Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మద్యం సీసాడియా..! మింగలేక, కక్కలేక కేజ్రీ… కిక్కు దిగినా కిక్కుమనడు..!!

August 21, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి ….. రేపో మాపో CBI కానీ, ED కానీ నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది ! ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అంటున్నాడు ఇలా… ! ఇప్పటివరకు కేవలం సిబిఐ మాత్రమే దాడులు చేసింది ఈయన మీద, కానీ మధ్యలో ED పేరును తానే ఎందుకు ఇరికించాడు ? అంటే మనీ లాండరింగ్ చేశాడా ?

ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలు ! Delhi Excise Policy 2021…

దేశ రాజధానిలో మద్యం అమ్మే షాపులని ఢిల్లీ ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అయితే ఆక్రమాలకి తెర లేపాలి అంటే అవి ప్రైవేట్ పరం చేయాలి. కాబట్టి నూతన లిక్కర్ చట్టం తేవాలని నిర్ణయించాడు కేజ్రీవాల్ ! దీనికోసం ఢిల్లీ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫారసులని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కి ఆమోదం కోసం పంపించింది. మొత్తం 9,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని అదనంగా ఢిల్లీ ప్రభుత్వానికి వస్తుంది అంటూ ఆ నివేదికలో పేర్కొన్నారు. దానికోసం ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపుల్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాలి… ఇలా ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపులని పూర్తిగా మూసేస్తారు…

Ads

దీనికోసం పెద్ద కసరత్తే చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఫిబ్రవరి 5, 2021 న ఆప్ ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులని ఒక కమిటీగా ఏర్పరిచి మొదట నివేదిక ఇవ్వమన్నాడు సీఎం… మార్చి 21, 2021 న కాబినెట్ కమిటీ డ్రాఫ్ట్ ని ఆమోదించింది. ఢిల్లీ ప్రభుత్వ కేబినెట్ ఆమోదించిన లిక్కర్ పాలసీని తుది ఆమోదం కోసం అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బాలాజీకి మే నెల 24 న పంపించారు.

కానీ LG అనిల్ బాలాజీ ఢిల్లీ ప్రభుత్వపు నూతన ఎక్సైజ్ పాలసీని ఆమోదీస్తూనే రెండు నిబంధనలని పాటించాలి అంటూ కండిషన్స్ పెట్టారు. ప్రస్తుతం ఏవైతే మద్యం షాపులు ఉన్నాయో వాటి స్థానంలో ప్రైవేట్ వ్యక్తులకి లైసెన్స్ లు ఇవ్వవచ్చు కానీ అధికారికంగా ఎక్కడయితే పూర్వం మద్యం షాపులు లేవో అక్కడ మాత్రం ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ [DDA] మరియు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ [MCD] నుండి అనుమతి తీసుకోవాలి. ఈ రెండు నిబంధనలని ఖచ్చితంగా పాటించాలి అన్నమాట.

2022 మొదటి త్రైమాసిక అమ్మకాలలో ఇంతకు ముందు కంటే ఎక్కువ లాభాలు వచ్చాయని మనీష్ సిసోడియా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. కానీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పెట్టిన నిబంధనల వలన తమ ప్రభుత్వానికి నష్టం వచ్చింది అన్నాడు. తరువాత ఏమయిందో కానీ తానే లిక్కర్ పాలసీ మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణను అడిగాడు, మళ్ళీ మాట మార్చి నేను అలా అనలేదన్నాడు. DDA, MCD ల నుండి అనుమతి తీసుకోవాలి అనే నిబంధన కేజ్రీవాల్ ఉల్లంఘించాడు.

చివరికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసు నుండి వెళ్ళిన నివేదిక ఆధారంగా… మొన్న అంటే 19/08/2022 శుక్రవారం రోజున సిబిఐ ఏకకాలంలో మొత్తం 30 ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. వీటిలో వివిధ రాష్ట్రాలతోపాటు యూనియన్ టెరిటరీలు కూడా ఉన్నాయి. ఢిల్లీ లోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో కూడా సోదాలు జరిపింది సిబిఐ.

