Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈతరం తప్పక చదవాల్సిన శాస్త్రి డెత్ మిస్టరీ… ఎవరు చంపారు..?!

October 2, 2023 by M S R

గాంధీజీ జన్మ దినమే లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన రోజైనా ఆయనకున్న ప్రాధాన్యం పొట్టివాడు, గట్టివాడు అయిన ఈయనకు లేక పోవడం విచారకరం. గాంధీజీ జన్మ దినమే లాల్ బహదూర్ శాస్త్రి జన్మ దినమే కాదు, ఆయన వర్థంతిని కూడా తలచుకునే తీరిక, జ్ఞాపకం కూడా నేటి రాజకీయ నాయకులకు లేకపోవడం బాధాకరం.

ఆయన ఇప్పటి రాజకీయాలకు పనికిరారు గనుక, ఈ నాయకులకు వారి విషయం తెలీదు గనుక, ఆయన పేరు చెబితే ఓట్లు రాలవు గనుక… ”జై జవాన్ – జై కిసాన్” నినాదాన్ని దేశానికి ఇచ్చిన భారత దేశ రెండవ ప్రధానమంత్రి, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, 1904 అక్టోబర్ 2న జన్మించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా నేడే.

శాస్త్రి మరణించి 57 ఏళ్లయినా ఇప్పటికీ ఆయన మృతిపై ముసురుకున్న అనుమానాలకు తెరపడలేదు. 1965లో భారత్, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం తరువాత 1966 జనవరిలో శాస్త్రి అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో భేటీ అయ్యేందుకు సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్ వెళ్లారు. భారత్, పాక్‌ల సంయుక్త ప్రకటనపై ఆయన సంతకం చేసిన కొద్ది గంటల్లోనే మరణించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన మరణంపై ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు.

Ads

ఇదిలా ఉండగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం, శాస్త్రి మరణం మధ్య సంబంధం ఉందంటూ.. దీనికి సంబంధించి పలు ప్రశ్నలు లేవనెత్తుతూ సుప్రీంకోర్టు న్యాయవాది అనూప్ బోస్ 2016 డిసెంబరు 7న లా జెడ్ మ్యాగజీన్‌లో ‘ట్రాజిక్ డెత్ ఆఫ్ లాల్ బహుదూర్ శాస్త్రి అండ్ ది మిస్టిఫైయింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యాంగిల్’ అంటూ రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

