.
Subramanyam Dogiparthi
…. వ్యాస భాగవతంలో చెల్లెలు దేవకీ దేవి అన్న కంసుడిని సవాల్ చేయలేదు , బతిమిలాడుకుంది . కానీ , ఈ కలియుగ భాగవతంలో చెల్లెలు గాయత్రీ దేవి కంసన్నని సవాల్ చేస్తుంది . కృష్ణుడిని కని కంస వధ చేయిస్తానని శపధం చేస్తుంది .
ఆ భాగవతంలో పుట్టిన వాళ్ళని కంస మామ చంపేస్తుంటాడు . ఈ భాగవతంలో పుట్టిన బిడ్డను చంపేయమని తాగుబోతు గొల్లపూడికి అప్పచెపుతాడు .
Ads
నందుడి లాంటి నూతన్ ప్రసాద్ కృష్ణాష్టమి నాడు దొరికిన బిడ్డను పిల్లల కోసం పరితపిస్తున్న భార్య రమాప్రభకు అందిస్తాడు . ఆమె యశోద అయి మోహన కృష్ణుడు అని పేరు పెట్టి ద్వాపర యుగం నాటి యశోద లాగానే ఈ మోహన కృష్ణుడు బాలకృష్ణని ఈ కలియుగం యశోద అయి పెంచుకుంటుంది .
ఈ సినిమాలో నటనలో మొదటి తాంబూలం రమాప్రభదే . అచ్చం యశోద లాగానే ఆమె పాత్ర తీర్చిదిద్దబడింది . ఆమే అలాగే యశోదమ్మలాగానే గొప్పగా నటించింది . ఆమె తర్వాతనే చెప్పుకోవాల్సి ఉంటుంది శారద గురించి కూడా .
లేడీ రివెంజ్ పాత్రలకు శారదను పరుచూరి బ్రదర్స్ కేరాఫ్ అడ్రసుగా మార్చారు 1980s లో . ఆమె కూడా అలాగే విజృంభించారు . ఈ సినిమాలో రివెంజుతో పాటు కంసన్నని అల్లరి కూడా పెడుతుంటుంది . బాగా నటించింది .
ఈ సినిమాకు కధను యం డి సుందర్ నేయగా స్క్రీన్ ప్లేని , దర్శకత్వాన్ని కె మురళీమోహన్ రావు నిర్వహించారు . అయితే పరుచూరి బ్రదర్స్ డైలాగులకు పదును కాస్త తగ్గిందీ సినిమాలో . హీరో హీరోయిన్లుగా బాలకృష్ణ , రాధలు చాలా హుషారుగా , చలాకీగా నటించారు . డబ్బు చేసిన తల బిరుసు యువతిగా రాధ కాస్త క్రూరంగా కూడా నటించింది . ఆ క్రౌర్యంతోనే నౌకర్ని జానపద సినిమాల్లోలాగా , ఫ్యూడలిస్ట్ గ్రామాల్లోలాగా కొరడా దెబ్బలు కొట్టిస్తుంటుంది .
ప్రతిఘటిస్తానికి హీరో రెడీగా ఉంటాడు . రెచ్చిపోయిన హీరోయిన్ హీరోని మోసం చేసి అల్లరి పెడుతుంది కూడా . తిక్క రేగిన బాలకృష్ణ జమీందారులాగా మారువేషంలో వచ్చి రాధ మెడలో మంగళసూత్రం కట్టి టిట్ ఫర్ టాట్ చేసేస్తాడు . తండ్రి యన్టీఆర్ లాగానే బాలకృష్ణ మారువేషం విలన్లు అసలు కనుక్కోలేరు . పైగా కూతురినిచ్చి పెళ్లి కూడా చేసేస్తారు . (సినిమాల్లో మారువేషాల్ని ప్రేక్షకులు ఇట్టే కనిపెట్టగలరు గానీ సినిమాలో పాత్రలు అస్సలు కనిపెట్టలేవు ఫాఫం…)
అటు తిరిగి ఇటు తిరిగి క్లైమాక్సులో కంస వధతో శుభం కార్డు పడుతుంది . మోహన కృష్ణుడే శారద కొడుకు అని , ఆమే రాధకు మేనత్త అని తెలుస్తుంది . కంస మరణానికి చెల్లెలు దేవకీదేవి కూడా బాధపడుతుంది . సినిమా కంచికి మనమింటికి .
