.
సుబ్రహ్మణ్యం దోగిపర్తి
….. మోహన్ బాబు , రేవతి ఫుల్ అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ సినిమా ఇది . అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది యన్టీఆర్, సావిత్రిల రక్తసంబంధం సినిమాయే .
1984 జూన్లో వచ్చిన ఈ సీతమ్మ పెళ్ళి కూడా అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని , ప్రేమానురాగాలను ప్రేక్షకుల గుండెలను తాకేలా తీసారు బాపు . తమిళంలో 1978 లో హిట్టయిన ముల్లుం మలరుం (Mullum Malarum) మన తెలుగు సినిమాకు మాతృక .
Ads
తమిళంలో రజనీకాంత్ , ఫటాఫట్ జయలక్ష్మి , శోభ , శరత్ బాబులు నటించారు . రజనీకాంత్ నటనను బాలచందర్ ప్రత్యేకంగా అభినందించారట .
మన తెలుగు సినిమాలో మోహన్ బాబు కూడా బాగా నటించాడు . రేవతికి తెలుగులో ఇది మొదటి సినిమాయా లేక మానసవీణ మొదటి సినిమాయా నాకు ఐడియా లేదు . మానసవీణ ఈ సినిమా కన్నా పదిహేను రోజులు ముందు విడుదలయింది .
తల్లీదండ్రులు లేని అన్నాచెల్లెళ్ళు … చెల్లెలు రేవతిని తానే తల్లీ తండ్రి అయి అపురూపంగా పెంచుకుంటాడు మోహన్ బాబు . ఓ హిల్ స్టేషన్లో వించ్ లిఫ్టులో ఆపరేటరుగా పనిచేస్తుంటాడు . అక్కడకు వచ్చిన ఇంజనీర్ మురళీమోహన్ అంటే ఎందుకో తెలియని అయిష్టత , కోపం మోహన్ బాబుకి .
దానికి తోడు మోహన్ బాబుకి ఆవేశం , మొండితనం , కోపం జాస్తి . ఇంతలో మరో దిక్కు లేని తల్లీకూతుళ్ళు రాధాకుమారి , ముచ్చెర్ల అరుణ వీళ్ళ జీవితంలోకి ప్రవేశిస్తారు . అరుణని వదినను చేసుకోవాలని రేవతి కోరిక . ఇంతలో ప్రమాదంలో మోహన్ బాబు చేయి పోగొట్టుకుని ఉద్యోగం కూడా కోల్పోతాడు .
చెల్లెలు అభీష్టం మేరకు అరుణని పెళ్ళి చేసుకుంటాడు మోహన్ బాబు . రేవతిని పెళ్ళి చేసుకుంటానని మురళీమోహన్ ప్రపోజ్ చేస్తే అతని మీద కోపమున్న మోహన్ బాబు అంగీకరించడు . ఇంజనీరుని ఇష్టపడుతున్న రేవతికి అతనితో పెళ్ళి జరిపించేందుకు వదిన అరుణ ఏర్పాట్లు చేస్తుంది .
చెల్లెలు అన్నను వదలలేక అన్న వద్దకే వెనక్కు వస్తుంది . అన్న మోహన్ బాబే మెత్తబడి చెల్లెలు సీతమ్మ పెళ్ళిని ఆమె కోరుకున్న మురళీమోహన్ తోనే జరిపించటంతో సినిమా ముగుస్తుంది .
అన్ని సినిమాలు సందేశాలను ఇవ్వవు . మన చుట్టూ జరిగే సంఘటనలను , మన జీవితాల్లో చోటు చేసుకునే ఘటనలను ఆధారం చేసుకుని కొన్ని సినిమాలు ఉంటాయి . డాన్సులు , ఫైట్లు , పళ్ళికిలించే హాస్యం కూడా ఉండకపోవచ్చు .
జీవుల్లో ఉండే సున్నితమైన భావోద్వేగాలను చూపే ప్రయత్నం చేస్తాయి కొన్ని సినిమాలు . ఈ సీతమ్మ పెళ్లి ఆ కోవకు చెందిందే . ఎవరూ లేని ఇద్దరు అన్నాచెల్లెళ్ళ కధ .
చాలా స్లోగా గూడ్స్ బండి లాగా నడుస్తుంది సినిమా . సినిమా అంతా అన్నాచెల్లెళ్ళ ప్రేమే . మధ్యమధ్యలో వదినామరదళ్ళ సరసం , వగైరా . సెంటిమెంట్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది . తమిళంలో హిట్టయినట్లుగా మన తెలుగు సినిమా హిట్ కాలేదు . తెలుగులో కూడా మహిళా ప్రేక్షకులకు నచ్చింది . వాళ్ళే సినిమాను వ్యాపారపరంగా సక్సెస్ చేసారు .
రేవతికి సినిమా ఎక్స్ప్రెస్ వారి ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది ఈ సినిమాకు . ముళ్ళపూడి వారు డైలాగులతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు . బాపు , బాలచందర్ , విశ్వనాథ్ సినిమాలలో డైలాగులు ఎక్కువగా ఉండవు కదా ! ఉన్న ఆ కాసిని డైలాగులను ముళ్ళపూడి , జంధ్యాల వంటి వారు పొదుపుగా , అద్భుతంగా వ్రాస్తుంటారు . మహానుభావులు .
ఈ సినిమాకు సంగీతాన్ని బాలసుబ్రమణ్యం అందించారు . పాటలకు అందించిన సంగీతం కన్నా బేక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా గొప్పగా ఉంటుంది . టైటిల్స్ పడేటప్పుడే చాలా శ్రావ్యమైన బేక్ గ్రౌండ్ మ్యూజిక్కుని అందించారు బాలు . పాటలన్నీ థియేటర్లో శ్రావ్యంగా ఉంటాయి .
ముఖ్యంగా చెల్లివయినా తల్లివయినా నాకు నువ్వే అనే పాట చాలా ఆర్ద్రతతో ప్రేక్షకుల గుండెల్ని తాకుతుంది . కోనసీమలో కొంగులేసిన ఆకుపచ్చ చందమామా వదినామరదళ్ళు వాళ్ళ స్నేహితుల మీద ఉంటుంది . బాగుంటుంది . సిల్క్ స్మిత , మోహన్ బాబు , ఊరి జనం మీద చిత్రీకరించిన నా సైదోడు అంటూ సాగే పాట చాలా బాగుంటుంది .
ఓయమ్మో షాకు ఓరయ్యో షాకు డ్యూయెట్ మోహన్ బాబు , అరుణల మీద హుషారుగా సాగుతుంది . వారిద్దరి మధ్యే ఫస్ట్ నైట్ తిండి మీద డ్యూయెట్ వెరైటీగా ఉంటుంది . ఏమాయెనే తల్లీ మాణిక్యవల్లి అంటూ సాగే వదినామరదళ్ళ సరసం పాట చాలా బాగుంటుంది .
సినిమా చూడాలంటే ఓపిక ఉండాల్సిందే . నలభై ఏళ్ళ కిందనే స్లో అంటే ఇప్పుడు వాళ్ళకు వీర స్లో అన్న మాట . అయిననూ చూడతగ్గ బాపు తీసిన అన్నాచెల్లెళ్ళ అనుబంధం సినిమా . కాస్త అరవ వాసన ఉంటుంది .
పాటల వరకు వీడియో ప్రత్యేకంగా ఉంది యూట్యూబులో . సంగీత ప్రియులు అంతవరకు కూడా ఆస్వాదించవచ్చు . సినిమా కూడా ఉంది యూట్యూబులో . ఆసక్తి కలవారు వీక్షించవచ్చు .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article