.
ఎక్కడో ఏదో ఓ చిన్న వెబ్ పత్రికలో ఒక వార్త కనిపించింది… ‘‘శ్రీశైలం మహాక్షేత్రంలో కొత్త వివాదం..? “నకిలీ శంకరాచార్య” వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం, ఎండోమెంట్ శాఖకు లీగల్ నోటీసులు..!
విషయం ఏమిటయ్యా అంటే..? దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైలం క్షేత్ర పవిత్రతను దెబ్బతీస్తున్నారట… తనను తాను శంకరాచార్య, పీఠాధిపతిగా ప్రకటించుకున్న విధుశేఖర భారతి అనే వ్యక్తిపై భక్తులను మోసం చేస్తున్నారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవాదాయ శాఖకు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి… ఎందుకంటే, శృంగేరీ శారదా పీఠానికి నిజమైన శంకరాచార్యులు శ్రీభారతి తీర్థ స్వామీజీ మాత్రమే, కానీ ఈ విధుశేఖర భారతి తప్పుడు ప్రతినిధిత్వంతో భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపణ…
Ads
ఈమేరకు నోటీసులు ఇచ్చినా సరే, భ్రమరాంబిక దేవి గర్భగుడిలోకి ఆయన్ని అనుమతించి, గుడి పవిత్రతను అధికారులు దెబ్బతీశారని, ఆగమశాస్త్రాలకు ఇది విరుద్దమనీ, నకిలీ శంకరాచార్యులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం అట… సో, వెంటనే ఆ ఈవోను, అర్చకులకు సస్పెండ్ చేసి, గుడిలో సంప్రోక్షణ నిర్వహించాలని డిమాాండ్…
గతంలో రాష్ట్రపతిభవన్లో శంకరాచార్య పేరుతో వెళ్లిన తీరుపై రాష్ట్రపతిభవన్ విచారణ జరుపుతోందనీ, కర్నాటక ప్రభుత్వం కూడా వేరే విచారణకు ఆదేశించిందనీ ఆ వార్తలో ఉంది… సో, తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర దేవస్థానాలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలట…
….. ఎవరో, ఎవరి తరఫునో లీగల్ నోటీసులు ఇస్తే, అవి కేసులు కావు, తీర్పులు కావు… ఏ దేవస్థానం యాజమాన్య బోర్డు, అధికారగణానికైనా స్వీయవిచక్షణ ఉంటుంది… లీగల్ నోటీసులకు జవాబు దేవస్థానం లీగల్ కౌన్సిల్ ఇస్తుంది, ఎవరైనా ఈమేరకు కేసు పెట్టినా వాదిస్తుంది… అంతే తప్ప లీగల్ నోటీసులు ఎవరి ఆదేశాలూ కావు… నోటీసులు ఆగమ సూత్రాలు కావు, శాస్త్రాలూ కావు…
- ఇంతకీ సదరు వార్తలో నకిలీ శంకరాచార్యుడిగా చెప్పబడుతున్న విధుశేఖర భారతి ఎవరు..? ఇదీ ప్రధానం… ఆయన శృంగేరీ శారదా పీఠానికి ఉత్తరాధికారి… అంటే తదుపరి పీఠాధిపతి… ఇప్పటి నుంచే పీఠం బాధ్యతలు, సంప్రదాయాలు, పద్ధతులను నేర్చుకుని తదుపరి కాలంలో అమలు చేయాల్సిన హోదా…ఉత్తరాధికారి అంటే పీఠాధిపతికి తక్కువేమీ కాదు.., అది వారసత్వం (జెనెటిక్ కాదు, ఉత్తరాధికారి ఎంపికకూ కొన్ని లెక్కలు, ప్రమాణాలుంటాయి…) బాధ్యతల సంక్రమణ సజావుగా సాగిపోవడానికి ఇదొక ఉత్తమ పద్థతి… పైగా దేశంలోని ప్రఖ్యాత పీఠాల్లో శృంగేరీ పీఠం కూడా ఒకటి… అది తప్పు చేయదు, తప్పును అంగీకరించదు, ఆ విశ్వసనీయత ఉన్న పీఠం అది… అందుకే పలు ధార్మిక సంస్థల నుంచి అప్పుడే కౌంటర్లు పడుతున్నాయి…
– విధుశేఖర భారతి ఎంపిక పీఠాధిపతి భారతీ తీర్థ స్వామిదే… అంటే విధుశేఖర భారతిని నకిలీ శంకరాచార్యులు అని దూషిస్తే అది సాక్షాత్తూ పీఠాధిపతి నిర్ణయాన్ని, విచక్షణను, ఎంపిక తీరును కించపరిచినట్టే అవుతుంది…
ఈ వివాదాన్ని కెలుకుతున్నది తనను తాను “బదరి జ్యోతిర్మఠ, ద్వారకా శారదా పీఠ బ్రహ్మలీన జగద్గురు శంకరాచార్యుల దీక్షా శిష్యుడిని” అని చెప్పుకుంటున్న వ్యక్తి అట… అసలు అధికారిక గుర్తింపు లేకపోయినా బ్రహ్మలీన మహాస్వామి పేరును వాడుకుంటూ భక్తులను వంచించే వ్యక్తి శృంగేరీ పీఠం ఎంపికను ప్రశ్నించడం విద్వేషం, విషవ్యాప్తి తప్ప మరొకటి కాదని పలు హిందూ సంఘాలు వేస్తున్న కౌంటర్ల సారాంశం..!!
Share this Article