.
Subramanyam Dogiparthi ….. ఈ సినిమా అనగానే నాకు మొదట గుర్తుకొచ్చేది అష్టలక్ష్ముల మీద హరికధే . అద్భుతమైన ఆలోచన , అందుకుతగ్గ చిత్రీకరణ , రెంటినీ మించి చిరంజీవి నటన .
శ్రీగజవదనం భవతరణం అంటూ సాగే ఈ హరికధ అష్టలక్ష్ములలో ఏ లక్ష్మి వెళ్ళిపోయినా ఫరవాలేదు ; కానీ ధైర్యలక్ష్మిని మాత్రం వీడిపోవద్దు అని రాజు కోరుకుంటాడు . ఈ హరికధలో చిరంజీవి వెర్సటైలిటీ బ్రహ్మాండంగా కనిపిస్తుంది .
Ads
విజయ బాపినీడు దర్శకత్వంలో 1984 జూన్లో వచ్చిన ఈ మహానగరంలో మాయగాడు సినిమా నిజంగానే జనాల్ని చిరంజీవి మాయలో పడేసింది . జంధ్యాల గారు కధను చాలా బాగా నేసారు . కుటుంబాన్ని పోషించుకునేందుకు చిల్లర దొంగతనాలు చేసుకునే హీరో దొంగ సాక్ష్యం చెప్పి స్వంత బావనే హత్యానేరంలో ఇరికిస్తాడు . ఆ బావను రక్షించుకునే ప్రయత్నమే మిగతా సినిమా అంతా .
రొమాంటిక్ సినిమాలో సస్పెన్స్ , ఇన్వెస్టిగేషన్ , క్రైం , థ్రిల్ , వగైరా దినుసులతో మాంచి మసాలా వండారు . ప్రతీ పాత్రకు ప్రాముఖ్యత ఉండేలా పాత్రల్ని మలిచారు . జంధ్యాల రచనా నైపుణ్యం తెలుస్తుంది . పోలీసులు తలచుకుంటే దొంగ కేసులు ఎలా బనాయిస్తారో , దారినపోయే అమాయకుల్ని ఎలా ఇరికిస్తారో , ఆ పోలీసుల వలయంలో నుండి బయటపడటం ఎంత కష్టమో గొప్పగా ఆవిష్కరించారు దర్శకుడు విజయ బాపినీడు .
సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టయ్యాయి . ముఖ్యంగా టైటిల్ సాంగ్ . మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు పాట జనానికి ఊత పాట అయిపోయింది . ఉడుకు ఉడుకుగా ఉంది యమ్మా యమ్మా అంటూ సాగే డ్యూయెట్ చిరంజీవి , విజయశాంతిల మీద హాట్ హాటుగా ఉంటుంది .
జయమాలిని , అనూరాధల మీద క్లబ్ పాట సరదాగా ఉంటుంది . తూగో జిల్లా పెద్దాపురం ఫేమస్ అంటూ రెండు గోదావరి జిల్లాలు , కృష్ణా జిల్లా , మా గుంటూరు జిల్లా తెనాలి అన్నీ కవరవుతాయి . చక్కటి చిత్రీకరణ . నూతన్ ప్రసాద్ మీద వెధవా ఒట్టి వెధవా పాట చవటాయను నేను నీకంటె పెద్ద చవటియని నేను పాటను గుర్తుకు తెస్తుంది . పాటల్ని వేటూరి , ఆత్రేయలు వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మలు శ్రావ్యంగా పాడారు .
చిరంజీవి తర్వాత ప్రేక్షకులు బాగా గుర్తుంచుకునే పాత్రలు అల్లు రామలింగయ్య , రావు గోపాలరావు పాత్రలు . సినిమా మధ్యలో ఉద్యోగాలలో స్థానభ్రంశం జరుగుతుంది . యస్సై హెడ్ అవుతాడు ,హెడ్ యస్సై అవుతాడు . బహుశా దీన్నే హలో బ్రదర్ సినిమాలో కోట శ్రీనివాసరావు , మల్లిఖార్జునరావుల మీద పెట్టి ఉంటారు .
గుర్తుండే మరో పాత్ర అల్లు అరవిందుది . చిరంజీవికి అసిస్టెంట్ దొంగగా బాగా నటించాడు . ఇతర ప్రధాన పాత్రల్లో విజయశాంతి , ఉదయకుమార్ , గిరిబాబు , సంగీత , మమత , నిర్మలమ్మ , నూతన్ ప్రసాద్ , సుత్తి వేలు , బాలాజీ , ప్రభృతులు నటించారు . నూతన్ ప్రసాద్ పిస్తా పహాడ్ డైలాగ్ వీర పాపులర్ అయింది . ఇప్పటికీ జనం వాడుతూనే ఉన్నారు . జ్యోతిలక్ష్మి , జయమాలినిలకు ఫుల్ లెంగ్త్ పాత్రలు లభించాయి . గ్లామర్ స్పేసుని విజయశాంతితో పాటు వీరిద్దరూ ఫిల్ చేసారు .
కాశీ విశ్వనాధ్ డైలాగులు చాలా బాగుంటాయి . ఏ ఒక్క పదమూ వ్యర్థం కాకుండా , తూచి తూచి వాడారు . ఈ చిరంజీవి మాయ సినిమా ఇప్పటికీ కొత్త కొత్తగానే ఉంటుంది . అప్పుడప్పుడు ఏదో ఒక చానల్లో వస్తూనే ఉంటుంది .
యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు వెంటనే చేసేయతగ్గ సినిమా . చిరంజీవి అభిమానులు ఎన్ని సార్లయినా చూడవచ్చు . అంత మాయ సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు (సినిమా బాగానే ఉన్నా ఎందుకో గాానీ పెద్దగా ఆడలేదు… ఏదో తేడా కొట్టేసింది…)
Share this Article