.
Subramanyam Dogiparthi ……… ప్రముఖ హిందీ గాయని ఆశా భోంస్లే పాడిన మొదటి తెలుగు సినిమా 1981 జూన్ 12న వచ్చిన ఈ పాలు నీళ్లు సినిమా . ఇది మౌన గీతం అనే ఈ పాటను దాసరే వ్రాసారు . ఈ సినిమా తర్వాత మరో ఆరు తెలుగు సినిమాలలో పాడారు ఆమె .
కధ , స్క్రీన్ ప్లే , సంభాషణలు , నటన , దర్శకత్వం వహించారు ఒక పాటతో సహా మల్టీ టాస్కర్ దాసరి … కధ పాతదే . నచ్చిన వాడి కోసం ఆస్తులు అంతస్థులను వదులుకుని రావటం , పెళ్లి అయ్యాక ఇగో సంఘర్షణలు , విడిపోవటం , పిల్లలు కలపటమో లేక మరొకటో.., చివరకు కధ సుఖాంతం కావడం .
Ads
ఈ సినిమా కధ కూడా ఇదే . కధను నడిపించే విధానం , ప్రేక్షకులకు ఆవిష్కరించే విధానం , ఇతర దినుసులను కలిపే విధానం సినిమా జయాపజయాలను నిర్ణయిస్తాయి . దాసరి మార్క్ డ్రామా పుష్కలంగా ఉన్న ఈ సినిమా స్పీడుగానే సాగుతుంది . సీతారాములు సినిమాలో కార్మికులు , యజమానులు భార్యాభర్తలు లాంటి వారని సినిమాను ముగించిన దాసరి ఈ సినిమాలో భార్యాభర్తలు పాలు నీళ్లు వంటి వారని ముగిస్తారు . మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చింది . మగవాళ్ళకు నచ్చితే ఒక టిక్కెట్టే తెగేది , ఆడవాళ్ళకు నచ్చితే రెండు టిక్కెట్లు తెగుతాయి .
ముఖ్యంగా సత్యం సంగీతం , జయప్రద గ్లామర్ సినిమా విజయానికి కారణాలు . పాత్ర రీత్యా నర్తకి అయిన హీరోయిన్ జయప్రద మీద నేనే నేనే నేనే స్త్రీ మూర్తిని అనే నృత్య గీతం చాలా బాగుంటుంది . అందమైన చిత్రీకరణ . వేటూరి పాటను చాలా బాగా వ్రాసారు . మిగిలిన మూడు పాటలు కూడా శ్రావ్యంగా ఉంటాయి .
దాసరి వ్రాసిన ఇది మౌన గీతం ఒక మూగరాగం , వేటూరి వ్రాసిన మిగిలిన రెండు పాటలు ఆశా నూరేళ్ళు పాశం మూణ్ణాళ్ళు , నాదం వేదం కాలం దైవం మూలాధారం బాగుంటాయి . నాదం వేదం పాట సాహిత్యం చాలా బాగుంటుంది .
నెగటివ్ పాత్రల నుండి పాజిటివ్ హీరో పాత్రల వైపు చేసిన ప్రయాణంలో మోహన్ బాబు తొలి సినిమాలలో ఒకటి ఇది . బహుశా దాసరి తన శిష్యుడిని పాజిటివ్ హీరోగా ప్రేక్షకులకు అలవాటు చేయాలని భావించి ఉండవచ్చు . గురువు ఆకాంక్ష మేరకు మోహన్ బాబు బాగా నటించారు . అప్పటికే పాపులర్ గ్లామరస్ హీరోయిన్ జయప్రద . చాలా బాగా నటించింది .
సినిమా ముగింపులో కోర్ట్ సీన్ ఓ ఇరవై నిమిషాల పైనే ఉంటుంది . దాసరి మార్క్ డ్రామాతో ఉంటుంది . ఇద్దరు లాయర్లలో ఒకరు దాసరి . ఇంక చెప్పేదేముంది ! చాగంటి వారు సాక్షాత్కరిస్తారు . రెండో లాయర్ ప్రభాకరరెడ్డి . ఇద్దరూ కోర్ట్ సీనుని రక్తి కట్టిస్తారు . చలం , రమాప్రభ , నిర్మలమ్మ , సువర్ణ , రావి కొండలరావు , సూర్యకాంతం , ప్రభృతులు నటించారు .
ప్రత్యేకంగా చెప్పుకోవలసింది కొడుకు పాత్రలో బేబీ సరస్వతి . గురూ గురూ అనే ఊతపదంతో బాగా నటించింది . ఆరోజుల్లో పరిచయం లేని వాళ్ళను కూడా గురూ అనటం మామూలు . కొన్నాళ్ళు అన్నా , కొన్నాళ్ళు బాసూ , కొన్నాళ్ళు బావా , మరి కొన్నాళ్ళు మామా పాపులర్ ఊతపదాలు . ఇప్పుడు బ్రో .
రామినేని సాంబశివరావు నిర్మించిన ఈ సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . జయప్రద అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . నేనే నేనే నేనే స్త్రీ మూర్తిని అనే వీడియోని మాత్రం మిస్ కాకండి . తప్పక ఆస్వాదించండి . A neat , feel good , entertainer . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article