ఈ సినిమాకు మేకప్ బృందం ఎవరో కానీ రాధను ఇంతగా అందం లేకుండా ఎవరూ చూపలేదు , చూపలేరు . జిడ్డు/గ్రీజ్ మేకప్ . అదేమయినా ఇన్వెన్షనా అప్పట్లో నాకు తెలియదు . శారద మేకప్ కూడా అలాగే ఉంటుంది .
సినిమాలో బాలకృష్ణ అభిమానులను గొప్పగా అలరించారు . డ్యూయెట్లలో కూడా రాధతో సమానంగా డాన్సించాడు . కంస మామగా రావు గోపాలరావు , తాగుబోతుగా గొల్లపూడి మారుతీరావు , తోటి విలనుగా అల్లు రామలింగయ్య , తన్నులు తినే బావమరిదిగా సుధాకర్ బాగా నటించారు . అన్ని సినిమాల్లో విలనుగా నటించినా ప్రేక్షకులను ఎక్కడా బోరించకుండా సినిమా సినిమాకు తేడా చూపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు రావు గోపాలరావు .
పరుచూరి బ్రదర్స్ ఎలాగోలా సమకాలీన రాజకీయాల మీద చెణుకులు వేస్తూనే ఉండేవారు . అలాంటి డైలాగ్ ఒకటి ఈ సినిమాలో . ఆంధ్ర దేశంలో వెన్నుపోటు సంగతి నీకు తెలిసి ఉండదు అని . ఈ సినిమాలో రిపీటెడ్ గా వచ్చే మాట . ప్రాంతీయ వార్తల్లో చెప్పిస్తా , వస్తుంది అని . సందర్భోచితంగా ఉపయోగించబడింది .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటలు బాగుంటాయి . కొన్ని హిట్టయ్యాయి కూడా . ఆ డ్యూయెట్లు ఎలా ఉన్నా నాకు బాగా నచ్చిన పాట రమాప్రభ పాడే కృష్ణాష్టమి నాటి పాట . జాబిల్లి ఉట్టికొట్టే జాణా గోపాలుడే . చక్రవర్తి చాలా శ్రావ్యమైన ట్యూన్ కట్టారు . సంగీత ప్రియులు మిస్ కాకండి . పాట చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది . Unmissable one .
ఇతర డ్యూయెట్లు , ఊపు పాటలు . కొంగూ కొంగూ ముడిపడ్డాక గొళ్ళెం తలుపుకు పెట్టేసాక బాలకృష్ణ అభిమానులకు బాగా నచ్చింది . హీరో హీరోయిన్లు బ్రేక్ డాన్స్ వేస్తారు . బంగారు తోటలో చెంగావి చీరెలో , అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా , చుక్క చుక్కల లేడి , రంభ రంభ అంటూ సాగుతాయి మిగిలిన పాటలు . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మలు పాటల్ని శ్రావ్యంగా పాడారు .
ఇతర ప్రధాన పాత్రల్లో రంగనాధ్ , అనిత , మాధురి , కుయిలీ , అనూరాధ , జగ్గారావు , సాక్షి రంగారావు , ప్రభృతులు నటించారు . It’s a romantic , commercial , mass masala , revenge-centred కలియుగ కృష్ణుడు అనబడే కలియుగ భాగవతం సినిమా … (ఇంత బాలయ్య మార్క్ మసాలాలు గుప్పించినా సరే ప్రేక్షకులు పెద్దగా ఆదరించినట్టు లేదు ఈ సినిమాను)…
Share this Article