1. విద్యా శాఖతో పాటు ఎక్సైజ్ శాఖని నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు 13 మంది మీద FIR ఫైల్ చేసింది సిబిఐ.

2. IPC సెక్షన్ల కి సంబంధించి క్రిమినల్ కాన్స్పిరసీ మరియు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ [IPC sections related to criminal conspiracy and provisions of the Prevention of Corruption Act.] ని తన FIR లో పేర్కొంది సిబిఐ.

3. మనీష్ సిసోడియాతో పాటు అప్పటి ఎక్సైజ్ కమీషనర్ ఆరవ గోపీ కృష్ణ [Arava Gopi Krishna], డిప్యూటీ ఎక్సైజ్ కమీషనర్ ఆనంద్ కుమార్ తివారీ [Anand Kumar Tiwari], అసిస్టెంట్ ఎక్సైజ్ కమీషనర్ పంకజ్ భట్నాగర్ [Pankaj Bhatnagar]లతో పాటు మరో 9 మంది వ్యాపారవేత్తలని నిందితులుగా పేర్కొంది సిబిఐ.

4. కొత్త లిక్కర్ పాలసీతో మద్యం షాపుల కోసం టెండర్లు వేసిన వారికి లైసెన్స్ ఫీజ్ లో రాయితీలు ఇచ్చినట్టు మరియు కొందరికి పూర్తిగా లైసెన్స్ ఫీజ్ మాఫీ చేసి లైసెన్స్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి… వాటికి ఆధారాలు కూడా దొరికాయి.

5. తక్కువ ధరకి టెండర్ కోట్ చేసిన [L1] లకి టెండర్ అనుమతి ఇవ్వకుండా, నేరుగా షాపు పెట్టుకోవడానికి సహకరించారు దీనికి ప్రతిఫలంగా ఎక్సైజ్ అధికారులకి ఒక్కొక్కరికి కోటి రూపాయలు బహుమతిగా నగదు రూపంలో ఇచ్చారు సదరు మద్యం షాపు యజమానులు… వీళ్లలో ఒకరు మనీష్ సిసోడియాతో సన్నిహితుడు… తను సిసోడియాకి పెద్ద మొత్తంలో లంచం ఇచ్చాడు.

6. చాలా మద్యం షాపులకి సంబంధిత DDA, MCD ల నుండి అనుమతి తీసుకోకుండా లైసెన్స్ లు ఇచ్చాడు మనీష్ సిసోడియా… విషయం బయటికి రాకుండా ఉండడానికి తనతో పాటు ఉన్నత స్థాయి ఎక్సైజ్ అధికారులకి కూడా ఒక్కో షాపుకి ఒక కోటి రాపాయలు లంచంగా ఇప్పించాడు.

7. అసలు నూతన మద్యం పాలసీ 2021-22 నివేదిక ఇచ్చింది పేరుకే కేబినెట్ కమిటీ… కానీ దాని రూపకర్తలు ప్రైవేట్ వ్యక్తులు.

8. ఇంతకీ ఆ నివేదిక ఇచ్చిన ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ? మాజీ CEO, ఓన్లీ మచ్ లౌడర్ [Vijay Nair, former CEO of Only Much Louder], ఇది ఎంటర్టైన్మెంట్ మరియు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అన్నమాట.

9. ఇండో స్పిరిట్స్ [Indospirits] అనే మద్యం సంస్థ అధిపతి అయిన సమీర్ మహేంద్రు [Sameer Mahendru ].

10. పెర్ణాయిడ్ రికార్డ్ [Pernod Ricard] అనే సంస్థ మాజీ ఉద్యోగి అయిన మనోజ్ రాయ్ [Manoj Roy ].

11. అమర్ధీప్ దాల్ [Amardeep Dhal ] బ్రాండికో స్పిరిట్స్ [Brindco Spirits] యజమాని.

ఇలా ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ సంస్థల యజమానులు మరియు లిక్కర్ తయారీ సంస్థల యజమానులు అందరూ కలిసి రూపొందించిన నూతన ఎక్సైజ్ పాలసీని యధాతధంగా కేజ్రీవాల్ ఆమోదించి, దానినే గవర్నర్ ఆమోదం కోసం పంపించాడు. సిబిఐ సోదాలు జరిపినప్పుడు ప్రైవేట్ వ్యక్తుల ఇళ్ళలో నూతన ఎక్సైజ్ పాలసీ తాలూకు పత్రాలు దొరికాయి. అవి ఉండాల్సింది ఎక్సైజ్ ఆఫీసులో కదా ?

నూతన ఎక్సైజ్ పాలసీని ప్రైవేట్ వ్యక్తులు రూపొందిస్తే ఇక మద్యం షాపులని ఎవరికి ఇవ్వాలి ? వాళ్ళ దగ్గర నుండి ఎంత మొత్తంలో లంచం తీసుకోవాలి? ఈ పనులన్నీ సిసోడియా ముఖ్య అనుచరులు చక్కపెట్టారు.

12. అమిత్ అరోరా [Amith Arora ] డైరెక్టర్, బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ [Buddy Retail Pvt. Limited] గురుగ్రామ్. లైసెన్స్ లు ఎవరికి ఇవ్వాలో, ఎంత మొత్తం లైసెన్స్ లు తీసుకున్న వాళ్ళు ఇవ్వాలో నిర్ణయాలు తీసుకున్నాడు.

13. దినేష్ అరోరా, అర్జున్ పాండేలు సిసోడియా ముఖ్య అనుచరులు… ఏ అధికారికి ఎంత మొత్తం ఇవ్వాలో లైసెన్స్ పొందిన వ్యాపారులకి సూచించడమే కాదు, వీళ్ళే స్వయంగా డబ్బు తీసుకొని ఎక్సైజ్ అధికారులకి ఇచ్చారు.

14. సిబిఐకి దొరికిన ఆధారాల ప్రకారం దినేష్ [రాధా ఇండస్ట్రీస్ అధినేత] ఒక కోటి రూపాయలు ఇండో స్పిరిట్స్ అధినేత అయిన సమీర్ మహేంద్రు నుండి లంచంగా తీసుకున్నాడు.

15. మొత్తం అంతా డబ్బు వ్యవహారం ఒకరో ఇద్దరో చక్కపెడితే సమస్య వస్తుంది అని భావించి మరి కొందరిని కూడా ఈ స్కామ్ లో భాగస్వాములని చేశాడు  సిసోడియా. అరుణ్ రామచంద్ర పిళ్లై అనే మద్యం సిండికేట్ బ్రోకర్ సమీర్ మహేంద్రు నుండి విజయ్ నాయర్ అనే వ్యక్తి ద్వారా డబ్బుని తీసుకొని వాటిని ఎక్సైజ్ ఉన్నత అధికారులకి ఇప్పించాడు.

16. అర్జున్ పాండే అనే వ్యక్తి సమీర్ మహేంద్రు నుండి 4 కోట్లు కలెక్ట్ చేసుకొని ఆ డబ్బుని విజయ్ నాయర్ కి అందచేశాడు. ఇలా వేరు వేరు వ్యక్తుల ద్వారా నేరుగా డబ్బుని ఎక్సైజ్ ఉన్నత అధికారులకి ఇప్పించాడు మనీష్ సిసోడియా. ఎక్కడా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదు. నేరుగా నగదు రూపంలో ఎక్సైజ్ అధికారులకి అందింది.

17. ఒకసారి వచ్చిన వ్యక్తి మళ్ళీ తరుచుగా ఎక్సైజ్ కార్యాలయానికి రాకుండా జాగ్రత్త పడ్డారు. CC కెమెరాలు ఉంటాయి కదా !

18. మహదేవ్ లిక్కర్స్ యజమాని సన్నీ మార్వా కి లైసెన్స్ ఇచ్చినందుకు గాను తను పెద్ద మొత్తంలో లంచం ఇచ్చాడు సిసోడియాకు… సన్నీ మార్వా ఎందుకు అందరికంటే ఎక్కువ మొత్తంలో లంచం ఇచ్చాడు ? సన్నీ మార్వా పొంటీ చద్దా అనే మద్యం వ్యాపారికి చెందిన సంస్థలో బోర్డ్ మెంబరు. అయితే పొంటీ చద్దా అనే ఆ మద్యం వ్యాపారి అప్పటికే ఎక్సైజ్ వారి బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడు. ఎందుకు ? లంచాలు ఇస్తూ మద్యం వ్యాపారంలో అక్రమాలకి పాల్పడుతూ చాలాసార్లు అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి. అంతే కాదు, ఎక్సైజ్ అధికారులకి లంచాలు ఇవ్వడంలో ముందు స్థానంలో ఉంటూ వచ్చాడు. పొంటీ చద్దా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడు కానీ సిసోడియా దయ వల్ల బినామీలతో తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు… కానీ ఎక్సైజ్ ఆఫీసులోకి మాత్రం రాడు. అక్కడ CC కెమెరాలు ఉంటాయి కాబట్టి…

తెలంగాణ-హైదరాబాద్ !

ఢిల్లీలో అయితే పోలీసు వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి పోలీస్ ఇంటెలిజెన్స్ నిఘా ఎప్పుడూ ఉంటుంది. అదే హైదరాబాద్ అయితే సురక్షితం. కాబట్టి ఢిల్లీ ప్రభుత్వపు నూతన ఎక్సైజ్ పాలసీని ఎలా రూపొందించాలనే దాని మీద చర్చలు చేయడానికి లిక్కర్ బ్రోకర్లు, లిక్కర్ సంస్థల యజమానులు హైదరాబాద్ లోని హోటల్స్, రిసార్ట్స్ లలో బస చేసి, ఒక ప్లాన్ ని సిద్ధం చేసుకొని, తిరిగి ఢిల్లీ వెళ్ళి దానిని అమలు చేశారు. ఢిల్లీ నూతన ఎక్సైజ్ చట్టం 2021-22 కి రూపకల్పన జరిగింది హైదరాబాద్ లోనే! అలాగే ముడుపులు ఎంత ? ఎవరు ఎవరికి ఎంత చెల్లించాలి అనే అంశాలని పూర్తిగా చర్చించి నిర్ణయం తీసుకుంది కూడా హైదరాబాద్ లోనే. నిందితుల బాంక్ లావాదేవీలు ఎక్కువగా హైదరాబాద్ లోనే జరిగినట్లు, కాల్ మరియు బాంక్ రికార్డ్ లని పరిశీలించిన తరువాత సిబిఐ ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చింది. చెప్పాల్సింది ఇంకా మిగిలే ఉంది! మరో పోస్ట్ లో చెప్పడానికి ప్రయత్నిస్తాను !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక ఫోటో… కవితకు అసలు తెలియదో లేదో… గుర్తుందో లేదో ఫాఫం…
  • 500 రూపాయల నోట్ల చెలామణీపై వార్తలేమిటి..? నిజాలేమిటి…?
  • బాలీవుడ్ డింపుల్ క్వీన్… ప్రీతి మరో మొహం… 34 మంది పిల్లల తల్లి…
  • ఆ పాత్ర దెబ్బతినేసింది… ఫాఫం రాజేంద్ర ప్రసాద్ మెడ విరిగింది…
  • మాటే పాటైనవాడు. పాటే బాటైనవాడు. మనకు కర్ణామృతమైనవాడు
  • ఎంత డబ్బిచ్చినా సరే.., మోహన్‌బాబుతో మాత్రం పోను అంటుందామె..!!
  • రేయ్, ఫుడ్ బ్లాగర్లూ… నా మొహం కూడా మాడింది ఆ మసాలా దోశలాగే…
  • 2 ఫ్లాట్లు… 639 కోట్ల రికార్డు ధర… ఇంతకీ ఆ ధనికురాలు ఎవరంటే..?
  • అదే సీన్… 2 పాటలు… ఒకటి తండ్రి, మరొకటి కొడుకు… కానీ ఎంత తేడా…
  • కాశీ తిరగబడింది… ఆ తెల్ల గవర్నర్ జనరల్ రాత్రికిరాత్రి పారిపోయాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions