Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇప్పుడు జరిగేదంతా అదానీకే నయం…! ఇదీ ఆర్థికకోణం, అసలైన పరిశీలన..!!

February 25, 2023 by M S R

అదానీ పని అయిపోయినట్టే… 12 లక్షల కోట్ల మేరకు నష్టపోయాడు… ఇక ఏ బ్యాంకూ తనను సపోర్ట్ చేయదు… వరల్డ్ నంబర్ 3 గా ఎదిగిన ఆయన, తన వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలినట్టే భావించాలి… ఇక కోలుకోవడం కష్టం… బ్యాంకుల్ని మోసగించాడు… ఈ దేశాన్ని మోసగించాడు…. ఈ దెబ్బకు మోడీ వెన్ను కూడా విరిగినట్టే….. ఇలాంటి వ్యాసాలు, అభిప్రాయాలు, విమర్శలు, విష విషెస్ రోజూ చదువుతున్నాం కదా….. కానీ అదానీని వేరే కోణంలో పరిశీలిస్తూ, ఆర్థిక కోణంలో విశ్లేషించే అభిప్రాయాలు చాలా తక్కువగా కనిపించాయి…

‘‘ఒక రాజకీయ నాయకుడి ప్రోద్బలంతో ఒక వ్యక్తి ఒక బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నాడు… దుకాణం తెరిచాడు… కానీ అది నామ్‌కేవాస్తే… వ్యాపార నిర్వహణ చేతగాక  ఆ దుకాణం దివాలా తీసింది… బ్యాంకుకు అప్పు మిగిలింది… కానీ సదరు రుణగ్రహీత బాగానే ఉన్నాడు…’’ ఇలాంటివాళ్ల సంఖ్య మన దేశంలో అపారం… కానీ అదానీ ఆ టైపు కాదు… తను అడుగుపెట్టిన ఫీల్డ్స్‌లో ఉన్నత ప్రమాణాల్ని సాధిస్తున్నాడు… తనకు వ్యాపారం తెలుసు… రుణాల్ని ఎలా వినియోగించాలో తెలుసు… అఫ్‌కోర్స్, తన విస్తరణలో భాగంగా మోడీ అండ తీసుకుని కొందరిని బెదిరిస్తున్నాడు, పక్కకు తప్పిస్తున్నాడు… అత్యంత బలమైన ప్రపంచస్థాయి ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించే దిశలో తప్పులూ చేస్తున్నాడు… అయితే…

షేర్ మార్కెట్‌లో కరెక్షన్స్ చాలా సహజం… డొల్ల కంపెనీలు, బ్యాంకు అప్పులు, పార్టీల సపోర్టు లేని పెద్ద కంపెనీని చూపించండి ఇండియాలో… చివరకు ఇంత మాట్లాడుతున్న సీపీఎం కూడా టెన్ టీవీ విషయంలో చేసింది ఏమిటి..? అది ఇంకా ఘోరం కదా, కూలీనాలీ చేసుకునే కార్యకర్తలు, అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేసింది… సో, మరో కోణంలో ఆలోచిస్తే అదానీకే ప్రస్తుత పరిణామాలన్నీ ఉపయుక్తం… తనను తాను కరెక్ట్ చేసుకుంటాడు… అదొక ఫీనిక్స్… కానీ ఆర్థిక కోణంలో అదానీని సరిగ్గా విశ్లేషించేది ఎవరు..? అదానీని మోడీ కోణంలో చూడటం కరెక్టు కాదు… అదానీని ఓ వ్యాపారిలాగే చూడాలి… అదెందుకు జరగడం లేదు..? ఈ ప్రశ్నలకు ఎకనామిక్ టైమ్స్‌లో ఓ వ్యాసం జవాబుగా కనిపించింది…

Ads

స్వామినాథన్ అయ్యర్ ఒక ఆర్థికవేత్త మరియు కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సోదరుడు… వామపక్ష భావజాలం గల వ్యక్తి… అమెరికా ఆర్ధిక విషయాలపైనా రీసెర్చ్ చేసి, ప్రపంచ బ్యాంకుకు అప్పుడప్పుడు సలహాదారుగా వ్యవహరించారు. ఫైనాన్సియల్ మేగజైన్స్ కి ఆర్ధిక విషయాలపై వ్యాసాలు రాస్తూ వుంటాడు. ప్రస్తుతం ఎకనామిక్స్ టైమ్స్ కన్సల్టింగ్ ఎడిటర్… మోడీ విధానాలను నిశితంగా విమర్శిస్తూ, తరుచుగా వ్యాసాలు రాస్తూ వుంటాడు… నిన్న ఎకనామిక్ టైమ్స్ పేపర్ లో ఒక భిన్నమైన కోణంలో వ్యాసం రాశాడు… అసలు ఓ లెఫ్ట్ ఓరియెంటెడ్, నాన్-మోడీ పర్సనాలిటీ నుంచి, అదీ సబ్జెక్టు నిపుణుడి నుంచి ఈ తరహా వ్యాసం రావడం విశేషం… పెద్ద వ్యాసమే… కానీ ఇంట్రస్టింగ్ యాంగిల్… https://m.economictimes.com/…/articleshow/98161215.cms
