.
సీ. నారాయణరెడ్డి గుర్తుండి పోయేట్టు నాకు తెలియవచ్చింది (అప్పటికి కొన్ని సినిమా పాటలు మాత్రమే విన్నాను) ఆయన “పీహెచ్.డీ. “ఆధునికాంధ్రకవిత్వం సంప్రదాయములు ప్రయోగములు”. తరువాతి నాళ్లలో దానిపైనే పీహెచ్. డీ. వచ్చింది!
కొన్ని వాస్తవ పరిస్థితులు తెలిశాక నాకు పీహెచ్.డీ. లన్నా , ఎమ్. ఫిల్ ల్లన్నా హాస్యాస్పదమై పోయింది; రోత కలిగింది. కానీ ఈ ఆధునికాంధ్రకవిత్వం సంప్రదాయములూ ప్రయోగములు అందుకు మినహాయింపు. తెలుగులో వచ్చిన గొప్ప పీహెచ్.డీ. అది.
Ads
“అంతకడివెడు పాలపై
ఒక్కింత మీగడ పేరినట్లు
మనకు మిగులును
గతము లోపలి మంచి
అదియే సంప్రదాయము”
సీ. నారాయణరెడ్డి ఈ మాటలు నాకు ఆయనపై గౌరవాన్ని కలిగించాయి.
అటు తరువాత ఆయన నాగార్జున సాగరం చదివాను.
“ఆమె చలించెను ఆమని పోలిక” అనీ “ప్రకృతిలోని ప్రత్యణువున / పరమాద్భుత శోభాన్విత/ సౌందర్యము నిర్లిప్త / స్థితిలోన నిద్రించును” అనీ ఆయన అందులో అనడం నాకు నచ్చాయి. అందులో ఉపమలు కొన్ని చాలా బావుంటాయి.
కృష్ణానదీ వర్ణన, చీకట్లు కమ్మడం విడిపోవడంపై ఆయన రాసింది నాకు నచ్చింది. అటు తరువాత కర్పూర వసంతరాయలు … అందులో “కాల విహంగమ రాజము / రేయి పవళ్లనెడు వింత / రెక్కలెత్తి దిక్కుల బడి / రివ్వు రివ్వున ఎగసిపోయె” అనీ, “అతి ధావన పరిశ్రాంతమై / సూర్యుని అశ్వ సప్తకము / నెత్తురు గ్రక్కెననగ / కడ సందియ యెఱ్ఱ వారె” అనీ అనడమూ నాకు నచ్చిన వాటిలో కొన్ని.
అటు తరువాత విశ్వంభర, కొన్ని ఇతర రచనలు చదివి ఆనందించాను. మాత్రాఛందస్సుల్లో కథాకావ్యాలను రాయడం ఆయన ప్రత్యేకత. దాశరథికన్నా , సామల సదాశివ కన్నా ముందే రుబాయీ రూపంలో తెలుగు రచన నారాయణరెడ్డి చేశారు. సాక్షి దినపత్రికలో రుబాయీపై రాస్తూ ఈ విషయాన్ని తెలియజేశాను.
సినీ గేయకవిగా మంచి పాటలు రాశారు నారాయణరెడ్డి. సుమారు 2,000 సినిమా పాటలు రాశారు. శివాజీ గణేసన్ తమిళ్ష్ కర్ణ సినిమా తెలుగు డబ్బింగ్ ఆయన రాశారు. ఎంతమాత్రమూ తమిళ్ష్ కణ్ణదాసన్ భావాలను తీసుకోకుండా రాయడం విశేషం. కణ్ణదాసన్ “కంటికి కులమేది?” అని అంటే నారాయణ రెడ్డి “గాలికి కులమేదీ?” అన్నారు.
మొగుడా పెళ్లామా? (1975) సినిమాలో “పరమశివుడి మెడలోని పాము అన్నది గరుడుడా క్షేమమా?…” పాట కూడా తమిళ్లో కణ్ణదాసన్ రాసిన పాటే. మెదటి పంక్తి మినహాయింపుగా నారాయణ రెడ్డి కణ్ణదాసన్ ను తీసుకోలేదు.
అక్బర్ సలీం అనార్కలి సినిమాలో “తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులాగా నవ్వుతుంటే ఏం చేయను?…” అన్న గజల్ రాశారు. తెలుగు సినిమాలో వచ్చిన తొలి గజల్ అది. అదే సినిమాలో నాయిక పాత్రకు కొన్ని షేర్ లు రాశారు.
“ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు…” అన్న ‘నారాయణరెడ్డి గజల్’ సంసారం ఓ సంగీతం చిత్రంలో పీ. సుశీల గళం ద్వారా వినిపించింది. ఈ గజల్ ద్వారా పీ. సుశీల తొలి తెలుగు గజల్ గాయని అయ్యారు.
అంతర్జాతీయ పాఠకుల కోసం ఒక అంతర్జాతీయ వేదికపై కొన్నేళ్ల క్రితం నేను ఇంగ్లిష్ లో నారాయణరెడ్డి గజళ్ల(ని రాసిన వాటి)పై రాశాను. ఆ సందర్భంగా ఆయన తెలుగు గజళ్ల లోని కొన్ని పాదాలను ఇంగ్లిష్ లోకి అనుభాష చేశాను. ఇలా తెలుగులో గజళ్లని వచ్చిన పంక్తులు కొన్ని ఇంగ్లిష్ లోకి వెళ్లాయి. నారాయణరెడ్డి పరంగా ఇతరులు చెయ్యనిది నేను చేసినది ఇదే.