శాస్త్రి మృతిపై విచారణ జరిపేందుకు జనతా పార్టీ హయాంలో రాజ్‌ నారాయణ్ కమిటీని ఏర్పాటు చేసినా ఆ నివేదిక వెలుగు చూడలేదు. శాస్త్రి మృతికి సంబంధించిన పత్రాలను బయటపెట్టాలని కోరుతూ నవదీప్ గుప్తా అనే సమాచార హక్కు కార్యకర్త 2017 జులై 14న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. హోం శాఖ ఆ దరఖాస్తును ‘నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా’కు పంపగా, వారు సమాచారం ఇవ్వలేమని సమాధానమిచ్చారు.
దరఖాస్తుదారు దానిపై రెండుసార్లు అప్పీల్ చేసుకున్నా సమాచారం రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కమిషన్… పత్రాలను బహిర్గతం చేయాలని ప్రధాన మంత్రి కార్యాలయ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు (సీపీఐవో) సహా విదేశాంగ, హోం శాఖల సీపీఐవోలను ఆదేశించింది
కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు 2018 మే నెలలో కులదీప్ నయ్యర్‌ను కలిసినప్పుడు ఆయన శాస్త్రి మరణానికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తవించారు. ”శాస్త్రి మరణించారని తెలియగానే అందరం షాకయ్యాం. మాకు అప్పుడు ఏ అనుమానం రాలేదు. కానీ, భారత్‌కు తిరిగివచ్చాక శాస్త్రి భార్య, బంధువులు కీలకమైన అనుమానాలు వ్యక్తం చేశారు. తాష్కెంట్‌లో శాస్త్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలనే ఆలోచన రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆయనపై విషప్రయోగం జరిగిందా అనే అనుమానాలు నిరాధారాలు అని కొట్టిపారేయలేం. శాస్త్రి మృతిపై నిజాలు తేల్చేందుకు ఏర్పాటైన రాజ్ నారాయణ్ కమిటీ ఎదుట సాక్ష్యం చెప్పేందుకు వస్తున్న శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు చుగ్, వ్యక్తిగత సహాయకుడు రాంనాథ్ ఇద్దరూ వేర్వేరుగా రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. ఈ రెండు నిజంగా రోడ్డు ప్రమాదాలేనా? శాస్త్రిపై విషప్రయోగం జరిగిందా? అదే నిజమైతే ఆ పని చేసిందెవరూ? నేనేమీ చెప్పలేను.. దీనిపై దర్యాప్తు జరగాలని మాత్రం చెప్పగలను” అన్నారు.
లాల్ బహుదూర్ శాస్త్రి మరణం, కారణాలపై 1966 ఫిబ్రవరి 16న పార్లమెంటు ఉభయ సభల్లో అప్పటి విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనను పొందుపరుస్తూ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు 2018 సెప్టెంబర్ 24న తన తుది ఆదేశాలను వెలువరించారు. తాష్కెంట్ వీడ్కోలు వేడుకలో పాల్గొన్నాక శాస్త్రి రాత్రి 10 గంటలకు తన గదికి చేరుకున్నారు. జగన్నాథ్ సహాయి, శాస్త్రి సేవకుడు రామ్ నాథ్, మరికొందరు సహాయకులు ఆయనతో వచ్చారు.
పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తేనీటి విందుకు ఆహ్వానించినట్లు వారికి తెలియడంతో వారు శాస్త్రిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. పాకిస్తాన్ హాని తలపెట్టే ప్రమాదముందని జాగ్రత్తగా ఉండాలని శాస్త్రికి వారు సూచించారు. ఇండియా- పాకిస్తాన్ యుద్ధ సమయంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బల్వంత్‌రాయ్ మెహతా ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానాన్ని పాకిస్తాన్ కూల్చేసిన ఘటనను జగన్నాథ్ సహాయి గుర్తు చేసుకున్నారు.
తాష్కెంట్ ఒప్పందం మరుసటి రోజు అంటే 1966 జనవరి 11న (తాష్కెంట్ సమయం) వేకువ జామున 1.20 గంటలకు శాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆర్.ఎన్.చుగ్‌ వచ్చి పరిశీలించారు. అప్పటికే శాస్త్రి తీవ్రమైన దగ్గుతో శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన శాస్త్రికి.. మెప్తెటేయిన్ సల్ఫేట్, మిక్రెనా ఇంజక్షన్లను ఇచ్చారు. అనంతరం 3 నిమిషాలకే శాస్త్రి స్పృహ కోల్పోయారు. కొద్దిసేపట్లోనే ఆయన శ్వాస, గుండె కొట్టుకోవడం మందగించాయి. సోవియట్ డాక్టర్ ఇ.జి.యెర్మన్కోతో కలిసి కృత్రిమ శ్వాస ఇచ్చేందుకు డాక్టర్ చుగ్ ప్రయత్నించారు. కానీ, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. శాస్త్రి గుండెపోటు కారణంగా రాత్రి 1.32 గంటలకు మరణించారని వైద్యులు ప్రకటించారు.
తాష్కెంట్ నుంచి తిరిగొచ్చాక లలితా శాస్త్రి (శాస్త్రి సతీమణి) ఆయన శరీరం ఎందుకు నీలంగా ఉందని అడిగారు. మృతదేహాలకు ఎంబాల్మింగ్ చేశాక నీలం రంగులోకి మారుతాయని అక్కడ చెప్పారని ఆమెకు వివరించగా. మరి ఒంటిపై ఉన్న ఆ గాయాలేంటని అడిగారామె. అంతేకాదు.. శాస్త్రి భౌతిక కాయానికి పోస్టు మార్టం నిర్వహించకపోవడంపైనా కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తంచేశారు. శాస్త్రిది సహజ మరణం కాదని ఆరోపిస్తూ చేసిన ఒక ప్రకటనపై సంతకాలు చేయాలని కోరగా ఆయన ఇద్దరు సహాయకులు అందుకు నిరాకరించడంపైనా లలితా శాస్త్రి ఆగ్రహంతో ఉన్నట్లు కొద్ది రోజుల తెలిసింది.
విషప్రయోగం వల్లే మరణించారన్న అనుమానం ఆయన కుటుంబసభ్యుల్లో మరింత బలపడింది. ఆయన వ్యక్తిగత సేవకుడు రామ్‌నాథ్ కాకుండా టి.ఎన్.కౌల్ వంటమనిషి జన్ మొహమ్మద్ ఆ రోజు వంట చేయడంపై వారు అసంతృప్తి, అనుమానంతో ఉన్నారు. 1965లో శాస్త్రి మాస్కోలో పర్యటించినప్పుడూ జన్ మొహమ్మదే వంట చేశారు. కాగా.. శాస్త్రి మరణంపై విచారణ జరిపించాలంటూ 1970లో ఆయన జయంతి రోజున (అక్టోబర్ 2) లలితా శాస్త్రి కోరారు.
శాస్త్రి మృతికి సంబంధించిన వెల్లడించాలని కోరుతూ దాఖలైన సమాచార హక్కు దరఖాస్తును ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించినట్లు పేర్కొన్నారు. శాస్త్రి మృతికి సంబంధించి రెండు దేశాల రాయబార కార్యాలయాల మధ్య జరిగిన సంప్రదింపుల పత్రాలు కోరుతూ అనూజ్ ధర్ అనే వ్యక్తి 2009లో దరఖాస్తు చేశారు. శాస్త్రి మరణంపై సమాధానం దొరకని ప్రశ్నలున్నాయంటూ అవుట్‌లుక్ వ్యాసంలో ప్రస్తావించారు.
శాస్త్రి మరణం తరువాత ఒక రష్యన్ వంటగాడిని సోవియట్ అధికారులు అరెస్టు చేశారు. అయితే, 5 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించి ఆ తరువాత వదిలేశారు. విష ప్రయోగం జరిగిందని ప్రాథమికంగా అనుమానాలు ఉన్నప్పటికీ ఆయన మృతదేహానికి తాష్కెంట్‌లో కానీ, భారత్‌లో కానీ పోస్ట్‌మార్టం నిర్వహించలేదు. శాస్త్రి కుటుంబసభ్యులు అనేకసార్లు అనుమానాలు వ్యక్తం చేసినా దర్యాప్తు చేయలేదు. ఎమర్జెన్సీ తరువాత జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాస్త్రి మరణంపై దర్యాప్తు కోసం రాజ్‌నాథ్ కమిటీ నియమించారు. కమిటీ నివేదిక ఇవ్వనప్పటికీ దర్యాప్తు ప్రక్రియ ప్రారంభించింది. కానీ, దీనికి సంబంధించి పార్లమెంటు లైబ్రరీలో ఎలాంటి పత్రాలు లేవు.
కమిటీ ముందు వివరాలు చెప్పడానికి వస్తుండగానే శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు చుగ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా… వ్యక్తిగత సహాయకుడు రామ్‌నాథ్ కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గతం మర్చిపోయారు. (అయితే… కమిటీ ఎదుట హాజరవడానికి వెళ్లడానికి ముందు రామ్‌నాథ్ శాస్త్రి సతీమణిని కలిశారు.”చాలా రోజులుగా మనసులో ఈ భారమంతా మోస్తున్నాను. ఈ రోజు మొత్తం చెప్పేస్తాను” అని చెప్పారని కుటుంబీకులు వెల్లడించారు.
లాల్ బహుదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి తన తండ్రి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. తన తండ్రి మృతికి సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేయాలని ఆయన 2015లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరారు. తండ్రి మృతిపై అనేక అనుమానాలు లేవనెత్తారు.
‘ఆయన మృతదేహం దిల్లీ విమానాశ్రయానికి వచ్చినప్పుడు చూస్తే ఆయన శరీరం నీలిరంగులో కనిపించింది. ముఖంపై తెల్లమచ్చలు కనిపించాయి. ఉజ్బెకిస్తాన్‌లో భారత్ ప్రధాని ఉండే రూంలో కాలింగ్‌బెల్ కూడా ఉండదా, ఫోన్ ఉండదా, కనీసం చూసుకునే వారు కూడా ఉండరా? నమ్మశక్యంగా లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. షిప్పింగ్ వ్యాపారి ధరమ్ తేజ్ కుంభకోణం గురించి నాన్నకు తెలుసు. శాస్త్రి చనిపోయన సమయంలో ధరమ్ తేజ్ కూడా తాష్కెంట్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు.