మిత్రుడు Chada Sastry దాన్ని తెలుగులోకి అనువదించాడు… కొన్ని ముఖ్యాంశాలు……… “హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆదానికి రహస్యంగా వచ్చిన ఒక ఆశీర్వాదంగా భావించవచ్చు”… 2006లో, నేను కాటో ఇన్‌స్టిట్యూట్ కోసం గుజరాత్ కొత్త పోర్ట్-బేస్డ్ డెవలప్‌మెంట్ వ్యూహంపై పరిశోధన చేసి, ఒక పేపర్ రాశాను. ఈ వ్యూహం 1990ల ప్రారంభంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్ ద్వారా ప్రారంభించబడింది. ఆ తరువాత బిజెపి వారు ఆ వ్యూహాన్ని విస్తరించారు.
నేను గౌతమ్ అదానీ యొక్క కొత్త ముంద్రా పోర్ట్‌ని సందర్శించాను. దాని అధిక ఆటోమేషన్ మరియు వేగాన్ని చూసి ఆశ్చర్యపోయాను. షెడ్యూల్‌ టైంలోగా అన్‌లోడ్ చేయని ఏదైనా ఓడకు ఇది నష్టపరిహారం ఇస్తుందని విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. 1990లో ముంబైలో పని చేస్తున్నప్పుడు, ఓడరేవు ప్రవేశం కోసం ఓడలు 20 రోజులు కూడా వేచి ఉండటాన్ని చూశాను. కాబట్టి, ముంద్రా పోర్ట్ వేరే గ్రహంలో ఉన్నట్లు అనిపించింది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ అదానీ కంపెనీలలో భారీ ధరల రిగ్గింగ్ మరియు మోసాన్ని ఆరోపించింది. ఆ ఆరోపణలు తీవ్రమైనవి. గ్లోబల్ ఇన్వెస్టర్లు అదానీ షేర్లను తొలగించారు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలి. నేను దీనికి సంబంధించిన భిన్నంగా చూడదలిచాను. అదానీ యొక్క విమర్శకులు అతను నైపుణ్యాల ద్వారా కాకుండా తారుమారు మరియు రాజకీయ అనుకూలతలతో ధనవంతుడు అయ్యాడని, హాయిగా గుత్తాధిపత్యంలో డబ్బు సంపాదించాడని చెపుతున్నారు. ఇది నేను ఒప్పుకోను. అసాధారణమైన వ్యాపార నైపుణ్యాలు లేకుండా రెండు దశాబ్దాలలో నిరాడంబరమైన మూలాల నుండి ప్రపంచ నంబర్ 3కి వెళ్లడం అసాధ్యం.
ఓడ రేవులు, గనుల నుంచి విమానాశ్రయాలు, ట్రాన్స్‌మిషన్ లైన్ల వరకు అదానీకి విలువైన ఆస్తులను బీజేపీ ‘ఇస్తోందని’ విమర్శకులు ఆరోపిస్తున్నారు. కాదు.. కచ్ ఎడారిలో రైలు కనెక్టివిటీ కూడా లేకుండా ఒక మైనర్ పోర్టును నిర్వహించే హక్కును ప్రభుత్వం మొదట్లో అదానీకి ఇచ్చింది. ఈ ఎడారి ప్రాంతాన్ని భారతదేశపు అతిపెద్ద ఓడరేవుగా మార్చడం ఒక అద్భుతం.
మార్స్క్ మరియు డుగ -భాయి వంటి ప్రపంచ నెంబర్ వన్ ఇన్ఫ్రా దిగ్గజాలను ప్రపంచ వేలం పోటీలో ఎదుర్కొని అదానీ గ్రూప్ డజను ఇతర ప్రదేశాలలో పోర్టులు, జెట్టీలను కూడా కొనుగోలు చేసింది. అతను సాటిలేని భారతదేశపు అగ్రశ్రేణి పోర్ట్ ఆపరేటర్, ఇప్పుడు మొత్తం భారతీయ సరుకు రవాణాలో పావు భాగాన్ని నిర్వహిస్తున్నాడు. దీనివల్లే అతను జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు.
