.
Subramanyam Dogiparthi
…. ముచ్చటగా ముగ్గురు టైటిల్ చూడగానే ఇదేదో 1+ 2 సినిమాయో లేక 1+3 సినిమాయో అనుకునేరు !! అదేం కాదు . 1+1 సినిమాయే .
హాస్యరస చిత్రాలను , కుటుంబ కధా చిత్రాలను విరివిగా అందించిన రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వచ్చింది ఈ ముచ్చటగా ముగ్గురు సినిమా . డి రామానాయుడు సమర్పణలో యార్లగడ్డ సురేంద్ర నిర్మాతగా ఈ సినిమా 1985 మే 10 న విడుదలయింది .
Ads
యార్లగడ్డ సురేంద్ర అంటే ANR అల్లుడు , నటుడు సుమంతుకి తండ్రి . బ్లాక్ బస్టర్ శివ సినిమాకు కూడా ఈయనే నిర్మాత . మనకున్న హాస్య చిత్రాల దర్శకులు తక్కువ మందే . ఒకప్పుడు పాపులర్ బేనర్లయిన విజయా వంటి వారివి ఎక్కువగా హాస్యం బేసిక్ ఉండేవి .
ఉదాహరణకు గుండమ్మ కధ , మాయాబజార్ , వగైరా . తర్వాత కాలంలో ఏక్షన్ సినిమాలు ఎక్కువయ్యాయి . మళ్ళా జంధ్యాల , రేలంగి నరసింహారావు , ఇవివిలతో ఊపందుకున్నాయి . ఈమధ్య కాలంలో అనిల్ రావిపూడి , మారుతి ఆ కోవలోకి వస్తారు .
- 70 సినిమాలకు దర్శకత్వం వహించిన రేలంగి నరసింహారావు 24 సినిమాలను చంద్రమోహనుతో , 30 సినిమాలను రాజేంద్రప్రసాదుతో తీసారు . ఈ సినిమాలో ఆ ఇద్దరూ ఉన్నారు . పాత తరం సంభాషణల రచయిత డి వి నరసరాజు గారే ఈ సినిమాకూ సంభాషణలను వ్రాసారు .
ఓ ఇద్దరు అనాధ అక్కాచెల్లెళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఓ వృధ్ధ జంట ఇంట్లో అద్దెకు ఉంటుంటారు . వీళ్ళకు మరో నిరుద్యోగ యువకుడు తారసపడి హౌస్ మేట్ అవుతాడు . ముగ్గురు మంచి స్నేహితులు అవుతారు .
తర్వాత హీరోకి తెలుస్తుంది వాళ్ళిద్దరు తన మేనత్త కూతుళ్ళే అని . వాళ్ళిద్దరు ద్వేషించే తాతను వాళ్ళిద్దరి అభిమానాన్ని పొందేలా చేస్తాడు హీరో . ఈ ముగ్గురికి మరో మిత్రుడు రాజేంద్రప్రసాద్ దొరుకుతాడు . సినిమా చివర్లో ఈ నలుగురూ రెండు జంటలు అవుతాయి .
ఈ సినిమాలో రెండు జంటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి . ఒకటి అల్లు రామలింగయ్య , నిర్మలమ్మ . అల్లు వారు నిరర్ధక శృంగార మనస్కుడు . నిర్మలమ్మ నిర్మలమైన మనసున్న తల్లి . అనాధ హీరోయిన్లను కంటికి పాపలాగా కాపాడుతుంటుంది . ఇద్దరూ బాగా నటించారు .
మరో జంట నూతన్ ప్రసాద్ , రమాప్రభ . నూతన్ ప్రసాద్ పిట్టలదొర . రమాప్రభది అమెరికా నుండి వచ్చి తెలుగును ఖూనీ చేసే పాత్ర . ఇలాంటి పాత్రను రేలంగి నరసింహారావు తన సినిమాయే అయిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాంలో పెట్టాడు . మునిసిపల్ కమీషనర్ వై విజయ పాత్ర .
ఈ సినిమాలో మరో జంట కూడా ఉంటుంది . సుత్తి వీరభద్రరావు , మమత . ఆఫీసులో శృంగార పురుషుడి పాత్రలో వీరభద్రరావు , ఇంట్లో గయ్యాళి పాత్రలో మమత బాగా హాస్యాన్ని పండిస్తారు . ఇతర ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , దేవదాస్ కనకాల నటించారు .
ఇద్దరు హీరోయిన్లుగా తులసి , పూర్ణిమ , ఇద్దరు హీరోలుగా చంద్రమోహన్ , రాజేంద్రప్రసాద్ గలగలా గోలగోల చేస్తారు . వేటూరి వారి పాటలు చక్రవర్తి సంగీత దర్శకత్వంలో శ్రావ్యంగా ఉంటాయి . రేలంగి నరసింహారావు చాలా బాగా చిత్రీకరించారు . ముచ్చటగా ముగ్గురం అంటూ సాగే హుషారయిన పాట చంద్రమోహన్ , తులసి , పూర్ణిమల మీద ఆరోగ్యకరంగా ఉంటుంది .
ఓహో తారకా వయ్యారాల బాలికా పాట , చినుకొచ్చి తాకాల అనే వాన పాట రెండూ రొమాంటిగ్గా ఉంటాయి . మరో కొత్త రకం పాట ఉంది ఈ సినిమాలో . మూడు జంటలు పిక్నిక్ పెట్టుకుంటారు . ఒకరు ఒక పదం చెపితే మరొకరు ఇంకో పదం కలపాలి , ఇంకొకరు ఇంకో పదాన్ని , ఇలా . ఉదాహరణకు కొంగ , కోతి , కాకి , కుక్క . అలా . సరదాగా ఉంటుంది . ఏ పాటా లేకుండా ఉండే క్లబ్ డాన్స్ కూడా బాగుంటుంది .
ఈ సినిమాలో పేకాటలో ఓ నయా ఐడియాను ఇస్తుంది రమాప్రభ . Strip war/tease/play . ఆట ఓడిపోతే ఒంటి మీద ఉన్న బట్టల్ని ఒక్కొక్కటి తొలగించుకోవాలి . ఓవరాల్ ఫీల్ గుడ్ మూవీ . ఎబౌ ఏవరేజుగా ఆడినట్లు గుర్తు . చిన్న బడ్జెటు పెద్ద లాభాలు కేటగిరీలో సినిమా . ఇంతకుముందు చూడనట్లయితే తప్పక చూడొచ్చు . చూడబులే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article