తాతతో పాటు అమ్మమ్మ కూడా విదేశీ పర్యటనలకు వెళ్లేవారని.. కానీ, రష్యా పర్యటనకు ఆమె వెళ్లలేదని శాస్త్రి మనవడు సంజయ్ తెలిపారు. తాష్కెంట్‌లో హోటల్ బుక్ చేయాలనుకున్నారు. అయితే, ఆయనకు సోవియట్ ప్రభుత్వం ఒక కాటేజ్ కేటాయించింది. అందులో టెలీప్రింటర్, టెలిఫోన్ కూడా లేవు. మృతదేహం దిల్లీకి వచ్చినప్పుడు చూస్తే ఆయన నోరు, ముక్కు నుంచి రక్తం కారడం కనిపించింది. ఆయన ఒంటిపై గాట్లు ఉన్నాయి. అమ్మమ్మ నెయ్యిలో ఆయన చేతులను ముంచింది. పెదాలకు నెయ్యి పూసింది. అప్పుడు నెయ్యి నీలిరంగులో కనిపించింది. ఆయన వ్యక్తిగత డైరీ, ఆయన రోజువారి కార్యక్రమాలను రాసుకొనే యాక్షన్ ప్లాన్ పుస్తకం కనిపించలేదు అని సంజయ్ తెలిపారు… ఇంతకీ శాస్త్రి ఎలా మరణించారు..? నేతాజీ మరణంలాగే ఇక ఇదీ ఎప్పుడూ తేలని మిస్టరీయేనా..? —- నందిరాజు రాధాకృష్ణ, వెటరన్ జర్నలిస్ట్, 98481 28215.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions