Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గజ్వెల్‌లోనూ బర్రెలక్క వంటి ఇంకో అభ్యర్థి… కాకపోతే ఈయన వ్యథ అనంతం…

November 25, 2023 by M S R

Kandukuri Ramesh Babu …….  విను తెలంగాణ – గజ్వేల్ : ఇది ఒక నిర్వాసితుడి గెలుపు నియోజకవర్గం… గజ్వేల్ అంటే మన ‘జాతి పిత’ నియోజకవర్గం. అంతేకాదు, ఇంకా పోరాడుతున్న మల్లన్న సాగర్ నిర్వాసితుల పునరావాస కేంద్రం కూడా. అక్కడ “భయపడకండి” అంటూ మూడు పయ్యల గుర్తు మీద పోరాడుతున్న ఈ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క లా పాప్యులర్ కాకపోవచ్చు. సామాజిక మాధ్యమాల్లో అతడు పోటీ వైరల్ కాకపోవచ్చు. అతడిని కలవడానికి మీరు వెళ్ళే ప్రయతం చేయకపోవచ్చు. కానీ అతడు ఇంకోరకంగా గెలుస్తున్నాడు. పోరాడి ఓడిన హృదయాల్లో అతడు నిలుస్తున్నాడు. కెసిఆర్ గారు గజ్వేల్ నుంచే కాకుండా కామారెడ్డి లో పోటీ చేయడమే అందుకు నిదర్శనం.

గజ్వేల్ అన్నది అభివృద్దికి చిహ్నమైన మన ప్రియతమ ముఖ్యమంత్రి ప్రస్తుత నియోజకవర్గం. ఆ పట్టణంలోని విశాలమైన రోడ్ల మీదుగా ఐదారు కిలోమీటర్లు లోపలి వెళితే ఆర్ అండ్ ఆర్ కాలనీ. మల్లన్న సాగర్ భూనిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస గ్రామాల కాలనీ. ప్రభుత్వం ఏ ఊరుకు ఆ ఊరు లెక్కన విడివిడిగా నిర్మించిన పద్నాలుగు గ్రామాల కేంద్రం అది. అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి. దానికి తోడు వర్షం. సరిగా వెలుతురు లేదు. వెళితే అక్కడ ఒంటరిగా ప్రచారం చేస్తున్న అడియాల కరుణాకర్ రెడ్డి గారు కన్పించారు. వెళ్ళే సరికి ఆయన తన ప్రచార రథం దిగి, నిలబడి మైకులో మాట్లాడుతుంటే అంబేద్కర్ ఒక్కరే మౌన సాక్షిగా వింటున్నట్టు కనిపించింది. ముఖానికి ముసుగు ఉన్నా చేతిలో రాజ్యాంగం చేత ధరించిన అంబేద్కర్ గారు అమిత శ్రద్ధతో ఆలకిస్తున్నరనే అనిపించింది.
కరుణాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని ఓడించడానికి నామినేషన్ వేసిన ఇద్దరు మల్లన్న సాగర్ నిర్వాసితుల్లో ఒకరు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇంకొకరు వేధింపులకు జడిసి బ్లూ ప్రింట్ అన్న పార్టీ పేరుతో నిలబడ్డాడు. ఆయన పేరు నిరుడి ప్రసాద్. ఇంకా ప్రచారంలో కానరాలేదు.
అన్నట్టు, ప్రచారంలో ఇదే తనకు మొదటి రోజు. పోలీసు అధికారులతో దాదాపు ఒక పోరాటం చేసినంత పని చేస్తీ గానీ ఆయనకు ఎన్నికల ప్రచారానికి అనుమతి లభించలేదు. ఆఖరికి మూడు పయ్యల గుర్తు (బేబీ వాకర్) ఉన్న బ్యానర్లతో, ఒక జోష్ ఇచ్చే ప్రచార పాటతో ఆయన వ్యాన్ మెల్లగా కదిలింది. వెంటనే వేగం పుంజుకుని ఒక్కో గ్రామాన్ని చుట్టేస్తూ వేములఘాట్ గ్రామాన్ని చేరుకున్నాడు.
వెంట ఒక్క మనిషి లేడు. కాకపొతే, కొద్ది సేపట్లోనే అర్థమైంది, ఇండ్లలో ఎవరి పని వారు చేసుకుంటూ ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా ఫాలో అవుతున్నారని. తమ తరపున మాట్లాడుతున్నందుకు, తమలో ఒకడిగా ఆయన పోరాడుతున్నందుకు వారు మనస్పూర్తిగా అశీర్వదిస్తున్నారు. కానీ బయటకు రాలేరు. మద్దతు ఇవ్వలేరు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నామినేషన్ వేసిన కరుణాకర్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లొనూ అండగా నిలబడలేరు. వినడం తప్ప అంతకన్నా ఎక్కువ ఏమీ చేయని నిస్సహాయ స్థితి. ఎందుకూ అంటే తెలంగాణా ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన పరిహారాలు ఇంకా రాలేదు. అందాల్సినవి ఇంకా అంచనే లేదు. చాలా మంది భయం అదే. మద్దతుగా నిలిస్తే వచ్చేవి ఇక ఎప్పటికీ రావని ఆ భయం. ఆ కారణంగానే ఇక్కడ ఈటెలకు కెసిఆర్ కూ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ‘వచ్చేవి’ లేకపోతే ఈటెల గెలుపు ఇప్పటికీ ఖాయం అని చెప్పేవారు. లేదంటే కరుణాకర్ రెడ్డికి మద్దతుగా అన్ని గ్రామ ప్రజలు ఒక హీరోను చేసేవారు. అడుగడుగునా భయం మరి.
నిజానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గారికీ భయమే ఉన్నది. గజ్వేల్ నియోజకవర్గంలో అతడికి అనేక రకాలుగా వ్యతిరేకత ఉన్నదని తెలుసు. ముఖ్యంగా భూములు కోల్పోయిన వాళ్ళు, ఇండ్లు వాకిళ్ళూ కోల్పోయిన వాళ్ళు, త్రిబుల్ ఆర్ ప్లాన్ లో నష్ట పోతున్న వాళ్ళు. అంతేకాదు, తన ఫార్మ్ హౌజ్ వాళ్ళ నష్టపోయిన వారు. ఇంకా చాలా రకాలు. ఇక్కడ ఈ ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణం కోసం సేకరించిన వందలాది ఎకరాల వల్లా మరో వ్యతిరేకత. వారి భూములు గుంజుకున్న కారణంగా మరో యాభై మంది కుటుంబాలూ నష్ట పోయాయి. వారూ బాధ పడుతున్నారు. ఊరు మీద ఊరు నిర్మించడానికి బలవంతంగా జాగాలు పొలాలు ఇచ్చి బాధపడుతున్నారు. ఆరు లక్షలు మొదలు పద్దెనిమిది లక్షల దాకా నష్ట పరిహారం అందుకున్నప్పటికీ ఈ ల్యాండ్ కోట్లు విలువ చేసే పరిస్థితి ఉంది. కానీ అడిగే పరిస్థితి లేదు.
ఇట్లా -ఇలాంటి బృందాలు ఎన్నో ఉన్నవి. ఒక్క మల్లన్న సాగర్, కొండ పోచంపల్లి నిర్వాసితులే కాదు, నియోజకవర్గంలో తిరిగితే అనేక రకాలుగా అసంతృప్తి పౌరులు. జీవులు. అందుకే ఎందుకైనా మంచిదని కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారాయన. కానీ కరుణాకర్ రెడ్డికి ఎటువంటి భయమూ లేదు. చంపితే చంపండి. ఉన్న ఒక్క ప్రాణం పొతే పోనీ. కానీ, తన పోరాటం వల్ల ఈ కాలనీలో నివాసం ఉంటున్న దాదాపు పద్దెనిమిది వేల ఓటర్లకు, ఈ నిర్వాసితులందరికే కాదు, నియోజకవర్గ ప్రజానీకానికి గొప్ప ఉపశమనం అంటున్నారాయన. తనవల్ల ఎవరికీ లాభం జారిగినా చాలు అనుకుంటున్నారు.
