.
తమిళ్ష్లో బారతియార్ తరువాత గొప్పకవిగా వినుతికెక్కిన కవి కణ్ణదాసన్. రాయడం అన్న కళపై పదునైన పట్టు ఉన్న వారు కణ్ణదాసన్. ఒక భావాన్ని కవిత్వంగా మలచడంలో ఆయన నేర్పు చాల గొప్పది. ఆయన రచనల్లో పద- పురోగతి విశేషమైనది. ఆయన వచనం రాసినా చాల బావుంటుంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక తూగు ఉంటుంది.
16 ఏళ్లకే పత్రికా సంపాదకుడిగా పని చేశారు కణ్ణదాసన్. అటుతరువాత సినిమా కవి అయ్యారు. తరువాత రచయిత, రాజకీయ వేత్త , సినిమా నిర్మాత అయ్యారు. మొత్తం దక్షిణ భారతదేశ సినిమాల్లో సాటిలేని కవి ఆయన. కథలు, నవలలు, నాటకాలు వ్యాసాలు, అధ్యాత్మిక రచనలు ఇలా ఎన్నో రాశారు.
కొన్ని నిమిషాల్లో పూర్తి పాటను రాసేస్తారు.
ఆయన రచన ప్రవాహంలా సాగుతుంది. “జోరు మీదున్నావు తుమ్మేదా…” పాట సందర్భానికి అదే మట్టు (ట్యూన్)కు 8 పల్లవులు, 24 చరణాలు రాసిస్తే దాసరి నారాయణ రావు ఆశ్చర్యపోయారట.
“మ్రోగింది వీణ పదేపదే హృదయాలలోన…” మట్టుకు ఒక ప్రేమగేయం మొదట కన్నడంలో వచ్చింది. కన్నడ కవి పాట రాయడానికి వారం రోజులు తీసుకున్నారు. తరువాత తమిళ్ష్లో వచ్చింది. తమిళ్ష్లో అలవోకగా, చెప్పడానికి మాత్రం పట్టే సమయంలో పాటను పూర్తిచేశారు కణ్ణదాసన్.
Ads
ఎన్నో గొప్ప పాటల్ని రాశారు. ఎంతో గొప్ప పాటల్ని రాశారు కణ్ణదాసన్. “పక్షిని చూశాడు విమానాన్ని సృష్టించాడు, చేపల్ని చూశాడు పడవను సృష్టించాడు…” అంటూ “దేన్ని చూశాడు మతాన్ని కనిపెట్టాడు?” అని బాధతో అడిగారు కణ్ణదాసన్.
పెళ్లికి సిద్ధమౌతున్న పెళ్లి కూతురుతో చెలికత్తే చేత ఇలా అనిపిస్తారు కణ్ణదాసన్: “పూయని స్త్రీత్వం పూస్తుంది, ఇంతకు ముందు తెలియని నిజం తెలుస్తుంది”.
“ఎవరికి ఎవరు కాపలా…” అని తెలుగులో మనకు తెలిసిన పాటలో ఆత్రేయ ద్వారా కణ్ణదాసన్ భావాలు వినిపిస్తాయి. “ఒకరి తపనలో పుట్టేది కవిత రా/ ఇద్దరి తపనలో పుట్టేది పాపరా” అని కణ్ణదాసన్ అన్నది “బుజ్జి బుజ్జి పాపాయి…” పాటలో ఆత్రేయ తెలుగులోనూ అన్నారు.
“దీపం కాంతిలో తిరుక్కుఱల్ (ఒక గొప్ప గ్రంథం) చదివితే అది దీపం గొప్పతనం కదా / ఆ దీపంతో ఒక హృదయాన్ని కాల్చేస్తే దీపం కూడా పాపం కదా” అన్నారు కణ్ణదాసన్. “పారే నీరు బండ రాళ్లను డీ కొడుతూండడం వల్ల నీరు చెదిరిపోవడం లేదు, కాలక్రమంలో బండ రాయి అరిగిపోతూంటుంది” అని కణ్ణదాసన్ అన్నది ఆయన ఆలోచించే తీరులోని గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంది.
ఆరుద్ర , దాశరథి, కృష్ణశాస్త్రి వంటి మన గొప్పకవులు కూడా కణ్ణదాసన్ భావాల్ని తీసుకున్నారు.
“తమిళ్ష్ నా ప్రాణం; సంస్కృతం నా ఆత్మ” అని నినదించారు కణ్ణదాసన్.
తెలుగు సినిమా పాటను, కవులను ఎక్కువగా ప్రభావితం చేసిన పరభాషాకవి కణ్ణదాసన్.
