.
Subramanyam Dogiparthi
…… రెండు రెళ్ళు ఆరు . తన నవలకు ఈ టైటిల్ని ఎంచుకున్న మల్లాది వెంకట కృష్ణమూర్తి గారిని మెచ్చుకోవాలి . టైటిల్ వినగానే ఆసక్తి కలుగుతుంది . ప్రాధమికంగా ఆసక్తి కలిగించకలిగితే లోపల సరుకుంటే సక్సెస్ అయిపోతుంది .
జంధ్యాల గారి హాస్య సినిమాలలో ఆయనకు పేరుని , నిర్మాత పంపిణీదారులకు ప్రదర్శకులకు డబ్బులు తెచ్చిపెట్టిన సినిమా ఈ రెండు రెళ్ళు ఆరు .
రెండు రెళ్ళు నాలుగు కాకుండా ఆరు ఎట్లా అయ్యాయి అంటే… : వెంకట శివానికి (రాజేంద్రప్రసాద్) , విఘ్నేశ్వరికి (ప్రీతి) చిన్నప్పుడే పెళ్ళి అయిపోతుంది . పిల్లలిద్దరికీ చిన్నప్పుడే ఆ పెళ్లి అంటే ఇష్టం ఉండదు . ఆ తర్వాత వెంకట శివం పట్నానికి వచ్చి ఉద్యోగంలో వేరే పేరుతో ఉంటాడు . విఘ్నేశ్వరి కూడా వేరే పేరుతో పట్నంలో చదువుకుంటూ హాస్టల్లో ఉంటుంది . ఇక్కడతో ఒక రెండు .
Ads
రాజేంద్రప్రసాద్ , చంద్రమోహన్ ప్రాణ స్నేహితులు . ఒకే కంచం ఒకే మంచం . అలాగే ఇద్దరు హీరోయిన్లు ప్రీతి , రజనిలు కూడా ప్రాణ స్నేహితులు . వీళ్ళూ ఒకే కంచం ఒకే మంచం . ప్రీతి తన చిన్ననాటి ప్రీతే అని తెలియని రాజేంద్రప్రసాద్ పెద్దయిన ప్రీతిని , అలాగే రాజేంద్రప్రసాదే తన చిన్ననాటి రాజేంద్రప్రసాద్ అని తెలియని ప్రీతి ప్రేమలో పడతారు . ఇది రెండో రెండు .
ఇంతలో ప్రీతి పెదనాన్న ప్రీతిని , ప్రీతి భర్త వెంకట శివాన్ని ఇంటికి రమ్మనటంతో సినిమా కధ మొదలవుతుంది . ఒకరంటే ఒకరికి ఇష్టం లేని ప్రీతి తన స్నేహితురాలయిన రజనిని బతిమలాడి ఒప్పించి తన స్థానంలో ఊరికి పంపుతుంది . రాజేంద్రప్రసాద్ కూడా స్నేహితుడు చంద్రమోహన్ని కాళ్ళా వేళ్ళా పడి తన స్థానంలో ఊరికి పంపుతాడు .
ప్రీతి పెదనాన్న శోభనం ఏర్పాటు చేస్తారు . తెలివిగా శోభనాన్ని తప్పించుకుంటుంది . స్లోగా ఇద్దరూ ప్రేమలో పడతారు . ఇది మూడో రెండు . ఇట్లా రెండు రెళ్ళు ఆరు అయ్యాయన్న మాట .
రజని అన్నకు ఈ గోలంతా తెలవటంతో కధను కట్టేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది . చంద్రమోహన్ , రజనిల పెళ్ళిని సుత్తి వీరభద్రరావు ఏర్పాటు చేసేస్తాడు . ఈలోపు రాజేంద్రప్రసాద్ , ప్రీతిలు కూడా ఊరికి వచ్చేస్తారు . అందరూ ఒక చోటకు చేరుతారు . అప్పుడు రాజేంద్రప్రసాద్ , ప్రీతిలకు తెలుస్తుంది తామిద్దరము చిన్ననాటి తామిద్దరమే అని .
సినిమా అంతా అల్లరి , గోల . జంధ్యాల సినిమాలో పాత్రలు అలాగే డిజైన్ చేయబడతాయి కదా ! శ్రీలక్ష్మికి సంగీతం పిచ్చి .సుత్తి వీరభద్రరావుకు చొక్కాలు చించుకునే తిక్క . రాళ్ళపల్లి పలు భాషల్లో మాట్లాడే పిచ్చితో ప్రేక్షకులను కూడా కాస్త విసిగిస్తాడు .
పొట్టి ప్రసాదుకి పితా అంటూ అరిసే పిచ్చి . సుత్తి వేలుకి నాటకాల పిచ్చి . CSR లాగా కీచు గొంతు . ఈ అందరి రకరకాల పిచ్చిల తిక్కల సమాహారమే ఈ సినిమా .
ఈ సినిమాలో ఈమధ్యనే మరణించిన డా పట్టాభి రాం తళుక్కుమంటారు . ఆయన హిప్నో థెరపీ సరదాగా ఉంటుంది . సినిమా టైటిల్స్ వేయటమే వెరైటీగా ఉంటుంది . రాజేంద్రప్రసాద్ రన్నింగ్ కామెంటరీతో టైటిల్స్ పడతాయి .
ప్రీతి పెదనాన్నగా పుచ్చా పూర్ణానందం నటనను , ఆయన బుర్ర మీసాలను ప్రేక్షకులు మరచిపోలేరు . ఓ ప్రత్యేకమయిన డైలాగ్ డెలివరీ . ఇతర పాత్రల్లో కాకినాడ శ్యామల , పి యల్ నారాయణ , సాక్షి రంగారావు , డబ్బింగ్ జానకి , హరిబాబు , ప్రభృతులు నటించారు . మీనా బేబీ మీనాగా చిన్నప్పటి విఘ్నేశ్వరి పాత్రలో కనిపిస్తుంది .
రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మూడంటే మూడు పాటలే ఉంటాయి . వీటిల్లో విరహ వీణా నిదుర రాక వేగే వేళలో చాలా చాలా బాగుంటుంది . వేటూరి వారు బ్రహ్మాండంగా వ్రాసారు . జానకమ్మ చాలా శ్రావ్యంగా పాడారు . నృత్య దర్శకుడు శేషు నృత్యాన్ని అద్భుతంగా కంపోజ్ చేసారు . జంధ్యాల అందంగా చిత్రీకరించారు .
చాలామంది హాస్య ప్రియులు ఈ సినిమాని చాలా సార్లు చూసే ఉంటారు . ఎన్నిసార్లు చూసి ఉన్నా ఈ పాటను మరలా ఆస్వాదించవచ్చు . మరో రెండు డ్యూయెట్లు రండు జంటల మీద ఉంటాయి . ఒకటి కాస్తందుకో దరఖాస్తందుకో , రెండోది జోహారు పెళ్ళామా . బాలసుబ్రమణ్యం , జానకమ్మలు శ్రావ్యంగా పాడారు . ఫుల్ హాస్యంతో జంధ్యాల గారు తన శైలిలో డైలాగులను వ్రాసారు . స్పీడుగా సాగేలా స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు . ఇవివి ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ .
సినిమా యూట్యూబులో ఉంది . It’s a hilarious Jandhyala-mark entertainer . ఇంతకుముందు చూడనివారు వెంటనే చూడతగ్గ సినిమా . చూసి ఉంటే విసుగ్గా ఉన్నప్పుడు కాసేపు పెట్టుకోతగ్గ సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగు_సినిమాలు
Share this Article