అందుకే, శ్రీలంక మరియు ఇజ్రాయెల్‌లో వ్యూహాత్మక జెట్టీలు మరియు ఓడరేవులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అతనికి మద్దతు ఇస్తున్నది. విమర్శకులు దీన్ని అతనికి ప్రభుత్వం సాయం చేస్తున్నట్లు గా పేర్కొంటున్నారు? ఇది నిజమేనా? శ్రీలంక టెర్మినల్ $750 మిలియన్ మరియు హైఫా పోర్ట్ $1.18 బిలియన్లు ఖర్చు అవుతుంది. ఏ భారతీయ ప్రత్యర్థి కూడా పళ్ళెంలో పెట్టి ఫ్రీ గా ఇచ్చినా అంతగా రిస్క్ చేయడానికి సాహసించడు.
అదానీ నైపుణ్యాలు అతన్ని వ్యాపారవేత్తగా కాకుండా వ్యూహాత్మక ఆటగాడిగా మార్చాయి. ఓడరేవు అనుకూలమైన గుత్తాధిపత్యం కాదు. అప్పటికే ఈ వ్యాపారంలో పాతుకుపోయిన ప్రత్యర్థుల నుండి నౌకలను ఆకర్షించడానికి కొత్త కంపనీ లాజిస్టిక్స్ మరియు ధరలలో పోటీపడాలి. ముంద్రా యొక్క లాజిస్టిక్స్ వేల కోట్ల వ్యాపార పెట్టుబడులను ఆకర్షించింది, ఎడారిలో పారిశ్రామిక కేంద్రాన్ని సృష్టించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమేటెడ్ బొగ్గు-నిర్వహణ సౌకర్యాన్ని కలిగి ఉంది. 2017 మోర్గాన్ స్టాన్లీ నివేదిక అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ)ని గ్లోబల్ పోర్ట్ కంపెనీలలో టాప్ 25%లో ఉంచింది.
adani
విమర్శకులు అదానీకి ప్రభుత్వ అనుకూలతపై దృష్టి పెడుతున్నారు. భారతదేశంలో, వ్యాపార విజయానికి ఫ్యాక్టరీలు నడపడం మాత్రమే కాకుండా రాజకీయాల నిర్వహణ కూడా అవసరం. వ్యాపారవేత్తలందరూ రాజకీయ నాయకులకు దగ్గరగా ఉండవచ్చు. ఇది కొన్ని తలుపులు తెరుస్తుంది, కొన్ని నియమాలను అధిగమించేలాగా చేస్తుంది, కానీ ఇది విజయానికి హామీ ఇవ్వదు.
ఉదాహరణకు రక్షణ వ్యవహారాల్లో అనిల్ అంబానీ 30,000 కోట్ల రూపాయలను పొందారని రాహుల్ గాంధీ తరుచూ ఆరోపిస్తున్నారు. అయితే అనిల్ వ్యాపార పరంగా ఫ్లాప్‌ అయ్యాడు. ఒకసారి, ధీరూభాయ్ అంబానీ కూడా రాజకీయ అవకతవకలు మరియు బూటకపు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రతి ఇతర వ్యాపారవేత్త చేయని పని నేను ఏమి చేసాను? అని ఎదురు ప్రశ్నిస్తే సమాధానం రాలేదు. వ్యాపారంలో బలంగా ఉన్న చాలా మంది ఇతర వ్యాపారవేత్తలు రాజకీయ నాయకుల నుండి చరిత్రాత్మక ప్రయోజనాలు పొందారు మరియు లెక్కల పుస్తకాలను కూడా మార్చారు. ధీరూ భాయ్ వంటి కొత్త ఆటగాడు పాత దిగ్గజాలను వారి స్వంత ఆటలో ఓడించడం అతని అపారమైన ప్రతిభను సూచిస్తుంది. అదానీ గురించి కూడా ఇదే చెప్పాలి.