తమిళ్ష్ కవి కణ్ణదాసన్ సినిమా పాటకు కావ్యస్థాయిని కలిగించారు. ఆయనలా మర్యాదను, మన్ననను పొందిన సినిమా కవి మన దేశంలో మరొకరు లేరేమో? 17/10/ 81న మరణించాక ఆయన పార్థివదేహం వెనుక ముఖ్యమంత్రి ఎమ్.జీ. రామచంద్రన్ శ్మశానం వరకూ నడిచి వెళ్లారు! ఇది ఒక కవికి దక్కిన అపూర్వమైన గౌరవం.
24/6/27న పుట్టిన కణ్ణదాసన్ కన్నియిన్ కాదలి (1949) సినిమాలో ‘కలత చెందకు మనసా’ అనే అర్థం వచ్చే తమిళ్ష్ వాక్యంతో సినిమా కవిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు.1958లో వచ్చిన మాలైయిట్టమంగై సినిమాతో కవిగా నిలదొక్కుకుని 60లలో నక్షత్రస్థాయిని అందుకున్నారు. నక్షత్రస్థాయిని అందుకున్న తొలి దక్షిణాది సినిమా కవి కణ్ణదాసన్.
దక్షిణ భారత సినిమాలో మన తెలుగు కవులతోపాటు మలయాళంలో వయలార్ రామవర్మ , పీ.భాస్కరన్ వంటి వాళ్లు సైతం కణ్ణదాసన్ కు దీటైన కవులు కాలేదు. కన్నడ సినిమాకవి ఆర్.ఎన్. జయగోపాల్ ఈ వ్యాసరచయితతో “దక్షిణాది సినిమాలోనే కణ్ణదాసన్ గొప్ప కవి” అని చెప్పారు. దక్షిణాది సినిమా పాటల రచనలో కణ్ణదాసన్ ఒక విప్లవం.
“పోతే పోనీ పోరా (పోనాల్ పోగట్టుమ్ పోడా)” వంటి మామూలు మాటల్ని కవిత్వం చేశారు కణ్ణదాసన్. ఈ మాటలు ప్రాయశ్చిత్తం డబ్బింగ్ సినిమాలో అనిశెట్టి ద్వారా తెలుగులోకి వచ్చాయి. ఈ పాట తమిళ్ష్ మూలంలో “అరువు ఇచ్చిన వాడు అడుగుతున్నాడు / లేదంటే వాడు వదిలేస్తాడా? / బంధాన్ని చెప్పుకుని ఏడిస్తే / ప్రాణాన్ని తిరిగిచ్చేస్తాడా” అని కణ్ణదాసన్ చెప్పిన గొప్ప భావాన్ని తెలుగులోకి అనిశెట్టి తీసుకురాలేదు.
ఇంతకన్నా ముందు 61లో విడుదలైన కలిసివుంటే కలదు సుఖం సినిమా ద్వారా కణ్ణదాసన్ భావాలు తెలుగులోకి తొలిసారి వచ్చాయి. ఆ సినిమాలో ఆరుద్ర రాసిన “మేలిమి బంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా…” పాటలో మనం వినేవి కణ్ణదాసన్ భావాల్నే.
కణ్ణదాసన్ భావాల్ని తొలిసారి తెలుగులోకి తెచ్చింది ఆరుద్ర… కృష్ణశాస్త్రి, దాశరథి, ఆత్రేయ, అనిశెట్టి ప్రభృతులు కణ్ణదాసన్ భావాల్ని తీసుకున్నారు. కణ్ణదాసన్ తమిళ్ష్లో రాశాక ఆ సందర్భానికి తెలుగులో ఇల్లాలు (1965) సినిమాలో ” నీవు నా కళ్లలోనే నిలిచావు…” అంటూ శ్రీశ్రీ రాసింది కణ్ణదాసన్ శైలికి, శయ్యకు, శిల్పానికి, బావానికి సరితూగలేదు.
“గోదారి గట్టుంది…” అని దాశరథి రాసింది కణ్ణదాసన్ నుంచి తీసుకున్నదే. “మంటలు రేపే నెలరాజా…” పాటలో “మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేశాడు” అని దాశరథి కణ్ణదాసన్ భావాన్నే తీసుకున్నారు. ఈ పాట రచనలో దాశరథి కణ్ణదాసన్ నాణ్యతకు సరితూగలేకపోయారు.
“రాముడు ఎంత మంది రామ్ముళ్లమ్మా” అని అంటూ కణ్ణదాసన్ రాముడిపై రాసిన పాటను విని ఆరుద్ర “మీకిలాంటి ఆలోచన ఎలా వచ్చింది?” అని కణ్ణదాసన్ను అభినందన పూర్వకంగా అడిగారట. కణ్ణదాసన్ రాసిన ఆ పాట స్ఫూర్తితోనే “శ్రీరామ నామాలు శతకోటి…” అంటూ మీనా (1973) సినిమాలో రాశారు ఆరుద్ర. కణ్ణదాసన్ రాసిన ఈ రాముడు పాట ఆధారంగా పెళ్లికూతురు (1970) సినిమాలో దాశరథి కూడా రాముడు పాట రాశారు.
వీరాభిమన్యు సినిమాలో “చూచి, వలచి చెంతకు పిలచి…” అంటూ ఆరుద్ర రాశారు. ఈ సందర్భానికి ముందుగా కణ్ణదాసన్ రాశారు. తమిళ్ష్లో ఈ పాట రచనా సంవిధానం, శయ్య , భావాల పరంగా చాల గొప్పగా ఉంటుంది. కణ్ణదాసన్ ఈ పాటలో Dramatic irony ని సాధించారు. ఆరుద్ర రచన కొంత అనువాదం, కొంత అనుకరణగా సాగి కొన్ని చోట్ల తేలిపోయింది.
మంచి రోజులు వచ్చాయి సినిమా (1972)లో దేవులపల్లి కృష్ణశాస్త్రి “నేలతో నీడ అన్నది నను తాకరాదనీ / పగటితో రేయి అన్నది నను తాకరాదనీ…” అని రాసింది పూర్తిగా కణ్ణదాసన్ భావమే. తమిళ్ష్లో “నీడను చూసి నేల అన్నది నన్ను తాకద్దు…” అని కణ్ణదాసన్ అంటే కృష్ణశాస్త్రి “నేలతో నీడ అన్నది” అని ఔచిత్యం లేకుండా అన్నారు.
“తల్లితండ్రి ఒకరి నొకరు తాకనిదే / నీవు లేవు, నేను లేను, లోకమే లేదులే” అని కృష్ణశాస్త్రి అన్నది కణ్ణదాసన్ తమిళ్ష్లో అన్నదానికి నకలే. ఈ పాటలో (దాశరథి రాసిన?) మూడవ చరణానికి కూడా ఆధారం కణ్ణదాసన్ చింతనే.
గుడిగంటలు సినిమాలో అనిశెట్టి రాసిన “జన్మమెత్తితిరా అనుభవించితిరా…” పాటలో “పుట్టడానికి ముందు ఉన్న హృదయం ఇవాళ వచ్చిందిరా / మరణించాక వచ్చే ప్రశాంతత వచ్చేసిందిరా” అని తమిళ్ లో కణ్ణదాసన్ గొప్పగా అన్నది తెలుగులో లేదు.
మొగుడా పెళ్లామా సినిమాలో (1975) “పరమశివుని మెడలోని పాము అన్నది గరుడా క్షేమమా …” అంటూ సీ. నారాయణ రెడ్డి కణ్ణదాసన్ రచనను అనుసరిస్తూనే రాశారు.
కణ్ణదాసన్ ప్రభావం ఎక్కువగా ఉన్న తెలుగు సినిమా కవి ఆత్రేయ. “తలచినదే జరిగినదా దైవం ఎందులకు/ జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు”, “తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం / అది తెలియకపోతేనే వేదాంతం” అంటూ కణ్ణదాసన్ చెప్పినవి ఆత్రేయ ద్వారా తెలుగులోకి వచ్చాయి. “దేవుడు నేనై పుట్టాలి/ దేన్నో తాను ప్రేమించి/ ఆడదాని మనసంటేనే/ విషమని తెలిసి ఏడ్వాలి” అని కణ్ణదాసన్ భావాన్ని కొంచెం మార్చి రాశారు ఆత్రేయ.
ప్రపంచంలో మరేకవి రాయనన్ని మనసు పాటలు రాసిన ఆత్రేయ ప్రేమనగర్ సినిమాలో రాసిన “మనసు గతి ఇంతే…” పాటకు తమిళ్ష్లో రాస్తూ ‘కవులు ఇలా శాపనార్థాలు పెడుతున్నట్టుగా అనకూడదు’ అన్న ఆలోచనతో కణ్ణదాసన్ “రెండు మనసులు కావాలి దేవుణ్ణి అడుగుతాను / తలుచుకుని బాధపడడానికి ఒకటి / మరిచిపోయి బతకడానికి ఒకటి” అని ఆత్రేయకు అతీతంగా చాల గొప్పగా రాశారు.
ఈ కణ్ణదాసన్ మాటల్నే కళ్యాణప్రాప్తిరస్తు సినిమా (1996)లో భువనచంద్ర “రెండు మనసులు కావాలి / వలపించాడానికి ఒకటి / విలపించడానికి ఒకటి” అని మళ్లీ చెప్పారు. గుప్పెడు మనసు సినిమాలో “మౌనమె నీ భాష ఓ మూగ మనసా…” అని ఆత్రేయ రాసిన పాట సందర్భానికి ముందుగా కణ్ణదాసన్ “మౌనంలో ఆడుకునే మనస్సాక్షీ…” అంటూ రాశారు. ఈ పాటలో కొన్ని చోట్ల కణ్ణదాసన్ భావాల్ని యథాతథంగా ఆత్రేయ తీసుకున్నారు. కొన్ని చోట్ల కణ్ణదాసన్ స్థాయిని అందుకోలేదు.
తమిళ్ష్లో కణ్ణదాసన్ స్థాయి పద, భావ ప్రయోగ రీతిని తెలుగులో ఆత్రేయ సాధించలేకపోయారు. కణ్ణదాసన్ను అత్రేయ బాగా అర్థం చేసుకున్నారేమో? తనపై కణ్ణదాసన్ ప్రభావం ఉందని ఆత్రేయ స్వయంగా చెప్పుకున్నారు. కణ్ణదాసన్ కూడా ఆత్రేయ రాసిన “నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి” అన్న దాన్ని తీసుకుని “నవ్వినా కన్నీళ్లు వస్తాయి / ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి / కలయికలో నవ్వు వస్తుంది / వియోగంలో ఏడుపు వస్తుంది / ఏడ్చినా నవ్వినా సుఖమైన నెమ్మది వస్తుంది” అని రాశారు.
కణ్ణదాసన్పై మన వేమన ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తుంది. వేమన పద్యాల్ని తమిళ్ష్నాడు మాజీ ముఖ్యమంత్రి అణ్ణాదురై “వేమన వెడి గుండుగళ్” (వేమన బాంబులు) పేరుతో తమిళ్ష్లోకి
అనువదించారు. వాటి వల్లో, మరో విధంగానో కణ్ణదాసన్ వేమనను ఆకళింపుచేసుకున్నట్టున్నారు.
“పునాదిలేకుండా కట్టిన భవనం గాలికి నిలబడదు”, “అందంగా ఉండే మేడి పళ్లు సంతలో అమ్మబడడం లేదు”, “ప్రమిద ఉన్నా నూనె లేకపోతే వెలుతురు దొరకదు” వంటి కణ్ణదాసన్ మాటల్లో వేమన శైలి కనిస్తూంటుంది.
వేమన భావాల్ని కణ్ణదాసన్ కొన్ని సినిమా పాటల్లో వాడారు. “లేడు లేడటన్న లేడు లేనే లేడు / కాడు కాడటన్నఁ గానె కాడు / తోడు తోడటన్నఁ దోడనే తోడౌను” అని వేమన అన్నది ఒక కణ్ణదాసన్ పాటలో వినిపిస్తుంది. “ఉరిమి మొరుగు కుక్క యోగి నే మెరుగురా” అని వేమన అన్నదాన్ని కణ్ణదాసన్ ఒక సందర్భంలో తన మాటలుగా చెప్పారు.
ఒక చింతనను కవిత్వం చెయ్యడంలో కణ్ణదాసన్ సిద్ధహస్తులు. కణ్ణదాసన్ అభివ్యక్తి ఉన్నతంగా ఉంటుంది. ‘మనిషి మరణిస్తాడు’ అన్న విషయాన్ని ఆయన ఇలా రాస్తారు: “ఆత్మ వదిలేస్తుంది /తనువు నశించిపోతుంది / నిప్పు కాల్చేస్తుంది/ ఉనికి శూన్యంలో ఉంటుంది”
ఇలా విషయాలను ఆయన కవిత్వం చేసే తీరు చాల గొప్పగా ఉంటుంది. “కరుణ పొంగే హృదయం / దేవుడు నివశించే నిలయం/ కరుణను మరిచిపోయి బతుకుతున్నారు /దేవుడిని వెతుకుతూ తిరుగుతున్నారు”, “మనిషి జీవితంలోని శోకమంతా మనసువల్ల వచ్చిన రోగం”, “తప్పుచెయ్యడానికి సాహసించిన మనిషి ఏడవడం లేదు / పొరబాటున కూడా ఆకాశం మట్టిపై పడిపోవడం లేదు” వంటివి కణ్ణదాసన్ గొప్పగా అన్న వాటిలో కొన్ని.
