.
Subramanyam Dogiparthi…. ఓ షీరో , ఓ బడ్డింగ్ హీరో , ఇద్దరు హీరోయిన్లు : వెరశి కిరాయి దాదా . 1987లో వచ్చిన ఈ సినిమాకు నిర్మాత యన్టీఆర్ సినిమాలకు పంపిణీదారుడుగా పేరు , డబ్బు సంపాదించుకున్న రాజకీయ నాయకుడు దొరస్వామి రాజు .
1986లో హిందీలో హిట్టయిన జాల్ సినిమాకు రీమేక్ మన కిరాయి దాదా . హిందీలో మిథున్ చక్రవర్తి , రేఖ , మందాకిని , మూన్ మూన్ సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు . మన తెలుగు సినిమాకు దర్శకుడు కోదండరామిరెడ్డి .
Ads
- భరతనాట్య శాస్త్రలో పట్టభద్రురాలు , సామాజిక ఉద్యమకారిణి , బ్లూ క్రాస్- హైదరాబాదు వ్యవస్థాపకురాలు అమలకు తెలుగులో అరంగేట్రం ఈ సినిమాయే . ఆ హీరోతోనే నిజ జీవితాన్ని కూడా తర్వాత పంచుకుంది .
అనగనగా ఓ జమీన్ . దాని జమీందారు జమీన్ లోని జనాల్ని పీక్కుతినటం తమ జన్మ హక్కు అని భావిస్తూ ఉంటాడు . అతని తమ్ముడు హృదయుడు . అన్న రావు గోపాలరావు , తమ్ముడు కృష్ణంరాజు .
హృదయుడయిన తమ్ములుంగారు చిన్ననాటి స్నేహితురాలిని ఆరాధిస్తూ ఉంటాడు . ఆ జమీన్లో జనం కోసం పోరాడుతూ ఉంటాడు మురళీమోహన్ . చిన్న జమీందారు కృష్ణంరాజు , మురళీమోహన్ స్నేహితులు .
విలన్ రావు గోపాలరావుకి తోక విలన్ గొల్లపూడి మారుతీరావు , కట్టప్ప లాంటి విధేయుడు శ్రీధర్ . వీరందరూ కలిసి చిన్న జమీందారుని చంపి అతని స్నేహితుడు అయిన మురళీమోహన్ మీద ఆ నేరం మోపి జైలుకు పంపుతారు . మురళీమోహన్ భార్యాబిడ్డలు ప్రాణభయంతో పట్నం చేరుతారు . వారి కొడుకే హీరో నాగార్జున .
చిన్న జమీందార్ భార్య జయసుధే ఈ సినిమాకు షీరో . తన భర్తను హత్య చేసిన విలన్ల మీద పగ తీర్చుకోవటానికి నాగార్జునని కిరాయికి కుదుర్చుకుంటుంది . జయసుధ , మురళీమోహన్లు కలిసి విలన్లను చంపి పగ తీర్చుకుంటారు . ఈ 1+2 సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా ఖుష్బూ , అమలలు నటించారు .
చివరాఖరికి ఖుష్బూ సైడయిపోవటంతో నాగార్జున , అమల ఒకటవుతారు . శుభం కార్డ్ పడుతుంది .
జయసుధ నటనను మెచ్చుకోవాలి . ముఖ్యంగా పగ తీర్చుకునే వ్యూహకారిణిగా , గానాబజానాలో నర్తకిగా చాలా బాగా నటించింది . ఇంక హీరోగా నాగార్జున సెటిల్ అయ్యాడనే చెప్పుకోవచ్చు . ఇద్దరు హీరోయిన్లు గ్లామర్ స్పేసుని అందంగా ఫిల్ చేసారు . అమల డాన్సుల్లో అదరకొట్టేసింది .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . రాత్రి వేళకు రేరాణిని రాచలీలకు నీదానిని గానాబజానా పాటలో జయసుధ చాలా బాగా నృత్యించింది . మురిసే మేఘాలు నడిచే అందాలు వాన పాటలో నాగార్జున , అమలలను దర్శకుడు కోదండరామిరెడ్డి విజృంభింపచేసారు . మరో డ్యూయెట్ నీ బుగ్గ పండు నే గిచ్చుకుంటా పాట కూడా బాగుంటుంది . వేటూరా ! మజాకా !
నాగార్జున ఖుష్బూని టీజ్ చేసే గుంతలకిడి గుంతలకిడి పాట , చిత్రీకరణ హుషారుగా ఉంటాయి . ఈ పాటలనన్నీ వేటూరే వ్రాయగా జొన్నవిత్తుల ఒక డిస్కో డాన్సుకి వన్ టూ త్రీ వాటేసేయ్ పాటను వ్రాసారు . అన్ని పాటల చిత్రీకరణ బాగుంటుంది . సినిమా విజయానికి దోహదపడ్డాయి .
బాలసుబ్రమణ్యం , సుశీలమ్స , జానకమ్మ పాటల్ని పాడారు . సత్యానంద్ డైలాగులు పదునుగానే ఉంటాయి . ఇతర ప్రధాన పాత్రల్లో అన్నపూర్ణ , సుధాకర్ , మాడా , రాళ్ళపల్లి , వరలక్ష్మి , సుత్తి వీరభద్రరావు , అనిత , మహీజా , ప్రభృతులు నటించారు .
ఈ సినిమా తమిళంలోకి కూడా తంబి తంగ కంబి టైటిలుతో 1988లో రీమేక్ అయింది . విజయకాంత్ , లక్ష్మి , రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు . క్రమక్రమంగా నాగార్జున హీరోగా నిలదొక్కుకోవటంలో ఈ కిరాయి దాదా బాగానే దోహదపడింది .
సినిమా యూట్యూబులో ఉంది . నాగార్జున , జయసుధ అభిమానులు తప్పక చూడవచ్చు . ఇతరులకూ చూడబులే . #తెలుగు_సినిమాల_సింహావలోకనం
Share this Article