.
Subramanyam Dogiparthi …. ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిన సినిమా కళ్లు . 1975 లో సాహిత్య ఎకాడమీ అవార్డు పొందిన గొల్లపూడి మారుతీరావు నాటకం కళ్ళు . 1970 లో విజయవాడలో విద్యార్ధిగా ఉన్న టైంలో ఆ నాటకాన్ని చూసిన యం వి రఘు మనసు పారేసుకున్నాడు .
సినిమా రంగంలోకి వచ్చాక 17 ఏళ్ళకు ఆ నాటకాన్ని సినిమా తీయాలనే కోరిక కలిగింది . అప్పటికే ఆ నాటకం రైట్స్ కొనేసిన డి రామానాయుడు దగ్గర నుండి రైట్స్ కొని అదే టైటిలుతో తెర మీదకు ఎక్కించారు .
అప్పటికే గొప్ప ఫొటోగ్రాఫరుగా పేరు తెచ్చుకున్న యం వి రఘు తన మిత్రులతో కలిసి ఏడు లక్షల ఖర్చుతో ఈ ఆర్ట్ ఫిలిం తీసారు .
Ads
ఫొటోగ్రఫీతో పాటు స్క్రీన్ ప్లే , దర్శకత్వ బాధ్యతలను కూడా ఎత్తుకున్నారు . ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇదే . వ్యాపారపరంగా ఎంత లాభం వచ్చిందో ఏమో కానీ కీర్తి , పురస్కారాలు మాత్రం వర్షించాయి .
ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డ్ వచ్చింది . నాలుగు నంది అవార్డులు వచ్చాయి . మూడవ ఉత్తమ చిత్రం అవార్డ్ , నూతన ఉత్తమ దర్శక అవార్డ్ , గొల్లపూడికి ఉత్తమ కధా రచయిత అవార్డ్ , చిదంబరానికి ప్రత్యేక జ్యూరీ అవార్డ్ . మరెన్నో ప్రైవేట్ సంస్థల అవార్డులే కాక సినీ ఫెస్టివల్సులో ప్రదర్శించబడింది .
గొప్ప కధాంశం . ప్రపంచంలో కళ్ళున్న చాలామంది తమ చుట్టూ జరుగుతున్న అన్యాయాలను , అక్రమాలను చూడరు , చూడటానికి విముఖత చూపిస్తారు . ఉన్న కళ్ళు మూసుకుని తామూ వాటిల్లో వాటాదారులు అవుతుంటారు . ఇలాంటి ప్రపంచంలో అయిదారు కళ్ళు లేనివారు కలిసి జీవిస్తూ ఉంటారు . వారిలో ఒక యువతి కూడా ఉంటుంది .
సామాజిక స్పృహ ఉన్న ఒక జర్నలిస్టు వాళ్ళకు కళ్ళు ఆపరేషన్ చేయించి చూపు తెప్పించాలని ప్రయత్నం చేస్తుంది . అందుకు కావలసిన అయిదు వేల రూపాయలను అందరూ చచ్చీ చెడి పోగుచేసి వారిలో ఒకరయిన శివాజీ రాజాకు చూపు తెప్పిస్తారు . చూపు వచ్చాక లోకాన్ని చూసిన అతను చెడు మార్గాలలోకి వెళతాడు .
పట్టణంలో ఉన్న ఒక మాఫియా లీడరు ముఠాలో చేరి అసాంఘిక పనులను చేస్తూ ఉంటాడు . తాగిన మైకంలో తమ అయిదుగురిలో ఒకరయిన స్త్రీని మానభంగం చేయటానికి ప్రయత్నిస్తాడు . నలుగురూ కలిసి వాడి కళ్ళు పీకేయటంతో సినిమా ముగుస్తుంది .
ఇక్కడ నేను చాలా సింపుల్ గా చెప్పాను కానీ దర్శకుడు యం వి రఘు చాలా తెర మీద చాలా గొప్పగా చూపారు . కాదు . అద్భుతంగా చూపారు . షూటింగ్ అంతా విశాఖపట్టణమే . కేబరే డాన్సులు నడిచే బార్లను చూపారు . Strip tease కూడా ఉంది .
1987- 88 రోజుల్లో విశాఖపట్టణంలో కేబరే బార్లు ఉన్నట్లు నాకు నిన్న ఈ సినిమా చూసేదాకా తెలియదు . ఆ కాలంలో మా గుంటూరులో కూడా అలాంటివి రెండు బార్లు ఉండేవి . జిన్నా టవర్లో కేసినో బార్ , బ్రాడీపేట మూడో లైన్లో పారడైజ్ బార్ . విజయవాడలో కూడా ఉన్నాయి . వాటి పేర్లు గుర్తు లేవు .
బాలసుబ్రమణ్యం సంగీత దర్శకత్వం వహిస్తే పాటలనన్నీ సిరివెన్నెల వారే వ్రాసారు . తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో మంచాలింక దిగండోయ్ కొక్కొరకో అనే పాటను ఆయన వ్రాయటమే కాదు పాడారు కూడా . గుంతలకిడి గుంతలకిడి , చీకటోళ్ళ లోకంలో , దారిని చూపేందుకు అంటూ సాగే పాటలు కూడా బాగా చిత్రీకరించబడ్డాయి .
బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , సిరివెన్నెల , శేష గిరీశం పాటల్ని పాడారు . ఈ సినిమాకు మరి కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి . సినిమాలో శివాజీ రాజా నటుడు చిరంజీవి పిచ్చోడు . సినిమాలో ఒక నటుడికి చిరంజీవి voice over ఇచ్చారు .
కళ్ళు చిదంబరంగా పాపులర్ అయిన చిదంబరానికి ఇదే మొదటి సినిమా . అతను విశాఖపట్టణం పోర్ట్ ట్రస్టులో అసిస్టెంట్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తుండేవారు . బాలసుబ్రమణ్యం , సిరివెన్నెల సినిమాలో తళుక్కుమంటారు .
అయిదుగురు గుడ్డివారుగా శివాజీ రాజా , కొత్తూర్తి భాస్కరరావు , బిక్షు , శ్రీనివాస్ , రాజేశ్వరి బ్రహ్మాండంగా నటించారు . జర్నలిస్టుగా సుధారాణి , ఇతర పాత్రల్లో గుండు హనుమంతరావు , చిట్టిబాబు , విశాఖపట్టణంలోని ఔత్సాహిక కళాకారులు చాలామంది నటించారు . విలన్ పేరు నాకు తెలియదు . డిఫరెంటుగా నటింపచేసారు దర్శకులు .
ఇ వి వి అసోసియేట్ డైరెక్టర్ . యం వి రఘు , ఆయన మిత్రులు నిర్మాతలు . యం వి యస్ హరనాధరావు పదునైన డైలాగులను వ్రాసారు . సినిమా యూట్యూబులో ఉంది కానీ వీడియో క్వాలిటే బాగా లేదు . ఇంతకుముందు చూడనివారు వీడియో క్వాలిటీ ఎలా ఉన్నా తప్పక చూడండి . Undoubtedly an unmissable art film .
నేను పరిచయం చేస్తున్న 1174 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాలు
Share this Article