.
( గోపు విజయకుమార్ రెడ్డి ) … భారత అణు ఇంధన విప్లవం: ‘కల్పకం‘ సాక్షిగా శక్తి స్వావలంబన దిశగా మరో ముందడుగు… ఇండియా ఎక్కడా రాజీపడటం లేదు… సైలెంటుగా కొన్ని స్వావలంబన విజయాల్ని నమోదు చేస్తూనే ఉంది… ఎటొచ్చీ మెయిన్ స్ట్రీమ్ జర్నలిజానికే ఆ ప్రాధాన్యాలు అర్థం కావడం లేదు… అఫ్కోర్స్, కొన్ని సబ్జెక్టుల మీద అవగాహన లేకపోవడమూ కారణమే…
ప్రస్తుతం ప్రపంచం దృష్టి మండుతున్న చమురు బ్యారెల్ మీద ఉంది… ఆ సెగ ప్రతి దేశాన్నీ తాకుతోంది… పలు దేశాలు విధ్వంస యుద్దంలో ఉన్నాయి… ఆల్మోస్ట్ ఓ ప్రపంచ యుద్దమే… ఈ జియోపాలిటిక్స్ వార్తల నడుమ ప్రధాని మోడీ నిన్న ఓ భిన్నమైన ట్వీట్ (ఎక్స్) వదిలాడు… దాని ఇంపార్టెన్స్ జెన్జీ తరానికి తెలుసు… అందుకే 31 మిలియన్ల రీచ్ ఆ ట్వీట్కు…
Ads
తను ఆ ట్వీట్లో ప్రస్తావించినట్లుగా, కల్పకంలోని ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) కోర్ లోడింగ్ ప్రారంభం కావడం అనేది కేవలం ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదు, ఇది రాబోయే శతాబ్ద కాలపు భారత ఇంధన భవిష్యత్తుకు పునాది…

ఎందుకు ఈ విజయం ఇంత ప్రత్యేకం? … భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ బాభా కలలు గన్న “మూడు దశల అణు కార్యక్రమం”లో మనం రెండో దశలోకి అధికారికంగా ప్రవేశించాం… దీని ప్రత్యేకతను అర్థం చేసుకోవాలంటే, అది పని చేసే విధానం చూడాలి…
ముఖ్య సూత్రం…: సాధారణ రియాక్టర్లు ఇంధనాన్ని కేవలం ఖర్చు చేస్తాయి… కానీ, ఈ ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‘ విద్యుత్తును ఉత్పత్తి చేస్తూనే, తాను వాడుతున్న దానికంటే ఎక్కువ ఇంధనాన్ని తిరిగి సృష్టిస్తుంది… అందుకే దీనిని “బ్రీడర్” (ఉత్పత్తి చేసేది) అని పిలుస్తారు…
మూడు అంచెల వ్యూహం: థోరియం లక్ష్యంగా… భారత్ వద్ద యురేనియం నిల్వలు తక్కువ, కానీ ప్రపంచంలోనే అత్యధికంగా థోరియం నిల్వలు ఉన్నాయి… మన వ్యూహం ఏమంటే…
-
మొదటి దశ…: సహజ యురేనియంను ఉపయోగించి విద్యుత్తును తీయడం… దీని ద్వారా వచ్చే వ్యర్థం నుండి ప్లూటోనియం సేకరించడం…
-
రెండో దశ (ప్రస్తుతం కల్పకంలో జరుగుతున్నది)…: ఈ ప్లూటోనియంను ఇంధనంగా వాడుతూ విద్యుత్ తీయడం… ఈ ప్రక్రియలో థోరియంను రియాక్టర్లో ఉంచితే, అది యురేనియం-233 గా మారుతుంది…
-
మూడో దశ…: ఇలా తయారైన యురేనియం-233ని ఉపయోగించి థోరియం ద్వారా అనంతమైన విద్యుత్తును పొందడం…

భారతదేశానికి చేకూరే 5 ప్రధాన ప్రయోజనాలు…
-
1. ఇంధన భద్రత…: యురేనియం కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు…. మన తీర ప్రాంతాల్లో (ఆంధ్రప్రదేశ్, కేరళ) పుష్కలంగా ఉన్న థోరియం మనకు అక్షయపాత్ర అవుతుంది…
-
2. తక్కువ వ్యర్థం – ఎక్కువ శక్తి…: ఈ టెక్నాలజీలో అణు వ్యర్థాలు చాలా తక్కువగా ఉంటాయి… పైగా ఒక రియాక్టర్ వదిలిన వ్యర్థం మరో రియాక్టర్కు ఇంధనంగా మారుతుంది…
-
3. పర్యావరణ హితం…: బొగ్గు వాడకం తగ్గడం వల్ల గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గి, నెట్-జీరో లక్ష్యాలను చేరుకోవడం సులభతరం అవుతుంది…
-
4. స్వదేశీ పరిజ్ఞానం…: ఈ రియాక్టర్ను భారత్ సొంతంగా డిజైన్ చేసి నిర్మించింది… రష్యా తర్వాత ఈ సాంకేతికత కలిగిన రెండో దేశం మనమే కావడం విశేషం…
-
5. ఆర్థిక వృద్ధి…: చౌకైన మరియు నిరంతర విద్యుత్ లభ్యత వల్ల పారిశ్రామిక రంగం దూసుకుపోతుంది….

ముగింపు… అంతర్జాతీయ వార్తల కోలాహలంలో ఇలాంటి కీలకమైన విజయాలు చర్చకు రాకపోవచ్చు.., కానీ భారత్ “శక్తివంతమైన దేశంగా” ఎదగడానికి కల్పకం లాంటి ప్రాజెక్టులే వెన్నెముక… థోరియం వినియోగంలో ప్రపంచానికే భారత్ మార్గదర్శిగా నిలవబోయే రోజు ఎంతో దూరంలో లేదు… భారత అణు శాస్త్రవేత్తల కృషికి, దేశం గర్వించదగ్గ మైలురాయికి ఇది నిదర్శనం!
Share this Article