.
ఇప్పుడు వెనెజులా ప్రపంచ వార్త… ప్రపంచ పోలీస్ ట్రంపు నియంతృత్వానికి బలైన కంట్రీ… బందీగా మారిన మదురో దంపతుల మీద ఎల్లెడలా సానుభూతి… ప్రపంచంలోకెల్లా అత్యధిక చమురు సంపద కలిగిన ఆ దేశం ఇప్పుడు దిక్కులేనిదైంది… ఎందుకీ దుర్గతి… కొంతకాలం వెనక్కి వెళ్లాలి…
ప్రఖ్యాత రచయిత Veerendranath Yandamoori అయిదు సంవత్సరాల క్రితం పోస్టు ఇది… తన ఫేస్బుక్ పోస్టు యథాతథంగా ఇలా… ‘ఉచితం అనేది ఆ దేశాన్ని ఎలా మార్చిందనేది సారాంశం)…
Ads
పదవి కోసం పెన్షన్లు, ఋణ మాఫీలూ, ఉచిత సర్వీసుల ఆఫర్ చెయ్యటం ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనిజులా చేస్తున్నారా? వళ్ళు గగుర్పొడిచే ఈ చరిత్ర చదవండి.
చిన్న చిన్న సెలయేళ్ళు, నదులు, పచ్చటి ప్రకృతి, సముద్ర తీరాల్లో సమృద్ధిగా ఆయిల్ నిక్షేపాలతో- 1970 లో వెనిజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి.
ఎన్నికల సమయంలో ఓ నాయకుడు అధికారంలోకి రావటం కోసం… ఇంట్లో ఖాళీగా కూర్చున్న వారికీ, బీద కుటుంబాలకీ, నెల నెలా ధన సహాయం అని ప్రకటించాడు.
ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో గెలిచాడు. వాగ్దాని౦చినట్టే దేశ ఐశ్వర్యం అందరికీ పంచాడు. 2008లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఈ సారి ఎన్నికల్లో కార్మికుల, ఉద్యోగస్తుల జీతాలు 5 రెట్లు పెంచాడు. సింగిల్ పేరెంట్స్కీ, ఆడవారికి అనూహ్యంగా కానుకలిచ్చాడు.
కొన్ని ఏళ్ళకి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ‘ధర పెరగని రొట్టె ముక్క’ అని ప్రకటించి మూడోసారి అధికారం సంపాదించుకున్నాడు.
ప్రభుత్వం ప్రకటించిన ధరలకి రొట్టెలు, మిగతా నిత్యావసర పదార్ధాలు ఇవ్వలేక చాలా కంపెనీలు మూతపడి పోయాయి. (ముఫై లక్షల మంది పారిశ్రామిక వేత్తలు, నైపుణ్యం నిండిన వర్కర్లు, మేధావులు దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు).
ప్రెసిడెంట్ వెనక్కి తగ్గలేదు. దేశంలో ఆయిల్ ద్వారా వస్తూన్న డబ్బు బోలెడు ఉంది. టాయిలెట్ పేపర్ కూడా విదేశాల నుంచి సంతోషంగా దిగుమతి చేసుకున్నాడు.
దేశంలో పని లేదు. హ్యాపీగా తినటం, ప్రభుత్వం ఇచ్చే భ్రుతితో ఆనందించటం..! ఉచితంగా వచ్చే డబ్బు, సబ్సిడీల కోసం ఎగబడిన జనం రాబోయే సునామీని ఊహించ లేదు.
2015 లో ఆయిల్ ధర పడిపోయింది. దాంతో కరెన్సీ ముద్రణ పెంచాడు. ఎక్కడ చూసినా డబ్బే. పైసా విలువ లేని డబ్బు..! 2018 వచ్చేసరికి ఇన్-ఫ్లేషన్ 13,00,000% అయింది.
ఉచిత సబ్సిడీలు ఆగిపోవటంతో దానికి అలవాటు పడ్డ యువకులు కత్తులు, పిస్టళ్లు పట్టుకుని లూటీలు ప్రారంభించారు. ప్రతి ఏటా, ఆ నగరంలో ప్రతి లక్షమంది జనాభాలో 20 వేలమంది మర్డర్లకి గురి అవుతున్నారు.
తిండి లేక జూలో జంతువులన్నీ చచ్చిపోయాయి. వెనిజులా ముఖ్య పట్టణం పేరు ‘కారకాస్’. Carcass అంటే జంతువు కళేబరం. (The dead body of an animal).
ప్రపంచంలో పదవ పెద్ద లంచగొండి దేశంగా మారిన వెనిజులా, ప్రస్తుతం ప్రపంచపు అత్యంత ప్రమాదకరమైన రక్తపాత దేశాల లిస్టులో నెంబర్ 1 స్థానంలో ఉంది (ఈ పోస్టు 2019 వ్రాసింది).
టూరిస్టులని ఆ దేశానికి వెళ్ళవద్దని మిగతా దేశాలు హెచ్చరిస్తున్నాయి. దిగుమతులకి డబ్బు లేదు. కరెంటు లేదు. నాలుగు రోజులకొక కేవలం గంట నీళ్ళు. షాపుల్లో చివరికి టూత్-పేస్ట్ లేదు. ఉన్నా కొనటానికి డబ్బు లేదు. తినటానికి తిండి లేని వారి సంఖ్య అయిదేళ్ళలో 30 నుంచి 66% కి పెరిగింది.
చిన్న రొట్టేముక్క కోసం శరీరo అమ్ముకోవటానికి రాత్రంతా రోడ్ల మీద నిలుచున్న బాలికలు, కాస్త తిండి కోసం తెల్లవారు నుంచి అర్థరాత్రి వరకూ క్యూలో నిలబడే పిల్లలూ, కాలుస్తున్న సగం సిగరెట్ ఇమ్మని రోడ్ల మీద అడుక్కునే పెద్దలు… ఇదీ ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి.
(వెనిజులా అధ్యక్షున్ని అమెరికా పోలీసులు అర్ధరాత్రి బంధించి తీసుకు వెళ్లిన సందర్భంలో ‘అమెరికాది తప్పు’ అని కొందరు అంటున్నారు. “మన దేశాన్ని మోసం చేసి పరాయి దేశాల్లో తలదాచుకున్న వ్యాపారవేత్తలని మన సి.బి.ఐ. ఇదే విధంగా వెనక్కి తీసుకురావచ్చు” అని మరి కొందరు అంటున్నారు. అది- అక్షయ కుమార్, రాణా నటించిన “బేబీ” సిన్మా అంత సులభం కాదు. మన టాపిక్ కూడా అది కాదు.
సమ సమాజం కావాల్సిందే. కానీ ఉచితంగా ఇవ్వటం ద్వారా కాదు. ఇది నాయకులు తెలుసుకోవాలి. దానికన్నా ముందు ప్రజలు ఆ నాయకులని రిజెక్ట్ చెయ్యాలి. చెయ్యకపోతే ఏమి జరుగుతుందో… ఇదే ఉదాహరణ.
“రిచ్ డాడ్ – పూర్ డాడ్” రచయిత గతంలో వెనిజులా మీద విశ్లేషణ చేసినప్పుడు అతడిని పాఠకులు “ఆ దేశ భవిష్యత్తుని మీరు చాలా కరెక్ట్ గా ఊహించారు” అంటూ అభినంది౦చారు. అప్పుడు అతని సమాధానం… “నేను ఆ దేశ భవిష్యత్తును విశ్లేషించలేదు. పనికి విలువ తగ్గిపోయిన దేశానికి భవిష్యత్తు ఎలా ఉంటుందో విశ్లేషించాను. అంతే”).
Share this Article