.
Subramanyam Dogiparthi…. జలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా , కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా , మిలమిల మెరిసిన తార మిన్నులు వీడిన సితార . ‘ల’లను నర్తింపచేసారు వేటూరి .
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి . వెన్నెల పైట వేయటం !! అలా పైట వేయించటం వేటూరికే సాధ్యం . సాగరసంగమం కోసం వ్రాసుకున్నారట . ఈ సితార సినిమాలో తళుక్కమంది .
Ads
శంకరాభరణం , సాగరసంగమం వంటి కళాఖండాలు తీసిన ఏడిద నాగేశ్వరరావు గారి పూర్ణోదయా బేనరుపై వచ్చిన ఈ సితార సినిమా మరో క్లాసిక్ గా నిలిచిపోయింది . సంగీత సాహిత్య నాట్య సమ్మిళితం ఈ సితార .
వేటూరి పాటలు , ఇళయరాజా సంగీతం , యం వి రఘు ఫొటోగ్రఫీ , శేషు నృత్య దర్శకత్వం , వంశీ సృజనాత్మక దర్శకత్వం , భానుప్రియ కళ్ళు , నవ్వు , నాట్య ప్రావీణ్యం సినిమాను ఓ musical visual splendour గా తీర్చిదిద్దాయి .
చతుర నిర్వహించిన నవలల పోటీలలో బహుమతి పొందిన వంశీ రచించిన మహల్లో కోకిల నవల ఆధారంగా ఈ సినిమాను తీసారు . వంశీకి ఇది రెండో సినిమా . అద్భుతంగా చిత్రీకరించారు . బాపు+విశ్వనాధ్ = వంశీ . బాపు లాగా ప్రకృతే కేన్వాసుగా , విశ్వనాథ్ లాగా సంగీత సాహిత్య నాట్యాలను మిళితం చేసి , ఓ గొప్ప సినర్జీని వండారు .
స్వయంగా శాస్త్రీయ నృత్యకారిణి అయిన భానుప్రియ చేత నృత్య దర్శకుడు శేషు అద్భుతమైన నృత్యాలను చేయించాడు . మొదటి సినిమా అయినా భానుప్రియ పరిపక్వతతో నటించింది . దక్షిణ భారత చిత్ర రంగానికి లభించిన అందాల భరిణ . అధి‘నేత్రి’…
ప్రధానంగా చెప్పుకోవలసింది పాటలు , నృత్యాలు . పగటి వేషగాళ్ళ బృందంలో సభ్యుడిగా రాజా గారి అంతఃపురం ముందు సుమన్ నృత్యాలు సూపర్బ్ . సువర్ణతో కలిసి సుమన్ నృత్యించిన నృత్యాలు ఫ్రేంలో ఉన్నది సుమనా కమల్ హాసనా అని అనిపిస్తుంది . సాగరసంగమంలో కమల్ హాసనే గుర్తుకొస్తాడు .
అచ్యుతమంత్రం అపురూపం అంటూ సాగే ఆ పాటను వేటూరి ఎంత గొప్పగా వ్రాసారో ! వెన్నెల్లో గోదారి అందం అది కన్నుల్లొ కన్నీటి రూపం పాట మరో శ్రావ్యమైన పాట . ఈ పాటకే జానకమ్మకు జాతీయ స్థాయిలో అవార్డు కూడా వచ్చింది . కుకుకూ కోకిల రావే డ్యూయెట్ సుమన్ , భానుప్రియల మీద చాలా బాగుంటుంది . నీ గానం మృదుమధురం పావనం మరో శ్రావ్యమైన పాట .
ఈ సినిమా ఘనవిజయానికి ప్రధాన కారణాలు పాటలు , నృత్యాలు , లోకేషన్లు . సినిమా కధకు ఎలాంటి కోట కావాలో కరెక్టుగా అలాంటి పాతబడ్డ కోట దొరకటం కూడా కలిసొచ్చింది . వెంకటగిరి దగ్గర పాతబడ్డ కోట అట . కోటకు సంబంధించిన సీన్లన్నీ అక్కడ తీసి మిగిలిన సినిమా అంతా గోదావరి ప్రాంతంలో షూటింగ్ చేసారు .
భానుప్రియ , సుమన్ల తర్వాత అభినందించవలసింది శరత్ బాబునే . చాలా గొప్ప పాత్ర లభించింది . చినిగిపోయిన చొక్కాను , దారిద్య్రాన్ని కప్పిపుచ్చుకునేందుకే కోటు వేసుకునే బతికి చెడ్డ రాజా వారిగా , ఫ్రస్ట్రేషన్లో చిలకల్ని హింసించే సేడిస్టుగా , మంచితనాన్ని పూర్తిగా పోగొట్టుకోలేని మనిషిగా ఆత్మహత్యే కరెక్ట్ అనుకునే పాత్రలో శరత్ బాబు ప్రేక్షకులు మరచిపోలేని నటనను ప్రదర్శించాడు .
మరో ముఖ్య పాత్ర శుభలేఖ సుధాకరిది . కధానాయికకు స్నేహితుడిగా , సంరక్షకుడిగా బాగా నటించాడు . మరో ముఖ్య పాత్ర సువర్ణది . సుమన్ తో సమానంగా నర్తించింది . ఇతర పాత్రల్లో సాక్షి రంగారావు , రాళ్ళపల్లి , ప్రభాకరరెడ్డి , మల్లిఖార్జునరావు , జె వి సోమయాజులు , ప్రభృతులు నటించారు .
సినిమా విడుదలయిన మొదటి వారం పది రోజుల్లో శంకరాభరణం లాగానే నిరుత్సాహ పరిచిన ఈ సినిమా word of mouth ప్రచారంలో ఘనవిజయం సాధించింది . 12 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . రష్యాలో కూడా రిలీజయింది . జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు పొందింది .
విశ్వనాథ్ కళాఖండాలయిన శంకరాభరణం , సాగరసంగమం , స్వర్ణ కమలం , సిరివెన్నెల సినిమాల సరసన పీట లభించింది ఈ సితారకు . బహుశా మాతరంలో చూడనివారు ఎవరూ ఉండరు .
ఈతరంలో ఎవరయినా ఉంటే అర్జెంటుగా చూసేయండి ఈ శ్రవణ దృశ్య కావ్యాన్ని . యూట్యూబులో ఉంది .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article