.
నిజానికి ఈ తరానికి రాహుల్ గాంధీ మతమేమిటో, కులమేమిటో తెలియదు… తన అపరిపక్వ మనస్తత్వాన్ని చూస్తూ నవ్వుకోవడం తప్ప..! పొరపాటున తను ప్రధాని అయితే దేశ భవిష్యత్తు ఏమిటనే భయాందోళనలు తప్ప… థాంక్స్ టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
రాహుల్ గాంధీ కులమేమిటో, మతమేమిటో దేశవ్యాప్తంగా ఓ చర్చకు ఆస్కారమిచ్చాడు… (కావాలనే ఈ చర్చను రేకెత్తించడా అనే సందేహమూ ఉంది లెండి… తన కెరీర్ నానాజాతిసమితి… మరీ చివరకు ఆ టీఆర్ఎస్లో కూడా ఉన్నాడు కొన్నాళ్లు ఫాఫం…)
Ads
మోడీ కులం బీసీ కాదు, తను కన్వర్టెడ్ బీసీ, ఒరిజినల్గా ఓసీ తెలుసా..? అంటూ అత్యంత మేధోసంపత్తిని ప్రదర్శిస్తూ వ్యాఖ్యలు చేశాడు… అవును, రాహుల్ గాంధీ టీమ్ అంటేనే అలా అనాలోచిత వ్యాఖ్యల టీమ్ కదా… ఫాఫం రాహుల్… తనకే ఏమీ తెలియదు, తన కోటరీకి అంతకన్నా తెలియదు…ః
ఎందుకు గోకినట్టు..? బీజేపీకే అన్యాపదేశంగా ప్రయోజనం చేకూర్చడానికా..? జగ్గారెడ్డి అని ఓ దివ్య తేజస్సు కలిగిన ఓ నాయకుడున్నాడు కాంగ్రెస్లో… అంతకుముందు ఏ పార్టీయో గుర్తు లేదు… నాన్సెన్స్, హిందూ సంప్రదాయం మేరకు భర్త మతం, భర్త కులమే భార్యకూ వర్తిస్తుందీ అని… నువ్వు గొప్పోడివి జగ్గన్నా… అన్నీ నిజాలు మాట్లాడతావు…
సరే, ఆ లెక్క ప్రకారమే వెళ్దాం… రాహుల్ గాంధీ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్… (ఎన్నికలప్పుడు మాత్రమే తను, తన సోదరి గంగాస్నానాలు, జంధ్యదర్శనాలు, గుళ్ల సందర్శనలు గట్రా ఉంటాయి… అది యావత్ హిందూ సమాజాన్ని ఒకరకంగా వెక్కిరించే ఓ పిచ్చి లబ్ధి ప్రయాస…) ౌ
ఆయన తల్లి ఓ క్రిస్టియన్… సరే, రాజీవ్ గాంధీ ఆమెను పెళ్లాడాడు… ఏ దేశం వారైనా సరే, ఏ మతం వారైనా సరే ఒకసారి హిందూ మొగుడిని పెళ్లి చేసుకుంటే ఆమె మతం కూడా భర్త మతమే అనుకుందాం… (జగ్గారెడ్డి అనే ఓ అద్భుత మేధావి మాటల ప్రకారం)…
మరి రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు..? తన మతమే కదా తనకూ రావల్సింది… మరీ బండి సంజయ్ అనే మరో తిక్క కూతల నాయకుడు చెబుతున్నట్టు రాజీవ్ తండ్రి ఫిరోజ్ ఖాన్ కాదు… బండి సంజయ్ అంతకు మించి ఎదగలేడు, అది వేరే విషయం…
ఫిరోజ్ కాదు, తన పేరు ఫెరోజ్… తను ఖాన్ కాదు… తను పార్శీ… అంటే… ఒక దశలో అదే అరబ్ ముస్లిం పాలకుల మతహింసను తట్టుకోలేక ఇండియాకు వలసవచ్చిన ఓ సెక్షన్… జొరాస్ట్రియన్ జీవనవిధానం వాళ్లది… మరి తను ఖాన్ ఎలా అయ్యాడు..? బండి సంజయ్ కదా, ఎవరి మతాన్నయినా ఎందుకోలైనా మార్చేయగలడు…!!
ఫెరోజ్ గాంధీ అసలు పేరు ఫెరోజ్ ఘండీ… తన తండ్రి జహంగీర్ ఫరేదున్. ఆయన ఆ కాలంలోనే మెరైన్ ఇంజినీర్. తల్లి రతీమాయ్. వాళ్లది గుజరాతీ పార్సీ కుటుంబం… ఫెరోజ్ అన్నలు దోరబ్ జహంగీర్, ఫరీదున్ జహంగీర్. అక్కలు తెహ్మీనా, అలూ దస్తర్…
తను నెహ్రూ అభిమాని, కాదు, ఇందిర అంటే ప్రేమ… నెహ్రూ భార్య కమలా నెహ్రూకు అనారోగ్య ఎమర్జెన్సీల్లో కూడా ఆమె సేవ చేసుకున్నాడు… ఇందిరను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అన్నాడు.,.. నెహ్రూకు ఇష్టం లేదు… గాంధీని సంప్రదించాడు, నువ్వుయినా చెప్పు, వద్దని అని కోరాడు… గాంధీ కదా, వాళ్ల ఇష్టం అన్నాడు…
పెళ్లయింది… ఫెరోజ్ మరీ నెహ్రూ కుటుంబ బానిస ఏమీ కాదు… తను ఎంపీగా ఉన్నప్పుడు నెహ్రూనే ఇరుకున పెట్టే ఏదో కుంభకోణాన్ని బయటపెట్టాడు… తరువాత ఇందిరతోనూ విభేదాలు… తరువాత తన మరణం… తన ఇంటిపేరు ఘండీ… తనే గాంధీ అని మార్చుకున్నాడు, గాంధీ మీద ప్రేమతో…
సరే, ఓసారి పార్శీల గురించి చెప్పుకుందాం… భారతదేశంలో సుమారు 70 వేల మంది పార్సీలున్నారని ఇప్పటి అంచనా… వారిది జొరాస్ట్రియన్ మతం. అది ఇరాన్లో పుట్టిన మతం… అప్పటి ముస్లిం పాలకుల ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు జొరాస్ట్రియన్లు ఇరాన్ నుంచి వివిధ దేశాలకు వెళ్లారని చరిత్ర… ఆ క్రమంలో కొందరు భారతదేశానికి వచ్చారు…
పర్షియన్ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి వారిని ‘పార్సీలు’ అన్నారు. ఆ తర్వాత అదే స్థిరపడింది. వారు ‘Ahura Mazda’ (జ్ఞానానికి దేవుడు)ని పూజిస్తారు. మన దేశంలో బొంబాయి, గుజరాత్లలో ఎక్కువమంది పార్సీలు ఉన్నారు. హైదరాబాదులో కూడా పార్సీలు నివసించిన ‘పార్సీ గుట్ట’ ఉంది. పార్సీలు ఎక్కువగా వ్యాపారాలు, ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
‘Grand Old Man of India’ దాదాభాయ్ నౌరోజీ, టాటా సంస్థ అధినేత జె.ఆర్.డి.టాటా, ఇస్రో తొలి అధ్యక్షుడు జహంగీర్ బాబా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహిన్టన్. ఎఫ్.నారిమన్, నక్సలైట్ నేత కోబాద్ గాంధీ తదితరులు పార్సీలే. ఇరాన్ నుంచి వచ్చిన మతం కారణంగా వారి పేర్లలో పర్షియన్ పదాలు (ఫెరోజ్, ఫర్జాన్, నౌరోజ్, అర్షద్) ఉంటాయి…
ఫెరోజ్ గాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్బరేలీ నియోజకవర్గానికి తొలి ఎంపీ. పార్లమెంటులో హరిదాస్ ముంద్రా కుంభకోణాన్ని బయటపెట్టి, అలాంటి పనిచేసిన తొలి ఎంపీగా చరిత్రలో నిలిచారు. ఆ కుంభకోణం వల్ల తొలి ఆర్థికమంత్రి టి.టి.కృష్ణమాచారి రాజీనామా చేయాల్సి వచ్చింది. 47 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఫెరోజ్ మరణించారు…
యూదులు విపరీతంగా హింసకు, అణిచివేతకు గురైనప్పుడు ఆశ్రయం ఇచ్చి అక్కున చేర్చుకున్నది ఇండియా… ఈరోజుకూ వాళ్లకు ఆ విశ్వాసం ఉంది… అలాగే పార్శీలను కడుపులో పెట్టుకుని కాపాడింది కూడా ఇండియాయే… పార్శీలు ఏనాడూ ఇండియా వ్యతిరేక చర్యలకు పోలేదు, మా నేల అన్నట్టే ఓన్ చేసుకున్నారు…
సో, ఐతే గియితే మన పితృస్వామిక వ్యవస్థలో రాహుల్ గాంధీ పార్శీ అవుతాడు… నెహ్రూ కశ్మీరీ బ్రాహ్మిన్… బిడ్డ పార్శీ ఇంటి కోడలు… కొడుకు రాజీవ్ గాంధీ పెళ్లాడింది ఓ క్రిస్టియన్ను… సో, నానా జాతి సమితి…! పర్లేదు, ఇండియా ఆ కుటుంబాన్ని ఓన్ చేసుకుంది, కానీ అనవసరంగా గోకి రచ్చ చేసి రేవంత్ రెడ్డి బీసీ, ఓసీ అనే చర్చను లేవనెత్తి సోనియా కుటుంబానికి నష్టం చేశాడు తప్ప లాభం ఏమీ లేదు…
ఈ చర్చలో ఎవరో ఓ ప్రశ్న లేవనెత్తారు… అసలు అమిత్ షా కులం, మతం ఏమిటి అని..? జైనుడని ప్రస్తావన… నో, మేం గుజరాతీ వైష్ణవ వైశ్యులం అని తనే ఓసారి ప్రకటించాడు… సో, అనవసరంగా మోడీ కులాన్ని గెలికి రేవంత్ రెడ్డి ఈ తరానికి రాహుల్ గాంధీ కులం, మతం ఏమిటో చర్చించుకునే అవకాశాన్ని కలిగించాడు… నువ్వు గొప్పోడివి రేవంతు భయ్యా..!!
Share this Article