నియోజక వర్గంలో కెసిఆర్ పట్ల ఉన్న వ్యతిరేకత అంతా తనకు అనుకూలంగా షిఫ్ట్ అవుతుందని కూడా చెప్పారు. ఇంత నమ్మకం ఎందుకూ అంటే ఎదురుగా ఉన్న గ్రామ దేవత మైసమ్మను చూపించారు. “ఆ తల్లి మాకు అండగా ఉంటుంది” అని అంటూ మళ్ళీ మైకు అందుకున్నారు. “ఎవరూ భయపడకండి. ఇంకా మోసపోకండి. ఆరు లక్షలకు ఇండ్లు జాగాలు పొలాలు పశు పక్ష్యాదులను వదిలి వచ్చాం. వచ్చి ఎంత కోల్పొయామో మీ అందరికీ తెలుసు. మనకు వచ్చిన పరిహారం ఆరు లక్షలా… పదిన్నర లక్షలా అని కాదు. ఈ సమయానికి మనం పంట పొలాల్లో పని పాటల్లో ఉండేవాళ్ళం. ఎన్ని రకాల పంటలు పండించే వాళ్ళం!. ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అన్నీకోల్పోయాం. మనకు ఇచ్చింది చాలా తక్కువ. కనీసం ఇరవై లక్షల నష్ట పరిహారం ఇప్పిస్తాను. నన్ను గెలిపించండి. నిర్వాసితుల పరిహారం కోసం మీకు వెన్నంటి ఉంటాను. మన కోసం కెసిఆర్ హామీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు అసెంబ్లీ సాక్షిగా పోరాడుతాను. మన యువకులకు ఉపాధి అవకాశాలు అడుగుతాను. పిల్లలకు బడి మొదలు అన్ని సౌకర్యాలు కావాలని డిమాండ్ చేస్తాను. సాధిస్తాను. ఈ ఎన్నికలో నాకు మద్దతు ఇవ్వండి” అని మళ్ళీ చెప్పిందే చెబుతూ ఒంటరిగా ప్రచారం చేస్తున్నారు. ముందే చెప్పినట్లు, ఇక్కడ నిర్మించిన పద్నాలుగు గ్రామ ప్రజలకు అదే చెబుతూ వస్తున్నాడు. వాళ్ళంతా మౌనంగా వింటున్నారు.
ఆయన ఎవరు అంటే ఏం చెప్పాలి! ఒక రైతు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలని కెసిఆర్ అధ్వర్యంలో పోరాడిన తెలంగాణా రాష్ట్ర సమితిలో క్రియాశీలక కార్యకర్త. తెలంగాణా వస్తే బంగారు భవిష్యత్తు అని అందరిలా కలలు గన్న వ్యక్తే. “కానీ, 2018 దాకా ఊహించలేదు. నా పార్టీయే నాకు నష్టం చేస్తుందని. మా అధి నాయకుడే మమ్మల్ని తరిమేస్తాడని. తంతే ఇక్కడ పడుతానని ఊహించలేదు” అని విచారంగా చెప్పాడు. అంతలోనే ధైర్యం కూడ దీసుకొని మళ్ళీ మైకెత్తుకుని గ్రామ ప్రజలకు “భయపడకండి” అని ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు.
ఆయన ఎవరూ అంటే మరొక్క ముఖ్య విషయం చెప్పాలి. అది తన తండ్రి గురించిన విషయం. ఎటువంటి అనారోగ్యం లేకుండా ఎనభై ఏళ్ళు జీవించిన వ్యవసాయ దారుడు తన తండ్రి. పదో తరగతి దాకా చదివినా వ్యవసాయం ఇష్టం కాబట్టి ఉద్యోగం చేయకుండా సాగుమీదే జీవించిన వ్యక్తి. తమ గ్రామాలన్నీ మల్లన్న సాగర్ లో మునిగిపోతున్నాయని తెలిసి, ఒక నిర్వాసితుడిగా బ్రతకడం ఎట్లా? అని రంది పడుతూ, ఇంటిని, పశువులనూ తోటి బంధు మిత్రుల స్థితిని గురించి ఆవేదన చెందుతూ, కలవరిస్తూ కలవరిస్తూ గుండె పగిలి చనిపోయిన వ్యక్తి. ఆ దుఖం కొడుకుగా ఇతడిని పట్టి పీడిస్తోంది. “ఉన్న తండ్రిని కోల్పోయాను. కన్న ఊరును కోల్పోయాను. ఇంకా ఏం జరుగుతుంది? ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్నాను. మా అందరికి ప్రభుత్వం ఏం హామీ ఇచ్చిందో వాటన్నిటినీ సాధించేందుకు పోరాటడం నా కనీస కర్తవ్యం” అని ధృడంగా చెప్పారాయన.
అతడెవరూ అంటే మరో మాటా చెప్పాలి. అతడు మల్లన్న సాగర్ నిర్వాసితుడే కాదు, సరికొత్తగా త్రిబుల్ ఆర్ బాధితుడు కూడా. ఊర్లో ఉన్నప్పుడు అతడి చుట్టూ అందరూ భయబ్రాంతులై ఊరును  ఖాళీ చేసి ఈ కాలనీకు వస్తుంటే అతడు అక్కడే ఉన్నాడు. చుట్టూ పక్కల ఇండ్లు కూలగొడుతుంటే నిరసనగా అక్కడే చివరి దాకా ఉన్నాడు. దాంతో ఇక్కడ ఇల్లు మిస్సయ్యాడు. తర్వాత తనకు ఇల్లు వద్దు, ప్లాట్ కావాలనడంతో ప్రభుత్వం అట్లా అడిగిన వాళ్లకు ఇచ్చింది. ఆ ఇచ్చిన ప్లాటు సడెన్ గా త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్ రావడంతో అది రోడ్డుకు అటువైపున్న పౌల్ట్రీ పరిశ్రమ నడిపే భాగ్యవంతులకు, భూస్వాములకు నష్టం చేయకుండా ఇటువైపు తనకిచ్చిన ప్లాటున్న పేదల భూములున్న చోటు నుంచే వెళ్ళింది. దాంతో వాళ్ళు తక్కువ ధరకు భూములు ఇవ్వక తప్పని స్థితిలో నష్ట పోయారు. తానూ మరోసారి మోసపోయాడు. మళ్ళీ పోరాడాడు. అప్పుడు ఈ కాలనీ బయట ఒక చోట కొంత చోటు చూసి తనలా కొందరికి ఇచ్చిందట. అక్కడకు తరిమేయబడ్డాడు. ఐతే, ఇప్పుడు ఈ కాలనీలోనే వేములఘాట్ లో అద్దెకు ఉంటున్నాడు. అక్కడ ఇల్లు కట్టుకునే రోజు ఎప్పుడో తనకే తెలియదు.
మరో విషయం అత్యంత కీలకం. అతడు నిజానికి నామినేషన్ వేసేవాడు కాదు. మాకిచ్చిన హామీలు ఏమయ్యాయి అని అడిగేందుకు జిల్లా సబ్ కలెక్టర్ శ్రీనివాస్ గారిని కలిశాడట. ఆయన హేళనగా మాట్లాడటమే కాదు, ఐదేళ్ళ దాకా ఏం చేస్తున్నావని కూడా అన్నాడట. అది కరుణాకర్ రెడ్డిని మనసును గాయపరిచింది. బాగా నొప్పించింది. వెంటనే వచ్చి నామినేషన్ వేశాడట.
“సార్. మీరు కొత్తగా వచ్చారు. మమ్మల్ని ఎన్ని రకాలుగా వేధించి వెంటాడి భయ పెట్టి ఇక్కడకు తరిమేశారో మీకు ఏం తెలుసు? ఆ తరిమేసిన వ్యక్తిని పిలిపిస్తే నేను ఎన్నిసార్లు వచ్చానో, ఎన్ని విధాలుగా పోరాడానో మీకు తెలుస్తుంది. పని అయిపోగానే పంపేశారు. కానీ మేమింకా ఇక్కడే నిలబడ్డం. మరి ఆ మనిషిని పిలిపిస్తావా? అని ఆగ్రహంతో అడిగి వచ్చేశాడు. వచ్చి నామినేషన్ వేశాడట.
ఆ వ్యక్తి ఎవరో కాదు. సిద్ధిపేట కలెక్టర్ గా పని చేసిన వెంకట్రామి రెడ్డి. “ఆయన హైదరాబాద్ రింగ్ రోడ్ భూ సేకరణ చేసిన వ్యక్తి. ఆయనే మల్లన్న సాగర్ నిర్వాసితులను రకరకాలుగా మభ్యపెట్టి బెదిరించి భూసేకరణ చేసిన వ్యక్తి. ఆయనకు తెలుసు నేనెవరో? ఏం చేశానో. అతడు ఐఎఎస్ కాదు, ప్రమోటైన కలక్టర్. తర్వాత ఎంఎల్‌సిగా ప్రమోటైన వ్యక్తి. రాజ పుష్ప రియల్ ఎస్టేట్ యజమాని. ఆ వ్యక్తి ఇచ్చిన హామీలనే నేను అమలు చేయమని అడుగుతున్న…” అని చెప్పి వచ్చేశాడట.
“అతడు వెళ్ళిపోయాక కొత్తగా వచ్చిన వ్యక్తితో మళ్ళీ పోరాటం. హేళన చేస్తారు. అయినా పోరాడుతాను. హేళన చేస్తే మరింత బలపడి వస్తాను. ఎంఎల్ఎ అయి వస్తానని చెప్పి వచ్చాను. వచ్చి నామినేషన్ వేశానని చెప్పాడాయన. కాస్త దూరంలోనే ఉన్న మహాత్మా గాంధి ఇవన్నీ వింటున్నట్టున్నాడు… తనకూ ఓ కథ ఉంది…
అవును. కాస్త దూరంలో గాంధీ విగ్రహం ఉంది. అ విగ్రహం అంటే వేములగట్టు గ్రామస్థులకు ఎంతో ఇష్టమట. ఎంతో అందంగా తయారు చేపించి ప్రతిష్టించుకున్నారట. అకస్మాత్తుగా పిడుగు పడ్డట్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు వస్తుందని తెలియడంతో ఊర్లు ఖాళీ చేసేటప్పుడు ఆయన్ని వదిలి రాబుద్ది కాలేదట. అనామతం ఆ విగ్రహాన్ని ఎత్తుకొని అట్లే ఈ కొత్త గ్రామానికి తరలించుకున్నారట. తిరిగి ప్రతిష్టించుకున్నారట. “ఎందుకు ఇంత ప్రేమ?” అంటే చెప్పారాయన. “అహింసాయుతంగా స్వతంత్ర సంగ్రామంలో పరాయి పాలకులైన బ్రిటీషర్లను తరిమివేసిన మహాత్ముడాయన. మన జాతి పిత. Projected కాదు, అసలైన మహాత్ముడు, ఒకే ఒక జాతి పిత” అన్నారాయన. ఎంతో ప్రేమతో అన్నారాయన.
ఆయన మాటల్లో బాపూ అని, జాతిపిత అని కెసిఆర్ గారిని పిలుచుకునే వాళ్ళ పట్ల అంతర్లీన నిరసన, జాలి ఒకటి కానవచ్చింది. ఇంకోమాటా అన్నారు. “మమ్మల్ని తరిమిన వాళ్ళను తిరిగి తరిమే రోజు ఎప్పుడైనా రావొచ్చు. అందుకు స్పూర్తిగా ఈ విగ్రహం వేములఘాట్ లో, మా మధ్యలో నిలబెట్టుకున్నం” అని సగర్వంగా, అభిమానంగా చెప్పారాయన. చెప్పి మళ్లీ మైకు అందుకున్నారు. “ప్రియమైన గ్రామస్తులరా. భయపడవద్దు…” అంటూ మళ్ళీ చెప్పడం ప్రారంభించారాయన.

ఇంతకీ కెసిఆర్ గారు, అదే మన జాతి పిత ఇక్కడ గెలుస్తారా? అంటే చెప్పలేం. గెలవవచ్చు. కానీ ఆ ఊర్లో ఉన్న గాంధీ తాత విగ్రహం మాత్రం ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది. ముంపు నుంచి భయట పడిన విగ్రహం కదా అది. దాన్ని మళ్ళీ ఎవరూ తొలగించలేరనే విశ్వసిస్తాను…

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions