.
Subramanyam Dogiparthi …… నాలుగు జంటల సంసారపక్ష సినిమా 1988 మార్చిలో వచ్చిన ఈ స్టేషన్ మాస్టర్ సినిమా . ప్రేక్షకుల నాడి తెలిసిన కోడి రామకృష్ణ దర్శకత్వంలో రావు గోపాలరావు సమర్పణలో వచ్చిన ఈ సినిమా కూడా మహిళల మెప్పు పొందిన సినిమా .
వాళ్ళు మెచ్చితే హిట్టేగా మరి . ఈ సినిమాలో కుర్ర హీరోలు ఇద్దరున్నా అసలు హీరో ట్రబుల్ షూటర్ పాత్రలో నటించిన రావు గోపాలరావే .
Ads
జుట్టున్న అమ్మ ఏ కొప్పయినా పెడుతుంది . కధంటూ ఉంటే ఎటయినా తిప్పొచ్చు . టైటిల్సులో కధ క్రెడిట్ R J R యూనిట్టుకి ఇచ్చారు . బహుశా రావు గోపాలరావు , కోడి రామకృష్ణ కూర్చోని నేసి ఉంటారు . కధ నీటుగా ఉంది . అదేందంటే :
ఇద్దరు అనాధ నిరుద్యోగులు మారుమూల ఉన్న ఓ చిన్న రైల్వే స్టేషన్లో టిక్కెట్లు లేకుండా దిగేస్తారు . స్టేషన్ మాస్టారికి కబుర్లు చెప్పి ఆయన ఇంట్లోనే తిష్ట వేస్తారు . మాస్టారు , ఆయన భార్య బంగారు మనుషులు , దయార్ద్ర హృదయులు . ఆ ఇద్దరినీ స్వంత బిడ్డలుగా ఆదరిస్తారు .
దగ్గరుండి ఆ ఊళ్ళోనే స్నేహితులుగా ఉన్న ఇద్దరు ముద్దుగుమ్మలకు ఇచ్చి పెళ్ళిళ్ళు జరిపిస్తారు . రెండు జంటల జీవితంలో లుకలుకలు , గొడవలు , వగైరా . స్టేషన్ మాస్టారు ట్రబుల్ షూటర్ అవతారం ఎత్తి రెండు జంటల రైళ్ళను పట్టాలు ఎక్కించి జండా ఊపుతాడు . అందరూ కలిసి కంచికి రైల్వే ట్రాలీలో బయలుదేరటంతో సినిమా సుఖాంతం అవుతుంది .
అసలుసిసలైన ఫీల్ గుడ్ మూవీ . రావు గోపాలరావు , అన్నపూర్ణ జంట చాలా చక్కగా , ఆదర్శ దంపతులు లాగా బాగా ఉంటుంది . ఇద్దరూ చక్కగా నటించారు . కుర్ర జంటలు : రాజేంద్రప్రసాద్ , అశ్విని ఒక జంట , రాజశేఖర్ , జీవిత మరో జంట . బాగుంటాయి జంటలు .

మరో ముఖ్య జంట సుత్తి వేలు , వయ్యారాల వై విజయ . వై విజయకు పాజిటివ్ పాత్ర . ఏ పాత్రయినా అదరగొట్టేస్తుంది అనుకోండి . ఇతర ప్రధాన పాత్రల్లో పి ఆర్ వరలక్ష్మి , సుత్తి వీరభద్రరావు , బట్టల సత్యం , చిడతల అప్పారావు , అనిత , రాళ్ళపల్లి , చిట్టిబాబు తదితరులు నటించారు .
రైల్వే స్టేషన్ నేపధ్యంలో మనకు చాలా సినిమాలే ఉన్నాయి . వెంటనే గుర్తొచ్చేవి సీతామాలక్ష్మి , బంగారు బాబు , తూర్పు వెళ్ళే రైలు . ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్ నేపధ్యమే . అరకు ప్రాంతంలో షూట్ చేసినట్లుగా ఉంది . లోకేషన్లు బాగుంటాయి .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో శ్రావ్యంగా వినిపిస్తాయి . టైటిల్సుతో రన్నయ్యే గాంగోళ్ళమండి బాబో గాంగోళ్ళమండి అంటూ బాగుంటుంది . కొట్టరా చప్పట్లు కొట్టరా అనే హుషారయిన పాట రాజేంద్రప్రసాద్ , రాజశేఖర్ల మీద చిత్రీకరించబడింది . ఈ పాట కూడా హుషారుగానే ఉంటుంది .
రెండు జంటల మీద పాటలన్నీ బాగుంటాయి . పరుగులు తీసే వయసుంటే ఉరకలు వేసే మనసుంటే బ్రతుకే ఒక రైలు బండి అంటూ సాగే పాట రెండు జంటలు రైల్వే ట్రాలీ మీద పోతూ ఉంటుంది . ఉడుకు ఉడుకు ముద్దు ముద్దు , సయ్యాటకు అంతా రెడీ కాస్త హాటుగా ఉంటాయి . ఎక్కడకోయీ పయనం ఏ దిక్కునకోయీ గమనం అంటూ సాగే విషాద గీతం శ్రావ్యంగా సాగుతుంది .
పాటల్ని సి నారాయణరెడ్డి , సిరివెన్నెల వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , నాగోర్ బాబు ఆ పాటల్ని పాడారు . గణేష్ పాత్రో డైలాగులను వ్రాసారు . సినిమా యూట్యూబులో ఉంది . It’s a feel good , sentimental , neat movie . ఇంతకుముందు చూసి ఉండకపోతే చూడండి . చూడబులే .
నేను పరిచయం చేస్తున్న 1186 వ సినిమా #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాలు
Share this Article