.
ప్రకృతిలో గొప్ప వైవిధ్యం ఉంటుంది. ఏ మొక్క జాతికి, ఏ జంతువు జాతికి ఒక దానితో ఒకటి ఎన్నో సామ్యాలు, దగ్గరతనాలు ఉంటాయి… అలాగే ఎన్నో తేడాలు ఉంటాయి. ఒకే జాతి జీవులలో కూడా ఎన్నో విధాలైన మార్పులు ఉంటాయి.
ప్రతి మనిషి తనకే ప్రత్యేకమైన లక్షణాలతో ఉంటారు. సగటు ఎత్తు, బరువు, రంగు, తెలివితేటలు, రూపాలతో ఆయా సమూహాలకు ప్రామాణికత అంటూ ఏర్పరుచుకున్నప్పటికీ… విడిగా ఎవరికి వారు ప్రత్యేకమైన వ్యక్తులు.
Ads
ఒకే గర్భంలో ఎదిగి, ఒకే విధమైన వారసకణాల (జీన్స్)ను పంచుకొనే కవలల్లో కూడా అనేక వైవిధ్యాలను చూస్తుంటాము. ప్రకృతికి అచ్చులు (Templates), నమూనాలు (Models) ఏమీ వుండవు. ఒకే తరహాలోని ప్రతి ఒక్క ప్రాణిలోనూ అనేక మార్పులను పొందుపరుస్తుంది.
మనుషుల మధ్య ఈ వైవిధ్యం రోగ నిర్ధారణ, చికిత్సలో ముఖ్యమైన విషయం. ఉదాహరణకి రక్తపోటు 140 / 90 మిల్లీమీటర్ల కంటే హెచ్చుగా ఉంటే అధిక రక్తపోటుకు చికిత్స ఇవ్వాలి అనేది ఒక సాధారణ సూచన. కాకుంటే గతంలో 110/60 ఉండే వ్యక్తికి 135/85 కి రక్తపోటుకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తితే… ఆ వ్యక్తికి కొద్దిపాటి చికిత్స అయినా చేయాల్సి ఉంటుంది.
ఇదంతా వైద్యుని యొక్క నిశితమైన పరిశీలన, నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే, క్లినికల్ పరీక్షల రిపోర్టులకు కాకుండా పేషెంట్ కి వైద్యం చేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. వ్యాధి నిర్థారణ (డయాగ్నొస్టిక్స్ ఇండస్ట్రీ) అనేది విపరీతంగా ఎదిగిపోయిన తరువాత… వైద్యుల నైపుణ్యం, అనుభవం, మానవీయ స్పర్శ ఉపయోగించడం తగ్గిపోతున్నది. వైద్య ప్రపంచం ఒక రకమైన యాంత్రికతతో ముందుకు వెళ్తున్నది.
మొన్న ఒక రోజు, 20 సంవత్సరాలుగా హెచ్ఐవి వైద్యం తీసుకుంటూ ప్రశాంతంగా గడిపేస్తున్న నా పేషెంట్ ఒకతను కొత్త సమస్యతో వచ్చాడు. కొత్తగా ఏవో మందులు వాడటం మొదలు పెట్టాక సమస్య తలెత్తినట్టు చెప్పాడు.
వివరం కనుక్కుంటే, సూపర్ స్పెషలిస్ట్ అయిన తన మిత్రుని కొడుక్కి ఏదో ఇబ్బంది వుంది అని చెప్పాడు. వెంటనే ఆయన బాగా ఖరీదైన పరీక్షలు చేసి, పెద్ద సమస్య ఉన్నట్టుగా తేల్చి చికిత్స మొదలు పెట్టారు. నిజానికి అక్కడ పరీక్షల్లో తేలింది పెద్ద సమస్య అయితే కాదు… ఇంకా చెప్పాలంటే వయసుతో వచ్చిన మార్పు.
20 ఏళ్ళ పైబడి హెచ్ఐవి జబ్బు, పెద్ద వయసు ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకోకుండా ఏదో జబ్బు ఉందని చెప్పి వెంటనే చికిత్స ప్రారంభించడంతో… ఇతను కొత్త సమస్యల పాలయ్యాడు. కొత్త వైద్యాన్ని ఆపు చేయడంతో త్వరగానే కోలుకున్నాడు.
గత ఏడాది ఒక పెద్దాయన దీర్ఘకాలపు సమస్యతో నా దగ్గరకు వచ్చాడు. కొద్దిపాటి పరీక్షలు చేసి పదిహేను రోజుల వైద్యం ఇచ్చాను. అయినా పెద్దగా మార్పు రాకపోవడంతో, అప్పటికే ఆయన చెప్పిన వివరాలతో వేరే దీర్ఘకాలపు చికిత్స మొదలు పెట్టాను. కోర్సు పూర్తయి, కోలుకొన్నాక ఆయన చెప్పిన విషయాలతో సంతృప్తి, విసుగు ఒకేసారి వచ్చాయి.
ఆయన బిడ్డ విదేశంలో వైద్యంలో సూపర్ స్పెషాలిటీ చదువుతున్నారు. పేషెంటు భార్య ఫలానా వైద్యం మొదలెట్టారు అని డాక్టరు బిడ్డతో చెప్పిన తర్వాత… ఎందుకు మొదలు పెట్టారు… ఏం పరీక్షలు చేశారు… అసలు ఆ వైద్యం వద్దు, వాడ వద్దు, డాక్టర్ అనగా నాతో మాట్లాడతాను అని రోజూ ఒకటే పోరు అట.
పేషెంట్ కూడా బాగా చదువుకున్న వ్యక్తి. నా విధానంపై, మాటలపై ఆయనకు పూర్తిగా గురి కుదిరింది. అందుకే తన బిడ్డతో వాదించకుండానే వైద్యం కొనసాగించారు. చికిత్స పూర్తయ్యే ముందు తన బిడ్డ పెద్ద పరీక్ష సూచిస్తే… చేయించుకుని చూపి, నా దగ్గరకు తెచ్చారు.
ఆ పరీక్ష రిపోర్ట్ చూసిన తర్వాత, అంతకు ముందు తన బిడ్డ చేసిన పెద్ద గొడవ లాంటి హితబోధను నిశ్శబ్దంతో ముగించినట్టుగా ఆయన చెప్పారు. తమ బంధువు ఒకరికి… ఆ సంపన్న దేశంలో మెదడులో వచ్చిన వ్యాధికి… కొన్ని డజన్ల పరీక్షలు చేసి, లక్షలాది రూపాయల ఖర్చు తర్వాత… నేను చెప్పిన తరహా జబ్బు అని చెప్పి చికిత్స ఇచ్చినట్టుగా ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు.
రానురాను కొందరు ఉన్నత విద్యావంతులు… ఇంత చదువుకొని అందరూ పలికేట్టుగా కాకరకాయ అని చెప్పడం నామోషీగాను… కీకరకాయ అని చెప్పడమే సరైనది గాను భావిస్తున్నారు. డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి, సాంక్రమిక వ్యాధుల నిపుణులు
Share this Article