.
ప్రభుత్వ రంగంలోని సంస్థలు ఒకే రంగానికి కట్టుబడి ఉండకూడదు… భిన్నరంగాల్లోకి ప్రవేశించాలి… తమ ఎక్సపర్టయిజ్ చూపించాలి… సంస్థను నిలబెట్టుకోవాలి… అదీ స్పూర్తి…
అది మన సింగరేణి కాలరీస్ కనబరుస్తోంది… గ్రేట్… కేవలం బొగ్గు తవ్వుకుని అమ్ముకోవడం కాదు… విద్యుత్తు, ఇతర మైనింగ్ రంగాలకూ విస్తరిస్తోంది… సంస్థను పచ్చగా ఉంచుకోవడం అంటే అదే… డైవర్సిఫికేషన్…
Ads
సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ దానికి కొత్త జవజీవాలు సమకూరుస్తున్నారు… ఆ పోస్టులో ఉండాల్సిన అధికారి… రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తనను అలాగే కొనసాగిస్తోంది అందుకే…
కీలక ఖనిజాల అన్వేషణలో సింగరేణి “బంగారు” అడుగు… వేలంలో కర్ణాటక దేవదుర్గ్ లోని బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ దక్కించుకున్న సింగరేణి… సింగరేణి చరిత్రలో తొలిసారిగా కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశం… భవిష్యత్ లో మైనింగ్ చేసే సమయంలో 37.75 శాతం రాయల్టీ పొందనున్న సంస్థ…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ సందర్భంగా సింగరేణి అధికారగణానికి అభినందనలు చెప్పారు… అభినందనలకు సింగరేణి ఉన్నతాధికారగణం అర్హులే…
సింగరేణి సంస్థ కీలక ఖనిజరంగంలోకి ప్రవేశించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాల్చింది ఎలాగంటే..? కర్ణాటకలోని దేవదుర్గ్ లోని బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో 37.75 శాతం రాయల్టీ కోట్ చేయడం ద్వారా సింగరేణి ఎల్-1 బిడ్డర్గా నిలిచింది… కీలక ఖనిజాన్వేషణలో రానున్న ఐదేళ్లలో ఈ గనుల్లో అన్వేషణను పూర్తి చేయనుంది సింగరేణి…
త్వరలోనే కర్ణాటకలో సింగరేణి అన్వేషణ….
కర్ణాటక దేవదుర్గ్ లోని బంగారం, రాగి నిక్షేపాలు ఉన్న ఈ ప్రాంతంలో సింగరేణి అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో త్వరలో పరిశోధన చేయనుంది… వివిధ రకాల అన్వేషణల అనంతరం తుది ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించాల్సి ఉంటుంది… అనంతరం కేంద్రం ఈ గనులను మైనింగ్ కోసం వేలంలో వేస్తుంది… ఆ గనులను సింగరేణి లేదా ఇతర సంస్థలు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది…
ఈ గనులను మైనింగ్ కోసం దక్కించుకున్న సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలో 37.75 శాతాన్ని ఆ గని జీవిత కాలం పాటు సింగరేణికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ అన్వేషణ కోసం సుమారు 90 కోట్ల రూపాయలు వ్యయం అవుతుండగా.. అందులో రూ.20 కోట్లను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా చెల్లిస్తుంది…
ప్రభుత్వ రంగ సంస్థ అనగానే అడ్డగోలు నష్టాల్ని చూపించడం, రాష్ట్ర ప్రభుత్వంపై సబ్సిడీ భారం మోపడమే గానీ… సింగరేణి మాత్రం ప్రభుత్వానికి డివిడెంట్ చెల్లిస్తుంది… ఉద్యోగులకు లాభాల్లో కొంతశాతం బోనస్గా ఇస్తుంది… ఇప్పుడు కొత్త కొత్త రంగాల్లోకి విస్తరిస్తోంది…
మూడు గనుల వేలంలో పాల్గొన్న సింగరేణి…
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 13వ తేదీన మొత్తం 13 కీలక ఖనిజాల అన్వేషణ లైసెన్స్ ల కోసం వేలం ప్రక్రియను ప్రారంభించింది… ఇందులో సింగరేణి సంస్థ పాలుపంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది… ఈ నేపథ్యంలో అన్వేషణకు అనువైన బ్లాక్లపై సింగరేణి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి అధ్యయనం చేశారు…
అనంతరం మధ్యప్రదేశ్ లోని పదార్ లోని ప్లాటినమ్ గ్రూప్ ఎలిమెంట్స్ బ్లాక్, ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి వద్ద ఉన్న ఒంటిల్లులోని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ బ్లాక్, కర్ణాటకలోని బంగారం, రాగి బ్లాక్లు తమకు అనువైనవని గుర్తించింది… వీటి కోసం ఈ నెల 13, 14, 19 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ వేలం నిర్వహించింది… ఇందులో ఈ నెల 19వ తేదీన జరిగిన వేలంలో కర్ణాటకలోని దేవదుర్గ్లోని బంగారం, రాగి బ్లాక్ల అన్వేషణ లైసెన్స్ సింగరేణి దక్కించుకోవడం విశేషం…
Share this Article