ ఫిక్స్ చేయడం బహుశా ప్రపంచంలో దిగ్రేట్ కేసీయార్ తప్ప ఇంకెవరూ చేసి ఉండరు కదా… ఇలాంటివి ఇంకెన్ని బయటపడతాయో గిన్నీస్ బుక్ రికార్డులు..)
7) రేప్పొద్దున విద్యుత్తు కమిషన్, ఫోన్ ట్యాపింగ్, గొర్ల స్కాం వంటి ఇతరత్రా ఏ రిపోర్టులు బయటికొచ్చినా ఇక మాకేం కాదులే అనే భరోసా బీఆర్ఎస్ పెద్ద తలకాయల్లో వచ్చేసినట్టేనా..?
- 8) కేటీయార్నే అరెస్టు చేయలేకపోయాం, రేప్పొద్దున కేసీయార్ను అరెస్టు చేయాల్సి వస్తే, డీల్ చేయలేమనే సందేహమా..? రాజకీయంగా అది నష్టం చేస్తుందనే అంచనా అనుకోవాలాా..? అదేదో కేంద్రం చూసుకుంటుందిలే, నా చేతులకెందుకు అంటించుకోవాలి అనే భావనా..?
9) ఆల్రెడీ ఎంతోకాలంగా బీజేపీ డిమాండ్ చేస్తోంది సీబీఐకి అప్పగించాలని… ఏమో, కేసీయార్ మెడ మీద కత్తి వేలాడదీసే అవకాశం రావాలని… మరీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒత్తిడి మరింత తీవ్రంగా ఉంటుందో లేదో తెలియదు కానీ… మోడీషా చేతుల్లోకి కాళేశ్వరం కథ చేరిపోవడం కాంగ్రెస్ పార్టీకి ఏరకంగా ఫాయిదా..? రేపు బీఆర్ఎస్, బీజేపీ ఏకమైతే తెలంగాణలో ఇక స్ట్రెయిట్ ఫైట్ ఉంటుందనే ఎత్తుగడా..? మోడీషా పొలిటికల్ యాంగిల్ కూడా అదేనా..? ఆ కత్తి మాకు ఇచ్చెయ్ అనడిగాడా మోడీ..?
- 10) బీజేపీ ఆసక్తిగా ఉంది కాబట్టి సీబీఐ టేకప్ చేస్తుంది… కానీ మోడీషాకు దీన్ని లాజికల్ కంక్లూజన్ వైపు తీసుకెళ్లాలని అనుకుంటే దర్యాప్తు వేగంగా ఉంటుంది… లేదా దీన్ని పొలిటికల్గా వాడుకుందామని అనుకుంటే మాత్రం… ఇక కాళేశ్వరం కథ కంచికే…! సీబీఐ మీద అంతగా కేసుల ఒత్తిడి కూడా ఉంది… ఇదీ ఓరకంగా జగన్ అక్రమాస్తుల కేసులాగే మారిపోనుందా..?
11) సో, ప్రస్తుతానికి మోడీషా గనుక కేసును నాన్చీ నాన్చీ… రేప్పొద్దున అవసరాన్ని బట్టి… కథ న-డి-పిం-చా-లని అనుకుంటేనే కేసులో కదలిక…
అవునూ, ఇంతకీ ఆ పిల్లర్లను ఏం చేద్దాం..? పిల్లర్ల రిపేరా..? మొత్తం బరాజు రిపేరా..? అసలు మేడిగడ్డ బరాజే వేస్ట్ అని తేల్చేశాక, మళ్లీ కడతారా..? అన్నారం, సుందిళ్లతో కూడా ప్రయోజనం లేనప్పుడు... రేప్పొద్దున వాటి పరిస్థితి ఏమిటి..? నిల్వ చేస్తే అవీ డేంజరే... కింకర్తవ్యం..?
- సో, రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం ఎదుట కొన్ని ఇప్పుడప్పుడే తేలని కొన్ని ప్రశ్నల్ని ఇలా వదిలేశాడు… ఇక కథ కొనసాగింపు వేదిక ఢిల్లీ..!!
సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా అంతకుముందు కేసీయార్ ఇచ్చుకున్న జీవోను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎత్తేయాలి… కొత్త జీవో ఇవ్వాలి… కోర్టు ఆదేశించిన లాయర్ వామనరావు దంపతుల హత్య కేసుతోపాటు ఈ కాళేశ్వరం అవినీతి అక్రమాల కేసును అప్పగించాల్సి ఉంది… రెండూ మంథని నియోజకవర్గమే…!!
Share this Article