“నేను ప్రేమ అనే కవితను చెప్పాను పానుపు పైన” అని నాయకుడంటే “ఆ కరుణకు నేను కానుక నిచ్చాను ఊయల పైన” అని నాయిక అంటుంది. ఇలాంటివి విరివిగా రాశారు కణ్ణదాసన్. కణ్ణదాసన్ పదాల ఎన్నిక, అల్లిక (word-play) ఉదాత్తంగా ఉంటాయి. ఆయన రచనల్లో పద-పురోగతి (word-progression) ఉంటుంది.
కణ్ణదాసన్ అసలు పేరు ముత్తయ్యన్. కణ్ణదాసన్ అంటే కృష్ణదాసుడని అర్థం. యవ్వనదశలో నాస్తికుడైన ఆయన తప్పు తెలుసుకున్నట్టుగా తరువాత ఆస్తికుడయ్యారు. “నలువైపుల నుంచీ బాధలు వస్తే /
నాస్తికులకూ దేవుడు ఉంటాడు; / కనిపించేదంతా దుఃఖం అయితే / దేవుడికీ దేవుడు ఉంటాడు”. అని అన్నారు. “నాగు పడగపై నర్తనాలు చేసి / దాహాన్నంతా తీర్చుకున్నాడు… ” అనీ, “వాడి మోహస్థితి కూడా ఒక / యోగస్థితిలాగా ఉంటుంది…” అనీ కృష్ణుడిపై రాశారు.
కణ్ణదాసన్ దాదాపుగా 5వేల పాటలు, 4 వేల పైచిలుకు కవితలు రాశారు. పలు సినిమాలకు కథలు, సంభాషణలు, ఇతర కథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు రాశారు. 79లో సేరమాన్ కాదలి అనే నవలకు కేంద్రసాహిత్య అకాదెమీ అవార్డ్ ను అందుకున్నారు.
68లో కుళ్షన్దైక్కాగ సినిమాలోని “రామన్ ఎన్బదు గంగై నది…” పాటకు ఉత్తమ గీత రచయితగా కేంద్రప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నారు. అర్తముళ్ళ ఇందు మదమ్ (అర్థవంతమైన హిందూమతం) అనే ప్రశస్తమైన గ్రంథాన్ని రాశారు. భగవద్గీత, భజగోవిందం కృతులకు అనువాదాలు చేశారు. 57 పుస్తకాలు రాశారు. 23- 3- 78 నుంచి చివరి వరకూ తమిళ్ష్నాడు ప్రభుత్వ ఆస్థానకవిగా ఉన్నారు.
"నేను కణ్ణదాసన్ పాటల వల్లే ఇళయరాజా నయ్యాను, కణ్ణదాసన్ నా హీరో" అని ఇళయరాజా ఇటీవల బహిరంగంగా చెప్పుకున్నారు.
“నేను నిరాశనుంచి బయటకు వచ్చి నిలబడి ప్రముఖకవినై బతికింది కణ్ణదాసన్ పాట వల్లే” అని తమిళ్ష్ కవి వాలి చెప్పేవారు.
రవీంద్రనాథ్, రూమీ, వంటి కవుల స్థాయిలో కణ్ణదాసన్ ఇలా రాశారు: “దేవుడిచ్చిన వీణ దానిపై దేవి చేసిన గానం / వెతికే చేతులు వెతికితే అందులో రాగం లేకుండా పోతుందా? – మేఘం పాడే పాటను విన్నాను నేనూ పాడుకుంటున్నాను/ మోహమా? శోకమా? ఇంకా నా మనసు నిద్రపోతూంటుందా?/ అనుదినమూ అన్వేషిస్తూంటాను. / ఆకాశం నా భవనం అవని నా వేదిక / వర్ణాలు నే చేసే ఆలోచనలు / ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాను/ సంగీతంలో మై మరిచిపోయాను / భగవంతుడి సభలో కళాకారుణ్ణి నేను”.
వేటూరి సుందరరామమూర్తి ఒకసారి ఇలా అన్నారు: “కాళిదాసు తమిళ్షుడు అవాలనుకుని కణ్ణదాసన్ అయ్యాడు"
…. రోచిష్మాన్ …. 9444012279
Share this Article