హమీష్ మెక్‌డొనాల్డ్ యొక్క 1998 పుస్తకం, “ది పాలిస్టర్ ప్రిన్స్‌” లో దీరూభాయి చర్యల గురించి వివరంగా ఉన్నాయి. కానీ విమర్శకులు అతను కేవలం ఒక విజయవంతమైన మానిప్యులేటర్ అని భావించడం తప్పు… లైసెన్స్- పర్మిట్ రాజ్ సమయంలో, తారుమారు వ్యవహారాలు ఒక తప్పించుకోలేని చర్య… కానీ, ఒకసారి ఆర్థిక వ్యవస్థ సరళీకృతం అయిన తర్వాత, అతను ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతి ఆధారిత, ప్రఖ్యాత సింగపూర్ రిఫైనరీలు కంటే కూడా అధిక ఆపరేటింగ్ మార్జిన్లు గల చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించాడు, తనది ప్రపంచ స్థాయి అని తాను నిరూపించుకున్నాడు.
అతను (అంబానీ) టెలికామ్‌లో అవకాశాలు పొందాడు, ప్రపంచంలోనే చౌకైన టెలిఫోన్ నెట్‌వర్క్‌ సృష్టించాడు. అతని మానిప్యులేషన్‌పై మాత్రమే దృష్టి సారించేవారు అతనిని చరిత్రాత్మక టైటాన్‌గా మార్చిన అసాధారణ నైపుణ్యాలను గుడ్డిగా పట్టించుకోరు. ఇప్పుడు అదానీ ఇదే మార్గంలో నడుస్తున్నాడు. అదాని ప్రధానంగా మౌలిక సదుపాయాలలో (ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాలలో) వ్యాపారి అనీ, ఇక్కడ నిజమైన నైపుణ్యాల కంటే ప్రభుత్వానికి దగ్గరగా ఉండటమే వ్యాపార విజయానికి కారణం అని విమర్శకులు అంటున్నారు.
బలమైన ప్రాంతీయ రాజకీయ పలుకుబడితో డజన్ల కొద్దీ కొత్త వ్యాపారవేత్తలు 2003-08లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారంలో చేరారు. కానీ రాజకీయ గాడ్‌ఫాదర్‌్లు ఉన్నప్పటికీ, చాలా మంది ఇబ్బందుల్లో కూరుకుపోయి, బ్యాంకులకు అపారమైన అప్పులు మిగిల్చారు. మౌలిక సదుపాయాలలో విజయానికి ఒక్క రాజకీయ మిత్రులే కాకుండా నైపుణ్యం కూడా అవసరం.
పాఠకులు నేను గొప్ప ఆదాని అభిమాని అని అనుకోవచ్చు, కానీ అధిక ధరలు మరియు అధిక రిస్క్ కారణంగా నేను ఏ ఆదాని కంపెనీ షేర్లను కలిగి లేను. అప్పు తెచ్చుకున్న డబ్బును ఉపయోగించి వేలం కొనుగోళ్లలో పాల్గొంటూ చాలా ఎక్కువ ధరలకు ఆస్తులు కొంటూ వైవిధ్యభరితంగా ఆదాని గ్రూప్ విస్తరిస్తోంది. ఈ పద్ధతి వేగవంతమైన విస్తరణను సులభతరం చేస్తుంది, కానీ గొప్ప ప్రమాదాలను కూడా కలిగి ఉంటుంది. పెద్ద వ్యాపార సముదాయాలను సృష్టించేందుకు ఇలా చేసిన విభిన్నమైన వ్యాపార ప్రముఖుల ఉదాహరణలు చరిత్రలో పుష్కలంగా ఉన్నాయి..అవి ప్రశంసల మధ్య కొన్ని దశాబ్దాలు విజయం సాధించాయి, కానీ చివరికి దివాలా (జాక్ వెల్చ్ కింద జనరల్ ఎలక్ట్రిక్ వంటిది) తీసాయి.
కాబట్టి, హిండెన్‌బర్గ్ నివేదిక నిజానికి అదానీకి జరిగిన ఒక అత్యుత్తమమైన పరిణామం అని నేను భావిస్తున్నాను. ఇది అతని విస్తరణ మరియు వైవిధ్యం యొక్క వేగాన్ని తగ్గిస్తుంది మరియు భవిష్యత్తులో అతని ఋణ దాతలను శ్రద్ధగా మరియు జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది. ఇది అదానీకి తన స్వంత ప్రయోజనం కోసం కావాల్సిన అత్యంత ఆర్థిక క్రమశిక్షణను నేర్పిస్తుంది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆదానికి రహస్యంగా వచ్చిన ఒక ఆశీర్వాదంగా భావించవచ్చు. (Blessing in disguise)… ఏదో ఒక రోజు నేను నిజంగా అదానీ షేర్లను కొనుగోలు చేయవచ్చు కూడా… – ….స్వామినాథన్ అయ్యర్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions