.
ఓ వార్త చదువుతుంటే కలుక్కుంది… అది వేములవాడ కోడెల వార్త… ఒకేరోజు 8 కోడెలు మరణిస్తే గుట్టుచప్పుడు కాకుండా ఏదో వాగులో ఆలయ అధికారులు ఖననం చేయించారనే వార్త… ఎవరో రోజూ పదుల సంఖ్యలో కోడెలు మరణిస్తున్నట్టు రాశాడు… ఆ సంఖ్య అతి కావచ్చు, అబద్ధం కావచ్చుగాక, కానీ ప్రాబ్లం మాత్రం ఉంది…
నిజమే… ఆ గోశాలలు కిటకిట… వచ్చిన కోడెలు వచ్చినట్టుగా వాటిల్లోనే కుక్కుతున్నారు… భక్తుల మొక్కుల రూపంలో వందల్లో వస్తున్న వాటిని ఏం చేయాలో, ఎలా సంరక్షించాలో గుడికే తెలియడం లేదు… దీన్ని అసమర్థత అందామా..? ఓ విధానం లేకపోవడం అందామా…? అసలు ఆలయానికి పట్టింపులేనితనం అందామా..?
Ads
కొన్ని గుళ్లల్లో అమ్మవారలకు మహిళలు చీరెలు, జాకెట్ ముక్కలను, వెండి, బంగారు వస్తువులను కానుకలుగా ఇస్తుంటారు… డబ్బు సరేసరి… మరి ఆ చీరెలను ఏం చేస్తున్నాం..? వేలం వేసి మరీ అమ్ముతున్నారు కదా… మరి మొక్కు కానుకలుగా వచ్చిన కోడెలను ఏం చేయాలి…?
వేలం అవసరం లేదు, ఇలా దిక్కుమాలిన నిర్వహణతో వాటి ప్రాణాలు తీసేబదులు రైతులెవరు ముందుకొచ్చినా సరే ఆ దేవుడి పేరిట ఇస్తే, వాళ్లు పెంచుకుంటారు… సంరక్షించుకుంటారు… రాజన్న ప్రసాదంగా భావిస్తారు… అంతేకదా…
అవును, అదీ చేశారు ఆమధ్య… ఇంతకు ముందు దాదాపు 1500 కోడెలను ఇచ్చారు… అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు… అయితే కొన్ని కోడెల్ని రైతులు అమ్ముకున్నట్టు వార్తలొచ్చాయి… వాటి మీద ఎంక్వయిరీ జరుగుతోంది…
భక్త రైతులు కొంతమంది ఇక బతుకవు అనుకున్న వాటిని మొక్కు కింద వదిలిపెట్టి పోతున్నారు… గుడి వాటిపై ఎంత శ్రద్ధ చూపినా ప్రయోజనం లేకుండా పోతోంది… హిందూ సంఘాలు కొన్ని అనవసర వివాదాలకు దిగుతుండటంతో… వాళ్లను కూడా సభ్యులుగా చేసి రైతులకు ఆవులను, కోడెలను ఇచ్చారు…
ఇదొక నిత్య సమస్య… దీని ఓ పరిష్కారం కోసం ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయమే రంగంలోకి దిగింది… కొన్ని చర్యలను కూడా ఆదేశించింది… పెద్ద వాటిని, బలహీనమైన వాటిని వేర్వేరుగా ఉంచడం, పచ్చిగడ్డి అందుబాటులో ఉంచడం, సీసీ కెమెరాలు పెట్టడం, వెటర్నరీ డాక్టర్, అసిస్టెంట్లు అందుబాటులో ఉండడం, వర్షాకాలం ఇబ్బందిలేకుండా గచ్చు చేయించడం, టీకాలు ఇప్పించడం, రోగాలతో ఉన్నవాటిని క్వారంటీన్ చేయడం ముఖ్యమైన సూచనల్లో కొన్ని….
ఇప్పుడిక మరోె వివాదం ఉంది, గుడి అభివృద్ధి కోసం కొన్నాళ్లు గుడి మూసేస్తారనేది… ఎక్కడైనా సరే గుడి పునర్నిర్మాణం వేళ విగ్రహాలను బాలాలయంలో పెట్టడం ఆనవాయితీయే, శాస్త్రబద్ధమే… స్థానికులను సరిగ్గా కన్విన్స్ చేయలేకపోవడంతో ఆ వివాదం… ముఖ్య నాయకులు వచ్చినప్పుడు అడ్డగోలుగా బిల్లుల పెట్టి కోట్లు ఆరగించకుండా… ఈ గుడి గురించి కాస్త సీరియస్నెస్ ఉన్న ఉన్నతాధికారులు, పక్కా ప్రణాళికల అమలు అవసరం కనిపిస్తోంది..!!
తెలంగాణలో ప్రధాన వైష్ణవాలయం యాదగిరిగుట్ట… దానికి వందల కోట్లు పెట్టిన కేసీయార్ అంతే ప్రసిద్ధమైన ఈ వేములవాడ శివాలయాన్ని మాత్రం అస్సలు పట్టించుకోలేదు… ఈ గుడికి వందల కోట్ల అభివృద్దిని ఆలోచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఇలాంటి సమస్యల్నీ పరిష్కరించడం అవసరం… అదే సమయంలో ఎమోషన్స్, మనోభావాలు, సెంటిమెంట్లతోపాటు కాస్త ప్రాక్టికాలిటీ కూడా అవసరం భక్తులకు, నాయకులకు, అధికారులకు…
చివరగా… కోడెల్ని భౌతికంగా అలాగే తీసుకొచ్చి కట్టేయనక్కర్లేదు… చిన్నవి వెండి కోడెలను రాజన్నకు సమర్పించినా అంతే పుణ్యం, అదే ఫలితం, అది శాస్త్రహితమే అంటున్నాడు ఓ పంతులు… ఇంట్రస్టింగ్…
ఇక గుడి ఉద్యోగులు, అధికారుల అవినీతి గురించి రాయాలంటే అదొక పెద్ద గ్రంథమే అవుతుంది… ఆలయ నిర్వహణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… ఒక జూనియర్ ఐపీఎస్ అధికారిని ఇన్చార్జిగా పెట్టిచూడండి రేవంత్ సార్, ఓ పదిమందిని పీకేయడానికి సిద్దపడి… తేడా చూస్తావు..!! యాదగిరిగుట్టకు ఐఏఎస్ అధికారిని వేశారు కదా… మరి ఇక్కడెందుకు వేయకూడదు..!? ఈ మాట ఎందుకంటే..? ఈరోజు మరో ఆరు కోడెలు మరణించాయి..!!
Share this Article