నారాయణరెడ్డి ప్రపంచపది ఒక నిజమైన కవితా ప్రక్రియ. ముఖమ్మస్ అనే ఫార్సీ ప్రక్రియలో ఒక మార్పు చేసి ప్రపంచపది అన్నారు. ఇవాళ తెలుగులో “నేను కొత్త ప్రక్రియను సృష్టించాను”, “ఇది నా ప్రక్రియ” అంటూ అప్రక్రియల్తో కనీసపు తెలివి, తెలివిడి లేకుండా, చివరికి వాక్యం కూడా లేకుండా విదూషకత్వంతో, మానసిక వైకల్యంతో తెలుగునే నవ్వులపాలు చేస్తున్న వాళ్లు ఈ ప్రపంచపది అన్న నిజమైన ప్రక్రియను గమనించాలి.
ఇకనైనా సిగ్గుపడి తలవంచుకుని అవతలకు వెళ్లి తమ మానసిక రోగాల్ని నయం చేసుకోవాలి.
నారాయాణ రెడ్డి ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు ప్రయోగములు ఒక ఎత్తు, ఇతర రచనలు ఒక ఎత్తు, విశ్వంభర ఒక ఎత్తు, చలనచిత్ర గీతాలు ఒక ఎత్తు , ప్రపంచపదులు ఒక ఎత్తు. ముక్తక సంప్రదాయంలో ఈ ప్రపంచపదులు మంచి రచనలు.
“సముద్రానికి చమురు పూస్తే జిడ్డుపడుతుందా?
హిమనగానికి బొగ్గుపూస్తే నల్లబడుతుందా?
తలుపులూ కిటికీలూ ఎంతగ మూసుకుని ఉన్నా –
తరుముకొచ్చే కాల వాహిని తిరిగి పోతుందా?
ముసురుకొచ్చే ముదిమి తన వల విసరకుంటుందా?” సినారె రాసిన ఒక ప్రపంచపది ఇది.
నారాయణరెడ్డి ముక్తక ధోరణిలో ద్వపదలు అనీ కొన్ని రాశారు. వాటిల్లోనూ మంచి రచనలు ఉన్నాయి.
తెలుగు సాహిత్యానికి నారాయణరెడ్డి చేసిన అత్యంత హాని గజల్. ఆయన గజల్ అని రాసిన నాసిరకం రచనలవల్ల తెలుగులో గజల్ పేరుతో విదూషకత్వమూ, వికారమూ వ్యాపించింది; తెలుగు భాషకే పెను దెబ్బ తగిలింది.
నారాయణ రెడ్డి కులవాద, మతవాద కవిత్వం అని ఏ ఉన్మాదాన్నో వాంతి చెయ్యలేదు. నేను మతవాదిని, కులవాదిని అని ఇవాళ సిగ్గులేకుండా చెప్పుకుంటున్న కవినామధూర్తులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన దగ్గఱ నుంచి ఈ విషయాన్ని తీసుకోవాలి.
తన కాలానికే సాహిత్యంలో చదువు, ప్రజ్ఞ ఉన్నవాళ్లు లేకుండా పోతూండడాన్ని సరిగ్గా పసిగట్టారు నారాయణ రెడ్డి. తన కాలం తరువాత సాహిత్యంలో పెద్దగా నాణ్యత ఉండదు అని గ్రహించి తాను నిలబడడానికి ఒక తేలికైన మార్గాన్ని ఎంచుకున్నారు ఆయన.
సహజంగానే నాసిరకంవాళ్లైన ఎమ్.ఎ., ఎమ్.ఫిల్., పీహెచ్.డీ. ల వాళ్లను, తెలుగు అధ్యాపకుల్ని బాగా మచ్చిక చేసుకోవడమే ఆ మార్గం. అందుకే ఆయన ప్రజల్లోకన్నా నాసిరకంవాళ్లైన ఎమ్.ఎ., ఎమ్.ఫిల్., పీహెచ్.డీ.ల వాళ్లు, అధ్యాపకుల మధ్యలోనూ, వాళ్ల కారణంగానూ నిలబడి ఉన్నారు.
ఉన్నంత వరకూ ఉన్న ప్రభ లేదా పనిగట్టుకుని సంపాదించుకున్న ప్రభ లేదా పరిగణన నారాయణరెడ్డి పోయాక క్రమక్రమంగా వెలిసిపోతోంది అని సరైన, నిజాయితీ ఉన్న పరిశీలకులు తెలియజేస్తున్నారు. ‘కవిగా నారాయణరెడ్డి పలచబడిపోతున్నారు’ అనీ, నాణ్యమైన కవి దాశరథి ఇటీవల పునర్నవాన్ని పొందుతున్నారు అని తెలియవస్తోంది. విశ్వనాథ సత్యనారాయణ ఎప్పుడో నారాయణరెడ్డి కన్నా దాశరథి గొప్ప అని చెప్పింది ఇప్పుడు స్పష్టమౌతోంది!
లబ్ద్యర్థం నారాయణరెడ్డి ఆడిన ముందు మాటల ప్రహసనం, సభలకు రావడం అందరికీ తెలిసినదే. ఇది తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన మరో హాని అని కొందరు గట్టిగానే చెబుతున్నారు.
‘నాణ్యత’ అన్నది ముఖ్యం. నాణ్యత తక్కువై తెరవెనక ప్రయత్నాలతో వచ్చిన రాణింపును ఒక దశ తరువాత కాలం కొట్టిపారేస్తుంది అన్న పరిణామానికి నారాయణరెడ్డి మరో ఋజువు కాబోతున్నారా? గత కొంత కాలంగా తగ్గిపోతున్న కవి అన్న పరిగణన మరో పదేళ్ల తరువాత నారాయణరెడ్డికి పూర్తిగా లేకుండా పోతుందా?…….. [[ రోచిష్మాన్ 9444012279 ]]
Share this Article